కొ.కు. ఐశ్వర్యం
Posted By భూమిక on November 5, 2009
ఓల్గా
మార్క్స్ డబ్బునీ మనుషుల మీద, మానవ సంబంధాల మీదా దానికున్న అధికారాన్నీ వివరిస్తూ ఒకచోట అంటాడు - డబ్బే
మనుషులను మానవ జీవితానికి కట్టిపడవేసే నిజమైన బంధంగా ఈ సమాజ ంలో బలపడుతోందని – అన్ని బంధాలనూ మించిన బంధం డబ్బు లేదా ఆర్థికబంధం అవుతోందని, అన్ని బంధాలను మాయం చేయగల ముడివేయగల ఏజెంటుగా డబ్బు పనిచేస్తోందని, మనుషుల్ని విడదీయగల, కలపగల సామాజిక రసాయన శక్తిగా డబ్బు బలపడుతోందని -
అలాంటి డబ్బు గురించీ, మానవ జీవితంపై డబ్బు ప్రభావం గురించీ, మానవ సంబంధాలలో డబ్బు పాత్ర గురించీ కుటుంబరావుగారు ‘ఐశ్వర్యం’ నవల రాశారు. ఈ నవలలో ప్రధానపాత్రలు నాలుగు. నరసింహం అనే లాయరు. అతని కొడుకు కనకసుందరం. ఈయన డాక్టరు. కనకసుందరం కూతురు నర్సు. కనక సుందరం దగ్గరకు పేషెంటుగా వచ్చి మిత్రుడై ‘మిస్టర్ నర్సు’గా మారిన ‘నేను’. నేను అనే పాత్ర ఈ కథంతా చెబుతూ ఉంటుంది. ఈ నలుగురే ఈ నవలలో ప్రధాన పాత్రలు. నరసింహానికి డబ్బే ప్రధానం. లాయర్గా లక్షలు గడిస్తాడు. ఆ డబ్బు ద్వారానే మనుషుల మీద తన ప్రేమను గానీ ద్వేషాన్ని గానీ ప్రదర్శిస్తాడు. కొడుకు కనకసుందరం తన వృత్తిలో గానీ వివా హంలో గానీ డబ్బునీ, డబ్బే సర్వస్వమైన తండ్రినీ ఖాతరు చేయకపోవటంతో నరసింహం కొడుకుని ద్వేషిస్తాడు. కక్షగట్టి అతన్ని దూరంగా ఉంచుతాడు. ముసలితనం, ఒంటరితనం భరించలేక మనవరాలికి డబ్బుని ఎరగా చూపి జయిస్తాడు. తన ఐశ్వర్యంతో తండ్రీ కూతుళ్ళను విడదీసి మనవరాలిని తన దగ్గరకు తెచ్చుకుంటాడు. మొదట తండ్రీ కొడుకులు విడిపోవటానికి కారణమైన డబ్బే తర్వాత తాతా మనవరాళ్ళు కలవటానికి కారణమవుతుంది. మళ్ళీ తండ్రీ కూతుళ్ళు విడిపోవటానికీ కారణమవుతుంది.
కనకసుందరానికి తండ్రి భావాలన్నా తండ్రి డబ్బన్నా అసహ్యం. ఆయన డాక్టరు. ప్రజాసేవ చెయ్యాలని డాక్టరవుతాడు. కానీ రోగుల మనస్తత్వాన్ని బట్టి కాకుండా తన పద్ధతిలో వైద్యం చేయటం వల్లా, భేషజానికి తావివ్వకపోవటం వల్లా ఆయనకు పెద్దగా ప్రాక్టీసు ఉండదు. మందుల అవసరం లేనపుడు ఆయన పేషెంట్లకు మందులివ్వడు. చిన్న రోగాలకు పెద్ద హడావుడీ చెయ్యడు. సాధారణ జ్వరాలు, అస్వస్థతలూ శరీరం తనకు తాను చేసుకునే వైద్యం అని డాక్టరుగా అతను చెబుతుంటే నమ్మేవాళ్ళు తక్కువ. ఆయన పెళ్ళాడింది తన మొదటి పేషెంటు భార్యను. ఆఖరి క్షణాల్లో తన దగ్గరకు వచ్చిన ఆ రోగి చనిపోతే ఏ దిక్కూలేని అతని భార్య సుందరమ్మను పెళ్ళాడతాడు. ఆ కారణంగా తండ్రికీ అతని డబ్బుకీ దూరమవుతాడు.
కనకసుందరానికి నిరాడంబర జీవితం ఇష్టం. భార్య కూడా ఆయన పద్ధతులను అనుసరిస్తుంది. వాళ్ళ జీవితాలలో అనవసరమైన, ఆడంబరమైన విషయాలకు తావులేకుండా చూసుకుంటారు. అతిసామాన్యమైన బట్టలూ, అతిసామాన్య మైన, అదే సమయంలో మంచి ఆరోగ్యకర మైన భోజనం తప్ప వాళ్ళింకో భేషజం జోలికి పోరు. తల్లీకూతుళ్ళిద్దరికీ నగలు లేవు. సిల్కుబట్టలు లేవు. పౌడర్లు, క్రీములూ వంటి అలంకరణలు లేవు. ఆఖరికి టూత్పేస్టు కూడా వాడరు. కచ్చికతోనే పళ్ళు తోము కుంటారు. డాక్టర్ గారికి ఈ నిరాడంబర జీవితానికవసరమైన తాత్త్విక పునాది ఉంది. ఆయన ఎంతో సాహిత్యం చదివాడు. ఆ సాహిత్యం ద్వారా సంస్కారం సంపాదించాడు. మానవత్వం అభివృద్ధి చేసుకున్నాడు. జీవి తాన్ని గురించి తాత్త్వికంగా ఆలోచించాడు. తన నిరాడంబర జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఆయన భాసుడి చారుదత్తం నాటకాన్ని ఉదహరిస్తాడు.
”హ్యూమన్ స్పిరిట్ శూన్యం. అది విలువలేని వజ్రం లాగా ధగధగ మెరుస్తుంది. ఒకరికి దిగ్భ్రమ కలిగించాలని కాదు. మెరవటం దాని స్వభావం. ఆ స్పిరిట్ స్వభావంతో మనుషులు తమ ప్రవర్తనలోనూ చర్యలలోనూ రకరకాల నిగ్రహాలు పాటిస్తారు. భాసుడి పాత్రలతో పోలుస్తున్నాననుకోకు – మా వాళ్ళు క్రీములూ, పౌడర్లూ వాడక పోవటంలో కూడా ఏదో ఒక వింత స్పిరి టున్నది. వాళ్ళు లిప్స్టిక్ వేసుకున్నా నేనభ్యంతరం చెప్పను. కానీ నా వైఫ్కు కొన్ని కొన్ని పడవు. కొన్ని పనులు చేస్తే ఆవిడ స్పిరిట్ దెబ్బ తింటుంది. సిల్కుచీరెలు కట్టదు. కట్టకపోవటంలో నీతి ఉందని కాదు. గొప్పతనం ఉందని కాదు. సిల్కు చీరెలు కట్టే వాళ్ళను గురించి తక్కువగా అను కుంటుందనీ కాదు. మనం సిగరెట్లు కాల్చేవాళ్ళందర్నీ తక్కువచేసి చూస్తామా? అది పాపమనుకుంటున్నామా?… అంటూ ‘నేను’తో చెబుతాడు. నేను నర్సుకి ఒక క్రీము కొనిస్తే నర్సు అది తిరిగి ఇచ్చేస్తుంది. ‘నేను’ నొచ్చుకోకుండా డాక్టరుగారు తమ జీవిత విధానాన్ని చెబుతాడు. ఆయన చెప్పినదాని ప్రకారం ఆయన జీవితవిధానం ఆయన ఎవరో చెబితే ఆచరించేది కాదు. తన సంస్కారం ద్వారా సంక్రమించినది. సుంద రమ్మకు కూడా ఆ సంస్కారం ఉండటం వల్ల భార్యాభర్తలిద్దరూ అనుకూల దాంపత్యం సాగించారు.
డాక్టర్గారి కూతురు నర్సుది వీళ్ళిద్దరి వంటి పరిస్థితి కాదు. ఆమె తలిదండ్రుల జీవితానికీ మిగిలిన సమాజ జీవితానికీ తేడా గమనించింది. ఆ తేడాలోని మౌలికతత్త్వం ఆమెకర్థం కాలేదు. తలిదండ్రుల జీవితాన్నే మౌనంగా తానూ అనుసరిస్తూ మౌనంగానే ద్వేషించసాగింది. మిగిలిన పిల్లలు పెట్టు కున్నట్లు నగలు పెట్టుకోవాలని, అలంక రించుకోవాలనీ కోరికలు నర్సుకున్నాయి. ఆ కోరికలను ఆ అమ్మాయి అణిచేసుకుంది. తలిదండ్రులు తప్ప ఆ అమ్మాయికి ఎవరూ లేరు. తలిదండ్రులను బహిరంగంగా ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయింది.
తాతగారైన నరసింహం నర్సుని పిలిపించుకుని ఆమెకు నగలు పెట్టి పెళ్ళి కూతురిలా అలంకరించి తన ప్రేమను హద్దులు లేకుండా ప్రదర్శిస్తాడు. ఆ ప్రదర్శనకు నర్సు చలించినట్లు కనపడదు గానీ తాతగారి ఐశ్వర్యానికి చలిస్తుంది. తండ్రికి తెలియకుండా తాతగారితో మాట్లాడుతుంది. చివరికి తాతగారిల్లు చేరి తలిదండ్రులకు ఉత్తరంముక్కయినా రాయకుండా నిశ్చింతగా ఆ ఐశ్వర్యంలో, అది యిచ్చే సుఖాలలో మునిగిపోతుంది. తన తండ్రి పట్ల తనకున్న వ్యతిరేకతను మొదటిసారి ‘నేను’ అనే పాత్ర దగ్గర బైటపెడుతుంది. ”ఆ రోజు నువ్విచ్చిన క్రీము పూసుకుంటే ఏమై ఉండేదనుకున్నావు? మా నాన్న పేర్చుకున్న కుటుంబసౌఖ్యమంతా పునాదులతో సహా కూలిపోయేది. కాస్త పౌడరు వేసుకున్నా ఒక సిల్కుచీర కట్టుకున్నా నరకయాతన పడతాడని తెలిసి మా నాన్నకు మేమిద్దరమూ లొంగిపోయి యమచెర లనుభవించాం. నీకేం తెలుస్తుంది? ఆ రోజు మీ బంధువుల ఇంట్లో పెళ్ళికొచ్చినపుడు నన్ను మా తాతయ్య పెళ్ళికూతురల్లే ముస్తాబు చేయించాడే అప్పుడు నిలువటద్దంలో నన్ను నేను చూసి ఏడిచాను తెలుసా? నేనేం పాపం చేశాను. నేను వీల యినంత అందంగా ఎందుకుండ గూడదూ? అందరూ నన్ను చూసి ఎందుకానందించ గూడదూ? అందువల్ల ఏ ఆదర్శాలకు భంగం వస్తుంది?” అని తన బాధనంతా పైకి చెప్పుకుంటుంది.
డాక్టరుగారు తన కూతురు పుట్టిన దగ్గర్నించీ తన ఇంటి వాతావరణంలో పెరగటం వల్ల సహజంగా తన సంస్కారం వస్తుందనుకుని ఉంటాడు. తన ఇంటి వాతావరణానికీ, సమాజానికీ మధ్యనున్న తేడా తన కూతురి మీద ఎట్లా పనిచేస్తుందో నని ఆయన ఆలోచించినట్లు కనపడడు. మన సంస్కారబలం వల్ల మనం సమాజానికి భిన్నంగా బతకవచ్చు. కానీ ఆ బలం మిగిలినవాళ్ళకు మన కుటుంబంలోని వాళ్ళకు ఉండాలని ఎక్కడుంది. ఆ బలం లేని వాళ్ళు వాళ్ళ అంతర్గత ప్రేరణ, ప్రమేయం లేకుండా మామూలు సమాజానికి భిన్నమైన జీవితంలోకి వచ్చేస్తే సమాజపు బూటకపు విలువలమీద మోజు పెరిగే అవకాశం ఉండదా? నర్సు డాక్టరు గారింట్లో సన్యాసినిలా కాకుండా మిగిలిన పిల్లల మాదిరిగానే పెరిగి ఉంటే తాతయ్య ఐశ్వర్యం చూసి అంత భ్రమపడేది కాదేమో. కోరికలనుంచీ, విలాస జీవన విధానం నుంచీ ఎవరికి వారు విముక్తులు కావలసిందే గాని యింకొకరి నిర్బంధం వల్లనో, ప్రభావం వల్లనో బైటపడలేరని చెప్పటానికి కొడవట ిగంటి ఈ నవల రాశారనిపిస్తుంది.
సమాజంలో మార్పు రాకుండా కొందరు వ్యక్తులు తమ మంచి తనం వల్లా, నిగ్రహశక్తి వల్లా ఆదర్శప్రాయ మైన జీవితం గడిపితే తమకు దగ్గరివారే దూరమయ్యే ప్రమాదముంది. ఆదర్శాలను ఆచరించగల వారు ఆచరించటం మంచిదే గాని తమవారనుకున్నవారు, కుటుంబంలోని వారు ఆటోమేటిగ్గా ఆ ఆదర్శాలను తను పాటించినట్లే, ఆ సంస్కారంతోనే పాటిస్తా రనుకోవటం పొరపాటు. పాటించకపోగా ఆ ఆదర్శాలను ద్వేషించే ప్రమాదం కూడా ఉంటుంది.
నర్సుకి పట్టిన ధనకాంక్ష వికృత రూపం డాక్టరుగారి భార్య సుందరమ్మ గర్భవతయినపుడు గాని బైటపడదు. పదహారేళ్ళ తర్వాత సుందరమ్మ మళ్ళీ గర్భవతయింది. ఆమెకు కొడుకు పుడితే? తాతగారికి మనవరాలిమీద కంటే మనవడి మీద ప్రేమ ఎక్కువుండే అవకాశం సహజంగానే ఉంటుంది. ఆస్తికి వారసుడు మనవడని అనుకుంటే – ఈ భయాలతో నర్సు విపరీతంగా ఆలోచించింది. తన తల్లి గర్భవతి అనే విషయం తాతకు తెలియక ముందే ఆస్తి తనపేర రిజిస్టరు చేయించు కుంటుంది. ఆస్తి తనతోపాటు తమ్ముడో, చెల్లెలో పంచుకుంటారనే ఊహే భరించలేక పోతుంది. అదే సమయంలో తన తల్లిదండ్రుల మీదా, పుట్టబోయే చెల్లి మీదా తనకున్న ప్రేమ ప్రకటించటానికి తన ఆస్తే ఆధారం అనుకుంటుంది. ”నాకు నా వాళ్ళపై ఉన్న ప్రేమ చూపటానికి నా డబ్బు తప్ప, ఆస్తి తప్ప మరేముంది?” అంటుంది. తనవాళ్ళనుంచి తనను విడదీసింది డబ్బు అనే సంగతి గమనించని నర్సు తన తనవాళ్ళతో తనకు సంబంధం కలపగలి గింది డబ్బేననుకుంటుంది. కానీ డాక్టరు గారి సంస్కారం డబ్బుకి విలువ యిచ్చేది కాదు గాబట్టి ఒకప్పుడు ఆయన తన తండ్రితో పెంచుకున్న దూరాన్ని, కూతురి తోనూ పెంచుకుంటాడు. తాతను మనవ రాలినీ కలపగలిగిన డబ్బు తండ్రినీ కూతు రినీ వేరుచేసింది. డబ్బుకున్న ఆ శక్తీ, మానవ సంబంధాలపై దాని ప్రభావం గురించి ఆలోచింపజేసే నవల ”ఐశ్వర్యం”. అలాగే ఆదర్శాలు లేదా హ్యూమన్ స్పిరిట్ అందరిలో ఒకేలా ఉండవనీ, ఎవరి బలం ప్రకారం వాళ్ళు ఎదగకపోతే వికృతమయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా ‘ఐశ్యర్యం’ బలంగా చెబుతుంది.
Comments
Leave a Reply