ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 20

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
”మొగాళ్లు ఈ లోకంలో ఉండే హక్కు తమకి మాత్రమే ఉందని ఎందుకనుకుంటారు? వేశ్యలని తయారు చేసేది మొగాళ్లు. వాళ్లు పాడు చేస్తేనే కదా ఆ ఆడవాళ్లు పాడయేది! మరి ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతారు? చచ్చిపోతే అన్ని కష్టాలూ సమసిపోతాయా?”
”చూస్తే ఈ పరిస్థితికి నేనే కారణం అంటున్నట్టున్నావే?”
”నాకు మీమీద చాలా కోపంగా ఉంది. లోకంలో ఉండే అవినీతినీ, మిమ్మల్నీ చూస్తే నాకు కోపం వస్తోంది. ఇది విని మీరేమైనా చేస్తారనే నేను మీతో పోట్లాడుతున్నాను.”
”నువ్వు నమ్ము, ఇది నాకు సాధ్యం కాని పని. సమాజంతో పోరాడటంలో స్త్రీలు ఎంత అసహాయులో, పురుషులూ అంతే అసహాయులు.”
”గాంధీ జీ కూడా దీన్ని గురించి ఏమీ రాయరు.”
”ఆయన చెప్పిన విషయాలని మహా అందరూ వింటున్నారా?”
”ఇక ఆయనే పాపం వీళ్లకి సాయం చెయ్యాలి.”
నేనలా అనగానే ఆయన నవ్వసాగారు. దాంతో నాకింకా కోపం వచ్చింది. ”ఎందుకలా నవ్వుతారు? నాకు వాళ్లని చూస్తే పాపం అనిపిస్తూంటే, మీరు నవ్వుతున్నారా?” అన్నాను.
”ఊరికే ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు, మనం ఏమీ చెయ్యలేం,” అన్నారు.
”ఇలాటి సమాజాన్ని మట్టు పెట్టెయ్యాలి. భగవంతుడనేవాడు ఉన్నాడో లేడో తెలీదు. ఉంటే ఇలాటి అన్యాయాలని చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడు? అయినా ఆయన కూడా మొగాడే కదా?”
”అందుకే అంటాను, దేవుడు కూడా ఆడవాళ్లకి అన్యాయం చేశాడని. కష్టమైన పనులన్నీ మీకే పెట్టాడు. అయినా ఆడవాళ్లే ఎక్కువగా ఆయన్ని నమ్ముతారు. అందుకే కదా నాస్తికురాలివి అయిపోమని అంటాను!”
”పుండుమీద కారం చల్లకండి!”
”నీకు పిచ్చెక్కింది!”
”ఈ నియమాలూ, ఆచారాలూ అన్నీ దేవుడెక్కడ చేశాడు? వాటిని చేసింది మీరు!”
”అదంతా మామూలే.”
”అవును, ఇదంతా ఈనాటిదా!”
”చాలా కాలంగా జరుగుతోంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఈ వేశ్యలు హిందువులకి పెద్ద అవమానమే అంటాను.”
”ఇవన్నీ అసలెలా వచ్చాయో?”
”తులసీదాస్‌ రామాయణంలో స్త్రీలని అవమానించాడు. మీరు ఆయన్ని ఏమీ అనరేం?” అన్నారాయన.
”నేనేం ఆయన్ని కీర్తించటం లేదే! ఆయన తనకి జరిగిన అనుభవం వల్ల ఏదో రాశాడు. స్త్రీల పట్ల ఎవరూ న్యాయంగా లేరు.”
”ఎవరో అరుదుగా మహాత్ములు తప్ప.”
”ఏమో ఎవరో ఆ మహాత్ముడు! ఈ యుగంలోనే వచ్చి సమాజాన్ని బాగుచేస్తే బావుణ్ణు.
”గాంధీ యుగంలో కూడా దీనికి మోక్షం లేకపోతే, ఇంకో వందేళ్లు ఇలాగే ఉండబోతోందని అనుకోవాలి.”
”ఎవరికి తెలుసు బాగు పడుతుందో, మరింతగా చెడిపోతుందో?”
”పరిస్థితులు బాగు పడాలి. నీలా మిగతావాళ్లకి కూడా కోపం వస్తూనే వుంటుంది.”
మంచిరోజులన్నీ గడిచిపోయాయి. అవెటుపోయాయో తెలీదు. ఈ ప్రపంచం ఒక పెద్ద సమస్యల వలయం. ఆ గడిచిపోయిన రోజులన్నీ ఎక్కడ జమ అవుతాయో నాకెలా తెలుస్తుంది? ఒకవేళ అలా జమ అయితే మళ్లీ వాపసు రావాలి కదా!
ఆయన బతికుండగా అన్ని బాధ్యతలూ ఆయన మీదే వేసేసేదాన్ని. అన్నిటికీ మంకుపట్టు పట్టేదాన్ని. ఎంత తెలివితక్కువగా ప్రవర్తించానో నాకిప్పుడు అర్థమవుతోంది. అదే మనిషిని, ఈరోజు ఎవరి ముందైనా నోరు విప్పి ఏమన్నా అనటానికి కూడా జంకుతాను. కానీ నాకు ఆయన తప్ప ఇంకెవరున్నారని? నా కష్టసుఖాలు ఇంకెవరితో చెప్పుకుంటాను? నా భారమంతా ఆయనమీదే వేసేదాన్ని. అందుకేనేమో ఆయన దగ్గర అంత చనువుండేది. ఆయన నా వారు. తనకి చెప్పుకోగలిగిన విషయాలని అందరికీ చెప్పుకోలేను కదా? ఆయనక్కూడా ఎప్పుడూ నా గురించిన ఆలోచనే ఉండేది. అలిగినా, కోపం తెచ్చుకున్నా, చిన్న పిల్లలా మొండితనం చేసినా, అన్నీ భరించేవారు. ఇప్పుడు మారిపోయాను. కాలం మారింది మరి! అలాగే ఎలా ఉండగలను? పడవ నడిపే వాడే లేనప్పుడు ప్రయాణం సాఫీగా ఎలా సాగుతుంది? అందుకే నేనిప్పుడు ప్రమాదంలో చిక్కుకుని ఉన్నాను. చూడటానికి బైటికి బాగానే ఉన్నట్టు కనిపించినా, నడి సంద్రంలో చిక్కుకున్నట్టు ఉంది నా పరిస్థితి. ఆయన శ్వాస ఆగిన క్షణాన్నే నా గుండె విచ్ఛిన్నమైంది!
జ    జ    జ
ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. నేను అలహాబాద్‌కి వెళ్లాను. హోలీ పండక్కి మా వదిన నన్ను ఉంచెయ్యాలని చూసింది.
”ఎలా వదిలేస్తాను? నేను ఒంటరి వాణ్ణయిపోనూ? నేను ఢిల్లీ వెళ్తున్నాను. వాళ్లు నన్ను పిలిచారు. రెండు మూడ్రోజుల్లో వెనక్కి వస్తాం. అప్పుడు మీరిద్దరూ పండగ చేసుకుందురుగాని,” అన్నారు మా ఆయన.
మేమిద్దరం ఢిల్లీకి వెళ్లాం. అక్కడ పెద్దెత్తున హోలీ పండగ జరుపుకున్నాం. ఆయన బట్టలన్నీ పాడైపోయాయి. మళ్లీ అలహాబాద్‌ చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండయింది.
”పద, మహాదేవి (వర్మ) ని కలిసి వెళ్దాం,” అన్నారాయన. ఇద్దరం ఆవిడింటికి వెళ్లాం. నేను లోపలికెళ్లాను, ఆయనింకా టాంగాలోనే కూర్చుని ఉన్నారు. నేను వెంటనే వచ్చేద్దామనుకుని లోపలికి వెళ్లాను. కానీ మహాదేవి నన్ను కాసేపు ఉండమని, ”మీ ఆయన్ని కూడా రమ్మంటాను,” అంది.
మహాదేవి ఒకామెని పంపించి ఆయన్ని లోపలికి రమ్మని కబురు పెట్టింది. మా ఆయన ఎంతో వినయంగా, ”మీరు వెళ్లి, ఆమెని పంపండి,” అన్నారు.
ఆమె మహాదేవి దగ్గరకొచ్చి ఆ విషయం చెప్పింది.
”ఆయన స్వయంగా వచ్చి తీసుకెళ్లా ల్సిందే. నేను ఈమెని పంపను,” అంది మహాదేవి.
ఆ రకంగా రెండు గంటలు ఆయన టాంగాలోనే ఉండిపోయారు. ఆ తరవాత దిగి వచ్చి, ”ఇప్పటికైనా ఈమెని వెళ్లనివ్వరా?” అని అడిగారు.
ఇద్దరం ఒకేసారి నవ్వి, ”మొత్తం మీద ఓడిపోయారు!” అన్నాం.
”నేను మీ చేతుల్లో ఇప్పుడేమిటి ఎప్పుడో ఓడిపోయాను!” అన్నారు.
”ముందే ఎందుకు రాలేదయితే?” అన్నాను.
”త్వరగా వచ్చేస్తావేమో అనుకున్నాను.”
ఆ తరవాత వాళ్లింట్లో టిఫిన్‌ పెట్టారు. మేం స్టేషన్‌లో దిగి టిఫిన్‌ తినే వచ్చాం. ఆకలిగా లేదు. కానీ వాళ్లు బలవంతపెట్టేసరికి తినక తప్పలేదు.
జ    జ    జ
మా ఇద్దరికీ తరచు సాహిత్యం, సమాజం, రాజకీయాలు, ఈ విషయాల గురించి వాదోపవాదాలు జరిగేవి. నేనెప్పుడూ స్త్రీల పక్షమే. ఒక్కోసారి మగవాళ్లు స్త్రీల గురించి రాసిన వ్యాసాలు చదివి మండిపడే దాన్ని. వాటికి జవాబు రాయమని ఆయన్ని అడిగేదాన్ని. లేకపోతే నేనే రాయవల సొస్తుందని బెదిరించేదాన్ని. తనూ రాసేవారు కాదు, నన్నూ రాయనిచ్చేవారు కాదాయన. స్త్రీలు తమని తాము సమర్థించు కోవటం బావుండదని అనేవారు. ”మరైతే వీటికి జవాబు ఎవరివ్వాలి?” అని నేను.
ఒకసారి ‘విశ్వమిత్ర్‌’ పత్రికలో స్త్రీల మీద ఒక వ్యాసం చదివాను. ఇది సుమారు పదిహేనేళ్ల కిందటి మాట. ఆ రాసిన మహానుభావుడెవరికో ఆడవాళ్లమీద గొంతు దాకా కోపం ఉన్నట్టుంది. ఆ వ్యాసం చదివాక మా ఆయనతో, ”మీరు దీనికి జవాబు రాయండి, లేకపోతే నేను రాస్తాను,” అన్నాను. ”ఇంకా చాలా మంది ఆడవాళ్లు న్నారు, ఎవరో ఒకళ్లు రాస్తారులే!” అన్నారాయన.
”మీరిలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. ఈ వ్యాసం చదివి బాధ పడ్డవాళ్లు నోరుమూసుకుని ఎందుకు ఊరుకోవాలి?” అన్నాను.
”దీనికి ఎవరైనా మగాళ్లు జవాబిస్తే బావుంటుంది, నువ్వు కాదు.”
”మగాళ్లలో మీరే అందరికన్నా గొప్ప రచయిత. మీరెందుకు జవాబు రాయరు?”
”సరే, నేను ఎవరినైనా పిలిపిస్తాను. నువ్వు చెప్పు, అతను రాస్తాడు. శాస్త్రిని పిలవనా?”
”పిలవండి!”
ఆయన పక్కనే ఉంటాడు, పిలవగానే వచ్చాడు, ”చెప్పండి, నాతో ఏం పని పడింది?” అన్నాడు లోపలికొస్తూ.
ఆ పత్రిక ఇంకా నా చేతిలోనే ఉంది. దాన్ని ఆయనకిస్తూ, ”కాస్త ఈ వ్యాసం చదవండి,” అన్నాను. ఆ వ్యాసం శీర్షిక, ‘ఈనాడు మన మహిళలు ఎటుకేసి వెళ్తున్నారు?’
”జాగ్రత్తగా చదివి, దీనికి జవాబుగా మరో వ్యాసం రాయండి. ఒకవేళ రాయలేకపోతే చెప్పండి. ఈయనగారు కాస్త నిమ్మళంగా ఆలోచించినట్టయితే మహిళలు ఎటుపోతున్నారో తెలిసేది. అసలు ఆ వెళ్లేది స్త్రీలా, పురుషులా అనేది కూడా అర్థమయేది. కానీ ఒకటి, రాసే స్త్రీలు తక్కువ, పురుషులే ఎక్కువ. అందుకే పందెం తామే గెలుస్తామనుకుంటారేమో! అసలు ఈనాడు అభివృద్ధికి కారణం స్త్రీలేనని ఈయన గ్రహించాలి. వంద మందిలో మగాళ్లు నూరుశాతం చెడ్డవాళ్లుంటే, స్త్రీలు ఐదు శాతం మాత్రమే ఉంటారు. మొగలు సామ్రాజ్యం ఏర్పడిన తరవాత స్త్రీలపై ఎక్కువ అక్రమాలు జరగటంతో వాళ్లు బలహీనులై పోయారు. ఇది కాలం చేసిన తప్పు. కాలాన్ని బట్టే మన బుద్ధి కూడా మారిపోతూ ఉంటుంది. కానీ ఈ వ్యాసం రాసిన వ్యక్తి మాత్రం పక్షపాతం చూపించాడనే అంటాను. తప్పంతా ఆడవాళ్ల నెత్తిన రుద్దటం చాలా అన్యాయం. పైగా ఇటువంటి ధోరణి సమాజానికి ఎంతో హాని కలగజేస్తుంది. పుట్టినప్పట్నించీ గిట్టే దాకా మగాళ్లు స్త్రీలతోనే కలిసి జీవిస్తారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురిగా ఆడదే వాళ్లకి అన్నీ అమర్చిపెడుతుంది. అసలు స్త్రీలేకుండా ఏ దశలో మగాడు ఉండగలడు? ఇద్దరిదీ ఒకటే జాతి! వాళ్ల మధ్య శత్రుత్వం తలెత్తితే మనుగడ సాగుతుందా? ఈయన గారు ఒక స్త్రీకి పుట్టిన బాపతు కాదు లాగుంది! లేదా ఆడదాని ప్రేమని ఈయన పొందలేక పోయుండాలి.”
నా మాటలు విని మా ఆయన కళ్లు నీళ్లతో నిండడం గమనించాను. శాస్త్రి గారికి కూడా కోపం వచ్చింది. ”ఈ రచయితకి చెప్పుతో కొట్టినట్టు జవాబు రాస్తాను, ఉండండి!” అన్నాడాయన.
”మీరు త్వరగా రాసిస్తే, ‘మాధురి’లో వేస్తాను,” అన్నారు మా ఆయన.
”ఏమో బాబూ, ఎంతైనా మీరూ మగవాళ్లే కదా! ‘చాంద్‌’కి పంపకూడదూ?” అన్నాను.
”మేమందరం తెలివితక్కువ వాళ్ల మన్నట్టు మాట్లాడుతున్నారు మీరు!” అన్నాడు శాస్త్రి గారు.
”అవును, భాయి! రాసినవాడు గప్‌చుప్‌గా తప్పుకున్నాడు, శిక్ష మనం అనుభవించాల్సి వస్తోంది!” అన్నారు మా ఆయన.
నాలుగైదు రోజుల్లో శాస్త్రిగారు వ్యాసం రాసి తీసుకొచ్చారు. ”ముందుగా, ఏం రాశారో చదివి వినిపించండి,” అన్నాను.
”రాసేశారుగా, చదివెయ్యండి చాలు!” అన్నారు మా ఆయన.
”ఇందులో ఒక్క మాట పొల్లుపోయినా మిమ్మల్ని వదిలేదు లేదు!” అన్నాను మా ఆయనతో.
వ్యాసం శాస్త్రిగారు చాలా బాగా రాశారు. అది ‘మాధురి’లో అచ్చయింది. మగవాళ్లు చాలా గొడవ చేశారు, కానీ జవాబిచ్చే ధైర్యం ఎవరికీ లేకపోయింది. స్త్రీలు అభినందిం చారు, నేను శాస్త్రిగారికి ధన్యవాదాలు తెలిపాను. ‘మాధురి’ పురస్కారంతో సత్కరించింది.
జ    జ    జ
లక్నోలో మా ఇంట్లో వంటచేసే వంటావిడ ఒకరోజు సాయంత్రం వంటచేసేందుకు రాలేదు. మర్నాడు పొద్దున్న ఆవిడ రాగానే, ”సాయంకాలం రాలేదేం?” అని అడిగాను.
ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది. ”మా అబ్బాయి ఎటోవెళ్లిపోయాడు, కనిపించటం లేదు,” అంది.
”వెతికించారా? ఎటు వెళ్లాడు?”
”నిన్న మీ ఇంటికి పొద్దున్న వచ్చిన ప్పుడు ఇంటిదగ్గరే ఉన్నాడు. సాయంత్రం నించీ కనిపించటం లేదు. నిన్నంతా వెతుకు తూనే ఉన్నాను, కానీ ఏమీ తెలీలేదు. ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లతో కలిసి పారిపోవటం చూశామని కొందరన్నారు.”
మేమిద్దరం ఇలా మాట్లాడు కుంటున్న ప్పుడు మా ఆయన తన గదిలో ఏదో పని చేసుకుంటున్నారు. మా గొంతులు విని బైటి కొచ్చారు. నాకన్నా ఎక్కువ ఆయనకే వంట మనిషి గురించి ఎక్కువ ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే, ఆవిడ రాకపోతే వంట చేసే పని నామీద పడుతుంది.
గదిలోంచి బైటికొచ్చి, ”నిన్న ఎక్కడ ఉండిపోయావు?” అని అడిగారు.
ఆవిడ మళ్లీ ఏడుపు లంకించుకుని, ”బాబుగారూ! మావాడు ఎక్కడో తప్పిపోయా డండీ! వాడికోసమే పగలనక రాత్రనక కష్టపడతాను. కానీ వాడు చూడండి, నేను తనకేమీ కానట్టు ఎలా వదిలేసి పోయాడో?” అంది.
”వాడు అలాటి పనికిమాలిన వెధవ అని  తెలిసీ ఎందుకు వాడికోసం కష్టపడతావు? పోతే పోనీ! మా అమ్మకి నేను తప్ప ఇంకెవరు న్నారు, అనే ఆలోచన ఆ బడుద్ధాయికి లేనప్పుడు నీకెందుకంత ప్రేమ వాడిమీద? సంపాదించుకుంటున్నావు, నీ సంగతి నువ్వు చూసుకో. వాడివల్ల నీకు ఎన్నటికీ సుఖం ఉండదు. నిన్ను కష్టపెట్టటానికే పుట్టాడు వాడు!” అన్నారాయన.
”ఎంతైనా తల్లిని కదా, బాబుగారూ! మనసొప్పదండీ. నిన్నననగా వెళ్లాడు, అప్పట్నించీ నేను పచ్చిమంచినీళ్లు కూడా ముట్టలేదు! ఆకలి చచ్చిపోయింది!”
”నీకు బుద్ధిలేదు! వాడు ఎక్కడో ఆనందంగానే ఉండి ఉంటాడు. నువ్వేడిస్తే మాత్రం వస్తాడా?”
”ఎంతైనా ఈవిడ వాడిలా మనసుని సమాధానపరుచుకోలేదుగా! తల్లి మనసు, కొడుకు కనిపించకపోతే భరించగలదా?” అన్నాను.
”అవును ఈవిడ తల్లి కాబట్టి బాధ ఈవిడకి మాత్రమేనా, వాడికి ఉండక్కర్లేదా? వాడు పూర్వజన్మలో ఈవిడకి బద్ధ శత్రువు! కడుపున పుట్టి మరీ పగ తీర్చుకుంటున్నాడు! నీ దుఃఖం వాడికి కనబడటం లేదమ్మా? నా మాట విను, ఏడవటం మాని హాయిగా ఉండు. ఒకవేళ వాడు మళ్లీ వచ్చినా ఇంట్లోకి రానివ్వకు. అప్పటిగ్గాని బుద్ధిరాదు వాడికి!” అన్నారాయన.
”అలా ఎలా చెయ్యగలదండీ, మరీనూ?” అన్నాను.
”అటువంటి కొడుకులున్నప్పుడు తల్లులు కూడా మారాలి. లేకపోతే లాభం లేదు. మగపిల్లలు మరీ పొగరెక్కిపోతారు. తల్లి కాస్త గట్టిగా ఉంటే వాడు కూడా బాగు పడతాడు. అంతేకాని. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమీ జరగదు.” అన్నారాయన.
”అందరు అబ్బాయిలూ ఇలా ఉండ రుగా!” అన్నాను.
”ఈ రోజుల్లో తరచు ఇలాంటివాళ్లే కనిపిస్తున్నారు. పదిహేను పదహారేళ్లు వచ్చాయి, అయినా వేషాలు చూడు ఎలా ఉన్నాయో! తల్లుల జీవితాలు మాత్రం ఎప్పటికీ ఇలా గడవాల్సిందే. కాలేజీల్లో ఎంతోమంది కుర్రాళ్లు చదువుతున్నారు. వాళ్ల దృష్టి ఎంతసేపూ పైపైకి ఎదిగిపోవటం మీదే. కానీ అంతమందిలో ఏ కొద్దిమందికో మంచి ఉద్యోగాలు వస్తాయి. కొడుకులు కూడా అంతే, కొద్దిమంది తల్లిదండ్రులకి మాత్రమే బుద్ధిమంతులైన కొడుకులుంటారు. మిగతా వాళ్లందరికీ పనికిమాలిన వెధవలే పుడతారు. అసలు నన్నడిగితే అలాటి కొడుకులు ఉండటం కన్నా ఉండకపోవటమే మేలు!” అన్నారాయన. – ఇంకా ఉంది

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.