కలం దూరమవ్వడం అంటే ఆక్సిజన్ కరువవ్వడమే.

– ఇంటర్వ్యూ: శాంతసుందరి

హిందీ రచయిత్రి, బాధితులైన స్త్రీలకోసం కౌన్సులింగ్ సెంటర్ ముంబైలో నడుపుతున్న, సుధా అరోరా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెతో జరిపిన ఇంటర్యూ

ప్రశ్న : సుధా అరోరాగారు, మీ నేపధ్యం కొద్దిగా చెపుతారా?
సుధ : నేను 1946లో దేశవిభజనకు పూర్యం లాహోర్లో పుట్టాను. మాది చాలా సంప్రదాయమైన కుటుంబం. మా కుటుంబంలో ఎమ్.ఏ. చదువుకున్న మొదటి ఆడపిల్లని. మొదట్నించీ (మంచి మార్కులు తెచ్చుకుంటూ) చదువులో ఫస్ట్గా ఉంటూ (ఉండటం గమనించి) డిగ్రీలో యూనియర్శిటీ టాపర్గా వచ్చిన నన్ను ఎమ్.ఏ. చదివించాలని పోట్లాడి సాధించిన వ్యక్తి మా అమ్మ. మా అమ్మ లాహోర్లోనే పుట్టి పెరిగింది. సాహిత్యరత్న పట్టం పుచ్చుకుంది (అది ఈనాటి ఎమ్.ఏ.తో సమానం) కవిత్వం రాసేది (కానీ ఎక్కడా ప్రచురించలేదు-అలాంటి పరిస్థితులు ఆకాలంలో లేవు)

ప్రశ్న : రచన చెయ్యాలన్న అభిలాష ఏవయసులో మీకు కలిగింది?
సుధ : 12-13 ఏళ్ళకే కవిత్వం రాసేదాన్ని, స్కూల్ మేగజైన్లో నా కవితలు అచ్చయ్యేవి. 1965లో బి.యే.లో ఉండగా నేను రాసిన ఒక కథ, జ్ఞాన్పీఠ్ వారి పత్రిక జ్ఞానోదయ్లో అచ్చయింది. దానిపేరు ‘మరీ హుఈ చీజ్. దానికి గుర్తించు వచ్చింది. ఎమ్.ఎ.లో ఉండగా నా మొట్ట మొదటి కథా సంపుటి అచ్చయింది, ‘బగైర్ తరాశే హుఎ’ (1967) అలహాబాద్లోని లోక్ భారతి అనే సంస్థ దాన్ని ప్రచురించింది.

ప్రశ్న : ముంబైలో ఎప్పట్నించీ ఉంటున్నారు?
సుధ : పెళ్లయాక 1971లో ముంబై వెళ్ళిపోయాను. సంసారంలో నిండా మునిగిపోయి రాయటం మానేశాను. మళ్లీ 1977-78లో ‘సారికా’ అనే మాసపత్రికలో ‘ఆమ్ ఆద్మీ! జిందా సవాల్’ అనే శీర్షికని రాశాను, అది చాలా ప్రాచుర్యం పొందింది.

ప్రశ్న : ఆ శీర్షిక దేన్ని గురించి?
సుధ : మనదేశంలో సామాన్య మానవుడు ఎదుర్కొనే దైనందిన సమస్యలని గురించి రాసేదాన్ని.

ప్రశ్న : కలకత్తాలో మీ అనుభవాలేమిటి?
సుధ : పెళ్లయి ముంబై వెళ్ళి పోలేక పూర్వం కలకత్తాలోనే ఎమ్.ఏ. చదివాను. అక్కడ రెండు కాలేజీల్లో, 1969-71 మధ్యకాలంలో లెక్చరర్గా కూడా పనిచేశాను. ముంబైనించి మళ్ళీ 1980లో కలకత్తాకి మారాం. నా భర్త ఉద్యోగరీత్యా, ఊళ్ళు మారవలసి వచ్చేది. ఆ తరువాత అక్కడే ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవటంతో, రాయటం పూర్తిగా మానేశాను. అలా మానేసిన దాన్ని పన్నెండేళ్ళ వరకు మళ్లీ కలం చేత్తో పట్టుకోలేదు. 1993 లో మళ్లీ రాయటం మొదలుపెట్టాక, ఇక స్త్రీ సమస్యల గురించి తప్ప మరేమీ రాయలేదు, ఈసారి ఎత్తిన కలం దించలేదు.

ప్రశ్న : అలా పన్నెండేళ్ళపాటు ఏమీ రాయకుండా ఉండటం మీకు కష్టం కలిగించలేదా?
సుధ : కష్టం అంటారేమిటి? నరకం అనుభవించాను! తాగు బోతుకి తాగుడూ, డ్రగ్స్ అలవాటున్న వారికి డ్రగ్స్ దొరక్కపోతే ఎలా తల్లిడిల్లిపోతారో, అలా నిలువెల్లా వణికి పోయేదాన్ని. రాయటం అనేది అత్యవసరమూ బైటికి పోయే ఒకే ఒక్కదారీ అయినప్పుడు అది ఆగిపోతే ఎంత నరకయాతనో, అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఆ సమయంలో కథ రాయాలని తీవ్రమైన కోరిక కలిగేది, కలం కాయితాలూ తీసుకుని కూర్చుంటే నా ఆలోచనకీ, భావాలకీ, భాష కరువయ్యేది. ఇక రాయటం ఈ జన్మలో నావల్ల కాదేమో అనేెంత అధైర్యమూ రాయలేక పోతు న్నందుకు ఒక రకమైనా అభద్రతా భావమూ కలిగేవి. నేను అసంపూర్తిగా ఉన్నానని అనిపించేది. రాయటం మొదలు పెట్టటానికి దారేేదీ తోచలేదు. ఇలాకాదని 1985లో నవల రాయాలని కూర్చున్నాను, మొదలెట్టాను, కానీ మాటిమాటికీ ఇళ్ళు మారటంతో అది పట్టాలు తప్పిన బండిలా కూలబడింది.

ప్రశ్న : కలకత్తానించి మళ్ళీ ముంబై ఎప్పుడు మారారు?
సుధ : 1991లో మళ్ళీ రాయాలని ప్రయత్నించాను. కుదరలేదు. కలం నాకు దూరమయినప్పుడు ఆక్సిజన్ దొరకని ప్రాణిలాగ ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. రాయలేకపోవటం అనేది నన్ను ఇరవై నాలుగ్గంటలూ ముల్లులా బాధపెట్టేది.

ప్రశ్న : మరి 1993 నించి మళ్ళీ రాయటం ఎలా మొదలైంది?
సుధ : 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు సంఘటన జరిగాక, ముంబైలో వాతావరణంలో మార్పు వచ్చింది. మా ఇంటికి కొంచెం దిగువున ముస్లింల ఇళ్ళుండేవి. ఆ రోజు నేనూ మా రెండో అమ్మాయి గుంజన్ అటుకేసి వెళ్ళాం. ఉన్నట్టుండి షాపుల షటర్లు దడదడా మూసుకుపోయాయి. ఎప్పుడూ మామూలుగా ఉండే ముస్లిమ్ యువకుల కళ్ళలో రక్తపు జీరలు కనిపించాయి. నాకు మా తాతా, నాయనమ్మ చెప్పిన దేశవిభజన నాటి సంఘటనలు గుర్తొచ్చి, గుంజన్ చెయ్యి గట్టిగా పట్టుకుని, వేగంగా ఇంటికేసి నడిచాను. (ప్రతి ఏడూ) డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ముంబైలో జరిగే హత్యాకాండా దానివల్ల సామాన్య నెలల్లో మానవుడికి కలిగే ఒత్తిడీ నా మనసుని బాగా కలచివేశాయి. మనసులోని ఆ అలజడి భరించలేక, మళ్లీ అన్నేళ్ల తరువాత కలం చేతిలోకి తీసుకున్నాను. అదే సమయంలో జనవాదీ లేేఖక్ సంఘ్ ఉర్దు, హిందీ రచయితల సంయుక్త సభ ఏర్పాటుచేసి, నన్నుకూడా మాట్లాడమని కోరారు. ‘ఈ ఉన్మాదం ఎప్పుడు పొతుంది? అనే వ్యాసం రాశాను. ఆ తరవాత 1993లో మార్చి 12 న ముంబైలో బాంబులు పేలినప్పుడు నేను ఇంట్లో లేను. కాలుతున్న నగరం మధ్యనుంచి నడుస్తూ ఇల్లు చేరుకున్నాను. ఆనాటి అనుభవం నన్ను నిలువునా కుదిపేసింది. ఆ కాలి మసైన నగరం నా మనసులో చాలా రోజులపాటు పెద్ద భారంలా నిలిచిపోయింది. చివరికి ఆ బరువు తగ్గించు కోటానికి, రిపోర్టులాగ దాన్ని రాశాను. ఎక్కడో జారిపోయిన రాత అనే కొస చేతికి చిక్కింది. ఈ జ్ఞాపకం మూడేళ్ళపాటు నా డైరీలోనే ఉండిపోయింది. ఆ తరువాత దాన్ని కథగా మలిచి, ‘కాలా శుక్రవార్’ అనే శీర్షికలతో ‘హంస్’ మాసపత్రికలో (డిసెంబర్ 1996లో) అచ్చయింది. మళ్ళీ నా కలం ఆగలేదు.

ప్రశ్న : రచనలే కాక, కష్టాల్లో ఉన్న స్త్రీలకి మీరు కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారని విన్నాను. ఆ విషయాలు కాస్త చెప్పగలరా?
సుధ : అవును, 1992 – 93లో ముంబైలో జరిగిన గొడవల తరవాత, రిలీఫ్ వర్క్ చేసేటప్పుడు నాకు రింకీ భట్టాచార్య (ప్రముఖ సినీ దర్శకుడు బాసు భట్టాచార్య భార్య)తో పరిచయమైంది. ఆమె హెల్ఫ్ అనే సంస్థ నడిపేది. అక్కడికి స్త్రీలు వచ్చి తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారమార్గాలు చూపమని అడిగేవారు. ఎక్కడెక్కణ్ణించో వచ్చి మాకు వాళ్ళ సమస్యలన్నింటినీ ఎటువంటి దాపరికమూ లేకుండా చెప్పుకునేవారు. ఆ సంస్థ స్త్రీలకి చేస్తున్న సేవ చూసి నాకు కూడా ప్రేరణ కలిగింది. నేను స్వయంగా వసుంధర కౌన్సెలింగ్ సెంటర్ను స్థాపించి, మధ్యవర్గ స్త్రీలకీ నిమ్న మధ్యవర్గ స్త్రీలకీ చేయూత నందించటానికి కొన్నేళ్లుగా ఈ కౌన్సెలింగ్ సెంటర్ని నడుపుతున్నాను.

ప్రశ్న : మీరు సాధించిన విజయాల గురించి చెప్పండి?
సుధ : నేను సాధించిన విజయాలలో నా ఇద్దరు కూతుళ్ళూ ముఖ్యమని నా భావన, వాళ్లని నాకు కావల్సిన రీతిలో చక్కగా పెంచి పెద్ద చేశాను, పెళ్ళిళ్లు చేశాను. అది నాకు అన్నింటికన్నా ఎక్కువ తృప్తినిచ్చే విషయం. వ్యక్తిగతం కానిది ఇంకోక సంఘటన నాకు చాలా తృప్తినిచ్చింది ఒకటుంది. పురుషులు పరస్త్రీ వ్యామోహం లో పడి భార్యలని వదిలివేయటం, నిర్లక్ష్యం చేయటం గురించి ఒక వ్యాసం రాశాను. అది ఒక హిందీ పత్రికలో అచ్చయింది. అది చదివిన ఒక స్త్రీ, ఆ వ్యాసం చదివాక, తనని రోజూ చితకబాదే భర్త పూర్తిగా మారిపోయాడనీ, ఇప్పుడు తనతో మంచిగా ఉంటున్నడనీ, చెప్పింది. నా వ్యాసం చదివి ఒక్క వ్యక్తి జీవితం బాగుబడినా, అది విజయం కిందే భావిస్తాను.

ప్రశ్న : మీరు రేడియో, టీవీల్లో కూడా టాక్ షోలు చేశారట కదా?
సుధ : అవును, టాక్షోలూ, ఇంటర్య్వులూ చేసేదాన్ని. పెద్ద పెద్ద రచయితలనీ, హిందీ సినిమారంగ ప్రముఖులనీ ఇంటర్వ్యూ చేశాను.

ప్రశ్న : మీ కథలు అనువాదం అయ్యాయా?
సుధ : దాదాపు అన్ని భారతీయ భాషల్లోకీ అనువాదం అయ్యాయి. అంతేకాక ఇంగ్లీషు, ఫ్రెంచి, పోలిష్, చెక్, జపాన్ భాషల్లో కూడా నా కథల అనువాదాలు అచ్చయాయి.

ప్రశ్న : చివరగా, మీరు భవిష్యత్తులో ఏం చేయాలను కుంటున్నారు?
సుధ : రాయటం, ఇంకా రాయటం, నావసుంధర కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా స్త్రీలకి సేవ చేయటం.

ప్రశ్న : మీరు భూమిక కోసం ఇంత కాలాన్ని వెచ్చించి, ఇన్ని వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలండీ, భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలని సాధించాలని కోరుతూ, సెలవు తీసుకుంటాను.
సుధ : ధన్యవాదాలండీ!

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.