డా. పి.యశోదారెడ్డి

డా. పి.సత్యవతి
1960లలోనే పి. యశోదారెడ్డి పాఠకులను కుచ్చుల సవారికచ్చెరంలో మెత్తలు పరిచి కూచోపెట్టి బిజినాపల్లి తీసుకువెళ్ళి అక్కడి చిత్రాలన్నీ తీరొక్కటిగా అచ్చమైన తెలంగాణా నుడికారంలో చెప్పారు.కథ చెప్పడం ఆమెకి వెన్నెతో పెట్టిన విద్య, అంటే అందులో అతిశయోక్తి అసలు లేదు. ఆమె తాను పుట్టి పెరిగిన మహబూబ్‌నగర్‌ జిల్లా మాండలికంలో కథ మొదలుపెడితే ఉపమానాలు, సామెతలు, చమత్కారాలు, అన్నీ కలుపుకుని పరిగెత్తే ఓ ప్రవాహమే అది.
అచ్చమైన తెలంగాణా నుడికారంలో ”మా ఊరిముచ్చట్లు” ”ఎచ్చమ్మ కథలు” వ్రాసిన ఎచ్చమ్మ (యశోదని అంటా యశా అని పిలిచేవారట. చిన్నప్పుడు తన పేరేమిటంటే ఎచ్చమ్మ అని చెప్పేదట యశోద. ఆ ఎచ్చమ్మే ఈ కథల్లో ఎచ్చమ్మ) తరువాత ”పత్రికల” భాషలో ”ధర్మశాల” కథాసంపుటి ప్రచురించారు. యశోదారెడ్డి మంచి వక్త. బహుశా ఆ ధారే రచనలో కూడా కనిపిస్తుంది.
ఉస్మానియా యూనివర్సిటీ నించి తెలుగు సాహిత్యంలో పిహెచ్‌.డితో పాటు ఆలీగర్‌ యూనివర్సిటీ నించి డి.లిట్‌ కూడా అందుకున్న యశోదారెడ్డి, హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్‌ భాషలో డిప్లొమా కూడా చేశారు. కోఠి వుమెన్స్‌ కాలేజిలో తెలుగు అధ్యాపకురాలిగా, తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేశారు. యూనివర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, కేంద్ర సాహిత్య అకాడమీ మహావక్తగా, అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పదవులు, సత్కారాలూ పొందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బిజినాపల్లి ఆమె స్వగ్రామం. రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్యలో అడుగుపెట్టిన యశోదలోని వాక్పటిమ, అప్పుడప్పుడే బొంబాయి జె.జె.ఆర్ట్స్‌ స్కూల్‌ నించీ వచ్చిన ప్రసిద్ధ చిత్రకారుడు పి.టి.రెడ్డి మనసు చూరగొన్నది. వివాహా నంతరం కూడా ఆమెచదువు సాగించారు. ఎవరి ప్రవృత్తులలో వాళ్లు విజయాలు అందుకున్న మంచి స్నేహితులు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, నాళం కృష్ణారావు అవార్డు, సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్నారు. మూడు కథాసంపుటులే కాక, ”ఉగాదికి ఉయ్యాల”, ”భావిక” కవితాసంపుటులు, కథలూ నవలలూ – ”ఒక పరిశీలన” ”కథాచరిత్ర” ”భారతంలో స్త్రీ” ”ఆంధ్ర సాహిత్య వికాసం” ”హరివంశము ఉత్తరభాగము” ”పారిజాతాపహరణం” ”తెలుగులో హరివంశములు” అనే వ్యాస సంపుటులు వెలువరించారు. 1951 నించే కథలు వ్రాసారని ఆమెపై పరిశోధన చేసిన సుజాత చెప్పారు. ఏ సంపుటిలోనూ ఏ కథ కిందా అది వ్రాసి ప్రచురించిన తేదీ లేదు.
మా వూరి ముచ్చట్లులో పది కథలు, ఎచ్చమ్మ కథలు లో ఇరవై, ధర్మశాలలో ఇరవై నాలుగు కథలు వున్నాయి. ఎచ్చమ్మ కథలూ, మా ఊరి ముచ్చట్లు, తెలంగాణా గ్రామీణ నేపథ్యంలో మాండలిక గుబాళింపుతో వుండగా ధర్మశాలలోని కొన్ని కథలు తను వార్తాపత్రికలో చదివిన సంఘటనలపై స్పందించి వ్రాసానని ఆమె వ్రాసుకున్నారు. మొత్తం యాభై కథల్లోనించీ కొన్నింటిని విశ్లేషించుకుని ఆమె శైలినీ, శిల్పాన్ని, తాత్విక దృక్పథాన్ని తెలుసుకుందాం.
ఈ యాభై కథల్లోనూ మొదట నిలిచే కథ ”గంగరేగిచెట్టు”. ఇది కొంత ఆత్మ కథాత్మక కథ అనొచ్చు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న ఎచ్చమ్మ మంచి నక్షత్రంలో పుట్టలేదన్న పేరు పడి, తండ్రి కూడా ఆమెను దగ్గరుంచుకోక రుక్మిణమ్మ అనే ఆమెకు పెంచుకోమని ఇచ్చాడు. తరువాత ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడు. రుక్మిణమ్మ దగ్గర పెరుగుతున్న ఎచ్చమ్మ మహబూబ్‌నగర్లో చదువుకుంటూ చూడచక్కగా అంతా తన తండ్రి పోలికలో వుంటుంది. తండ్రి ఆమెను పెంపకానికైతే ఇచ్చాడుగానీ అప్పుడప్పుడూ వెళ్లి చూసుకొస్తూనే వుంటాడు. ఆమెకు తొమ్మిదేళ్ళప్పుడు ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఆ పిల్ల తన దగ్గరగా వస్తే ఆ పిల్ల అంతా తన పోలికేనని, కదిలిపోయాడు, ముద్దుచేశాడు. అంతకు ముందు ఆయన చెల్లెలు ముత్యాలమ్మ, తన కొడుక్కు ఆయన కూతుర్ని ఇవ్వమనీ, అట్లా సంబంధం కలుపుకుంటే పరువూ ప్రతిష్టలుగల అన్న అండ తనకి వుంటుందనీ, భర్త బిర్రు కాస్త సడలుతుందనీ అడుగుతూ వుంటుంది. అప్పుడు తన రెండో భార్య కూతురు నీలిని ఇస్తానంటాడు. ఎచ్చమ్మని చూసి మనసుకరిగిపోయిన తరువాత నీలిని కాదు ఎచ్చమ్మని ఇస్తానంటాడు. మొదట్లో ముత్యాలమ్మకి ఎచ్చమ్మని అంతా నష్టజాతకు రాలనడం తండ్రి కూడా దగ్గరుంచుకోక పాలమూరు పంపడం గుర్తొచ్చి కాస్త సందేహించినా అన్నతో సంబంధం ముఖ్యం అనీ, నీలి కన్న ఎచ్చమ్మే బాగుంటుందనీ అసలు తనే ఆ పిల్లను తెచ్చి పెంచుకుంటే బాగుండేదనీ సర్దిచెప్పుకుని సరేనంటుంది. సంక్రాంతి పండక్కి నెలరోజుల ముందుగానే అన్న ఇంట్లో మకాంపెట్టి, వదిన మర్యాదలో ఏంచేసినా సహించుకుని వుంటుంది. అప్పుడు ఎచ్చమ్మని కూడా తీసుకుని రుక్మిణమ్మ కూడా వస్తుంది. ఎచ్చమ్మ రాకతో ”బంతిపూలు పూసినట్లు, పచ్చతోరణాలు గట్టినట్టు, ఎన్నెల గాసినట్టు” ఆ యిల్లు కళకళలాడింది. తొమ్మిదేళ్ళ ఎచ్చమ్మ ఇంగ్లీషులో పద్యాలు అవీ చెప్పడం పిల్లలందర్నీ ఆకట్టుకోడం మేనత్త కొడుకు రఘునాథరెడ్డి చూస్తాడు. అతనేమో ఉర్దూ మీడియంలో చదువుకుని వచ్చాడు. ఎట్లాగైనా ఆమె దగ్గర ”అంగిరేజ్‌” నేర్చుకోవాలను కున్నాడు. అయితే ఆ పిల్ల ఒక షరతు పెట్టింది. కాశిరెడ్డి పెరట్లో పెద్దగంగరేగి చెట్టుంది. సంక్రాంతి రోజుల్లో నిండాకాయలతో వుంది. ఆ గంగరేగి కాయలు కోసిస్తే అంగిరేజు నేర్పుతానంటుంది. కానీ అక్కడేదో దయ్యం వుందని పిల్లల్ని పోనివ్వరు. అయినా గానీ సరే అన్నాడు ఆ పిల్లవాడు – మధ్యాహ్న భోజనాల వేళ వాళ్ళిద్దరూ గంగరేగి చెట్టు దగ్గరకు పోయి అక్కడ గోడ మీద కూచుని ఎచ్చమ్మ చదువుతుంటే అతను మళ్లీ అని ఆమె చెప్పినవి వల్లె వేస్తున్నాడు. ఇది చూసిన పిల్లలు కొంతమంది పోయి, అతని తల్లి ముత్యాలమ్మకి ఎచ్చక్క దగ్గర బావ అంగ్రీజు నేర్చుకుంటున్నాడని చెప్పారు. కొడుకు అంగ్రీజు నేర్చుకుంటున్నాడంటే ముందు సంతోషమైనా వెంటనే, రేపు తన కొడుకు ”అదుపాజ్ఞలలో వుండవలసిన పోరి గురువాలె వాడికి అంగ్రీజు నేర్పడమేమిటని” కోపం వచ్చింది. అంగ్రీజు నేర్చుకోడం తరువాత ఇద్దరూ ఒడుపుగా చెట్టెక్కి కాయలు కోసుకుని తిన్నారు. మరి రఘునాథరెడ్డయితే దిగాడు గానీ ఎచ్చమ్మకు దిగరాలేదు. అతనే ఉపాయం చెప్పాడు. తను కింద వొంగి నిలబడితే, తన వీపు మీద కాలు పెట్టి దిగమన్నాడు. అట్లాగే దిగుతోంది ఆ పిల్ల. కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన ముత్యాలమ్మ కంట తన కొడుకు ”సల్వ” అంగి మీద కాలుపెట్టి దిగుతున్న పిల్ల ”తిప్పికొడ్తే పదేండ్లు లేని ఈ పిల్ల ఇప్పట్నించే తన కొడుకుని కర్రె కుక్కను చేసి తిప్పుతుండది. దీనికీ దీని సంబంధానికీ ఒక దండం” అనేసి కొడుకుని తీసుకుని వెళ్లిపోయింది. బాల్యవివాహమూ చదువుకు స్వస్తి మొదలైనవి తప్పిపోయిన ఆ పిల్ల ఏ ప్రొఫెసరో అయుండచ్చు. మేనత్త దయవల్ల ఇందులో మేనత్త పాత్రని ఆనాటికి అత్యంత సహజంగా చూపించారు యశోదారెడ్డి – ”మ్యానరికం” అనే మరో కథ. మేనరికం పేరిట బాల్యంలోనే పిల్లల పెళ్ళిళ్ళు నిశ్చయం అవడాన్ని వ్యతిరేకించిన కథ. పల్లెలో పీర్ల పండగ, హిందూ ముస్లింల మైత్రి, భంగు తాగి సన్యాసులెంటబడి ఆరునెలలు తిరిగి ఇంటికొచ్చి మళ్ళీ భార్యను చూసి ఆమెకు అంటుకుపోయిన జోగుళయ్య అప్పటి గ్రామీణ జీవితాన్ని కళ్ళకు కట్టిస్తారు.
ఎచ్చమ్మ కథలలోని ధర్మశాలలోనూ ఒక చెల్లెలు (ఎచ్చమ్మ) అక్కకు వ్రాసే ఉత్తరాల రూపంలో కొన్ని కథలున్నాయి. ఈ కథలన్నీ మాంటికంలోనే ఉన్నాయి. అట్లాగే తెలంగాణా గ్రామాలలోని పెళ్లి వేడుకలు, నగలు, రైకపై కుట్టుపని, పండగలు, ఆచారాలు ఎన్నో తెలుసుకోదగ్గ విశేషాలున్నాయి. ఎచ్చమ్మ అక్కకు వ్రాసే ఉత్తరాలన్నింటిలో ఆమె అక్కాబావల అనురాగ దాంపత్యాన్ని, అన్యోన్యతనూ ప్రస్తావించకుండా వుండదు. అట్లాగే ఆమె కథల్లో ఆడపిల్లలంతా చంద్రదీపాలు. తండ్రులు ఆ పిల్లల్ని ఎంతగానో అక్కున చేర్చుకుంటారే గానీ ఎక్కడా వివక్ష చూపరు. ”సీతక్క పెండ్లి” అనే కథలో కూతురు ”పాపిట తీర్పుకు, నా బిడ్డ కాటిక సక్కనకు, నా తల్లి బొట్టు పొందికకు, బాసికపు కూర్పుకు, నా పండు ఒడిబియ్యానికి, నా మొల్క ఎదుగుకు, నా కంటి సలవకు, ఆ సీతారాముల జంటకు, ఆ జత ముద్ద మురిపానికి” తనకున్న పొలం తనఖా పెట్టడానికి కాళ్ళరిగేలా తిరిగిన సీత తండ్రి, అదంతా తన బిడ్డ కోసమని తన అంతస్తుకు మించిన సంబంధాన్ని ఒప్పుకుని పెళ్ళి సామానుకు పందిర్లకు మండపాలకు తెచ్చిందంతా ఖర్చుచేసినా, కట్నం దగ్గర పేచీలొచ్చి పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళికొడుకు ”విలాయతు”కి వెళ్ళిపోయాడు. నిజానికి సీతక్క మీద మనసు పడింది అతనే. కానీ సంవత్సరం తిరిగేసరికి అతనే వచ్చి సీతని అక్కున చేర్చుకుని మామ కాళ్ళకి మొక్కాడు. ఆమె కథల్లో ప్రేమికులు తాము ప్రేమించిన అమ్మాయిలని తప్పకుండా పెళ్ళి చేసుకుంటారు. అంతస్తుల తేడాలున్నా – పెద్దలు అంగీకరించినా లేకపోయినా చేసుకుంటారు. మా వూరి ముచ్చట్లు అనే పెద్ద కథలో ఆ వూరికి జానపద కళలపై పరిశోధనకొచ్చిన యువతీయువకుల ఎదుట తమ కళల్ని ప్రదర్శించడానికి సిద్ధమౌతున్న వివిధ కళాకారుల్ని మనకి పరిచయం చేస్తూ పనిలో పనిగా అందులోనే ఒక ప్రేమ కథను కూడా చెప్తారు. కురువల పెళ్లి సంబరాలు చూడ్డానికి పోయి వాళ్ల పెళ్ళి తంతుల్లో ఇరుక్కుపోయిన ఒక కాపింటి బిడ్డ, అనుకోకుండా ఒక బ్రాహ్మణ యువకుడికి భార్య అయిపోవడం, ఆ ఇద్దర్నీ పెద్దలు అంగీకరించకపోతే, వాళ్ళు వెళ్ళిపోవడం ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ వాళ్ల మధ్య. చివరికి వాళ్ళు ఈ జానపద సంఘంతో ఆ వూరొచ్చినప్పుడు ఆమె వరుస చెల్లెలు ఆమెని తమ ఇంటికి పిలవడం కథ – ఇందులో పల్లెల్లో వుండే ఎంతో మంది జానపద కళాకారులు వాళ్ల విద్యలూ, అన్నీ పూసగుచ్చారు యశోదారెడ్డి. జమ్మి కథలో పల్లెటూర్లో దసరా పండగ సంబరాల్లో భాగంగా జమ్మి కొట్టేటప్పుడు ఊరి ఆసాముల సంభాషణల ద్వారా వారి మనస్తత్వాలు అద్దంలో లాగా కనపడతాయి. పర్పుబండ, బొక్కిందే దక్కుడు, రాజుగారి ఒకనాటి ప్రచారం కథలు అద్భుతమైన రాజకీయ వ్యంగ్యాస్త్రాలు. ఎలెక్షన్లు రాబోయేముందు” రాంగ రాంగ నెలలు నిండి పురిటి దినాలు దగ్గర పడ్డట్లు.. ఎన్నికలు రేపోమాపో.. ఇవే నాల్గు రాళ్ళు రాలంగ రెండురాళ్ళు వెనకేసుకునే దినాలు.. పల్లె ఒళ్ళు విరుచుకుని లేచి ఉత్సాహం పుంజుకునే వైనం.
అప్పటి పల్లెల్లో కొందరు దొరసాండ్ల కెంత అసూయ పొగరు వుండేవో ఎన్ని కుటిల బుద్ధులుండేవో ”కాలం చెప్పిన తీర్పు” కథలో పాపవ్వ దొరసాని ఉదాహరణ. మంచి దొరసాండ్లకు ”సంజ” కథలో దొరసాని ఉదాహరణ. ఎచ్చమ్మ ”కోరి చేసుకుంటినమ్మ కోతిశివుణ్ణి” అని ఏరికోరి ఒక వన్నెల మొగోడు, చిత్రకారుణ్ణి పెళ్ళి చేసుకుంది. వాళ్ళు చెమటోడ్చి ఒక ఇల్లు కట్టుకున్నారు. దాని పేరు సుధర్మ. అదొక బొమ్మల కొలువు. అంతా బాగానే వుంది కానీ ఆ ఇంటిచుట్టూ బస్తీ రొద పెరిగింది. అక్కడొక చెత్తకుండీ వెలిసింది. ఆ చెత్తకుండీలో చిత్తుకాగితాలేరుకునేవాళ్లు మొదలయ్యారు. అప్పుడు కుండీ ఖాళీ చేసే మున్సిపాలిటీ మనిషి చిత్తుకాయితాల వాళ్లని రూపాయకట్టి కాయితాలు ఏరుకోమని ఆర్డరేశాడు. ఆ రూపాయి కట్టలేని వాడొకడు కుండీలో దిగి కూచుని కాగితాలు మూటగట్టుకుని బయట కుక్కల్ని బెదరగొట్టడానికి తనూ కుక్కలాగా అరుస్తాడు. ఒకావిడ సీసాపెంకులు తెచ్చి కుండీలో పోయగా అతని తలకు, వంటికి గాయాలై నెత్తురోడుతూ బయటికొచ్చాడు. ఈ కథని యశోదారెడ్డి వ్రాసిన తీరు ఒక కెమెరా పట్టుకుని ఆ వీధిని, అందులో పొద్దుటినించీ సాయంత్రం దాకా నడిచివెళ్ళే రకరకాల మనుషుల్నీ, వాహనాల్నీ క్లోజప్‌ షాట్లు తీసి అంతా కలిపి ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. ఒకప్పుడు మారియో మిరండా అనే చిత్రకారుడు ఒక బొమ్మ వేస్తే అతిచిన్న వివరాన్ని కూడా వదిలేవాడు కాడు. అలా వుంటుంది యశోదారెడ్డి కథనం. పెళ్ళితంతుల్ని గురించి చెప్పినా, ఉయ్యాల వేడుక గురించి చెప్పినా ప్రయాణానికి కచ్చరం బండి తయారుచెయ్యడం గురించి చెప్పినా బండికి ఏ ఎద్దుల్ని కట్టాలో అందులో ఎలాంటి మెత్తలు పరవాలో, ఏమేమి అలంకారాలు చెయ్యాలో ఏ ఒక్క వివరమూ వదలదు ఆమె. ఆమె కథలన్నీ కథాచిత్రాలే. ఆమె భాషలోనే చెప్పాలంటే ”పూరాగా చిత్తారి దించినట్లు” వుంటాయి. మనుషుల పట్ల ప్రేమ కథల్నిండా పరుచుకుని వుంటుంది. శాంత గంభీరమైన కథలు ఆమెవి.
ఇక ఉపమానాలైతే ఏరుకోవాలి గానీ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. అవి శ్రమ పడి వెతికి తెచ్చి అతికించినవి కావు. అలా ఆశువుగా పాళీలోంచి సిరా ప్రవహించినంత సహజంగా ప్రవహిస్తాయి సామెతలూ అంతే. ”ఆ రెండూ నావి” అనే కథలో ముసలి ఎలమందని గురించి ఆకురాలిన సెట్టోలె, దురమాగిన పండోలె, పండువారిన ఆకోలె, పీసువారిన బీరకాయోలే, వొట్టివోయిన సెర్వోలె, రెక్కలూడిన పక్షోలె వున్న ఎలమంద, పసినిమ్మ పండోలె, పచ్చని సిగురోలె, దోరకాయోలె, దానిమ్మపూవోలె, రెక్కలొచ్చిన చిల్కోలె, పులిబెదురు తాకని జింకపిల్లోలె, కొబ్బరిగిన్నోలే వున్న మన్మరాలిని వెంటబెట్టుకుని…” ఇటువంటి ఉపమానాలు కథల్నిండా వుంటాయి. ఇంక బీర పువ్వులన్నా చిలకపచ్చ చీరెలన్నీ చాలా ఇష్టం ఆమెకు.
మోనా అనే కథలో ఇతివృత్తం పాతదే అయినా ఆ కథ మొదట్లో ఆమె వరదను వర్ణించిన తీరు అద్భుతం. ”మొగులు చిల్లివోయినట్టు, ముంతన గుమ్మరించినట్ల, మిన్నూ మన్నూ కలిసి ఏకంకవొడికినట్ల, ఏకసిస్తుగవాన, వొర్రెలు, వొంపులు, కాల్వలు, మడుగులు, కుంటలు, చెర్లు, ఏర్లు, నదులు అన్నీ నీళ్లు నిండంగ, పిక్కటిల్లి, గండ్లువడి, కట్టలు దెంపుకోని, ఏకమై, ఒడ్లెక్కి, అలుగులు దుంకి, చిన్నా పెద్దా తారతమ్యాలుడిగి, మిర్రు పల్లాలు ఒకటై, వొంపులు దీరి, ఊసురోసాలు ఇడ్సి, ఒక్క బాటగా, ఒక్క సూటిగా, జతజతగా కలెగల్పుగా సముద్రయ్య దిక్కు నడిసినై” ఇట్లా సాగుతుంది.
1929లో జన్మించిన ఈ విదుషి, 2009లో మరణించారు. త్వరలోనే ఈమె కథాసంకలనం నేషనల్‌ బుక్‌ట్రస్టు ద్వారా వెలువడనున్నది.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.