యువతను పోత్స్రహిస్తున్న ‘భూమిక’ పాత్ర హర్షణీయం
Posted By భూమిక on September 2, 2010
శైలజామిత్ర
స్త్రీల సమస్యల పట్ల అత్యంత బాధ్యతను నిర్వహిస్తూ, ఏలాంటి పక్షపాతానికి, నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రముఖ రచయితలతో పాటుగా వర్ధమాన, కొత్త రచయిత్రులను కూడా ప్రోత్సహిస్తూ. స్త్రీలు ఎదుర్కొంటున్న ఆవేదనలను, సంఘంలో ఎదుర్కుంటున్న అన్యాయాలను ప్రతిఘటిస్తూ వారికి తమ హెల్ప్లైన్ ద్వారా సహాయపడుతూన్న భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మహిళని ఆదివారం జరిగిన కథ వ్యాస రచనల పోటీలకు బహుమతిని అందజేస్తున్న సందర్భంగా డైరెక్టర్ స్త్రీ,శిశు అభివృద్ధి శాఖ డైరక్టర్, వి. ఉషారాణి ఐఎయస్ తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. 14 వ తారీఖు ఆగస్టు ఆదివారం సాయంత్రం ఎమ్మెస్కో హాలులో స్త్రీవాద పత్రిక ‘భూమిక’ నిర్వహించిన కథ, వ్యాసాల పోటీలలో బహుమతి ప్రదానోత్సవ సభలో డైరెక్టర్ ఉషారాణి, ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మల, సంపాదకురాలు కొండవీటి సత్యవతి, వారణాసి నాగలక్ష్మి, శాంతసుందరి మరికొందరు ప్రముఖ రచయిత్రులు పాల్గొన్నారు… సాహిత్యంలో సుస్థిర స్థానం కలిగిన రచయిత్రులను సమావేశపరిచి, ఎక్కడా బేషజానికి తావులేకుండా అందరినీ స్నేహపాత్రంగా చూస్తున్న కొండవీటి సత్యవతిని అభినందించారు. సత్యవతి స్పందిస్తూ ఎందరో సహృదయులు తమ ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న కారణంగా తమ పత్రిక నడుస్తోందని, నేడు బహుమతి ప్రదానోత్సవానికి కూడా కొందరు తమ తల్లి, తండ్రి పేరు మీద ఆర్ధిక సహాయం చేసారని వారికి ఎప్పుడూ తమ కృతజ్ఞుతలు ఉంటాయని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తంచేసారు. ఇంతేకాకుండా నేడు కాలేజీ విద్యార్ధులకు కూడా ఈ విధమైన పోటీని నిర్వహించి, యువతలో దాగున్న సాహిత్యాన్ని కవిత, కథ, వ్యాసం, నాటికలాంటి ఏ అంశమైనా తమ పత్రిక ద్వారా ప్రోత్సహిస్తామని, అది కూడా వచ్చే సంవత్సరంనుండే ప్రారంభిస్తామని సభికులు హర్షద్వానాల మధ్య చెప్పారు. ఈ సందర్భంగా కధా విభాగంలో ఎ. పుష్పాంజలి మొదటి బహుమతిని శారదా శ్రీనివాసన్గారు తమ తల్లి జ్ఞాపకార్ధం, జె. శ్యామల రెండవ బహుమతిని డా||భార్గవిరావు పేరుమీద భర్త ప్రభుగారు అందించిన అవార్డు, స్వర్ణ ప్రభాత లక్ష్మి మూడవ బహుమతిని సుజాతామూర్తిగారు అందించిన అవార్డు అందుకున్నారు. వ్యాసాల విభాగంలో డా||కె. రామలక్ష్మి మొదటిబహుమతిని భూమిక సంపాదక, వ్యవస్థాపక సభ్యులు జి.భారతిగారి పేరుమీద వారి భర్త శర్మగారు అందించిన అవార్డు, శ్రీ అంజన్ కుమార్ రెండవ బహుమతిని డా||సమతరోష్ని తమ తండ్రిగారిపేరు మీద అందించిన అవార్డు. మూడవ బహుమతిగా శ్రీ పి.వి.శేషారత్నం ఆరి సీతారామయ్య గారి పేరుమీద అవార్డు అందుకున్నారు.. ఇకపై పోటీలలో స్త్రీలనే కాదు, పురుషులను కూడా ప్రోత్సహించే నేపథ్యంలో మొదటసారిగా బహుమతిని టీచర్గా పనిచేస్తున్న శ్రీ అంజన్ కుమార్ అందుకోవడం విశేషం.. న్యాయనిర్ణేతలుగా అబ్బూరి ఛాయాదేవి, ప్రముఖ రచయిత్రులు శాంతసుందరి, వారణాసి నాగలక్ష్మి గారు వ్యవహరించారు. బహుమతులు పొందిన కథలను విశ్లేషించి అభినందించేరు. బహుమతి గ్రహీతలు కూడా తమ స్పందనను తెలియజేసారు.
Comments
Leave a Reply