సఫాయి కర్మచారులపైన సంబంధిత అధికారులు పాలకులు చూపుతున్న వివక్షత
Posted By భూమిక on April 4, 2010
సి. పెన్నబిలేసు
కర్నూల్ జిల్లానందు అక్టోబర్ 2వ తేది నుంచి 8వ తేది వరకు 7 రోజుల వరద ప్రభావం వలన దాదాపు కర్నూలు పట్టణం, నంద్యాల, మంత్రాలయం, నందికొట్కూరు, కౌతౌళం, కొసిగి, ఆవుకు, గొనెగండ్ల, మద్దికెర, సిరివెల్ల, రుద్రవరం, గూడూర్, వెలుగోడు, ఆత్మకూర్, మహానంది, పాణ్యం, మండలాలు మొత్తం 16 మండలాల పరిధిలో ఉన్న 200 గ్రామాలలో దాదాపు 20 వేల కుటుంబాలు వరదముప్పు వలన ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది.
ఇందులో వెయ్యి కుటుంబాలకు ప్రాణనష్టం జరుగగా, మిగిలిన 32 వేల కుటుంబాలకు ఆస్తినష్టం జరిగినాయి. పై కనబరిచిన కుటుంబాలలో దాదాపు 354 సఫాయి కర్మచారి కుటుంబాలలో 47 కుటుంబాలు ఇండ్లు కూలిపోయిన బాధితులు, 307 కుటుంబాలు ఆస్తినష్టం కల్గిన సఫాయి కర్మచారి కుటుంబాలు ఉన్నవి. అయితే ప్రభుత్వం ద్వారా ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా పునరావాస పంపిణీల్లో చాలావరకు (అవకతవకలు) పొరపాట్లు జరిగినవి. మరియు ఊరి మధ్యలో ఉన్న క్షతగాత్రులకు మాత్రమే పునరావాస సహాయం అందించుటలో భాగంగా ప్రభుత్వం ద్వారా కొన్ని కుటుంబాలకు డబ్బు పంపిణి కార్యక్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు, మీడియా, పాత్రికేయుల ప్రతినిధుల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటసామాగ్రి బట్టలులాంటివి పంపిణి చేయడం జరిగింది. అయితే దళితలైన ముఖ్యంగా షెడ్యూల్డు కులాలవారు ఊరికి చివరగా ఉన్న దళితవాడల్లోకి వెళ్ళి వారిని ఓదార్చి సహాయం అందించు ప్రక్రియ ముమ్మాటికి జరుగలేదన్నది ఒక చేదునిజం.
కర్నూలు జిల్లాలోని గ్రామాలలో వరదనీటి ప్రవాహం వలన నిత్యావసర వంటసామాగ్రితో పాటు ఇండ్లల్లోని విలువైన వస్తువులు మరియు చిన్నపిల్లలు ముసలివాళ్ళు వికలాంగులు (నడవలేని పరిస్థితి ఉన్నవాళ్ళు సైతం) పశువులు (ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు) వరద నీటి ఉధృతి వలన నీటిప్రవాహంలో కొట్టుకొనిపోయి అసువులు బాసిన మనుషుల శవాలు, జంతువుల కళేబరాలతో గ్రామాలు అన్ని దుర్గంధభరితమైన వాసనతో భరించలేని, చూడలేని భీభత్సం జరిగినది. అయితే సంబంధిత అధికారులు, పరిపాలనా మాత్యులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వరద భాదిత ప్రజలకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారేగాని, ముఖ్యంగా వరదముప్పుకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పి వారి సహజీవనానికి బరోసా ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దడానికి మెరుగైన వైద్యసేవలు చేయడానికి మరియు అపరిశుభ్రత పారిశుద్ధ్యము నుంచి వచ్చు అంటురోగాలు ప్రబలకుండా అనేక జబ్బులకు ప్రజలు బలికాకుండా మానవత్వం ఉన్న ప్రతిమనిషి సహాయక ప్రతిచర్యలు పూర్తి భాగస్వాములు అయి చేయాల్సిన సహాయకచర్యలు చేయలేకపోవడం ఇక్కడ జరిగిన ఒక పెద్ద లోపం.
అయితే అగ్నిప్రమాద సంఘటనలు, హింసాత్మక సంఘటనలు, దేశ సరిహద్దు భద్రత సంఘటనలు పరిరక్షించడానికి ప్రత్యేక రక్షణ సాధనాలు సమకూర్చుతూ ప్రత్యేక శిక్షణలు ఇచ్చు ప్రభుత్వాలు వరద బాధిత సహాయక చర్యలు అందించు ప్రక్రియనందు ముఖ్యంగా అపరిశుభ్రత పనులు చేయించవల్సిన పరిస్థితుల్లో వినియోగించు పారిశుద్ధ్యపు కార్మికులకు (సఫాయి కర్మచారులు) ఎందుకు ప్రత్యేకంగా రక్షణ సాధనాలు కల్పించకుండా, శిక్షణ లేకుండా వీరిచేత పనులు చేయించడం జరుగుతున్నది అనేది సభ్యసమాజంలో ఉన్న ప్రతి మనిషి అంతరాత్మ సాక్షిగా ప్రశ్నించుకోవాల్సిన విషయం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధిలాంటి కార్యక్రమాల కొరకు అనేకవేలకోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసే పరిస్థితి ఉన్నప్పుడు వరద సహాయ అపరిశుభ్రత పారిశుద్ధ్యపు పనులను చేసే సఫాయి కర్మచారులు మనుషులు కారా? ఎందుకు అనగా కర్నూల్ జిల్లా నందు జరిగిన వరద బాధితులను అంటురోగాలనుంచి కొన్నివేల ప్రాణాలను కాపాడిన సఫాయి కర్మచారుల ప్రాణాలకు విలువలేదా?
ఉదా : 1. మంత్రాలయం గ్రామపంచాయితిలో నెలకొన్న అపరిశుభ్రతను తొలగించుటకు (మనుషుల శవాలు, జంతువులు కళేబరాలు) ఎమ్మిగనూర్, ఆదోని మున్సిపాలిటి, నుంచి మండగిరి గ్రామపంచాయితీ నుంచి పత్తికొండ, కొసిగి, కౌతాళం, గ్రామపంచాయితీల పనిచేస్తున్న సఫాయి కర్మచారులు.
2. నంద్యాల, వెలుగోడు, ఆత్మకూర్, పాణ్యం, ఆవుకు, బనగానిపల్లె, కోవెలకుంట్ల, బేతంచర్ల గ్రామపంచాయితీలలో పనిచేస్తున్న 95 సఫాయి కర్మచారులు పాల్గొని పనిచేశారు.
3. కర్నూల్ : డోన్, ప్యాపిలి, నంద్యాల, ఎమ్మిగనూర్, సిరివెల్ల, రుద్రవరం, గ్రామపంచాయితీలలో పనిచేస్తున్న 120 సఫాయి కర్మచారులు పాల్గొని పనిచేశారు.
గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న సఫాయి కర్మచారులను వరదముప్పు ప్రాంతాలకు కట్టుబట్టలతో తరలించి మనుషుల శవాలు, జంతువుల కళేబరాలను పూడ్చడానికి దహనం చేయడానికి వినియోగించబడిన సఫాయి కర్మచారులకు రక్షణ సాధనాలైన కాళ్ళకు బూట్లు, ముక్కులకు మాస్కులు, చేతులకు గ్లౌజులు, సబ్బులు ఇవ్వకుండా ఉదయం నుంచి పొద్దుపోయేవరకు విశ్రాంతి కూడా తీసుకోనివ్వకుండా పనులు చేయించడం ఎంతవరకు సమంజసం? ఇంతటి శ్రమదోపిడిని భరిస్తూ కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు గురైన సఫాయి కర్మచారులకు అత్యవసర వైద్యసహాయం అందించడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు.
వరద ముప్పుకు గురైన గ్రామాలలో నెలకొన్న అనేక అపరిశుభ్రత పనులు చేసిన సఫాయి కర్మచారులకు భోజనం చేయడానికి ముందు కాలుచేతులు శుభ్రపర్చుకోవడానికి సబ్బులను కూడా సమకూర్చకపోవడం, సరైన మంచి భోజనం కల్పించలేకపోవడం, రాత్రివేళల్లో పడుకోవడానికి వసతిని కల్పించకపోవడం ఇవన్నీ కనీస సౌకర్యాలు కూడా సమకూర్చకపోవడం సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం యొక్క దళిత సఫాయి కర్మచారుల పైన చూపుతున్న వివక్షత కాదా?
ఎందుకు అనగా ఈ విపత్తు సహాయక చర్యలలో భాగస్వామ్యులు అయిన సఫాయి కర్మచారులు పొద్దుపోయేదాక పనులుచేసి మధ్యాహ్నం తెచ్చిపెట్టిన భోజనాలను పనులు పూర్తి అయినప్పటికి రాత్రి 10 గంటలకు మున్సిపాలిటి, గ్రామపంచాయితీల ద్వారా నెలకొల్పబడిన పబ్లిక్ కొళాయిల దగ్గర శుభ్రం చేసుకొని సద్దిఅన్నం తిని కనీసం కప్పుకోవడానికి ఒక చిన్న బట్ట (గుడ్డ) ముక్క కూడా లేక తెల్లవార్లు ఈగల దోమలతో కరిపించుకొని నిద్రలేక అలసిపోయిన కళ్ళతో నీరసించిపోయిన సఫాయి కర్మచారుల పరిస్థితి నిజంగా బండరాయి సహితం కరిగి నీరై పారే హృదయవిదారక పరిస్థితుల్లో వీరిచేత పనులు చేయించుకున్న సంబంధిత అధికారులు పాలకులల్లో మానవత్వం ఉందా? ఉంటే చిన్నపిల్లలు సైతం సిగ్గుపడే అంతటి వివక్షత చూపుతున్న వీరు క్షమార్హత లేని మనుషులు కాదంటారా?
కాబట్టి ఇంతటి శ్రమదోపిడికి, వివక్షతకు గురిచేసి ఆరోగ్యాలను సహితం హరించి అంటరాని వెట్టిచాకిరి పనులను చేయించినందుకు ఒక్కొక్క సఫాయి కర్మచారులకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తూ ఉద్యోగభద్రత కల్పిస్తూ నిజమైన సమాజసేవ చేసినందుకుగాను అవార్డు, ప్రశంసాపత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాబోవు రోజుల్లో ఇటువంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
Comments
Leave a Reply