హృదయసౌందర్యమే అసలుసిసలు అందం

 శిలాలోలిత
రాచమల్లు రామచంద్రారెడ్డి భావించినట్లు ‘కురూపి’ని నవల అని అనడం గురించి సందేహాలు వున్నాయి. దీనిని పెద్ద కథ అనవచ్చునేమో అని, లేదా నవలికగా చూడవచ్చునేమోనని అన్పిస్తుంది. ఈ ప్రస్తావనను పక్కన పెడితే, ‘కురూపి’ గురించి ‘రా.రా.’ భావించినట్లుగానే ఇందులో ప్రధానంగా కొడవటిగంటి కుటుంబరావు గారు అందం, శిల్పం, హృదయసౌకుమార్యంల గురించి ఈ వస్తువును నడిపినట్లు మొత్తంగా చదివాక అర్థమవుతుంది.
ఇందులోని ప్రధానపాత్ర కనకం కథారచయిత. ఈ పాత్రతో పైన చెప్పిన అంశాలను నిగ్గుతేల్చడానికా అన్నట్లుగా మరో ప్రధానపాత్ర సరస్వతి ప్రశ్నిస్తూ వుంటుంది, చర్చకు పెడుతూ వుంటుంది. అంతేకాక అందం, శిల్పం, హృదయ సౌకుమార్యంల గురించి వివరిస్తుంది. నిజానికి సరస్వతి పాత్ర ద్వారానే కొ.కు. తన దృక్పథాన్ని విడమర్చి చూపినట్లుగా భావించవచ్చు. ”పనిపెట్టుకొని నోటివెంట ఆమె అనకపోవచ్చు గానీ, ఆమె తన జీవిత లక్ష్యాలనూ, నమ్మకాలనూ, రచనా విధానాన్నీ, ఛాలెంజ్‌ చేస్తున్నట్లే వున్నది.” (పేజి-158, 5వ సంపుటం) అని కనకం తనలో తాను అనుకుంటాడు. ఇదే ఈ మొత్తం రచనలో కొ.కు. వస్తువుగా ఎన్నుకొని చివరివరకూ చెప్పడానికి ప్రయత్నం చేశారు. సరస్వతి, కనకం రాసిన కథల్ని విమర్శి స్తుంది. అందులోని అంశాలను అతనితో చర్చిస్తుంది. ”రచనను విమర్శించ డం అంటే, ఒక విధంగా అతని జీవితాన్ని విమర్శించ డమే.” (పేజి-158, 5వ సంపుటం) అని రచయిత ఈ సందర్భంలో అంటాడు. రచనలు జీవితానికి పర్యాయమే అని చెప్పడానికే కొ.కు. ఈ కథను ఎన్నుకున్నాడని పిస్తుంది. అంతేకాక, కథకుల మీద, రచనల గురించి ఒక విసురు విసిరారు. పాశ్చాత్య సాహిత్యం నుంచి ‘ఏరిన ముత్యాల్ని’ ఎన్నుకుని తమ కథల్లో వాటిని చేర్చడం మీద ఆయనకు కోపం. కథావస్తువు తమ అనుభవంలోకి వచ్చిన లేదా తామున్న సమాజంలోంచి తీసుకోవాలన్నదే ఆయన అభిప్రాయం. సెక్సు గురించిన ప్రస్తావనలు కూడా ఈ కథలో వున్నాయి. పట్నాల్లో ‘సెక్సు ఆకలి’ ప్రవర్తనల్ని కొ.కు. ప్రస్తావికంగా నిరసించాడు. అలాగే, బంధుత్వాల గురించి కూడా కొ.కు. ప్రస్తావించాడు. ”బంధుత్వా లంటే పనికిమాలిన బంధాలు. కొంతకాలం వాటివల్ల ఉపయోగం ఉంటుంది. ఆ తరువాత అవి సంకెళ్ళే.” (పేజి-148) ఇలా అనడం రచయిత యొక్క జీవనగాఢత వల్లనే కాక, సునిశితమైన సామాజిక దృష్టివల్ల కూడా ఇది సాధ్యమైంది.
ఇదే దృష్టికోణం ‘కురూపి’లోని వస్తువు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో పనికివచ్చింది. ఇక, రా.రా. భావించినట్లుగా ”అందవిహీనత కురూపిలోని సమస్య. అందం లేనివాళ్ళు (స్త్రీలైనా, పురుషులైనా) ప్రేమనూ తద్వారా సంపూర్ణ జీవిత సౌఖ్యాన్నీ పొందడం సాధ్యమా? ఆ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కా రం మాత్రమే ఉందనేది కథలోని ఇతి వృత్తం.”
”శారీరకేతరమైన ఆకర్షణ ఏదైనా వుంటే అలాంటి వాళ్ళను ప్రేమించడం సాధ్యమే. ఈ ఆకర్షణను ఆత్మసౌందర్యం అనవచ్చు, అంతస్సౌందర్యం అనవచ్చు, హృదయ సౌందర్యం అని కూడా అనవచ్చు. నామట్టుకు నాకు, మాయా, మర్మమూలేని చివరిమాటే నచ్చుతుంది.”
ఆదిమకాలం నుంచి ప్రపంచ సాహిత్య మంతటా నాయికా నాయకుల్ని అందంగా చూపడం ద్వారా, అందవిహీనతను అసలు ఏ ప్రాధాన్యత లేని అంశంగా చూపడం జరుగుతూ వస్తున్నది. అదే మూసలో సాహిత్యమంతా నడిచింది. దీన్ని ప్రశ్నించడం, ఆ స్థానంలో అందానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో చూపడం, అందవిహీ నంగా వున్నా హృదయసౌందర్యం వుంటే, అది అందం కన్నా అత్యుత్తమ మైందని చెప్పడం కూడా కొ.కు. ఉద్దేశ్యం. దీన్నే సరస్వతి మాటల్లో శిల్పసమస్యగా మనముందుకు తెచ్చారు. ప్రయోజనం అనే మాటని కూడా ప్రస్తావించారు. కథలో పదేపదే అందం గురించి ప్రస్తావించడం సరైంది కాదనీ కనకంతో సరస్వతి అంటుంది. ”అట్లా అయితే ఆవిడ అందగత్తె అన్నది అంతా గుచ్చిగుచ్చి చెప్పకుండా ఉండవలసింది. ఆమె అందానికి ఏదో ప్రయోజనం వుండాలి కదా! లేకపోతే శిల్పం దెబ్బతింటుంది.” (పే-154) అందమనేది రచనకు ప్రధానమైన ఒనరు కానేకాదని వస్తువు కోరితే, ఆ ప్రస్తావన తేవడం అవసరమే తప్ప, పనిగట్టుకొని అందమే ప్రధానమైందని చెప్పడం సరైంది కాదని యిందులో ఉద్దేశ్యం. అందుకే ప్రయోజనం ఏమిటనే చర్చ వచ్చింది. అవసరం లేకుండా, ప్రయోజనం లేకుండా ప్రస్తావించడం ద్వారా రచనాశిల్పానికి విఘాతం ఏర్పడుతుంది.
జ    జ    జ
సరస్వతి ఒక ఉదాత్తమైన నాయిక. ప్రేమ ఔన్నత్యాన్నీ, ఆత్మీయస్పర్శనీ, భావోద్వేగాల్ని మనముందు పరిచింది ‘కురూపి’ కథ. తాననుకున్న భావా లన్నింటినీ, చర్చించదలచుకున్న, చూపించ దలచుకున్న విషయాలన్నింటినీ, పాత్రల ద్వారా మానసిక లోకంలోకి ప్రవేశపెట్టి, వారి వారి మాటల్లోంచే, ప్రవర్తనల్లోంచే జీవనసారాన్ని చూపుతారు. అందువల్లనే ఆయన రచనలన్నీ, పాత్రలన్నీ ఇప్పటికీ సజీవంగా మనముందు ఉంటాయి.
ఒక్కొక్కరిదీ ఒక్కో రచనాశైలి. రచయిత ప్రవేశిస్తూ, వివరిస్తూ పోతుండే పద్ధతి ఒకటైతే, కొ.కు. గారి ప్రవేశం రచనల్లో ఎప్పుడోకాని కనపడదు. ఆయన చెప్పదలచు కున్న విషయాలన్నీ, ఆయా పాత్రలు సందర్భానుకూలంగా ఎంతో సహజంగా మాట్లాడుతున్నట్లు చిత్రించడమే ఆయన చేసిన పని. ఎంతో పరిణతి, లోకానుభవమూ వున్నవారికే అది సాధ్యం.
‘కురూపి’ నవలను చదివాక అది మన నీడై, మన ఆలోచనాధారై ప్రవహిస్తూ ఉంటుంది. సరస్వతి హృదయ సౌందర్యం, ఔన్నత్యం అంత గొప్పదవడం వల్లే ‘కనకం’ లాంటి రచయిత ఆమె ప్రభావంలోపడి, మొద్దుబారిన హృదయాన్ని చైతన్యపరుచు కోగలుగుతాడు.
సరస్వతి, కనకాల సంభాషణలలో ‘శిల్ప’ చర్చ వస్తుంది. అదే ఈ నవలలో ఆయువు పట్టయింది. అప్పటివరకూ బాహ్య సౌందర్యానికీ, హృదయ సౌందర్యానికీ మధ్యనుండే సన్నని గీతను కనకం ఆలోచించలేదు. కొ.కు. గారి సంభాషణా శైలిలో క్లుప్తత, గాఢత, ఘాటైన విమర్శ, లోతైన అవగాహన ఉంటాయి. సరస్వతి మాట్లాడేంత వరకూ, తన రచనలలో అనాకారి పాత్రలు లేవన్న స్పృహ లేదతనికి. కనకంలో వున్న గొప్ప లక్షణమేమంటే, తననుతాను తరచి చూచుకోవడం, తప్పొప్పులు బేరీజు వేసుకోవడం, మారాల్సిన స్థితి వుంటే గుర్తించి మారడం – ఇవన్నీ ప్రతిమనిషీ చేయాల్సిన విధులన్నది రచయిత ఉద్దేశించిన భావన. అంతస్సౌందార్యన్ని గురించీ చెప్పాల్సింది చాలా వుందని రచయిత భావించారనడానికి నిదర్శం, ఇదే వస్తువుతో ‘కురూపి భార్య’, ‘ఆకర్షణ లేని అమ్మాయి’లనే పేర్లతో మొత్తం మూడు రాశారు. కథ, గల్పిక, నవల ఇలా మూడు రూపాల్లో పదేపదే చెప్పడం ద్వారా సమాజానికి చెప్పాల్సిన బాధ్యత వుందని భావించా రన్పిస్తోంది. ఒకే అంశాన్ని పదేపదే చెప్పడం కూడా కొ.కు. గారి ధోరణికి విభిన్నం. కానీ, ఈ కథా వస్తువు ఆయనను అతిక్రమించి మనముందుకొచ్చింది. జీవన విలువల్ని పెంపొందించింది. మనుషుల ఆలోచనా కోణాల్ని మార్చుకోవాల్సిన స్థితిని కల్పించింది. అందరిలానే మామూలు మనిషైన కనకం, సరస్వతి పరిచయమైనాక, తనలోవున్న వెకిలితనం, అహంకారం, రచయితనన్న ఆధిక్యతా ధోరణీ, సౌందర్య వంతులకు మాత్రమే తనతో మాట్లాడే హక్కుందనుకునే పొగరూ, తాను, ఇతర మామూలు మనుషుల కంటే భిన్నమనుకుని, వాళ్ళెవరితోనూ కలవక, అప్పటి వరకూ తన చుట్టూ తాను కట్టుకున్న కంచుకోటా – అన్నీ కూలిపోతాయి.
జ    జ    జ
 ఇక, కథ ముగింపులో కనకంలో వచ్చిన మానసిక పరివర్తన అనూహ్యమైనది. దానికి కారణం సరస్వతిలో ఉన్న హృదయ సౌందర్యమే, సౌకుమార్యమే. అందువల్లనే తాను సరస్వతి తన కథల్ని విమర్శించినా, మార్పులు చెప్పినా, లేదా కథావస్తువు గురించి తానేం అనుకుంటుందో నిర్మొహ మాటంగా మాట్లాడినా, అతనికి ‘సరస్వతి తన జీవితానికింకేదో పరీక్ష పెట్టినట్టుగా’నే తోచింది. తనకు తెలియ కుండానే ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడై నాడు. అంతేకాక తన ప్రవర్తనల పట్ల తానే సిగ్గుపడేంతగా మారిపోయాడు. అంతుకు ముందు తాను అనుసరిస్తున్న జీవనవిధానం నుండి క్రమంగా సరస్వతి వ్యక్తిత్వ ప్రభావం వల్ల మారుతూ వచ్చాడు. ఆఖరికి ఉద్వేగంగా ముద్దపెట్టుకున్నాక ఆ ‘మరపురాని అనుభవం’ అతడికి ఎదురైన ‘సిగ్గుపడే’ అనుభవాల కంటే భిన్నంగా తోచింది. అందువల్లనే తనలోతాను తరిచి తరిచి చూసుకునేందుకు మారిపోయాడు. తనకు కూడా కారణం తెలియనంతగా ఆమె ప్రభా వంలో పడిపోయాడు. ఈ పరిణామం అంతా కొ.కు.ఉద్దేశించిన లక్ష్యం హృదయ సౌంద ర్యం యొక్క ప్రాముఖ్యతను తెలియ జెప్పేదే.
చివరికి సరస్వతి చాలా ఆపేక్షగా చూసుకున్న అన్నయ్య కూతురు చనిపోయి నప్పుడు. ఆమె స్థితిని గురించి కనకం ఎంతో ఆలోచించాడు. కంగారు పడ్డాడు. ఆమెను ఉత్తమ సంస్కారిగా ఓదార్చాడు. చివరికి సేదతీర్చే తల్లిలా మారి పోయి నట్లుగా భావించాడు. ఈ ముగింపు ద్వారా కొ.కు. కనకం వంటి అస్థిర వ్యక్తిత్వం గల వ్యక్తిని, హృదయ సౌందర్యం, సౌకుమా ర్యం వున్న సరస్వతి ఎంతగా ప్రభావితం చేయగలదో నిరూపించగలిగారు.
జీవితాన్ని హృదయసౌందర్యం, సౌకు మార్యం మాధ్యమంగా సాగించే సరస్వతికి ఆ పేరు పెట్టడంలో కొ.కు. ప్రజ్ఞ యిమిడి వుంది. చదువు, ఆలోచన, ప్రవర్తన, ఉత్తమ సంస్కారం. ఇవన్నీ మూర్తీభవించి నందువల్లనే ‘సరస్వతి’ అనే పేరు పెట్టినట్లుగా అన్పిస్తుంది. అలాగే కనకం పేరు కూడా. కంచు, కనకం రెండింటి రూపం ఒకటిగా అన్పించినా తేడా ఎంతగా వుంటుందో, అలానే ‘కంచు’లా మొదలై, ‘కనకం’లా పరివర్తన చెందిన క్రమపరి ణామం ఈ పాత్రలో కన్పిస్తుంది. ఇలా ‘కురూపి’లోని అంశాలను సునిశితంగా విడమరిస్తే, ఇంకెన్నో అంశాలు వెలికివచ్చే అవకాశం వుందనిపిస్తుంది. కొ.కు. చేసిన పనల్లా విషయాన్ని స్థూలంగా చెప్పడం మాత్రమే. పాఠకుడు తన హృదయంతో, వివేచనతో, అనుభవంతో జతగలిపి విశ్లేషించుకోవడం ద్వారా ఇంకా సూక్ష్మంగా ‘కురూపి’లోని అంతస్సారాన్ని అందుకోవచ్చు నని అన్పిస్తుంది.
‘మానవ స్వభావాల్లో సౌందర్య ముండాలి. అదే బతుకును వెలిగిస్తుంది’ అనే గొప్ప సూత్రాన్ని ఈ కథ వివరిస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.