టుహిమ్‌ విత్‌లవ్‌

Posted By on August 2, 2010

పరిశోధన : బండారి సుజాత
పర్యవేక్షణ : కాత్యాయనీ విద్మహే
కథా పరిచయం : సంబోధన, సంతకం లేకున్నా ఒక భార్య తన భర్తకు వ్రాసిన అడ్రస్‌ లేని ఉత్తరం రూపంలో ఉన్న కథ ఇది.
ఎగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన గృహిణి ఆవేదనకు, అశక్తతకు అక్షరరూపం ఈ లేఖ. పెళ్ళయి పాతికేళ్ళయిన సంబరం జరుపుకునే సందర్భంలో ఒక భార్య భర్తకు వ్రాసినది ఈ ఉత్తరం.
పాతికేళ్ళ నాటి సంతోష సమయాలను, మధుర ఘట్టాలను, మార్పులను, అనుభవాలను తాను కోల్పోయిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నాటి అబద్దపు బ్రతుకుతో పోల్చి చూచుకుంటూ వివాహ రజతోత్సవానికి అతనికిచ్చే కానుకగా ఆమె ఈ లేఖ వ్రాస్తుంది.
ఆనాడు ఒకరిని ఒకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. ఆమె అలవాట్లు, ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకుని ఆమె లోకంగా జీవించి, ఆమె కోసమే తన జీవితమున్నట్లుగా మసలిన భర్త అతను. ఒకరి అభిప్రాయాలు ఒకరు ఒకరి మనసులోని మాటను ఒకరు తెలుసుకునే విధంగా బ్రతికిన ఆ జంట పెళ్ళయి ఇరవై అయిదేళ్ళయినా పుట్టిన రోజులను, వివాహవార్షికోత్సవాలను మరచిపోకుండ జరుపుకుంటున్న ప్రేమజంటగా ఇతరులతో పొగడబడుచున్నారు వాళ్లు. ఆ పొగడ్తకు తాము అర్హులమేనా? తాము జీవించేది నిజమైన జీవితమేనా? అని ఆమె మనసులో పడే ఆవేదనకు ఆకర్ష రూపం ఈ లేఖ.
ఈమెను స్నేహితురాలిగా ప్రేయసిగా భావించిన అతడు ఆ ప్రేమలో మరొకరికి భాగం పంచడంతో ఆమె గుండె పగిలి ఏడ్చింది. అతని మొహం చూడకూడదనుకుంది. పుట్టింటికి వెళ్ళింది. కాని అతను రాగానే పిల్లలు పరుగెత్తి కెళ్లి నాన్నతో చేరగానే ఆమె వారికి తండ్రి కావాలి, తల్లి తండ్రి కలిసి ఉండడం కావాలనుకుని అతనితో వచ్చేసింది. కాని ఆమె గుండెలో తీరని మంటగా ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఎవరికి తెలియకుండ, తెలియనీయకుండ ఆ బాధ రగులుతూనే ఉంది. తాను పోగొట్టుకున్న ఆనాటి తన భర్త మళ్ళీ కనపడతాడేమోనన్న ఆశతో ఆరాటపడే ఆమె అంతరంగానికి అద్దం ఈ లేఖ.
కథా విశ్లేషణ : దాంపత్యాలను జన్మజన్మల బంధాలుగా కుటుంబాన్ని సంతృప్తికరమైన మానవ సంబంధాలకు నిలయమైన ఒక వ్యవస్థగా చెప్తుంటారు. కాని అవి ఎంత అబద్ధాలో లోపలినుండి చూపించిన కథ ఇది.
ప్రేమలేనిదే ప్రపంచం లేదు. ప్రేమ మూలంగానే ప్రపంచం అనుకుని ఆమె అతనిని ప్రేమించి పెళ్ళి చేసుకుని దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లల తల్లైంది. భర్త ప్రేమ తనదేనని మురిసి పోయింది.
ఆమె వ్యక్తిత్వం ఆధునికమైంది. అందుకే తిండి, బట్టా ఇచ్చి భరించే వాడే భర్త అన్న నిర్వచనాన్ని అసహ్యించుకుంటుంది. భర్త అంటే తన దృష్టిలో మంచి స్నేహితుడు, సమాన అభిరుచులు కలసిన వాడు.
వీరిద్దరి ఇండ్లు దగ్గర దగ్గర ఉండటంతో పరిచయాలు స్నేహంగా మారి అభిప్రాయాలు, అభిరుచులు ఒకరివి ఒకరు తెలుసుకుంటారు. అతనికి, ఆమెకు సాహిత్యమంటే ఇష్టం. అందుకని ఆమెతో కలిసి ప్రబోధ పుస్తకాల షాపుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాడతను. ఏ మంచి పుస్తకం కనిపించినా ఆమె కోసం కొని తెచ్చేవాడు. ఇద్దరు కలిసి సాహిత్యం, కవిత్వం రాజకీయాలు చర్చించుకునేవాళ్ళు.
ప్రకృతంటే ఇద్దరికీ ఇష్టం. ఇద్దరు కలిసి తోటలలోకి షికారువెళ్ళడం, పిల్లల చదువు పూర్తికాగానే ఉద్యోగం మానేసి ఏదైనా పల్లెటూళ్ళో చిన్న పాక వేసుకుని పూలతోట పెంచుకుని హాయిగా ఉండాలనుకోవడం దాన్నే సూచిస్తుంది.
క్రీడలంటే ఇద్దరికి ఇష్టం చదరంగం ఆడుతూ, బ్యాట్‌ మెంటిన్‌ పిల్లలతో కలిసి ఆడుతూ ఎంతో సంతోషించేవారు. ఇన్ని అభిరుచులు, అభిప్రాయాలు కలిసిన ప్రేమ సత్యమని ఆమెనమ్మింది. అందుకే భర్తకు మరొక స్త్రీతో సంబంధం ఉందని తెలిసినప్పటి నుండి ఆమెకు అతనితో గల సంబంధంతో పెద్ద ఆగాధం ఏర్పడింది.
ఆమె భర్తను వదిలేసి తన మానాన తాను బ్రతకవచ్చు. కాని రాజీపడి అతని తోనే జీవించింది. తమ దాంపత్యానికి రజతోత్సవాలు చేసుకునే దశకు వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది?
నిజానికి ఆమెకు భర్త పట్ల పూర్వపు అనురాగం, సంతోషం కుటుంబమంటే ఇష్టం అతని చర్యల వల్ల హరించుకుపోయాయి. అయినా అతనితో వచ్చింది. భర్త లేనిదే బ్రతకలేనని కాదు. వదిలిపెట్టి వుండలేనని కాదు. అతనిని వదిలిపెడితే లోకం పరిహసిస్తుందని కూడ కాదు. మనస్ఫూర్తిగా అతనిని ప్రేమించింది. ఆ ప్రేమ ఆమె స్వంతం అనుకుంది. ఆ ప్రేమ వ్యసనం తోటే పిల్లలను తండ్రిని దూరం చేయవద్దన్న ఆలోచనలతో అతనితో వచ్చేస్తుంది.
ఇద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కాని అతని ప్రేమ అనతికాలం లోనే తరిగిపోయింది. పరాయి స్త్రీలతో సంబంధాలు, క్లబ్బులు, త్రాగడం మొదలైన వ్యసనాలు ముందు వెనుకాలుగా అతని జీవితాన్ని ప్రభావితం చేసాయి. వాళ్ళ జీవితంలోని సమాన ధర్మాలకు తెరపడింది. కలిసి ఆడుకోవడం కలిసి కవిత్వాన్ని చర్చించుకోవడం అన్నీ గత జీవితపు స్మృతులయ్యాయి. అతనికి ఆమె పట్ల ప్రేమ ముందుగా తగ్గింది. అందుకే అతను ఆమె నుంచి దూరమయ్యాడు. ప్రేమించినప్పుడు ఆమెలో ఏ స్నేహం, సౌకుమార్యం, సాహిత్య సంస్కారం చూచి ప్రేమించాడో అవన్ని ఆమెలో అలాగే ఉన్నాయి. ఆమె పట్ల అతని ప్రేమ తగ్గింది. అందువల్లనే మరో స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నాడు.
ఆ సంబంధాలను కొనసాగించడంలో భాగంగా ఈమెకు అబద్ధాలు చెప్పాడు. అంటే అతనికి ఆమె మీద ప్రేమ వ్యామోహమై ఉండాలి. అది తీరాక నశించి వుండాలి. ప్రేమించలేక పోయినా ప్రేమతో సంబంధంలేని సంసారం మాత్రమే చేయగలిగిన అతని పట్ల ఆమె ప్రేమ కూడ నశించడం సహజం. ఆ ప్రేమ రాహిత్యం నుండే ఆమె భర్తకు తన అంతరంగపు బాధను ప్రత్యక్షంగా చెప్పుకునే చనువును కోల్పోయింది. కాగితం మీద వ్రాసుకుని తన ఆవేదనకొక అభివ్యక్తి మార్గాన్ని చూచుకుని తృప్తిపడింది అంతే.
తనంతట తాను బ్రతకవచ్చునన్న చైతన్యం, బ్రతకగల సత్తావున్నా కూడా స్త్రీలు తమకు తాము సంకెళ్ళతో బంధించుకుని ఎంతగా హింసించుకుంటారో అందుకు ఆమె నిదర్శనం. అతని జీవితంలో తన జీవితానికి రాజీ కుదుర్చుకుంది. ఆనాటి సంఘటనలు జ్ఞాపకం చేసుకోవడం, కుమిలి పోవడం ఆమె పని. ప్రతి స్త్రీ ఏదో ఒక విధంగా దాంపత్య జీవితంలో రాజీ పడుతూనే ఉంది. రాజీలేని కుటుంబమే లేదేమో.
స్త్రీలు రాజీపడకుంటే అసలు కుటుంబమే లేదు. ఆవరుస లోనిదే ఆమె కూడ. ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి తనను తాను లోపలినుండి దహించుకునే స్త్రీలందరికి ఆమె ప్రతినిధి. మొత్తం మీద కథలోని భార్యభర్తలిద్దరు ప్రేమలేని దాంపత్య జీవితాన్ని జీవిస్తున్నట్లే. అంటే దాంపత్యానికి ప్రేమ ఒక అత్యవసర అంశం కాదు. ప్రధానమైన షరతు కూడ కాదు. ఆమె పిల్లలకోసం అతనిని భరించింది. పిల్లలు అతని వంశానికి వారసులు. కుటుంబం అతనిది. బయట ఎటువంటి సంబంధాలు ఎలా కొనసాగుతున్నా అతనికి ప్రశాంతత, విశ్రాంతి ఇచ్చే గృహం ఒకటి కావాలి. అందుకతను కుటుంబ రూపం చెదరకూడదనుకున్నాడు. ప్రేమ ఉన్నాలేకపోయినా ఆమె తాను ఒకే కప్పు కింద జీవించడం పిల్లల జీవితానికి, ఆస్తులకు బాధ్యత వహించడం కోసమే.
ఆమె అతనిని నిష్కల్మషంగా ప్రేమించింది కాని అతడు ఆమె వైపు ఆకర్షించబడ్డాడు. వైవాహికేతర సంబంధాలు కొనసాగించాడు. అదంతా ఆమెకు తెలియనంతకాలం నడిచింది. ఆమెకు తెలిసినా ఆమె ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితి గురించి ఆమె ఎవరికి చెప్పుకున్నట్లు లేదు. అతనిని కూడా నిలదీసి అడిగినట్లు లేదు.
మగవాడికి కావలసింది ఇటువంటి గౌరవ మర్యాదల కుటుంబం. అంటే భార్య, పిల్లలు వారితోనే అతని గౌరవ మర్యాదలు పెంపొందింప బడతాయి. కనుకనే అతడు అతని కుటుంబాన్ని వదులుకోలేడు. కనుకనే అతడు అతని కుటుంబాన్ని పెంపొందించుకుంటాడు. తనకు ఇష్టమైన బయటి సంబంధాలు వదులుకోలేదు. భార్యకు తెలిసినా ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేకపోయినా, నిర్మలంగా మాట్లాడలేక పోయినా అతనికి ఆ అబద్దపు జీవితం వెగటనిపించలేదు. ఏమీ తెలియనట్లే ఆమె నటిస్తున్నదని తెలిసి అతను ఇబ్బంది పడలేదు.
అప్పుడు, ఇప్పుడు పుట్టినరోజులు, పెండ్లి రోజులు యథావిధిగా ఘనంగానే జరిపిస్తున్నాడు. జీతం తెచ్చి ఆమెకే ఇస్తున్నాడు. పిల్లలకు చదువులు చెప్పించాడు. ప్రయోజకులను చేశాడు. ఆ రకంగా తన బాధ్యతలను నెరవేర్చుకున్నాడు.
భర్త కొనసాగిస్తున్న వైవాహికేతర సంబంధాల గురించి ఇంట్లో, బయట ఆఖరికి పిల్లలకు కూడ తెలియ చేయకుండ అబద్ధపు జీవితం కొనసాగించింది.
సంబోధన అడ్రస్‌లేని ఆ ఉత్తరం లేకపోతే వాళ్ళ దాంపత్యం ఆదర్శ దాంపత్యమే. సంఘంలో గౌరవ మర్యాదలందుకుంటూ, అందరు ఏర్పాటు చేసి పిలిచే పార్టీలకు కలిసి వెళ్ళి వస్తు ఆదర్శ జంట అంటూ అందరు ప్రశంసిస్తే గౌరవంగా స్వీకరించడంతో వెళ్ళి పోయేది. కాని కుటుంబమే ఒక దాపరికాల వ్యవస్థగా వంచనకు నిలయంగా మారినా మనసులు ఎంతో దూరమైనా మనుషులు మాత్రం ఒక కుటుంబంలో వుండే అబద్ధపు జీవితాలన్న అనంతం నగ్న సత్యాన్ని బయట పెట్టింది. ఈ ఉత్తరం అలాంటి అబద్ధపు జీవితాల అవసరమే దాంపత్యం అని కుటుంబాల గుట్టును మేడి పండు విప్పి చూపినట్లు ఈ కథలో చూపింది సత్యవతి.

Share

About The Author

Comments

One Response to “టుహిమ్‌ విత్‌లవ్‌”

  1. ఆరి సీతారామయ్య says:

    ఈ కథ ఏ పత్రికలో/సంకలనంలో ప్రచురించబడిందో, ఎక్కడ దొరుకుతుందో చెప్తే బాగుండేది.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో