ఉద్యమ కేదారంలో పూసిన మందారం

కొండపల్లి కోటేశ్వరమ్మ
రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ ఒకచోట కూర్చున్నా… విజయవాడను గూర్చీ… విజయవాడలో ఆవిర్భవించిన ఉద్యమాల ప్రాభవాల గూర్చీ వినిపిస్తూ ఉండేది. విజయవాడ వీధివీధి తనను పలకరిస్తున్నట్లుగా కనిపిస్తుందని చిరునవ్వుతో పలికేది.
”విజయవాడంటే… ‘నీకెంతిష్టం’ రాజమ్మా!” అని నేనంటే… నీకు లేదా? అని అడిగేది.
గంగానదిలాగ పుచ్చలపల్లి సుందరయ్య గారు, యమునానదిలాగ చండ్ర రాజేశ్వరరావుగారు, సరస్వతీనదిలాగ (అంతర్వాహిని) మద్దుకూరి చంద్రశేఖరరావు గారు ఆ నగరంలో సంగమించారనీ తరంగించీ ప్రవహించీ ఆ నగరాన్ని శుభ్రపరిచారనీ… మానవజాతి మనుగడకై మంచి పంటలు పండించను యోగించారనీ చెప్పింది.
కుళ్ళుకంపు కొట్టే పాత ఆచారాలనూ, విర్రవీగి తిరిగే రౌడీమూకలనూ అణచడానికి, అంతం చేయడానికి యువతీ యువకులను ఉత్తేజపరిచింది వారేనని చెప్పింది…
వారు నగరంలోనే కాక రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజాసంఘాలు నెలకొల్పారని… ఆ సంఘాల అభివృద్ధికోసం ఆఫీసులను పెట్టాలని ప్రజల చైతన్యపరిచేదానికోసం పత్రికలను నడపాలని యోచించారని చెప్పింది.
ఆ మహనీయులు వారికున్న ఆస్తులను అమ్మి సొమ్ముగ మార్చి వాటి నిర్మాణం కోసం, వాటిని నడపడం కోసం వినియోగించారని చెప్పింది. ఆ త్యాగమూర్తులు భోగభాగ్యాలకోసం, అధికారాలకోసం చూడలేదనీ వాటిపై వారికి ఎలాంటి వ్యామోహం లేదనీ… స్వాతంత్య్ర సముపార్జన కోసం, సమసమాజ నిర్మాణం కోసం వారు చూశారనీ పనిచేశారనీ చెప్పింది.
ఆ నిరాడంబరులు నిర్మించిన ఆఫీసులకు వచ్చే యువకులతోనూ, వారు జరిపే సభలకొచ్చే జనంతోనూ సందడించిన వీధులూ…, వారిచ్చిన స్ఫూర్తితో ఎర్రజెండాల తలపాగాలెట్టుకుని అందగించిన ఇంద్రకీలాద్రి పర్వతాలూ అందరికీ సుస్వాగతమంటుంటే… ఆ నగరంవైపు చూడని వారుంటారా? అంది.
”ఎర్ర జండాల రెపరెపలతో కనువిందు చేసే… విజయ వాడంటే… నాకెంతో ఇష్టం. నీక్కూడ ఇష్టమే. కాదంటావా?” అని అడుగుతూనే వినిపించింది.
”కర్నూలు జిల్లాలో నేను పుట్టినా… కన్నతల్లికంటె మిన్నగ కమ్యూనిస్టు పార్టీ నన్ను పెద్దదాన్ని చేసింది. ఆ పార్టీకి విజయవాడ కేంద్రమైంది. నాలాంటివారికోసం రాజకీయ పాఠశాలలు నడిపింది. ఆత్మీయంగా పెంచిన అమ్మనూ, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలనూ విస్మరించే మనుష్యులు వుంటారా? అని ప్రశ్నించింది. ఇలా నా స్మృతిపథంలోని రాజమ్మను చూస్తుంటేనూ, రాజమ్మకు ఇష్టమైన విజయవాడను తలుచుకుంటుంటేనూ… నా మనసులోకి ఎన్నో ఆలోచనలు చొరబడుతున్నాయి.
రాజమ్మా నేనూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లోకి వెళ్లడానికి మమ్మల్ని ఉత్సాహపరచీ నచ్చచెప్పీ ఆ రంగాల్లోకి మేము ప్రవేశించడానికి దోహదం చేసిన మద్దుకూరి చంద్రం గారు – శ్రీశ్రీ సాహిత్యాన్ని గూర్చి మాకు చెపుతూ… శ్రీశ్రీ బాల్యాన్ని గూర్చి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
”శ్రీశ్రీ 1910లో ఏప్రిల్‌ 30న విశాఖపట్నంలో అప్పల కొండమ్మ అనే ఆమెకు పుట్టాడట. శ్రీశ్రీ పుట్టిన ఆరుమాసాలకే అప్పల కొండమ్మ చనిపోయిందట. శ్రీశ్రీ ఎందిరి తల్లుల పాలో తాగుతూ ఎదుగుతున్నాడట. శ్రీశ్రీ తండ్రి సుభద్రమ్మ అనే ఆమెను రెండవసారి పెండ్లి చేసుకున్నాడట. సవతితల్లి సుభద్రమ్మ శ్రీశ్రీని కుమారునిగ చూడక పరాయివానిగ చూస్తూ బాధపెడుతుందని బంధువుల్లో కొందరు అంటూ వుండేవారట. బంధువులంటున్నట్లు గాకుండా సుభద్రమ్మ శ్రీశ్రీని కన్నతల్లికంటే ఎక్కువగ చూసేదట. ఆమె ప్రేమతో పెరుగుతున్న శ్రీశ్రీ బంధువులను లెక్కచేయక ఆమెను మరింత ప్రేమగ చూసేవాడట” అంటూ చెప్పారు.
ఈ కారణాల వల్లనే శ్రీశ్రీ సాహిత్యంలో ముఖ్యంగా మహాప్రస్థానంలో మాతృస్పర్శ తొంగిచూస్తుందని పరిశీలకులు అన్నట్లుగా చంద్రంగారు చెపుతూ శ్రీశ్రీ కవిత్వంలోని రసధునీ, మణిఖనీ, జననీ, కవితా, ఓకవితా… అనేవి వినిపించారు.
చంద్రంగారు చెప్పిన శ్రీశ్రీ బాల్యాన్ని గుర్తుచేసు కుంటుంటే…తాపీి రాజమ్మ కూడా తల్లికి దూరమైనా…కమ్యూనిస్టు పార్టీకి చేరువై ఆ పార్టీ నాయకులకు అభిమాన పుత్రికై ఆ పార్టీకి కేంద్రమైన విజయవాడను పుట్టిల్లుగ భావిస్తుందేమో…కన్నవారిగ పార్టీ నేతలను చూస్తూ విజయవాడలోనే ఎక్కువ రోజులు వుండాలని కోరుకుంటుందేమో అనిపించింది.
ఎగరేసిన ఎర్రని జండా…రుద్రాలికనైన జ్వాలిక
కావాలోయ్‌ నవకవనానికి” అన్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గీతాన్ని గానం చేసిన రాజమ్మ విజయవాడ వీధుల్లో ఎర్రజండాను ఎగరేసిన రాజమ్మ విప్లవం వర్ధిల్లాలని నినదించిన రాజమ్మ ”విజయవాడ వీధివీధి నన్ను పలకరిస్తున్నట్లు కనిపిస్తుంది” అనడానికి గల కారణాలైనవి కొన్ని నా కండ్లకు కనిపిస్తున్నాయి.
తొలి రాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ గాంధీనగరం జింఖానా గ్రౌండ్‌లో జరుగుతున్నప్పుడు రాజమ్మ సభావేదికపై ప్రజాకళాకారులతో కలిసి ఫాసిస్టు వ్యతిరేక గీతాలను పాడి, ప్రదర్శనల్లో పాల్గొని హిట్లరు, ముస్సోలిని ఇంత దుర్మార్గులా…? అనేటట్లుగ ప్రేక్షకులను ముగ్దులను చేసింది. రెండో ప్రపంచ యుద్ధాన్ని గూర్చి ఆలోచింపచేసింది.
విజయవాడ ప్రతి సెంటరులోనూ తిరుగుతూ…ప్రజాశక్తి పత్రికల నమ్ముతూ స్త్రీల వెంటబడే రౌడీలను లెక్కచేయకుండాను భయపడకుండాను ఎక్కువ పత్రికలు అమ్ముడుపోవడానికి ‘పాలపేణి లాంటిది ప్రజాశక్తంటూ’ పాడుతూ పత్రికలను అమ్మింది.
హనుమంతరాయ గ్రంథాలయంలో మహాకవి గురజాడ వర్ధంతిని అభ్యుదయ రచయితల సంఘం జరుపుతుంటే… ఆ సభలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథను గానంచేసి బాల్యవివాహాలు నశించాలని పిలుపునిచ్చింది. దేశభక్తి గీతం పాడి దేశభక్తిని రేకెత్తించింది. దేశభక్తి గీతం ప్రార్థనాగీతం కావాలనే సంకల్పం పెద్దలకు కలిగించింది.
మొగల్‌రాజపురంలో ప్రజాశక్తి నగరం ఏర్పడడానికి సహకరించింది. ఆ నగరంలో కమ్యూన్‌ నడిపే బుల్లెమ్మగారికి కుమార్తెగా తోడ్పడుతూ కమ్యూన్‌ నడపడానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. అక్కడ భోజనం చేసే కామ్రేడ్సుకు వేళకు భోజనం సమకూర్చుతూ, పెడుతూ వారికి తల్లిగ చెల్లిగ కనిపిస్తూ వారి మన్ననల నందుకుంటూ అక్కడే కొన్నాళ్లు వుంది.
సూర్యారావుపేట (డాక్టరు అచ్చమాంబ గారి ఇంటిదాపున)లో మహిళాసంఘం ఆఫీసులో పనిచేస్తూ అక్కడుంటూ అచ్చమాంబ, మానుకొండ సూర్యావతి లాంటి మహిళా కార్యకర్తలకు తన సహకారాన్ని అందించింది. రాష్ట్ర మహిళా మహాసభ జరుగుతుంటే… వేయిమందితో నడుస్తున్న ఊరేగింపులో పాల్గొని ”ఈనాడే స్త్రీలంత ఏకమవ్వాలి. ధారాళముగ శక్తి ధారబోయాలి. పోరాటముల మధ్య పోరి గెలవాలి.” అంటూ నినాదాలిస్తూ పోలీసుల లాఠీదెబ్బలు తింటూ జైలుకెళ్లి సమరయోధురాలనిపించుకుంది.
ఈ విధంగా విజయవాడలో 1943 నుండి జరిగిన అఖిల భారత రైతు మహాసభ దగ్గర నుండి 1948 వరకు పార్టీ జరిపిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ నటిగ, గాయనిగ, వాలంట్రీగ, కార్యకర్తగ పనిచేసింది. నిస్వార్ధంగ నిబద్ధతతో పనిచేసింది రాజమ్మ అనిపించుకుంది.
రాజమ్మను విజయవాడ వీధివీధి పలకరించడానికి కారణాలు యివేనేమో? అని నేను అనుకుంటున్న సమయంలోనే…
రాజమ్మను మరణించే వరకూ విజయవాడే గాకుండ రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలు సైతం స్వాగతం పలికాయి గదా? అనే ప్రశ్న నాముందుకొచ్చింది.
మన్యపు వీరుడు అల్లూరి సీతారామరాజు కథను, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేసిన ఆ వీరుని విప్లవాగ్నిని బుర్రకథ రగడలో పొదిగి రాజకీయాలలో మేళవించి దేశభక్తి పెంపొందగ రాగయుక్తంగ కథాగానం చేస్తూ వందల వేదికలపై రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో పార్టీ నిర్ణయించిన స్థలాల్లో డక్కపై తాళంవేస్తూ వినిపించినందుకూ…
తెలంగాణా సాయుధపోరాటాన్ని బలపర్చుతూ ”దున్నేవానికే అన్ని హక్కులంటూ, దోచేవానికి దోహదం ఈయమంటూ” మా భూమి నాటకంలో సీతమ్మై పోరాటయోధులకు ఊతమిస్తూ… ”ఒక వీరుడు మరణిస్తే… వేలకొలది ప్రభవింతురు. ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు” అంటూ సమరయోధులకు విశ్వాసాన్ని కలిగిస్తూ రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో వందల సంఖ్యలో నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నందుకూ…
రాష్ట్ర మహిళా సంఘ కార్యవర్గ సభ్యురాలుగా మహిళాభ్యు దయంకోసం, మహిళా సంఘం పెరిగేదానికోసం మూఢనమ్మకాలు, మూఢాచారాలు నశించేదాని కోసం గ్రామాల్లోనూ పట్నాల్లోనూ పాటలు పాడుతూ, ప్రసంగిస్తూ మహిళా సంఘ సభ్యత్వాన్ని పెంచుతూ, విరాళాలు స్వీకరిస్తూ పట్టుదలగ పనిచేసినందుకూ…
మంచిని పెంచే తత్వం గల రాజమ్మను మంది ప్రేమిస్తూ అవసరమనుకున్నప్పుడు ఆహ్వానిస్తున్నారనేదే… ఆ ప్రశ్నకు సమాధానమనుకున్నాను.
తెలుగువారి కళా, సంస్కృతీ దీప్తి చెందడం కోసం, కమ్యూనిస్టు పార్టీ విలువలు దశదిశల నింపడం కోసం అవిశ్రాంతిగ పనిచేసిన తాపీ రాజమ్మ నా స్నేహితురాలు కావడం నా అదృష్టంగా భావించాను.
1952లో కమ్యూనిస్టు పార్టీపైనున్న నిషేధాలను ప్రభుత్వం వారు తొలగించారనీ, అజ్ఞాతవాసం చేసే నాయకులు, జైళ్ళల్లో వున్న నాయకులు బైటికొస్తున్నారనీ, పార్టీ ప్రముఖులు విజయవాడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారనే వార్త విన్న తాపీి రాజమ్మ అంబరమంత సంబరంతో సభావేదిక దగ్గరకొచ్చింది. ప్రజాకంటకుడు పళని యప్పన్‌ చేతికి చిక్కకుండా ప్రాణాలతో బైటకొచ్చిన తన ప్రియతమ నాయకులను చూసింది. ఆనందాశ్రువులు రాల్చుతూ చెంగుచెంగున వేదికనెక్కింది. తన మామగారు (తాపి ధర్మారావుగారు) ఇచ్చిన బంగారు ఆభరణాలను వంటిపైనుండి తీసి (శ్రీనివాసునకు భక్తులు సమర్పిస్తున్నట్లుగ) సుందరయ్యగారికిస్తూ ‘వందనం’ అంది. కరతాళధ్వనులతో సభాప్రాంగణం మ్రోగుతుండగా సభలో ఓ పెద్దాయన లేచి రాజమ్మవైపు చూస్తూ… ఈమె ”ఉద్యమ కేదారంలో పూసిన మందారం” అన్నాడు. ఆ మాటవిన్న నాకూ ఆనందం కలిగింది. రాజమ్మ కళ్లనుండి జారినట్లుగానే నా కళ్లనుండీ ఆనందాశ్రువులు రాలాయి.
ఇలా సమసమాజ నిర్మాణం కోసం రాజమ్మేసిన అడుగులనూ అంకితభావంతో రాజమ్మ నడిచిన తీరునూ నేను చూస్తుంటే… నా గొంతు నుండి నా పెదవుల మీదికి… శ్రీశ్రీ రాసిన
 ”పసిడి రెక్కలు విసిరి కాలం
 పారిపోయిన జాడలేవి?
 ఏవి తల్లీ” అన్నవి వచ్చాయి.
 ఏవి తల్లీ? నిరుడు పూసిన ఎర్రమందారాలు.
 ఎక్కడమ్మా రౌడీలనణచిన యువకిశోరాలు. అనేవి
 అప్రయత్నంగ.. పెదవులు దాటి.. బైటకొచ్చాయి….
ముద్దమందారంలాగా పెద్దలకు కనిపించిన రాజమ్మ ఈ లోకాన్ని వీడి అమరురాలయ్యే రెండురోజులముందు కూడ తన చిన్నకుమార్తెను ”దేశమును ప్రేమించు”మనే గురజాడ వారి దేశభక్తి గీతాన్ని గానం చేయమని కోరిందట. కుమార్తె పాడుతుంటే… ”వరస తప్పినట్లుందమ్మా!” అందట. వరస వినిపించడానికి ప్రయత్నించి ”గొంతు సహకరించడం లేదమ్మా!” అందట. మరణశయ్యపైన నరకయాతన పడుతూ కూడా దేశభక్తినీ, సంగీత, సాహిత్యాలను మరిచిపోని రాజమ్మ అమరురాలైనా… మరోలోకానికి వెళ్లినా మరచిపోలేమనిపిస్తుంది.
”మరో ప్రపంచం పిలిచిందంటూ” మరచిపోని, మరణంలేని సాహిత్యాన్నిచ్చిన శ్రీశ్రీని మహాప్రస్థానం అట్టమీదున్న ఫోటోలు చూస్తూ ఇక్కడ కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు శ్రీశ్రీ శతజయంతి వుత్సవాలు జరుపుతున్నారు గదా!
మరో లోకమంటూ ఒకటుంటే… అమరులైన మావాళ్లంతా అక్కడుంటే… అమరురాలై అక్కడున్న మా రాజమ్మ శ్రీశ్రీ కవితలను గానం చేసిన  రాజమ్మ శ్రీశ్రీని చూస్తూ శతజయంతి వుత్సవాలను గూర్చి యోచించకుండా వుంటుందా? వుండదు గాక వుండదు.
మర్దుకూరి చంద్రం గారితో సంప్రదిస్తుంది. వుత్సవ ఏర్పాట్లను సుంకర సత్యం గారిని చేయమని కోరుతుంది. తాతాజీ అధ్యక్షతను, ఆరుద్ర, ఆత్రేయ, క్రిష్ణశాస్త్రీ మొదలైనవారి ఉపన్యాసాలతో గరికిపాటి రాజారావుగారి ”పొలాలనన్నీ హలాలదున్ని” అనే గేయనృత్యంతో, శ్రీశ్రీ గారి శతజయంతి మహాసభ జరుగుతుందనీ, అమరులంతా ఆహ్వానితులేనంటూ ప్రకటన చేయిస్తుంది. నిండుసభలో ఉన్నతాసనంపై శ్రీశ్రీని కూర్చోబెట్టి తుమ్మల వెంకట్రామయ్య గారితో ఇంతలేసి కళ్లతో చూస్తున్న శ్రీశ్రీకి ఘనసత్కారం చేయిస్తుంది. తాను…
”ఆనందం ఆర్ణవమైతే…అనురాగం అంబరమైతే
అనురాగపు అంచులు చూస్తామ్‌. ఆనందపులోతులు తీస్తాం” అనే గీతం గానం చేస్తుంది. అమరలోకంలో మహాకవి శతజయంతి అందంగా జరిగిందని పత్రికలతో అనిపిస్తుంది. అని అనుకుంటుంటే… నా మనసుకు ఏదో తృప్తిగా వుంది.
ఈ ఊహల నుండి వాస్తవంలోకొచ్చిన నేను
”నిజంగానే నిజంగానే నిఖిలలోకం హసిస్తుందా?
మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా?”
అనుకుంటూ… సృజనాత్మకమైన వచన, పద్య, కవితా ప్రక్రియల్లో సూరీడై వెలుగుతూ… యుగకవిగ, మహాకవిగ పిలుపించుకుంటున్న శ్రీశ్రీని
ఆశయం, త్యాగం ఆభరణాలుగ అలంకరించుకుని ఉద్యమ కేదారంలో పూసిన మందారమనిపించుకున్న తాపీ రాజమ్మని నా… జ్ఞాపకాల్లో చూస్తూ… విప్లవాభివందనాలర్పిస్తున్నాను.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

One Response to ఉద్యమ కేదారంలో పూసిన మందారం

  1. రహంతుల్లా says:

    మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

    * పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
    * పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
    * బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
    * జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
    * అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
    * చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
    * చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
    * కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
    * బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
    * తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
    * కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
    * నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
    దేశంలో కొన్ని మూఢనమ్మకాలు
    * ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.
    * మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
    * కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
    * నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
    * గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.