ఆడదేవుళ్ళూ – మగదేవుళ్ళూ

కొండేపూడి నిర్మల
మీరొక స్కూలు పెట్టారనుకోండి. మీ విద్యార్థులం దరూ పాఠశాల నిబంధనలకు అనుగుణంగా స్కూలు యూనిఫామ్‌లో రావాలనుకుంటారా..? భవానీ వేషంలో కొందరు, అయ్యప్ప వేషంలో కొందరు, బాలబాబా అవతారంలో గోచీపెట్టుకుని కొందరూ, దుర్గామాత, జిల్లేళ్ళమూడి అమ్మల వేషధారణలో కొందరూ ఒకేసారి గానీ, విడివిడిగా కానీ వస్తే చూస్తూ చెంపలు వాయించుకుంటూ, వాళ్ళ కాళ్ళు కళ్లకద్దుకుంటూ, చూడండి స్వామీజీ…!… అని పిల్లల్ని సంభోదిస్తూ పాఠం చెప్పాలనుకుంటారా..? అసలది తరగతి గది లాగా వుంటుందా..? పిచ్చాసుపత్రిలాగా వుంటుందా..? ఇక్కడి పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందా..? సమ సమానత్వ భావనలు వికసిస్తాయా..? అలాంటి చోట పాఠాలు చెప్పే పంతులమ్మ అన బడు బడుగుజీవిని ఎవరైనా గౌరవిస్తారా..? ఆ సమయంలో ఆమె చరిత్రని బోధిస్తున్నట్టయితే, మన భారతావని మత ప్రమేయంలేని లౌకిక రాజ్యం అని చెప్పడానికి నోరు వస్తుందా..? రాజకీయ శాస్త్రం అయితే మన నిర్భందం ఎంత తప్పో అది మానవహక్కులకి ఎంత వ్యతిరేకమో ఆవిడ చెప్పగలదా..? హాజరు వేస్తున్నప్పుడు ప్రెజెంట్‌ సార్‌ అనడానికి బదులు, జైమాతా అనో శంభోశంకరా అనో అరిస్తే వినడానికి ఎలా వుంటుంది..? ఒకవేళ అదే సమయంలో ఇన్‌ స్పెక్షన్‌ కనక జరిగితే అప్పుడు ఎవరి ఉద్యోగం గాలి కెగురుతుంది..?
ఇవన్నీ నిన్న ఈ పాటికి మా పక్కింటి సుధా టీచరు నన్ను అడిగిన ప్రశ్నలు. జవాబు నాదగ్గర లేదు. నిజమే కదా, డాక్టర్లకి తెల్లకోటు లాగా, లాయర్లకి నల్ల కోటులాగా, పోలీసు వ్యవస్థకి ఖాకీ యూనిఫామ్‌లాగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థకి ఒక యూనిఫామ్‌ వుంది. ఈ యూనిఫామ్‌ తెచ్చుకోవడానికే మనం చాలా రోజులు ఎదురుచూశాం. ధనిక, బీద వర్గాలకి మధ్యవున్న తేడా తెలీకుండా విద్యముందు అందరూ సమానులే అని చెప్పడానికి ఉద్దేశించిన యూనిఫారాన్నీ, దాని ఉద్దేశాన్నీ తల్లిదండ్రులే చేతులారా నీరు కారుస్తున్నప్పుడు టీచర్ల పాత్ర ఏమిటి..? పాఠశాలలో మత చొరబాటు అవసరమా..? పోనీ స్కూలు కంటే మతమే ముఖ్యమని ఆ పిల్లల తల్లిదండ్రులు నిర్ణయించుకున్నట్టయితే, అనుకోనివ్వండి. తప్పులేదు. అప్పుడు వాళ్ళ వంశాకురాల్ని నిజాయితీగా నలభై రెండు రోజులూ స్కూలుకి సెలవుపెట్టి ఆరాధనలో ముంచి తేల్చమనండి… మనకభ్యంతరం లేదు. ఎందుకంటే అర్థరాత్రి వరకూ భక్తి పారవశ్య కార్యక్రమాలవల్ల వీళ్ళంతా ఎలాగూ హోంవర్కు చెయ్యకపోవచ్చు. పవిత్ర స్వామి సేవ పుణ్యమా అని, పరీక్షలు రాయలేకపోవచ్చు… కానీ సమస్య అక్కడితో ఆగుతుందా ఆగదు. ఇవాళ వస్త్రధారణకి సామాజిక మద్ధతు లభించిన పిల్లలు రేపు కాలేజీలోకి వచ్చేసరికల్లా త్రిశూలాలతోనూ, కత్తులతోనూ రారని గ్యారంటీ ఏమిటి..? అప్పుడు పంతులు బోర్డు వైపు తిరిగి ప్రాణభయం లేకుండా ఇవాల్టి తేదీ అయినా వెయ్యగలడా..? ఇక్కడ స్కూలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నదెవరు..? తల్లిదండ్రులు కాదా..?
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాల టీచరూ అదే భయపడి వుంటుంది. కాబట్టి ఎనిమిదో క్లాసు చదువుతున్న తన విద్యార్థుల్ని నల్ల దుస్తులు వదిలి స్కూలు యూనిఫామ్‌లో రావాలని గట్టిగా చెప్పింది. వినకపోయేసరికి గల్లా పట్టుకుని అడిగింది.. అది తప్పా..? ఇంటికెడుతూనే ఆ విద్యార్ధులు వారి తల్లిడండ్రులకి చెప్పారు. వారు కొందరు అయ్యప్పభక్తులతో కలిసి ఆమె నివాసం మీద దాడిచేసి నానా యాగీ చేశార్ట. నలభై అయిదు మంది భక్తులు అరెస్టయినట్టు వార్త వచ్చింది. కొన్ని భక్తి దినపత్రికలు ఆ టీచరుదే నేరం అన్నట్టు కూడా రాశాయి. ప్రస్తుతం ఊటీలోని పోలీసు స్టేషనులో ఆమెమీద కేసు నమోదయింది. ఆదివారాలు విద్యార్థుల్ని పిలిచి బైబిలు పాఠాలు చెబుతోందని ఫిర్యాదు చేశార్ట.
ఈ సంఘటన వెలుగుచూసిన నెలరోజులలోపే మళ్ళీ ఇవాళ ఇంకొక వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే పరమ పవిత్రమైన శబరిమలై ఆలయాన్ని ఒక ముప్పై అయిదేళ్ళ సరస్వతి అనే మహిళ దర్శనం చేసుకోవడం ద్వారా అపవిత్రం చేసిందట. కాబట్టి ఆమె ఎక్కి వచ్చిన పద్దెనిమిది మెట్లతో బాటు ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసుకున్నామని ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధికారులు వివరిస్తున్నారు. సరస్వతి పూజలు చేసుకుని మల్లికాపురంలోని ఉపాలయానికి వెడుతుండగా టాస్క్‌ఫోర్స్‌ గుర్తించి ఆమె దుశ్చర్యని ఖండించార్ట. మూడేళ్ల క్రితం జయమాల అనే కన్నడ నటి కూడా స్వామి అయ్యప్పని చూడ్డానికి వచ్చి పాపం మూటకట్టుకుని వెళ్ళిందట. దాన్ని శుద్ధి చేసుకోవడానికి కూడా పాపం దేవస్థానం చాలా ప్రయాస పడిందిట.. ఇవి రెండు రకాల వార్తలు. మొదటి వార్తలో బాలల హక్కులమీద, రెండవ వార్తలో స్త్రీల హక్కులమీద దాడి జరిగింది.
దీన్నిబట్టి ఏమి తెలుస్తోందంటే, గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న రెండు గ్లాసుల పద్ధతిలాగా, మగాళ్ళకి మాత్రమే పనికొచ్చే దేవుళ్ళూ, ఆడాళ్ళకి మాత్రమే పనికొచ్చే దేవుళ్ళు వున్నారన్నమాట. ఎవర్ని తల్చుకుని గంట వాయించాలో గుర్తుంచుకోవాలి. లేకపోతే మీ పుణ్యం కాస్తా ప్రత్యర్ధి హుండీలోకి చేరిపోతుంది.. మరి భారతీయ మహిళగా మీరిప్పుడు మీకోసం కాకుండా భర్త క్షేమం కోసంగాని వ్రతాలు చేస్తున్నవారయితే అప్పుడు అవి ఎవరి పద్దులోకి చేరుతాయో ఏమిటో… లెక్క చూసుకోవడం మంచిదేమో…

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

One Response to ఆడదేవుళ్ళూ – మగదేవుళ్ళూ

  1. “ఈ జన్మలో ఎన్నో పుణ్య కార్యాలు చేసుకోవాలి. దాని వల్ల, వచ్చే జన్మలో ఇంకా గొప్పగా పుట్టడమో, లేదా మరో జన్మ లేకుండా, దేవుని సాన్నిధ్యానికి చేరడమో జరుగుతుంది” అని అన్నాడా భర్త, ఆవకాయ ముక్క పెరుగన్నంలో నంజుకుంటూ.

    “భార్యాభర్తలు పాప పుణ్యాలు పంచుకుంటారంట!” అందా ఇల్లాలు తన భర్తకి మరింత గడ్డ పెరుగు వడ్డిస్తూ.

    “నీ మొహం! ఎవరి పుణ్యం వారిదే! ఎవరి పుణ్యం సంగతి వారే చూసుకోవాలి!” అని ఈసడించాడా భర్త.

    “అదేం కాదు! భర్త చేసుకున్న పుణ్యంలో సగ భాగం భార్యకి వస్తుందంట. భార్య చేసుకున్న పుణ్యంలో భాగం మాత్రం భర్తకి వెళ్ళదంట! మొన్న గుళ్ళో చెప్పిన పురాణంలో ప్రస్తావించారు” అందా భార్య నమ్మకంగా.

    భార్య తెలివి మీద నమ్మకం లేదా భర్తకు.

    “వాళ్ళేం చెప్పారో, నువ్వేం విన్నావో! అసలే ఓ వెర్రి మాలోకానివి” అని తీసి పారేశాడావిడను.

    మొహం చిన్నబుచ్చుకుందావిడ.

    అక్కడే వున్న ఆ మగాయన అత్తగారు అందుకుంది.

    “అది కాదండీ, అల్లుడు గారూ! భర్త చేసుకున్న పుణ్యంలో సగ భాగం భార్యకి వస్తుందని మను ధర్మ శాస్త్రంలో రాశారంటా” అని కూతుర్ని సమర్థించింది.

    అంతే! ఆ భర్త మొహం నల్లబడింది.

    తను చేసుకునే పుణ్యం తగ్గి పోతోందని, ఎక్కువ పుణ్యం చేసుకోవాలో, లేక భార్యకి వెళ్ళే పుణ్య భాగం తగ్గించడానికి, తక్కువ పుణ్యం చేసుకోవాలో అర్థం కాక, మొహం ముట ముటలాడించాడు.

    భర్త అవమానాలు చేస్తే చేశాడు గానీ, అతని పుణ్యంలో సగ భాగం తనకి వస్తుందని మొహం వికసించిందా భార్యకి.

Leave a Reply to ప్రసాద్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.