నూతిలో గొంతుకలు -వనజ తాతినేని

 

అన్న కట్టిన కొత్తింటి చుట్టూ తిరిగి చూసి చాలా బాగుందిల్లు, అదివరకంటే విశాలంగా ఉంది, గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, పైగా బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చని సంతోషిస్తూ పడమటి వైపు గోడకి అవతల వాస్తు దోషం

ఉందని విడగొట్టబడిన స్థలంలో బాగా పెరిగిన వేప చెట్టు, టేకు చెట్టు చూసి పోనీలే వాస్తు పిచ్చిలో పడి మొక్కలకి జాగా అయినా మిగిల్చారు అనుకున్నా. ఎంతైనా తండ్రి అదృష్టవంతుడు. తన జీవితకాలంలో రెండుసార్లు కొత్త ఇళ్ళలో ఉండే భాగ్యం కల్గింది. ఒకటి తండ్రి కట్టిన ఇల్లు, రెండవది కొడుకు కట్టిన ఇల్లు. నీళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈశాన్యంలో తవ్వించిన ఆరడుగుల వెడల్పు గల నూతిలోకి మోటార్‌ బిగించి ట్యాంక్‌లో నీరు నిలవ ఉండే ఏర్పాటు చేసి తండ్రికి నీళ్ళు తోడుకునే శ్రమ కూడా లేకుండా చేశాడు కొడుకు అనుకుంది. ఈ ఇంటి నీటి కష్టాలన్నీ ఆడవాళ్ళవే కదా! ఆర్థికంగా చితికి ఇంట్లో పనివాళ్ళు లేకపోయాక మగమహారాజులు ఏ రోజైనా నూతిలోకి కడవేసి నీళ్ళు తోడిన కష్టం తెలిస్తే కదా అని ఉక్రోషపడింది. అప్రయత్నంగా బలిష్టంగా ఉన్న తన దండ చేతులని చూసుకుంది. మీ పోలికలు, శరీర ఆకృతి అంతా బాగుంటుంది. చేతులే మగవాళ్ళ చేతుల్లా ఉంటాయి అనింది శాంతమ్మ అనే స్నేహితురాలు. ఇంటి అవసరాలకి, పశువులు త్రాగడానికి పదేళ్ళ వయసు నుండి నూతిలో నుండి నీళ్ళు తోడి, మోసి భుజం దగ్గర నుండి మోచేతి దాకా ఒకేలా ఉంటూ బలంగా తయారయింది ఇందుకేననుకుంటా అనుకున్నానపుడు.

మళ్ళీ దక్షిణం వైపు గోడ దగ్గరికి వచ్చి గోడవతల తొంగి చూసే ప్రయత్నం చేసి తనకన్నా అరడుగు ఎత్తు ఎక్కువలో ఉన్న గోడపై నుండి అవతలకి తొంగి చూసే వీలులేక ముక్కాలి పీట యెక్కి గోడవతలకి తొంగి చూశాను. నూతి చూపు తగిలిన ఇరవై అడుగుల వెడల్పు స్థలమంత మేరా వదిలేసి కట్టిన ప్రహరీ గోడ అవతల ఇంటి నేలమట్టం అంతెత్తు చెరువు మట్టి తోలి ఉండడం గమనించి, ”ఎందుకు నాన్నా! అంత మెరక పోశారు. చాలా ఖర్చై ఉంటుందిగా. అయినా ఇప్పుడు నుయ్యి పూడిపోయి రోడ్డులో కలిసిపోయిందిగా, అంత స్థలం వదిలేసి గోడకట్టి విడగొట్టారెందుకు? రెండున్నర సెంట్ల స్థలం దాకా ఉంటుంది. ఇంత స్థలం పోతే చాలా డబ్బు పోయినట్టు కాదు. ఈ ఊరు కూడా జ=ణూలో కలిసిపోయిందిగా”. ”నువ్వు పూడ్చేస్తే మాత్రం దాని చూపు పోనే పోదు, విడగొట్టి ఇల్లు కట్టమన్నాడు సిద్ధాంతి. అందుకే పాతింటి స్థలంలోనే ఉత్తరం, తూర్పు బాగా వదిలి కట్టాం. ఇంచ్‌ కూడా దక్షిణపు ప్రక్క పల్లం ఉండకూడదని అంత మెరక తోలించాడు అన్నాయ్‌” అన్నాడాయన. చూపు సారించి తమకి తూర్పున ఉన్న ఇంటికి ఆగ్నేయంగా రోడ్డులో కలిసిపోయిన పెద్ద నుయ్యిని గుర్తు చేసుకుంది జ్ఞాపకాలలో. ఎంత పెద్ద నుయ్యో అది. పెద్దవాళ్ళందరూ మోటబాయి అనేవాళ్ళు. ఇప్పుడంటే నుయ్యి అని నాజూకుగా అంటన్నారు కానీ నా చిన్నతనంలో బాయే అనేవాళ్ళు అని చెపుతూ తాతయ్య నా చిన్నప్పుడు చెరువు నీళ్ళు రాని చోట పెద్ద బాయిలు తప్పి ఇత్తడితోనూ, ఇండాలియంతోనూ చేసిన పెద్ద పెద్ద బానలతో, తొట్టె ఆకారం లాంటి పాత్రలతో నీళ్ళను ఎద్దులతో తోడించి పాటి మీద తోటల్లో పొగాకు పండించే వాళ్ళు. మన పెద్ద చావిట్లో అటకమీద ఉన్నయ్యే అయ్యే మోటలంటే వెళ్ళి చూసిరా అని చెప్పేవాడు.

పెద్ద నూతిలో నీళ్ళు ఎంత నల్లగా ఉండేవి, అంతే తీయగా కూడా ఉండేవి. ఇత్తడి బిందెకి తాడు బిగించి తాబేటిపై అంగేసి ఒక్కసారిగా తాడుని నూతిలోకి వదిలితే డబ్‌మన్న చప్పుడుతోపాటు నీళ్ళు తొణికిసలాడుతున్న శబ్దానికి రెండు బజార్ల అవతల నిద్రపోతున్న వాళ్ళు కూడా లేసి కూర్చునేవారు. వేపపుల్ల నోట్లో వేసుకుని వచ్చి బిందెలో నీళ్ళు ముంచుకుని తెల్లారిందంటే పిల్లా! నిద్దరబోతున్న నీళ్ళని కూడా లేపేసి జోళ్ళు జోళ్ళు మోసేసి గాబులు నింపేస్తావ్‌! యెనకమాల మాక్కాసిని ఉంచావా లేదా అని పరాచికాలాడేది నాగరత్నమ్మ మామ్మ. తనకి ఊహ వచ్చాకే ముగ్గురు ఆడవాళ్ళు ఆ నూతిలో పడి చనిపోయారు. తను కూడా ఒకసారి కాలు జారి నూతిలో పడిపోతూ ఎలాగో ఒకచేత్తో గట్టిగా తాగాడిని పట్టుకుని వ్రేలాడుతుండగా పెద్ద తాత కొడుకొచ్చి చేతిని పట్టుకుని పైకి లాగి రక్షించాడు. అప్పటికి నిండుగా ఉన్న నూతిలోకి ఒరిగి సగం శరీరం తడిసి పోయింది కూడా.

ఆ రోజు అమ్మ గట్టిగా ఏడ్చింది. గంగమ్మ చల్లగా చూడబట్టి నా బిడ్డ బ్రతికి బయటపడింది. ఆ నూతిలో పడిన వాళ్ళలో ఒక్కరైనా బ్రతికి బయట పడలేదు. పిల్ల నింపిన గాబులో నీళ్ళు పోసుకుని ఉరుకులు పరుగుల మీద రాచకార్యాలు యెలగబెట్టడానికి పోవడమే తప్ప మగాడయి ఉండి ఏనాడైనా నాలుగు జోళ్ళు నీళ్ళు తెచ్చి పోసిన పాపాన పొయ్యాడా అని నాన్నని సాపిస్తూ, ఇంత కఠినాత్ముడిని ఎట్టా కన్నదో మహాతల్లి, ముసలాళ్ళకి నీళ్ళు తోడి పోసావంటే నీ కాళ్ళు ఇరక్కొడతా అంటూ హెచ్చరించింది. మధ్యలో నాయనమ్మ ఏం చేసింది ఆమెని తిడతావ్‌ అంటూ విసుక్కుంటూ అమ్మకి దూరంగా జరిగి బట్టలుతకడానికి వేసిన బొంత రాయిపై కూర్చున్నా. నాయనమ్మ గబగబా వచ్చి పమిట చెంగుతో నీళ్ళు కారుతున్న తలని తుడిచి రిబ్బన్‌ పువ్వునిప్పి రెండు జడలని విప్పి తల బాగా తుడిచింది. అంతమంది దొడ్లలో బారలు బారలు పెరిగిన తాళ్ళున్నాయి. ఒక్కళ్ళైనా ఒక తాడిని నరికి తాగాడిని వెయ్యకపోతున్నారు. పుచ్చిపోయి ఊలిపోయి ఉన్న తాగాడి ఎప్పుడు విరిగి నూతిలో పడుద్దో అన్నట్టు ఉంది. అందరూ సొంత నూతులు తవ్వుకుని దాన్ని వదిలేశారు. ఈశాన్యం స్థలం లేక నుయ్యి తవ్వుకోలేక ఇంత దూరం నుండి నీళ్ళు మోసుకోలేక అవస్థ పడుతున్నాం, ఉండటానికి ముగ్గురు కొడుకులుండి తిండికే కాదు నీళ్ళకే అలమటించాల్సి వస్తోంది అంది నాయనమ్మ కళ్ళు తుడుచుకుంటూ.

మా అమ్మ నీళ్ళు పొయ్యొద్దు అంటే మాత్రం నేను మానేస్తానా నాయనమ్మా! చూడకుండా అయినా నేను పోస్తానుగా ఏడవబాకు అంటే, నీళ్ళ కోసం కాదమ్మా! ఆ నూతి మీద నీళ్ళు తోడుతూ నువ్వేమవుతావో అని నాకు భయం. మీ పెద్దత్తను మింగిన నుయ్యి అది. మీ నాన్న మేనత్తని మింగిన నుయ్యి కూడా అదే అంది. ఇంకా కళ్యాణి, కళ్యాణి వాళ్ళ అమ్మ, మూలింటి వాళ్ళ కోడలు కూడా ఆ నూతిలో పడి చచ్చిపోయారుగా అన్నాను. ఆ తర్వాత ఆ నూతిలో నీళ్ళు తోడడానికి నాకు భయం వేయలేదు కానీ అమ్మకి భయమేసింది.

అమావాస్య రోజు రాత్రిపూట మా ఇంటి చాకలిని తోడు తీసుకుని కోడి పెట్టని ఒకదాన్ని పట్టుకుని దానికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో వేపాకుల దండేసి ఆ కోడి పెట్టని నన్ను నూతి దగ్గరికి తీసుకెళ్ళి కోడిని నా చుట్టూ మూడుసార్లు తిప్పి నేలకు తాపించి కోడిని కోసి తలనుండి కారే రక్తాన్ని నూతిలోకి విదిలించింది మా చాకలి. చచ్చిన కోడిని నూతి ప్రక్కనే గుంట తీసి పూడ్చి వేసి ఆ మట్టిపై పెద్ద రాయిని పెట్టిచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చి తలస్నానం చేయించి నా చేతికి తాయెత్తు కట్టి ఇక భయమేమీ లేదు, గంగ గండం అమ్మాయికి తొలిగిపోయినట్లే అని అమ్మ దగ్గర నుండి వంద రూపాయలు పుచ్చుకుని వెళ్ళింది. ఇక అప్పటినుండి దూరంగా ఉన్న వేరే నూతి నుండి నీళ్ళు తెచ్చుకోవడం మొదలుపెట్టాం. తర్వాత్తర్వాత ఆ నుయ్యి క్రుంగిపోయి పూడిపోయింది. అలా నా జ్ఞాపకాలలో పెద్ద నుయ్యిని గుర్తు చేసుకుని భారంగా నిట్టూర్చి ఇంటిలోపలికి వచ్చాను. ఆ రాత్రి ఇంటికి వచ్చాక కూడా నూతి జ్ఞాపకాలు నన్నొదలలేదు. ముఖ్యంగా కళ్యాణి తన గురించే ఆలోచిస్తూ పడుకున్నాను.

… … …

నేను చెంబు తీసుకుని పాటిమీదకి వెళ్తున్నాను. ఎవరెవరో నేనెరుగని ముఖాలు రెండు, ఎరిగిన ముఖాలు మూడు నూతిలోనుండి కీచు గొంతులతో నన్ను పిలుస్తున్నట్లు ఉంది. అందరూ ఏమిటేమిటో చెపుతున్నారు. ఎవరేమి చెపుతున్నారో నాకసలు అర్థం కావడంలేదు. చెవుల్లో హోరుమనే శబ్దంతోపాటు ఏడుస్తున్న శబ్దం, వెక్కిళ్ళు పడుతున్న శబ్దం. నేను నూతిలోకి తొంగి చూస్తున్నాను. అమ్మ, నాయనమ్మ వచ్చి నన్ను చేయిపట్టి వెనక్కి లాక్కొస్తున్నారు. ఉండండి వాళ్ళు ఏమిటో చెపుతున్నారు విని వస్తాను అంటున్నా వినకుండా ఇంటికి లాక్కుని వచ్చేశారు. నేను బిర్ర బిగదీసి దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు నూతిలో గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి. అబ్బబ్బా! మీరందరూ ఇలా రొద పెడితే నాకేమి అర్థమవుతుంది. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి వింటాను అన్నాను. వినడమే కాదు ఈ రాత్రి మా గొంతుకలకి నీ కలం అరువివ్వాలి, ఎవరికీ చెప్పని రహస్యాన్ని నీకు చెపుతున్నాం అన్నాయి. రహస్యమా! అందరూ చెప్పేది రహస్యాలేనా అంటూ ఆసక్తిగా లేచి కూర్చున్నాను.

ముందుగా వయసులో పెద్దదాన్ని నేను చెపుతా అంటూ రత్తమ్మ గొంతు విప్పింది. నీకన్నా మూడు తరాల ముందు ఇంటి ఆడపడుచుని నేను అంటూ కథ మొదలెట్టిందామె. అయిదుగురు అన్నదమ్ముల మధ్య ఒకే ఒక ముద్దుల చెల్లిని. అన్నదమ్ముల కళ్ళ ముందరే తిరగాలని మేనమామ దాయాదుల ఇంటికి కోడలిని చేశారు. ఐదు రోజుల పెళ్ళి. మీనాలో ఊరేగింపు, వడ్డాణం, కంటె, రవ్వ బేసరి, నాలుగు జతల గాజులు, నాలుగు బళ్ళ ఇత్తడి సామాను, పందిరి మంచం, ఆవు, దూడ, రెండెకరాల పొలం కట్నం కింద రాసిచ్చి సారె చీరలతో ఘనంగా అత్తగారింటికి పంపారు. నేను కాస్త పొట్టిగా, తెల్లగా, మరీ సన్నం, మరీ లావుగా కనబడని ముక్కుతో అందంగా ఉండేదాన్ని. మా ఆయన అన్నదమ్ములిద్దరు. మా ఆయన కూడా నాలానే పొట్టి మనిషి. ఆయనకి విరుద్ధంగా మా బావ ఆజానుబాహుడు, అందగాడు. మా తోడికోడలు పేదింటి పిల్ల. చంకలో పిల్ల, కడుపులో పిల్లతో నీరసంగా ఉండేది. మా అత్త, విధవరాలైన ఆడపడుచు తగని గయ్యాళులు. పెళ్ళైన పదహారు రోజులకే నా ఒంటిమీద నగలన్నీ ఒలుచుకుని భోషాణంలో పెట్టి తాళం బిగించుకున్నారు. గొప్పింటి సంబంధమని చేసుకుంటే ఇంతేనా ఇచ్చేది అని సూటిపోటి మాటలతో దెప్పి పొడిచేవారు. వారానికొకసారయినా ఏదో ఒక సారె పుట్టింటి నుండి రాకపోతే కాల్చుకుని తినేవాళ్ళు. రాత్రిపూట మా ఆయన పడకటింట్లోకి వస్తే చాలు మా అత్తగారు కేకలు పెట్టి ధాన్యం పురి దగ్గర ఎలుకలు తవ్వుతున్నాయనో, దూడలు విప్పుకుని ఆవుల దగ్గరికి వెళ్ళాయనో మమ్మల్ని దూరం చేసేది. పగలల్లా పొలం పనులతో ఆయన, ఇంటి పనులతో నేను తీరిక లేకుండా ఉండేవారిమి. ఏడాది దాటినా మా మధ్య మొగుడు, పెళ్ళాం బంధం ఏర్పడనేలేదు. కోడలు నీళ్ళోసుకోలేదు అంటే ఆమె పుట్టింటి నుండి తెచ్చిన భోగభాగ్యాలు తినడానికి ఆ నలుసే లేదు పాపం అని మెటికలు విరిచేది. మా ఆయన మెతక అవడంతో ఏమీ మాట్లాడలేక నిస్సహాయంగా చూస్తూ ఉండేవాడు. మా బావ చూపు నాపై పడింది. తమ్ముడిని వరికుప్ప దగ్గరికి కాపలాకి పంపి గదిలోకి వచ్చి గడియ వేశాడు. నా అరుపులు విని అత్త, ఆడపడుచు కిటికీ పక్కకొచ్చి నోరుమూసుకుని ఉండు, ఎన్నాళ్ళనుండి సాగుతోందీ రంకు. మేము చూసేసరికి అరుపులు మొదలు పెట్టావ్‌ అని కానీయరా అబ్బాయ్‌, ఒక నలుసు కడుపులో పడితే వారసుడిని అడ్డం పెట్టుకుని దాని మేనమామలు కాజేసిన మన ఆస్తిని దీని అమ్మకి కట్టబెట్టారుగా. ఇప్పుడు దీని అన్నదమ్ముల నుండి ఆ ఆస్తిని లాగేయవచ్చు అని కిటికీ తలుపులు మూసి వెళ్ళారు. కాసేపటికే నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అయిపోయింది. ఆ సంగతి నా అన్నదమ్ములకి చెప్పాలని ఆ అర్థరాత్రి దొడ్డి తలుపు తీసుకుని పుట్టింటికి బయలుదేరాను. ఇంకా ఫర్లాంగు దూరం అయితే పుట్టింట్లో పడేదాన్ని. మా అత్త, ఆడపడుచు, బావ ముగ్గురూ నా వెనుకగా వచ్చి నా చీర చెంగే ముఖాన కప్పి మజ్జిగ కవ్వం తాడుతో మెడకి ఉరి బిగించి ఈ నూతిలోకి తోసేసి ఇంటికెళ్ళి ఏమీ యెరగనట్టు పడుకున్నారు. తెల్లారాక నూతిలో నా శవాన్ని చూసి గగ్గోలు పెడుతూ ఇంకా కడుపు పండలేదు, మా అబ్బాయికి మగతనం లేదా అని అనుకుంటారు అన్నానమ్మా. ఆ మాటకి నూతిలో దూకి చావాలా అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడ్చారు. మా ఆయనకి జరిగింది తెలిసినా పెదవి విప్పలేదు. అత్తింటి వాళ్ళు కట్నం చాలలేదని ఆరళ్ళు పెట్టారు, అందుకే నూతిలో దూకిందని ఏడ్చుకుని ఏడ్చుకుని ఆళ్ళ పిల్లలకి నా పేరు పెట్టుకున్నారు అని ముగించింది. తాతయ్య ఎప్పుడూ చెబుతూ

ఉండేవారు, అసలు సంగతి ఇదా అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. ఇక మీ మేనత్త తన కథ చెపుతుంది విను అంది.

… … …

నా మేనత్త. ఆమెనసలు చూడనేలేదు నేను. అందరూ ఎత్తు, లావు, కళ్ళు, జుత్తు అన్నీ ఆమె పోలికే అంటారు. ఏదీ నన్ను చూడనీ అని బావిలోకి తొంగి చూశాను. గోధుమ రంగు శరీర ఛాయ, పెద్ద కళ్ళు, ఒత్తైన కనురెప్పలు, నల్లటి నిగనిగలాడే పొడవైన జుత్తు, పల్చటి పెదాలు, కొద్దిగా బండ ముక్కు… నాకులాగానే ఉంది ఆమె. అచ్చు అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టుగానే ఉంది. అత్తా… అన్నాను సంభ్రమంగా. చిన్నగా నవ్వింది. నీకులాగానే చురుకుగా ఉండేదాన్ని. ఇంటి వెనక వాళ్ళబ్బాయి దబ్బపండులా పచ్చగా

ఉండేవాడు. కావాలని చేసుకున్నాడు. గోడ దిగి పుట్టింటికి కూడా రానిచ్చేవాడు కాదు. పెళ్ళైన కాడి నుంచి ఒకటే రోగం. ఎంతమందికి చూపించినా నా రోగం తగ్గేది కాదు. ఆఖరికి బెజవాడ వెళ్ళి కూడా చూపించాడు మా పెద్ద తమ్ముడు. అయినా తగ్గలేదు. ఇది ఇంటి పనికి పనికిరాదు, పడకటింటికి పనికిరాదు, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపొండి అని పంపించేశారు. నా రోగం ఏమిటన్నది నేను ఎవరికీ చెప్పేదాన్ని కాదు. మా అత్త పెళ్ళయి నాలుగేళ్ళయినా పిల్లలు పుట్టలేదని తిట్టిపోసేది. పిల్లలు ఎందుకు పుట్టడంలేదో నేను ఎలా చెప్పేది. నా మొగుడు పరమ వికృతమైన మనిషి. క్షేత్రంలో విత్తు నాటితే మొలకెత్తుతుంది కానీ ఇంకెక్కడో నాటుతానంటే ఎన్నాళ్ళని ఓర్చుకునేది. ఎవరితోనైనా చెప్పుకోవాలంటే సిగ్గు. ఆఖరికి డాక్టర్‌తో చెప్పుకుందామంటే మగ డాక్టర్‌ అయిపోయే. ఎవరైనా నీకెక్కడ బాగోలేదు అని అడిగారా? నాడి చూసేది, కళ్ళు చూసేది, ఒళ్ళు చూసేది అంతే. దొడ్డికి వెళ్తే రక్తం ధారలుగా పోయేది. నడక కష్టమై నిత్యం జ్వరంతో

ఉండి కూడా మొగుడి ముందు బోర్లా పడుకునే బాధ ఏందిరా భగవంతుడా అనుకుని కన్నీళ్ళు పెట్టడమే. రక్తం అంతా పోయి ఒళ్ళు నీలంగా మారిపోయి మంచానికి అతుక్కుంటే రెండెకరాల పొలం అమ్మి వైద్యానికి మద్రాసు తీసుకుపోవడానికి తయారయ్యాడు మా పెద్ద తమ్ముడు. అప్పుడైనా నా బాధ ఇది అని మా అమ్మకి చెప్పాలనుకున్నా, కానీ చెప్పలేకపోయా. వైద్యం చేయించుకుని నేను బ్రతికి మళ్ళీ ఆ మొగుడి దగ్గరికే కదా పోవాలి అనుకుని చడీచప్పుడు కాకుండా చెంబుతో నీళ్ళు తీసుకుని పాటి దిబ్బలమీదికి పోతున్నట్లు పోయి ఈ నూతిలో దూకేశా. అట్టా నా వాళ్ళకి ఎకరాలు మిగిలే, నా బాధలు తీరే! అంది కళ్ళు తుడుచుకుంటూ. నేను మాట రాక చూస్తూ

ఉండిపోయా.

మగాడికి పెళ్ళాన్ని సుతిమెత్తగా చూసుకోవడం తెలియకపోయే, మనసెరిగి కాపరం చెయ్యడం తెలియకపోయే. ఒళ్ళో పెట్టేదాన్ని దడిలో పెడతా, రొచ్చుని తీసుకొచ్చి నోట్లో పెడతా అంటే రోగాలు కాక యేమొస్తాయి తల్లీ! పగాడికి కూడా వద్దు ఈ బాధ. సాని కొంపల్లో పుట్టిందానికి కూడా యెగటు పుట్టే కాపరం అది. ఇదిగో ఈ గంగమ్మ చేతులు చాపి చల్లగా తనలోకి చేర్చుకుని రొవ్వంత శాంతినిచ్చింది. చెప్పుకోలేని రోగం వచ్చి చచ్చిపోయింది అని చెప్పుకోకండి, ఇకముందు మన ఇంటి ఆడాళ్ళనైనా ఇదిగో అత్త ఈ ఇబ్బంది పడి చెప్పుకోలేక చచ్చిపోయింది అని చెప్పుకోండి తల్లీ అని కళ్ళు తుడుచుకుంది. ధారలుగా కారే కన్నీటిని తుడుచుకోవాలనే స్పృహ కూడా లేకుండా అత్తా అని ఆమె దగ్గరికి వెళ్ళబోయాను. జాగ్రత్తమ్మా! నూతిలో పడిపోతావ్‌, వెనక్కి వెళ్ళు, నేను కూడా వెళుతున్నా అని మాయమయింది ఆమె.

… … …

అత్తా అని లేచి ఏడుస్తున్నాను. కలో, మెలుకవో తెలియని స్థితిలోనే కాసిని నీళ్ళు త్రాగి పడుకున్నాను. మళ్ళీ కళ్ళముందు కళ్యాణి కదలాడింది. నిజంగానే కళ్యాణి కాలుజారి బావిలో పడిందా లేక వాళ్ళ అన్నయ్య స్నేహితుడు అమ్మ, నాన్న ఆట ఆడేశాడా? అప్పటికీ, ఇప్పటికీ నా సందేహం అలాగే ఉండిపోయింది… ఆలోచిస్తూ అలా కళ్ళు మూసుకున్నాను.

… … …

వెక్కి వెక్కి ఏడుస్తోంది కళ్యాణి… ఏయ్‌! ఎందుకేడుస్తున్నావ్‌… నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా చాలా ఏడ్చాను కళ్యాణీ. ఏం జరిగింది? వాడు చెంబు తీసుకుని వెళ్ళినప్పుడు తుమ్మ పొదలమధ్యకి తీసుకెళ్ళి మళ్ళీ ఏమన్నా చేశాడా? అమ్మ, నాన్న ఆట ఆడితే పిల్లలు పుడతారని నీకు ఖచ్చితంగా తెలుసా? అవున్లే మీ నాన్నగారు డాక్టరేగా! నీకు తెలిసే ఉండవచ్చు. పిల్లలు పుడతారంటే ఇష్టం లేకపోతే మందులేసి, జిల్లేడు వత్తులేసి కడుపులు తీసేస్తారని నువ్వే చెప్పావుగా! అలా చేయించుకునే పనిగా, అసలెందుకు చచ్చిపోయావ్‌. నాకు ఆడుకోవడానికి నీలా మంచి స్నేహితులే లేరని ఎంత ఏడుస్తున్నానో తెలుసా అన్నాను. కళ్యాణి నవ్వి నువ్వు చాలా తెలివికలదానివి. నీకు అనుమానం వచ్చేసిందా? నిజంగానే నేను నూతిలో ప్రమాదవశాత్తు పడిపోలేదు, కావాలనే దూకేశాను. మా అన్నయ్య స్నేహితుడు ఆ సాయిబ్బుల అబ్బాయి నా వెంట పడుతున్నాడని చెప్పానుగా, వాడే మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు దూరి మా పందిరి మంచం కింద ఒక్కసారంటే ఒక్కసారి అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అని ఆడాడు. తర్వాత కూడా మా అన్నయ్యకి ఆ సంగతి చెప్పేస్తా అని బెదిరించి రోజూ ఆడుతూనే ఉన్నాడు. అమ్మ లేదు, అక్క దగ్గరికి కాన్పు చేయడానికి వెళ్ళింది కదా! నాన్న కూడా రోజూ ఇంటికి రాకుండా నర్స్‌ ఇంటికే పోతున్నాడు. ఇక నేను ఎవరికి చెప్పాలి? అన్నయ్యకి చెప్తే చంపేస్తాడు. ఆ రోజు మధ్యాహ్నం వాంతులు అయ్యాయి. అవి ఎలాంటి వాంతులో నాకు తెలుసుగా. అక్కవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు అలానే వాంతి చేసుకునేవారు. మధ్యాహ్నం అమ్మ, నాన్న ఆట ఆడుకుందామని వచ్చిన ఆ సాయిబ్బుల అబ్బాయిని మనం నిజంగానే అమ్మ, నాన్నలం కాబోతున్నాం. ఎటైనా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందామని అడిగాను. అప్పుడు వాడు అమ్మా, నాన్న ఆటా, అసలు మనమెప్పుడు ఆ ఆట ఆడాము? నాకు తెలియనే తెలియదు. మీ నాన్నకి చెప్పి నిన్ను కొట్టించాలి అని వెళ్ళిపోయాడు. నాకు ఏడుపొచ్చి నూతిలో దూకేశాను అంది. నా అనుమానం నిజమే అయింది కళ్యాణీ! అసలు నువ్వెందుకు అలా చేశావు? వాడు నన్ను కూడా అలాగే అన్నాడు. మా అమ్మతో చెప్తానన్నాను. నువ్వు నాతో అప్పుడే చెప్తే మా అమ్మతో చెప్పి వాడి కీళ్ళు విరగ్గొట్టిచ్చి ఉండేవాళ్ళం కదా! అనవసరంగా చచ్చిపోయావ్‌ అన్నాను వెక్కుతూ. కళ్యాణి కూడా ఏడుస్తూనే ఉంది. మీ అమ్మ రాకుండానే నిన్ను పూడ్చి పెట్టేశారు. తర్వాత మీ అమ్మ వచ్చి ఎంత ఏడ్చిందో తెలుసా! మంచానికి అతుక్కుపోయింది. ఆ సాయిబ్బులాడు వంకరగా నవ్వుతూనే ఉండేవాడు నన్ను చూసి. ఒకరోజు పాటి మీద నా చెయ్యి పట్టుకున్నాడు. ఏడుస్తూనే చెంబుతో వాడి ముఖం మీద కొట్టి పారిపోయి వచ్చేశాను. తర్వాత నేను నూతిమీద నీళ్ళు తోడుతుంటే నూతిలో ఈత కొడుతూ నా కాళ్ళ మధ్యనుంచి చూస్తూ ఏడిపించేవాడు. అప్పుడు అమ్మకి చెప్పాను వాడి సంగతి. తర్వాత మా ఇంట్లో మరుగుదొడ్డి కట్టించేసింది. తర్వాత వాడికి పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్ళాం ఎవరితోనో లేచిపోయింది. వాడికి ఏదో రోగం వచ్చి ఈసురోమంటూ ఉండేవాడు. ఇప్పుడు వాడు చచ్చాడో, బతికాడో కూడా తెలియదు. నాకు వాడంటే అంత అసహ్యం. అన్నట్టు నీకు తెలుసా? మీ అమ్మ కూడా ఇదే బావిలో పడి చచ్చిపోయింది అన్నాను. ఇదిగో అమ్మ కూడా ఇక్కడే ఉందిగా చూడు అంది కళ్యాణి.

… … …

”డాక్టర్‌ గారి అత్తయ్యగారూ” అన్నాను నేను సంతోషంగా. పిల్లా! ఇంకా ఆ పేరుతోనే పిలుస్తావా? అంటూ నవ్వింది. ఎలా

ఉన్నారు? మీరు ఈ నూతిలో పడి చచ్చిపోయాక ఇక ఎవరూ ఈ నూతి నీళ్ళు వాడటం మానేశారు. మేము కూడా నీళ్ళకి రావడం మానేశాము. అవునూ! మీరెలా పడిపోయారు? కళ్ళు తిరిగి పడిపోయారా? అన్నాను.

లేదమ్మా! చెప్పుకుంటే సిగ్గుచేటు. మా ఇంటెదురుగా ఉండేవాడే మీ రంగారావు మామయ్య, వాడే నా చావుకి కారణం. ఛీ… వాడా! వాడంటే ఆడాళ్ళందరికీ అసహ్యం. కళ్యాణీ కూడా మీకెప్పుడూ చెప్పి ఉండదులే. ఆడపిల్లలు కనబడితే చాలు పంచె ఎత్తి రెండు కాళ్ళ మధ్యన ఉన్నదాన్ని తీసి చూపించేవాడు. దాన్ని చేత్తో పట్టుకుంటావా, రూపాయిస్తా అనేవాడు. వాడితో మాట్లాడితే వాత పెడతాను, వొట్టి మదపు వెధవ అని మా చిన్న మేనత్త కూడా తిట్టేది అన్నాను. ఊ… వాడే! మీ డాక్టర్‌ మామయ్యగారు లేనప్పుడు ఇంట్లోకి చొరబడి మా ఆవిడ కార్తీక మాసం అని మడి కట్టుకుని కూర్చుంది. వస్తానన్న నర్సి ముండ ఇంతవరకూ రాలేదు, మీ ఆయన లేడుగా. వెయ్యి రూపాయిలిస్తా అంటూ తలుపులు బిగించి కాళ్ళు, చేతులు మంచానికి కట్టేసి ముఖం మీదకి తెచ్చి రుద్దబోయాడు. అరిసినా వదిలిపెట్టలేదు. చెంపలు చెపలు వాయించి వాడి కుతి తీర్చుకోబోయాడు. పైగా… మీ ఆయన డాక్టర్‌గా, ఇలాంటివి నీకు నేర్పే ఉంటాడు, నువ్వైతే బాగా ఒడుపు నేర్చుకుని ఉంటావని వస్తే ఇలా కొరికి పెడతావేమిటే ముండా అంటూ… పిడిగుద్దులు గుద్దాడు. నేను గట్టిగా అరిచేసరికి వెనకింటి వదినగారు వచ్చారు. ఆమెని చూసి రెండు కాళ్ళ మధ్య రక్తం కారుతున్న దాన్ని పంచతో ఒత్తిపెట్టుకుని పరిగెత్తాడు. ఆరుగురు బిడ్డల తల్లిని, అన్నయ్యగారూ అని పిలిచే నన్ను వావి, వరస మరచి బిడ్డపోయిన దుఃఖంలో ఉన్న సంగతి కూడా మరిచి అంతటి దురాగతానికి పాల్పడ్డాడు. అందరూ నావి ఎత్తు పళ్ళు, పార పళ్ళు అని ఎక్కిరించేవారుగా. ఆ పళ్ళనే ఆయుధాలుగా చేసి వాడి తాట తీశాను కానీ వెనకింటి ఆమె చూడనే చూసింది. మీరు చనువియ్యకపోతే ధైర్యంగా లోపలికి ఎలా వస్తాడు? డబ్బులకి ఆశపడి ఉంటారు, అందులో కుటుంబం కూడా జరగడం లేదుగా అంది. అవమానం అనిపించింది, నూతిలో దూకాను. అందరూ మతిస్థిమితం లేక, నీళ్ళు తోడుకుంటూ ఓపికలేక కళ్ళు తిరిగి పడిపోయిందని అనుకున్నారని చెప్పింది. అత్తయ్యగారూ! అన్నాను బాధగా. ఆ రంగారావు గాడు మిమ్మల్ని అలా చేసినందుకు ఏదో గుప్తరోగం వచ్చి చచ్చాడులే అన్నాను. నూతిలో నుండి ఏ సవ్వడి లేదు. అయ్యో! ఇప్పటిదాకా మాట్లాడిన వీళ్ళందరూ ఇంతలోనే ఏమైపోయినట్లు అనుకుంటూ నూతి ఒడ్డు నుండి లేవబోయాను.

… … …

అందరూ చెప్పింది విన్నావు, మరి నేను చెప్పేది వినవా అంది ఇంకో చెయ్యి పైకెత్తి ఊపుతూ. ఆ చేతినిండుగా రంగురంగుల గాజులు. ఇంకో రెండు రోజులుంటే అమ్మలక్కలు ఆ చేతుల గాజుల్ని పగలగొట్టి విధవని చేసేసేవాళ్ళు. పెద్ద కర్మ అవ్వకముందే చనిపోయింది కాబట్టి ఇదే నూతి ఒడ్డున చేటల నిండుగా గాజులు తెచ్చి అందరికీ పంచిన జ్ఞాపకంలో నుండి తేరుకుంటూ ఆమె వంక చూసి నువ్వు మూలింట్‌ వాళ్ళ కోడలివి కదా అన్నాను. అవును అంది నవ్వుతూ. చందమామ ముఖంలో మల్లెపూలు పూసినట్టుంది ఈమె నవ్వు అనుకున్నాను. పాపం! మీ ఆయన చనిపోయాడని నువ్వు కూడా నూతిలో దూకి చనిపోయావు కదూ! తప్పు కదూ! పాపం నెలల పసిపిల్లవాడ్ని వదిలేసి మీరిద్దరూ అలా చచ్చిపోవచ్చా అన్నాను. ఏం చేయను? చచ్చిపోవాలని లేకపోయినా చచ్చిపోయాను. మా మామ ఎలాంటి అభాండం వేశాడో నా మీద ఆయనకి రెండో భార్యను నేను. మా అత్తమామ ఎప్పుడో గొడవలు పడి విడిపోయారంట. మా ఆయన మా మామ దగ్గర పెరిగి మంచి ఉద్యోగస్తుడు అయ్యాడు. హాస్పిటల్‌లో పనిచేసేవాడు. మా ఆయనకి పెళ్ళిచేసి ఆయనతోనే

ఉండేవాడంట మామ. రెండో సంబంధం అయినా అందంగా ఉండాడు, ఆస్తిపాస్తులున్నాయని మా అమ్మ నన్ను ఒప్పించి పెళ్ళిచేసింది. సంబంధం మాట్లాడుకునేటప్పుడు తండ్రి, కొడుకు వేర్వేరుగా ఉండేటట్లయితేనే పిల్లనిస్తానని మా అమ్మ చెప్పిందంట. మా మామ ఈ ఊర్లోనే ఉండేవాడని మీకు తెలుసు కదా! అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. మా ఆయన తను ఉన్నప్పుడే తండ్రిని మా ఇంటికి రమ్మని, తను లేనప్పుడు మా ఇంటికి రావద్దని గట్టిగా చెప్పేశాడు. నా సవతి మీద లేనిపోనివన్నీ పుట్టించి మా ఆయనకీ ఎక్కించి వాళ్ళని విడగొట్టేశాడని మా ఆయన చెప్పేవాడు. మా ఆయన చచ్చిపోయిన రోజు యేమి జరిగిందంటే మామ మా ఇంటికి వచ్చాడు. భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి మా ఆయన డ్యూటీకి వెళ్తూ తండ్రిని బస్‌ ఎక్కించాడు. మా ఆయన దూరంగా వెళ్ళాక, ఎక్కిన బస్సు దిగి మళ్ళీ మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. నాకు ఏదో జరుగుతుందని భయంగానే ఉంది. వంటింట్లో పనిచేసుకుంటున్న నా వెనుక నిలబడి నడుం చుట్టూ చేయి వేశాడు. అంతలో భళ్ళున తలుపు తెరుచుకుంది. గుమ్మంలో మా ఆయన. నన్నేమీ అనలేదు కానీ తండ్రి ముఖాన ఖాండ్రించి

ఉమ్మాడు. లోపలి గదిలోకి వెళ్ళి మత్తు ఇంజక్షన్‌ చేసుకుని మంచంపై పడుకుని చనిపోయాడు. నేను చూసేసరికి ఘోరం జరిగిపోయింది. దహన కార్యక్రమాలన్నీ అయ్యాక కొడుకు చచ్చిపోవడనికి కారణం నేనే అని, ఆయన హాస్పిటల్‌ నుండి ఇంటికి వచ్చేసరికి నేను ఎవరితోనో కలిసి ఉండడం చూశాడని, అందుకే ఇంజక్షన్‌ చేసుకుని చచ్చిపోయాడని బంధువులందరికీ చెప్పాడు. ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని పేచీపెట్టాడు. కొడుకు ఎందుకు చనిపోయాడో మా అత్తకి తెలుసు. అంతకు ముందు భార్యపై చెప్పిన కల్లబొల్లి విషయాలన్నీ కూడా మా మామ కట్టుకథలే అని తల్లీ కొడుకులకి తెలుసని ఆమె చెప్పింది. అర్థరాత్రి సమయంలో నన్ను నిద్రలేపి వాడి నిజస్వరూపాన్ని నా కళ్ళకి చూపించింది. పశువులతోనూ, పెంపుడు కుక్కలతోనూ వాడి పైశాచిక రతి క్రీడల గురించి చెప్పింది. నేను వణికిపోయాను. కొడుకుకి వారసత్వంగా వచ్చే ఆస్తిని పసిపిల్లాడి పేరున వ్రాయించడానికి పూనుకుంది కూడా. మా అత్త కూడా నా తరపున మాట్లాడేసరికి నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా భర్తకి వచ్చే వాటా కాకుండా తనకున్న ఆస్తి మొత్తం నా పిల్లాడికి వ్రాసి ఇస్తానని, తనతో ఉండిపొమ్మని, లేకపోతే బయటవాళ్ళతో ఎవరితోనో కాదు, నీకు నాకు సంబంధం ఉండడంవల్లే నా కొడుకు చచ్చిపోయాడని చెబుతానని బెదిరించాడు. వాడి వేధింపులు భరించలేక నేను లేకపోయినా, పిల్లాడిని మా అత్త బాగా చూసుకుంటుందనే నమ్మకం కుదిరి… చెంబు పట్టుకుని వచ్చి మా అమ్మ ప్రక్కన ఉండగానే ఈ నూతిలో దూకేశాను అంది. నేను మూగబోయి వింటూనే ఉన్నా.

ఆడాళ్ళకి చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడల్లా ఇదిగో ఇట్టాంటి నూతులే సీతమ్మని, భూదేవి తల్లి తనలోకి పొదువుకున్నట్టు చల్లగా అక్కున చేర్చుకుంటుంది. వినిపించుకునే మనసుండాలే కానీ వేల వేల నూతుల్లో నాలాంటి స్త్రీల లోగొంతుకలు వినబడుతూనే ఉంటాయి. నీ కలం అరువిచ్చి ఈ గొంతుకలను వినిపించు చెల్లీ… ఇంటింటికి ఒక నుయ్యి లేకపోయినా, వీథి వీథికి ఒక నుయ్యి అయినా ఉండాలి. జనం నీళ్ళు త్రాగడానికి కాదు, మన ఆడాళ్ళు కన్నీళ్ళు దాచుకోవడానికయినా నుయ్యి ఉండాలి. నూతులని పూడ్చనీయకండి. తరతరాల ఆడాళ్ళ అభిమానాన్ని ఇలాగన్నా నిలుపుకోనీయండి. వికృతమైన మగాడి కోరికల అగ్గి నుండి తప్పించుకుని పుట్టిళ్ళు ఆదరించకపోయినా, నిస్సహాయతలో ఆదుకోవడానికి ఓ తోడు ఉండనివ్వండి అంటూ తలని నీళ్ళలోకి వంచింది ఆమె. నేను తేరుకునేలోపే గుడగుడమనే శబ్దంతో నూతి మధ్యలో నీళ్ళు కాసేపు వలయాలుగా తిరిగి తిరిగి నిశ్చలంగా నిలబడిపోయాయి.

పొద్దున్నే పనిమనిషి వచ్చి ఇల్లు ఊడుస్తూ, అమ్మగారూ… ఇవిగో ఈ కాయితాలు ఏంటో చూడండి పనికొచ్చేయే అంటారా. కథలు గిథలు వ్రాసుకుంటారుగా, అయ్యేమన్నానేమో చూసుకోండి అంటూ పేపర్‌ చదువుకుంటున్న నా ముందు పెట్టి వెళ్ళింది.

నేనెప్పుడు వ్రాసానబ్బా ఈ కథ! అనుకుంటూ చూశానా… నూతిలో గొంతుకలు అని కనబడింది. వినబడింది కూడానేమో! అందుకే కలం అరువిచ్చాను కాబోలు అనుకుంటూ ఆలోచనగా ఆ కాగితాలవైపు చూస్తూ ఉన్నాను.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.