గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’ – ఎ.కె.ప్రభాకర్‌

 

‘నా వాళ్ళ బ్రతుకు గాయాల మయం. వ్యాపారం, వస్తు వ్యామోహం ఎక్కువయిన నేపథ్యంలో ఆదివాసీల మనుగడ మరింత సంక్లిష్టమైంది. నా అక్క చెల్లెళ్ళ మానప్రాణాలకు విలువనివ్వని ‘వాకపల్లి’ సంఘటనలు… కంటి మీద కునుకు పట్టనివ్వని ‘గ్రీన్‌ హంట్‌’లు, సల్వా జుడుంలు అడవిని మాకు కాకుండా చేసే ఎత్తుగడలే’.

కొండకి నమస్కరించి (శిలకోల కథల సంపుటి, ముందుమాట-2011)’

ఇది అడవి బిడ్డ మల్లిపురం జగదీశ్‌ ఆవేదన. రచయితగా జగదీష్‌ ఆదివాసి బతుకు గాయాల మయం కావడానికి, మనుగడ సంక్లిష్టం కావడానికి కారణాలు తెలుసుకున్నాడు. ఆ గాయాలకు ఆకుపసరు కోసం అడవీ, కొండా గాలిస్తున్నాడు. తన నేలకి తాను పరాయి అవుతోన్న వైనాన్ని చూసి బిత్తరపోతున్నాడు. అడవి నుంచీ ఆదివాసిని వేరుచేస్తున్న కుట్రల్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాడు. వెంట్రుక వేసి కొండను గుత్తగా గుంజుకుపోతున్న ధోకాబాజీల అతి తెలివికి సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు. తమ సంస్కృతి నుంచి తమను దూరం చేస్తున్న నాగరిక దుర్మార్గాన్ని నిక్కచ్చిగా నిరసిస్తున్నాడు. ప్రకృతితో ముడివడి ఉన్న ఆదివాసి సంస్కృతిని కొండ నెత్తిమీద నిలబెట్టి చూపుతున్నాడు. తన లోపలి కల్లోలాన్ని కథలు గట్టి మనలోకి నేరుగా ప్రవహింపజేస్తున్నాడు.

ఆదివాసీలకు ‘విత్తనం నాటితే పండుగ. మొలకెత్తితే పండుగ. పూస్తే పండుగ. కోత కోస్తే పండుగ. ఎంత గొప్ప సంస్కృతి. ప్రకృతి మార్పులకనుగుణంగా సంప్రదాయ గిరిజన జీవితం!!!’ కానీ యిప్పుడు కొండమీద కంది కొత్తల్లేవు. ధింసా అడుగుల్లేవు. తుడుం దెబ్బల్లేవు. డప్పుల మోతల్లేవు. కిన్నెర పాటల్లేవు. పిన్లకర్ర రాగాల్లేవు. జాకరమ్మ పూజల్లేవు. గొడ్డలమ్మ ముస్తాబుల్లేవు. ‘దుర్ల’ దూకుడు లేదు. ‘శతర’ ఆట లేదు. జీలుగు కల్లు ఇప్పసారాల మత్తు లేదు. అన్నీ మాయమైపోయాయి. వాటి స్థానంలో హై వాల్యూం స్టీరియో డెక్‌ మ్యూజిక్‌లు, రికార్డింగ్‌ డాన్సులు, డిస్కో చిందులు, హేపీ న్యూ ఇయర్లూ, బ్రాందీ, విస్కీలు, బిర్యానీ పార్టీలు, గడప గడపనా పేకాటలు, పాన్‌ పరాగ్‌లు, ఖైనీలు చొచ్చుకువచ్చాయి. కొండ శిరస్సుపై డిష్‌ ఏంటెన్నాలు మొలిచాయి. లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు, సీరియళ్ళు, ఎఫ్‌ టీవీలో అర్థనగ్నంగా అమ్మాయిలు చేసే కేట్‌వాక్‌లు అడవిలోకి దావానలంలా దర్జాగా నడిచొచ్చాయి. సెల్‌ ఫోన్లూ, వీసీడీ డీవీడీల్లో బ్లూ ఫిల్మ్‌లు అనేకానేక కొత్త మెమొరబుల్‌ మూమెంట్స్‌ దెయ్యాల్లా వచ్చి చేరాయి. గిరిజన జీవితంలోని సామూహికత అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఊరు చినుకు రాలని చీకటి కొండలా ఉంది. అందుకే జగదీశ్‌ కథలో కళ్ళముందే ‘వాయిదాల పద్ధతిలో బతుకంతా పరాయివాడి చేతిలోకి వెళ్ళిపోయింద’ని దిగులు ధ్వనిస్తుంది. ‘సుఖాల వేటలో మనిషి మృగమైపోతున్నాడ’ని క్రోధం కనిపిస్తుంది. తన అక్క చెల్లెళ్ళ కలలు కాలుతున్న వాసన అతని అక్షరాల్లో ఘాటుగా ముక్కుపుటాల్ని తాకుతుంది. ‘దారితప్పి తిరుగుతున్న తన వాళ్ళని దారిలో పెట్టాల’నే ఆర్తి వినిపిస్తుంది. ఆరిన నిప్పులా ఉన్న అడవీ, కన్నీటి కుండలా ఉన్న కొండా గుండె కోతకి కారణమౌతాయి. అంతరించిపోతున్న స్వీయ సంస్కృతి మీద అలవికాని అనురాగం పెల్లుబుకుతుంది. మాయమైపోతున్న మానవ సంబంధాలను నిలుపుకోవాలనే తపన తడితడిగా తగులుతుంది.

శిలకోల సంపుటిలో కథలన్నీ 2000 తర్వాత రాసినవే కానీ వాటిలో వర్ణించిన జీవితం మూడు తరాలది. జగదీశ్‌ తన తాతలనాడు కొండ బిడ్డని, షావుకార్లు, సొండీలు, బుగతలు దోచుకున్న వైనం గురించి, దానికి వ్యతిరేకంగా గురువుల అండతో చేసిన సాయుధ పోరు గురించి విన్నాడు. తన తండ్రుల కాలంలో అభివృద్ధి పథకాలు గిరిజనుల్ని అడవికి దూరం చేసి ఆర్థికంగా అవిటివాళ్ళుగా మార్చిన క్రమాన్ని చూశాడు. ఇప్పుడు తన తరంలో ప్రపంచీకరణ నేపథ్యంలో అడవిని కబళించిన మార్కెట్‌ శక్తులు ఆర్థికంగా, సాంస్కృతికంగా ఆదివాసిని పరాయీకరణకు గురిచేస్తున్నన హింసని స్వయంగా అనుభవిస్తున్నాడు.

తన ముందు తరం వాళ్ళు చీకటితో యుద్ధాలు చేస్తేనే ‘ఇప్పుడున్న ఆస్టల్లు, ఇస్కూల్లు, డిపోలు, జీసీసీలు, తెల్లబువ్వల

ఉద్యోగాలు’ వచ్చాయనే యెరుక సైతం అతనికి ఉంది. అప్పటి తరం చేసిన యుద్ధాల్లో అంటుకొన్న అడవి గురించి- దాన్ని రగిల్చిన కొండగాలి గురించి, ఆ తర్వాత వీచిన కొత్తగాలుల గురించి భూషణం మాస్టారు కథలు బోధించారు. భూషణం ఆగిన చోట అట్టాడ అప్పల్నాయుడు మొదలై పాలకుల గిరిజనాభివృద్ధి పథకాల్లోని డొల్లతనాన్నీ, పునరావాసాల అమానవీయతనీ ఎంతో ఆవేదనతో, క్రోధంతో అక్షరాల్లోకి తర్జుమా చేశాడు. అటెనక సంక్షోభాలకు గురైన గిరిజన జీవితంలో చోటుచేసుకున్న దృశ్యాదృశ్య హింసనీ దాన్నుంచీ బయటపడడానికి అడవి బిడ్డలు చేసే రాజకీయ సమరాన్ని సువర్ణముఖి సాహిత్యంలోకి తెచ్చి దానికి న్యాయసమ్మతిని సాధించే ప్రయత్నం చేశాడు.

ఉత్తరాంధ్ర నేల నుంచి ఈ యానగాలి తెలుగు కథకి ఆరని నిప్పురవ్వల్ని జోడించింది.

అయితే ఈ రచయితలెవరూ కొండ బిడ్డలు కారు. పల్లం నుంచీ, మైదానం నుంచీ వచ్చినవాళ్ళే. కొండ పాదులో నుంచొని తలెత్తి కొండని చూసి అక్కడి ప్రజల జీవన పోరాటాన్ని, మరణ యాతననీ సొంతం చేసుకుని ఆర్తితో సహానుభూతితో కథీకరించారు. కానీ మల్లిపురం జగదీశ్‌ తెలుగులో తొలి ఆదివాసీ రచయితగా ఇన్‌సైడర్‌గా తన చుట్టూ తన జాతి జనుల జీవితాల్లోని సంక్షోభాన్నీ, సంఘర్షణనీ, సంక్లిష్టతనీ అనితరంగా పట్టుకుని మనకు అందిస్తున్నాడు. అందుకే ఉత్తరాంధ్ర కథల్లోనే కాదు, తెలుగు కథల్లో సైతం కొండ బిడ్డ గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ‘శిలకోల’ కథలు విలక్షణమైనవీ, విశిష్టమైనవీ. ఇవి అన్నివిధాలా అచ్చమైన ఆదివాసీ కథలు. తమవికాని జీవితాల్ని జగదీశ్‌ రాయలేదు. గిరిజన సాంస్కృతిక సామాజిక చలనాన్ని జగదీశ్‌లా మరొకరు రాయలేరు. గిరిజన సాంస్కృతిక అస్తిత్వ చైతన్యంతో కొండ జీవన సౌందర్యాన్ని కవితాత్మకంగా ఉన్నతీకరించిన ‘టిహిలికి పెళ్ళి’ (2010) లాంటి కథలు జగదీశ్‌ వంటి ఆదివాసీ మాత్రమే రాయగలడు. బయటి వాళ్ళనుంచీ ఊహించలేం.

ఆదివాసీ జీవితానికి సంబంధించిన అనేక పొరల్ని జగదీశ్‌ అపూర్వంగా ఆవిష్కరించాడు. బడిలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుల వద్దే అవమానాలను ఎదుర్కొన్న స్వీయ జీవితానుభవం నుంచే అతను కథకుడుగా మొదలయ్యాడు (అక్షరాల దారిలో… 2000). బడిలో దిద్దిన అక్షరాల్లోనే ఎక్కడో ఆత్మగౌరవ స్వరాన్ని సరాయించుకున్నాడు. చదువుల ద్వారా సాంస్కృతిక మూలాలకు దూరమౌతున్న క్రమాన్ని పసిగట్టాడు. ఒక అపరాధ భావనతోనే కావొచ్చు, వాటికి కారణాలు వెతుక్కున్నాడు. బయటపడడానికి సంఘర్షణ అనివార్యమని గ్రహించాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం చంద్రయానం చేయడానికి ఉత్సాహపడుతుంటే ఆకలికి విషపు గడ్డలు తినో, టెంక పిండంబలి తాగో సరైన వైద్యం లేక ప్రాణాల్ని పోగొట్టుకున్న కొండ మనుషుల్ని చూసి విచలితుడయ్యాడు (వాన 2010). క్రీస్తు సంఘాలు, పాస్టర్లు గిరిజనుల మెడలో వేలాడదీసిన శిలువల్ని చూశాడు, నేర్పిన వాక్యాల్ని విన్నాడు (గాయం 2008). షావుకారి తరాజు, పోలీసు లాఠీ మిలాఖత్‌ అయి చేసి మూగ గాయాల్ని తడిమాడు (ఉరులు). ‘ఒకప్పుడు నాటుబళ్ళ మీదికి బస్తాలు మోయించి సరుకులు తీసుకెళ్ళిన షావుకారు ఇప్పుడు లారీని నేరుగా కళ్ళానికే తెచ్చి పంటల్ని సులభంగా మోసుకుపోతున్న’ సౌకర్యాల దారుల్ని గమనించాడు. అడవి బిడ్డల అరణ్య రోదనకి అసలు కారకుల్ని గొంతెత్తి నిలదీయడానికి పూనుకున్నాడు. రైతాంగ పోరాటాలు గిరిజన జీవితాల్లో తెచ్చిన ఎన్నో మార్పుల్ని అతను లోతుగా పరిశీలించాడు. వాటిని అణచివేయడంలో భాగంగా అనేక ప్రలోభాలకు గురిచేసి గిరిజనుల్ని ఉద్యమాలకు దూరం చేసిన వైనాన్ని విడమరచి వివరించాడు. ఆ క్రమంలో అమలైన సంక్షేమ పథకాలు, ఐటీడీఏ-గిరిజన కార్పొరేషన్‌ మొదలైన ప్రభుత్వ సంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ళు, చదువులు-ఉద్యోగాలు, అంది వచ్చిన ఆధునిక సదుపాయాలూ, సౌకర్యాలూ అన్నీ ఆదివాసిని అడవి నుంచి వేరుచేయడానికి దోహదం చేశాయన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. వాటన్నింటినీ విమర్శనాత్మకంగా విశ్లేషించాడు. ‘పెరట్లోని పెసర కాయలో… కొండమీది కంది గింజలో… చింతపండో సంతకి దిగి పాకెట్‌ మనీగా మారుతున్నా డబ్బు అవసరం ఇంకా తీరని’ యువత కొత్త అలవాట్లని అసహ్యించుకున్నాడు.

అమలౌతున్న అభివృద్ధి నమూనాలు తప్పని చెప్పడానికి అతను ఎక్కడా తడబడలేదు. నీళ్ళు నమలలేదు. అభివృద్ధి ఆదివాసి జీవితాల్లోని చీకటిని తొలగించలేదు సరికదా మరింత చీకటినే నింపిందని ప్రతి పదంలోనూ లోతుగా చర్చించి నిరూపించాడు (సిందవ 2010). డి ఫర్‌ డెవలప్‌మెంట్‌ కాస్తా డి ఫర్‌ డిస్ట్రక్షన్‌గా తయారైందనీ, సమీకృత అభివృద్ధి విషమీకృత విధ్వంసంగా మారిందనీ ఆదివాసీ స్త్రీల బతుకులు అగ్గిపాలయ్యాయనీ తీవ్రస్వరంతో నిరసించాడు. అందుకు కారణమౌతున్న ప్రతి సందర్భాన్నీ, వ్యవస్థనీ ద్వేషించాడు. బతుకుతో, నాగరిక సమాజంతో పెనుగులాడే ఆ స్త్రీల పట్ల అమితమైన అనుకంప అతని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.

గిరిజన స్త్రీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ సర్వస్వాన్నీ దోచుకుని జీవితాల్ని నాశనం చేసే గిరిజనేతరులు లెక్కలేనంతమంది. గిరిజన సంప్రదాయం ప్రకారం రెక్కపట్టిన వాడితోనే ఆ స్త్రీ బతుకు ముడిపడిపోతుంది. వాడు గిరిజనేతరుడైనా నామమాత్రపు దండగ కట్టేసి ఆమెను సొంతం చేసుకుని పెత్తనం చెలాయిస్తాడు. ఆమెను పనిమనిషిగా, భోగవస్తువుగా వాడుకుంటూ గిరిజనుల పేరుతో వచ్చే పథకాల ద్వారా ఆర్థిక, రాజకీయ లబ్దిని పొందుతాడు. గిరిజనుల క ట్టుబాట్లనీ, నాగరిక చట్టాల్నీ అడ్డుబెట్టుకుని పచ్చటి జీవితాలతో ఆటలాడుకుంటాడు. కళ్ళం (2010)లో సిరిమెల, శిలకోల (2009)లో చామంతి అలా మోసపోయినవాళ్ళే. చివరికి నమ్మి తాము కోల్పోయిందేంటో తెలుసుకుని స్వీయ అస్తిత్వాల్ని కాపాడుకోవడానికి స్థిరంగా నిలబడ్డారు. సిరిమెల భూమిని కాపాడడానికి ఊరంతా ఉమ్మడిపోరుకి తయారైతే- చామంతి ఒంటరి పోరుకి సిద్ధపడింది.

అయితే ‘ఇప్ప మొగ్గలు’ కథ (2011)లో బూదేవి సిరిమెల, చామంతిల్లా మోసపోవడానికి సిద్ధంగా లేదు. అభివృద్ధి తెచ్చిన చీకటి ఆమెకి తెలుసు. ఆ చీకటిలో అడుగులు తడబడకుండా దాన్నుంచీ బయటపడే దారి కూడా ఆమెకు తెలుసు. అందుకే ఈ కథ ప్రత్యేకమైంది. నిజానికి ఇప్పమొగ్గల్లో రెండు కథలున్నాయి. ఒకటి-కొత్త శతాబ్దంలో ప్రపంచీకరణ తెచ్చిన మార్పుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బూదేవిది, రెండు- అంతకుముందు పాలకులు ఎరవేసిన అభివృద్ధి పథకాలకు బలైన బూదేవి అక్క జ్యోతిది.

జ్యోతక్క విషాద జీవితం బూదేవిని అనుక్షణం బతుకు పోరులో అప్రమత్తం చేస్తూ ఉంటుంది. జ్యోతక్క రోజుల్లో గిరిజన యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఐటీడీఏ ద్వారా బుక్‌ బైండింగ్‌, టైలరింగ్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ మేకింగ్‌, టైప్‌ రైటింగ్‌, బనియన్ల తయారీలో ఉచిత శిక్షణ ఇచ్చేవారు.

‘ఐటీడీఏలో బనియన్‌ ఫ్యాక్టరీల కోసం, పళ్ళరసాల తయారీ కేంద్రాల కోసం కొత్త కొత్త భవనాలు కట్టించేరు. పగోడాలు… పర్ణశాలలు, రకరకాల పేర్లతో… రకరకాల రూపుల్లో. అవి ఊపిరాడని పగోడాలు… చీకటి నింపుకున్న రహస్య నిర్మాణాలని తర్వాత తెలిసొచ్చింది. బనియన్ల తయారీలో చీకటి కత్తెరకి చిక్కి చీలిక పీలికలైన గుడ్డముక్కలయ్యారు కొండ పిల్లలు కొందరు. పళ్ళరసం తయారీలో రసం పిండిన పిప్పిలా తయారయ్యారు మరికొందరు’. వాళ్ళల్లో జ్యోతి కూడా ఒకరు.

ప్రపంచీకరణలో గిరిజనుల్ని నాగరికులుగా మలిచే శిక్షణ స్వభావం అదేకానీ స్వరూపం మారింది. అది పూర్తిగా మార్కెట్‌ భాష నేర్చింది. విషయం విషం అదే; స్వరం మారింది. ‘మారుతున్న కాలంతోపాటు గిరిజనులూ మారాలి. సభ్య సమాజంలో కలిసి నడవాలి. పోటీ పడాలి. అభివృద్ధి సాధించాలి’. కాబట్టి కొత్త పద్ధతులు, కొత్త విధానాలు. ‘గిరిజన విద్యార్థుల కోసం ఐటీడీఏ, కొన్ని కార్పొరేట్‌ సంస్థలతో కలిసి సంయుక్తంగా శిక్షణనిస్తోంది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ లాంటి కోర్సులు…’

‘ఎవరైనా కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఆదరించడం… పండో కాయో మామిడి తాండ్రచుట్టో ఇచ్చి నేస్తరికం చేయడం… కొండ ఫలంలోని కొంత నేస్తానికివ్వడం… ఇది గిరిజన సంప్రదాయం. అతిథుల్ని గౌరవించడం, వాళ్ళని నమ్మడం సంస్కారం’. అదే వాళ్ళ పాలిట శాపంగా మారింది. ఆతిథ్యం గురించి వారికి శిక్షణ. హాస్పిటాలిటీ అంటే ఆడపిల్ల అన్నీ వదులుకొని అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎదగడం అన్న కార్పొరేట్‌ భాషని భూదేవి తన అక్క జీవితానుభవం నుంచి అర్థం చేసుకుని దాన్ని గుండె లోతుల్లోంచి అసహ్యించుకుని ఆ చీకటి తనకి అంటకముందే ఊబినుంచి బయటపడింది.

చదుకున్నా ఎందరో గిరిజన యువతుల జీవితాలు పూలై వికసించకుండా మొగ్గలుగా మారిపోవడానికి కారణం అన్వేషించే బూదేవి మొగ్గల్ని పువ్వులుగా చేసి రేపటి సమాజానికి అందించే దిశగా అడుగులేస్తుంది.

ఈ కథ చదువుతున్నంతసేపు సువర్ణముఖి ‘గోరపిట్ట’ కథ, కుప్పిలి పద్మ ‘సాలభంజిక’ కథ గుర్తొస్తాయి. గిరిజన స్త్రీల శీలం గురించి సెక్సువాలిటీ గురించి సభ్యసమాజం ఎంత నీచంగా ఆలోచిస్తుందో, ఎంత అసభ్యంగా వ్యవహరిస్తుందో జగదీశ్‌ మాటల ద్వారా విన్నప్పుడు దేశం యావత్తూ సిగ్గుతో తలవంచుకోవాలి. నాగరిక సమాజం మార్జినలైజ్డ్‌ బతుకుల్ని అపహాస్యం చేసే తీరుని అతను గొప్ప నైపుణ్యంతో ఆవిష్కరించాడు.

ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన కథ ఇది. ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అన్నీ చక్కగా అమరిన కథ ‘హృదయమెక్కాడున్నాది’ రింగ్‌ టోన్‌తో ఫోన్‌ మోగే దగ్గర మొదలుపెట్టడంలోనే జగదీశ్‌ కథలో సగం చెప్పేశాడు. కొండమీద చోటుచేసుకున్న సామాజిక చలనాన్ని ఒక్క మాటలో ఆవిష్కరించాడు. ముగింపులో, బూదేవి గమనంలో ‘దారికడ్డగా’ వచ్చిన ఐటీడీఏ నిర్మించిన చెక్‌డ్యాం తాలూక మట్టిలో పాతుకుపోయిన శిలాఫలకాన్ని గెడ్డలోకి విసిరికొట్టి, ‘బడి మొఖం ఎరుగని పసిమొగ్గ’ పిల్లలవైపు నడిచిందని చెప్పి అభివృద్ధి-మానవీయతల గురించి పాఠకుల్లో కొత్త ఆలోచనకి తెరతీశాడు. ఆదివాసీ స్త్రీకి, మొత్తం సమాజానికి బూదేవి ఆదర్శం కావాలని జగదీశ్‌ ఎంతో సంయమనంతో, నేర్పుతో రాసిన కథ ఇది.

వని ఇప్పుడు బహుళజాతి కంపెనీలకు లాభాల గని అయింది. ‘కొండని తవ్వాలంటే అక్కడ ఊళ్ళుండకూడదు. ఊళ్ళుంటే ఉద్యమాలంటారు.’ అడవినీ అడవినుంచి ఆదివాసినీ మాయం చేసే కుట్ర పాలకుల కనుసన్నల్లో అమలవుతోంది. అందుకనే అడవిని నమ్ముకొన్న ఆదివాసీకి అడవిలో ఒకింతసేపు నిలబడి సేదతీరడానికి చెట్టునీడ కూడా వెతుక్కునే పరిస్థితి ఇవ్వాళ ఎదురవుతోంది. బాక్సైట్‌ కోసమో, బండరాళ్ళ కోసమో, వజ్రాల కోసమో, నల్ల బంగారం కోసమో అడవి కడుపుని చీల్చడానికీ, కొండ గుండె ఛిద్రం చేయడానికి వ్యవస్థీకృతమైన హైటెక్‌ హింస పడగ విప్పింది. అభివృద్ధి-అణచివేత అనే రెండంచెల కత్తితో, జోడుగుళ్ళ తుపాకితో రాజ్యం అడవిమీద కమ్ముకుంది. అడవిలో ఉన్నా, ఆస్టల్లో ఉన్నా కొండ పిల్లల మానప్రాణాలకు భద్రత లేదు. భద్రతా బలగాల తోడేళ్ళ దాడికి అడవి బతుకులు ఆగమౌతున్నాయి. ‘అడవి… షావుకారు, సొండోడు… దౌర్జన్యం… గురువులు… సంఘాలు… పోలీసులు… లాఠీలు… లూటీలు… అరెస్టులు, పారిపోవడాలు… పోరాటాలు… ఐ.టి.డి.ఎ.లు… జీసీసీలు… హాస్టల్‌, ఆసుపత్రులు…

ఇస్కూళ్ళు… చదువుల కోసం కొండనొదిలి పట్నంవైపు పరుగులు…’ అయినా తుపాకి గొట్టాల నీడల్లోనే ఇంకా గడపాలా అని అడవీ కొండా ఆక్రోశిస్తున్న తీరుని నలభై యేళ్ళ చరిత్ర సాక్షిగా రచయిత అడుగుతున్న ప్రశ్నకి (దాడి-2008) సమాధానం ‘మళ్ళీ తుపాకీల మోతే’. ఆదివాసీ బతుకు అడుగడుగు గండమే. నిప్పుల గుండమే.

ఆదివాసీని ఇప్పుడు దోచుకునేది మైదానాల నుంచి దారులు పరుచుకొంటూ వచ్చిన బయటి వ్యక్తులు మాత్రమే కాదు. దోపిడీ రాజకీయాలు నేర్చిన సొంత మనుషులు కూడా. చదువుల ద్వారా,

ఉద్యోగాల ద్వారా మూలాలకి దూరమైన ఆదివాసీలు కొందరు రాజకీయ స్వార్థం బలిసి ఉద్యమాల చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకొంటూ తమ జాతికే ద్రోహం చేయడానికి, తమ వాళ్ళనే మోసగించడానికి పూనుకుంటున్నారు. ‘కొండోడెప్పుడూ మోసపోడమేన్రా… అయితే మోసం చేసినోడే మారేడు. అప్పుడు పయ్యోడు, ఇప్పుడు మనోడు… అంతేన్రా తేడా’. అయితే పయ్యోడితోనైనా లోపలోడితోనైనా అడవి బిడ్డలు పోరాటానికి వెనుతీసేది లేదనే జగదీశ్‌ చెబుతున్నాడు. రక్త సంబంధంకన్నా వర్గ సంబంధమే ప్రధానమని (దారి-2009) స్పష్టం చేస్తున్నాడు.

బూదేవి (ఇప్పపూలు), సిరిమెల్ల (కళ్ళం), సోమేశు (సిందవ), నిమ్మీ (కలలు కాలుతున్న వాసన), చామంతి (శిలకోల), కురమయ్య (దారి), మిలంతి (గాయం), ధర్మూ (టిహిలికి పెళ్ళి)… వీళ్ళంతా అది మాయల మార్కెట్‌ తెల్ల దెయ్యం కావొచ్చు, పై మెరుగుల వికృత వస్తు వ్యామోహం కావొచ్చు, రాక్షస రాజకీయం కావొచ్చు, ప్రలోభాల మతాంతరీకరణ కావొచ్చు, కలుషిత కార్పొరేట్‌ భూతం కావొచ్చు, పాశవిక రాజ్య హింస కావొచ్చు, సాంస్కృతిక పరాయీకరణ కావొచ్చు. యెదురైన సంక్షోభం యేదైనా ఎంత తీవ్రమైనదైనా ఎదిరించి ఎదురీదడానికే నిర్ణయించుకున్నారు. ఎన్ని పరాజయాలు సంభవించినా ఆదివాసీల యీ సడలని తిరుగుబాటు తత్వమే జగదీశ్‌ కథలకు ఆత్మయింది. జీవం పోసింది. వన్నె తెచ్చింది.

అయితే దాన్ని పాఠకుల గుండెలోకి సూటిగా ప్రవహింపజేయడానికి అతను సంయమనాన్ని పాటిస్తూనే ఉద్వేగ ప్రధానమైన కథనాన్ని ఎన్నుకున్నాడు. కవితాత్మక శైలిని ఆశ్రయించాడు. కథలో స్వీకరించిన వస్తువుకి అనుగుణమైన వాతావరణాన్ని నిర్మించడానికి ఆ శైలి ఎంతగానో ఉపకరించింది. ఉత్తరాంధ్ర నేలలోనే ఆ గుణం ఉంది. సంభాషణల్ని సామెత స్థాయికి తీసుకెళ్ళిన గురజాడబీ కథలో వాతావరణానికి అనుకూలమైన కొత్త డిక్షనరీని, ఆధునికోపమానాల్నీ ఉపయోగించిన రావిశాస్త్రి, బీనాదేవీబీ వచనానికి వ్యంగ్య వైభవాన్ని జోడించిన పతంజలిబీ కథనంలో అనేక ఉద్వేగాలకు కవిత్వ సువాసనలద్దిన అప్పల్నాయుడు, గౌరునాయుడుల వారసత్వాన్నే జగదీశ్‌ అందుకున్నాడు. అలా అని తనకు తాను కానీ, ఇతరులకు కానీ పునరుక్తం కాలేదు. వస్తు స్వీకరణలో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ‘గురువుల’ నుంచి నేర్చిన దాన్ని తన జీవితానుభవం వెలుగులో మెరుగులు దిద్దుకున్నాడు. సమాజాన్ని తనదైన ప్రాపంచిక దృక్పథంతో వ్యాఖ్యానించాడు. ‘ఆకుపచ్చని చీర కట్టి ఒద్దికగా కూర్చున్న గిరిజన యువతిలా అడవి… ఆ పిల్ల సూసిన సూపులకి ఇప్పమొగ్గలు జలజల రాలినట్టిగైంది… గిలిగిచ్చికాయలు గాలికి కదిలినట్టు కిలకిల నవ్వులు… థింసా అడుగులేస్తున్న ఆడపడుచుల వరస కొండ మెడలో బంతిపూల దండలా కదులుతుంది… ఒక్కొక్క మొగ్గా, ఒక్కొక్క జ్ఞాపకంలా ఏరుకుంటోంది… పోడు దువ్వి ఇతనాలేసిం తర్వాత కొండ మీద సినుకు రాలినట్టిగైంది… ఊరిలో టిక్కిపోయిన సెవర పిల్లిలా గిలగిల్లాడిపోయే మనుషులు… కొండొచ్చి మీద పడినట్లైంది… చినుకు రాలని చీకటి కొండలా ఉంది ఊరు… రేతిరి నా దుఃఖంలో ఈదుతున్నట్టుంది…’ ఇలాంటి సందర్భోచిత వర్ణనలు ఈ కథలో కోకొల్లలు.

‘మనమెటు నడుస్తున్నాము? ఆ రోజుల్లోన ముసిలోలు ఆలు వయసప్పుడు ఉద్యమం కాసి నడిచేరు. ఈ వేల మనము, రేపు మన పిల్లలు… ఎటు నడుస్తారు?’… ‘మూలాల్ని మరిచి అడవికి దూరమవడమే అభివృద్ధా?’ అని ప్రశ్నించే సోమేశ్‌ (సిందవ-2010) గొంతు రచయితదే. అడవి బిడ్డల సాంస్కృతిక అస్తిత్వాన్నే కాదు అడవిలోని సమస్త జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే అభివృద్ధికి చెందిన అనేక పార్శ్వాలని (కట్టూ బొట్టూ, ఆహారపు అలవాట్లూ, రోగాలూ, ఆటా పాటా, పంటలూ…) ‘శిలకోల’ కథల ద్వారా చర్చకు పెడుతున్నాడు. రచయితగా, ఆదివాసీగా జగదీశ్‌ ఒకటి కాదు వందల ప్రశ్నలు సంధిస్తున్నాడు. అవి సూటిగా ఉన్నాయి. ‘ఇక్కడ ఉద్యమం ఉంది. ఉత్తేజమూ ఉంది. ఐతే అదెలా ఉంది? దశాబ్దాల నాడు యిక్కడ ఎంత కల్లోలం జరిగింది? ఇంత జరిగినా ఈ ప్రాంతంలో ఇంత వెనుకబాటుతనం ఎందుకుంది? విద్య ఉంది వివేకమూ ఉంది. కానీ ఇంకా జరగాల్సింది ఎంతో ఉందని అర్థమవుతూనే ఉంది. అసలేం జరుగుతోందిక్కడ? జేగురు కొండమీది ఊళ్ళెందుకు ఖాళీ అయిపోయాయి?’ ఇలా ప్రతి వాక్యంలోనూ తన జాతి మనుగడ గురించి ఆలోచిస్తున్నాడు. గత పోరాటాల పటిమనీ, వర్తమాన నిర్వీర్యతనీ బేరీజు వేస్తున్నాడు. చీకటి వర్తమానం గురించి ఆవేదన చెందుతున్నాడు. భవిష్యత్తు వెలుగుల కోసం బెంగపడుతున్నాడు.

అడవిలో ఒంటరిగా ఒట్టి చేతుల్తో సిందవని ఎదిరించగల ఆదివాసీలు అభివృద్ధి ముఖం తొడుక్కొని అవసరం లేని ఆధునికతని మోసుకొస్తున్న కొత్త క్రూరమృగాన్ని తరిమికొట్టాలంటే ఊరు సమూహం కాక తప్పదని గ్రహించారు. బాణం, శిలకోల, గొడ్డలి, కత్తి, వడిసెల, బల్లెం ఎవరికి దొరికిన ఆయుధంతో

వాళ్ళు ముందుకు కదలక తప్పదని తెలుసుకున్నారు. ఆ సమూహంలో రచయితగా జగదీశ్‌ కూడా ముందు నిలబడి ఉన్నాడు. సిందవ-ఆడ సిరత పులి-దాడికి గాయపడిన మేకపిల్లకి మందేసి కట్టుకట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆదివాసి మీదకు ‘ఎగిరి పీక కరిసీసి రక్తం లాగేసే ‘బాకుడుంబారి’ భరతం పట్టేందుకు అప్రమత్తుడై అక్షరాయుధుడయ్యాడు. అతని కథలన్నీ ఆ ప్రయత్నంలో పుట్టినవే.

అటవీ పర్యావరణాన్ని దెబ్బతీసే విధ్వంసకర పవర్‌ ప్రాజెక్టులు, 1/70 ని భూస్థాపితం చేస్తున్న దుర్మార్గపు భూసేకరణ చట్టాలు, కార్మికులు పోరాడి సాధించుకున్న సమస్త హక్కుల్నీ కాలరాసే సెజ్‌లు, కార్పొరేట్‌కి అడుగులకు మడుగులొత్తుతున్న పాలకుల పారిశ్రామికీకరణ విధానంలో అమలౌతున్న బలవంతపు విస్థాపనలు వలసలు, గిరిజన జీవితాల్ని షోకేస్‌ చేసి అమాయక యువతుల్ని మార్కెట్‌ సరుకుగా మారుస్తున్న టూరిజం స్కీంలు… ఇలాంటి వివిధ అంశాలు ఆదవాసీ బతుకుల్లో తెస్తున్న పరిణామాలు జగదీశ్‌ మాత్రమే చ్పెగలిగినవి తెలుగు కథలోకి ఇంకా యెక్కవలసి ఉన్నాయి.

అయితే తెలంగాణా నుంచి పద్దం అనసూయలాంటి ఏ ఒకరిద్దరో తప్ప జగదీశ్‌లా తమ జాతి జనుల జీవన వైవిధ్యాన్ని, సాంస్కృతిక చలనాన్ని కథలుగా మలుస్తున్న వారు లేరు. ఈ నేలమీద అది శ్రీకాకుళమైనా… ఆదిలాబాద్‌ అయినా… ఆదివాసి సాయుధుడై ముందునడవని ఉద్యమం లేదు. ఆదివాసీల్లో అక్ష్యరాస్యత పెరిగింది. అడవికీ, మైదానానికీ మధ్య దూరం తరిగింది. అయినా ఉత్పత్తి కులాల నుంచి వచ్చినట్టు గిరిజన సమాజం నుంచి రచయితలు ఎందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు రానున్న కాలంలోనైనా సమాధానం దొరుకుతుందని ఆశ.

‘… కొమ్మకి పూసిన పువ్వు

నేల రాలిపోకూడదు.

పిందవ్వాల…

కాయవ్వాల…

పండవ్వాల…

యిత్తనమై మొలకెత్తాల.’ (టిహిలికి పెళ్ళి)

ఇదీ ఆదివాసి హృదయం. సంస్కృతి, ప్రాపంచిక దృక్పథం, జీవన తాత్వికత. అవి అలాగే పదిలంగా ఉండిపోవాలని కోరుకునే జగదీశ్‌ కథలూ, గాథలూ, మండే గూడేల్లో కొండ పూలై విరిసి, మంది గుండెల్లో విత్తనాలై మొలకెత్తాలని కోరుకుంటూ…

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.