డాక్టర్‌ ఆనందీబాయి జోశి

భండారు అచ్చమాంబ
స్త్రీవిద్యా విజయదుందుభి!!!
గీ. తనసిరే వేల్పు లుదధిరత్నములచేత
వెరచిరే ఘోర కాకోలవిషముచేత
విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ఇయ్యుత్తమకాంత క్రీ.శ. 1865వ సంవత్సరము మార్చి నెల 31వ తేదీని పూనాపట్టణము నందు జన్మించెను. ఈమె తండ్రి పేరు గణపతిరావ్‌ అమృతేశ్వర్‌ జోశి. ఈయన పూర్వు లార్జించిన యగ్రహారములోని ధనమువలన జీవింపుచుండెను. వీరి నివాసస్థలము కల్యాణపట్టణము. ఆయన భార్య పూనాకు బుట్టినింటికి నీళ్ళాడబోయెను. కాన ఆనందీబాయి యచటనే జన్మించెను. మన దేశమునందలి యాచారమువలన నాడుబిడ్డ పుట్టుటవలన దలిదండ్రుల కేమి, బంధువుల కేమి మిగుల వ్యసనము కలుగును. అదే ప్రకార మీమె జననీజనకులును విచారపడిరి. అప్పుడీ బిడ్డవలన దామును బ్రసిద్ధుల మగుదుమని వారి కేమితెలియును? దేశాచారప్రకారము పదునొకండు దినములు గడచినవెనుక పండ్రెండవదినమున బారసాల చేసి పిల్లకు యమున యని నామకరణము చేసిరి. శిశువునకు మూడు నెలలు వెళ్లగానే, తల్లి కల్యాణమునకు వెళ్లెను. యమున క్రమక్రమముగా బాలలీలలను జేయుచు దల్లిదండ్రుల నానంద సాగరమున ముంచుచుండెను. ఈమె నాలుగైదు సంవత్సరముల వయసువందుననే మిగుల ‘తెలివిగలదిగానుండెను. అటుపిమ్మట నా చిన్నది యింటిలో నుండిన జెరుపుపనులు చేయునని తల్లి, సమీపము నందున్న బాలికాపాఠశాల కామెను బంప దొడగెను. కాని చిన్నతనము వలన నాచిన్నది విద్యాభ్యాసమునందు జిత్తములేనిదై యుండెను. ఆమె తల్లి బిడ్డలను గొడ్డువలె బాదు మూర్ఖస్త్రీలలోనిది యగుటవలన నామె చిన్నతనమున తల్లి చనువు లేక యెప్పుడును శిక్షకు బాత్రురాలగుచుండెను. ఆమె తల్లితల్లియు గణపతిరావుగారి యింటనే ఉండెను. కాన యమున నెవ్వరేమనినను నా ముసలమ్మ వారితో దగవులాడుచుండెను. యమున చిన్నతనమునుండియు నేదోయొక పనిలేక కూర్చుండ స్వభావముగలది గాక, సదా యేదో యొకపనిని చేయుచునే యుండెను. యమున యేడు సంవత్సరములది కాగానే తల్లిదండ్రుల కామె వివాహమును గురించి చింత కలిగెను. వారనేక స్థలముల వెదకి యనుకూలుడగు వరుని చింతించు నెడ, నొక గృహస్థుడు ఠాణా యను గ్రామమునుండి కల్యాణమునకు వచ్చెను. ఆయనతో గణపతిరావు కొమార్తె వివాహ చర్చ తేగా నాయన ”ఠాణాలోని పోస్టుమాస్టరుగారి భార్యని వర్తించెను. మీరాయనకడకు వెళ్ళి విచారింపుడ”ని చెప్పెను.
ఆయన చెప్పినవాడు గోపాలవినాయకజోశి సంగమనేర్‌ఖర్‌గారు. ఈయన తన చిన్నతనములో దన యక్కయదానును జరుపుకొను కాలములో స్త్రీల బుద్ధి పురుషలబుద్ధితో సమానముగా నుండునని తెలిసికొనెను. గోపాలరావుగారికి జిన్నతనముననే ప్రథమ వివాహమాయెను. ఆయన తన భార్యకు విశేషవిద్య గరపి స్త్రీల విద్యవలని లాభములను ప్రపంచమున కగుపరచవలెనని దృఢముగా నిశ్చయించుకొనినవాడు. అందువలన నాతడనేక ప్రయత్నములచే దన సతికి విద్య నేర్పదొడగెను. కాని యా చిన్నది యత్త యాడుబిడ్డల కోడంట్రికముచే నలుగుచుండినందున విశేష విద్యాభ్యాసము చేయలేకుండెను. ఇట్లుండగా నా చిన్నదానికి బదుమూడవయేట నొక కొమారుడు కలిగి తల్లిని స్వర్గమున కంపెను. ఆ చిన్నవానిపేరు కృష్ణా. ఆతడిప్పటివరకును సుఖముగానే యున్నాడు. ప్రథమ భార్య చనిపోయిన పిదప గోపాలరావు మిగుల నుదాసీనుడయి రెండవ వివాహము చేసికొనను అని నిశ్చయించుకొనెను. ప్రథమ పత్ని యున్నకాలములోనే యతనికి మొదట పూనాలో పోస్టాఫీసులో నొక చిన్న జీతము గలపని దొరకి పిదప స్వతంత్రముగా ఠాణాలోని పోస్టు మాష్టరుపని దొరకెను. ఆయన తన ప్రథమపత్నికి గలిగిన కోడంట్రికముంగని చిన్నతనముననే వివాహములు చేసి పిల్లల నత్తవారియింటికి బంపు తల్లిదండ్రులను, పరులపిల్లల నతి క్రూరముగా జూచెడి యత్తలను మిగుల దూషింపుచుండెను. ఇవన్నియు విచారించి యాయన ద్వితీయవివాహము జేసికొనుటకు నిష్టము లేనివాడయి యుండెను. కాని గణపతిరావు ఆయనవద్దకి వచ్చి తన కొమార్తెను చేసికొనవలసినదని యడుగగా నాతడు తానొక స్త్రీని పూర్ణవిద్యావతిని జేసి ప్రపంచమునకు నుదాహరణము చూపదలచినవాడగుటచే, ‘నా భార్యకునేనే నెట్టి విద్య గరపినను మీరడ్డుపడకుండెడి యెడలనే వివాహమునకొప్పుకొనెద”ననెను. గణపతిరావు గారందున కొడంబడగా గొన్ని దినములకు వివాహము జరిగెను. దేశాచారప్రకారము వివాహానంతరము యమునాబాయి ‘ఆనందీబాయి’యని యత్తవారు పేరుపెట్టిరి. పెండ్లియైనపిదప గణపతిరావుగారి యనుమతిప్రకారము, గోపాలరావు నిత్యము సాయంతనము కళ్యాణపట్టణమునకు వచ్చుచుండెను. ఆనందీబాయి కొంచెము చదువుకున్నదని తెలిసి గోపాలరావు మరాఠిపుస్తకములు కొనితెచ్చి ముత్తవచేత నామె కిప్పించి చదువునట్టు చేయించుచుండెను. రెండవ పెండ్లివాడగుటచే పిల్లదానిని త్వరలో భర్తగారితో మాటలాడ బురికొల్పసాగిరి. కాని ఆనందీబాయి కా కాలములో భర్తయనిన నొక వ్యాఘ్రమువలె దోచుటచే నామె మిగుల భయపడుచుండెను. గోపాలరావామె నెంతమాత్రమును భయపెట్టక బుజ్జగించియే చదువు మొదలయినవి చెప్పుచుండెను.
గోపాలరావు ఆనందీబాయికి విద్యనేర్పుట ఆయన మామగారి కెంతమాత్రమును సమాధానము లేదు. ఆయన తానందు కొడంబడినవాడగుటవలన నల్లునితో వేమియు యనజాలక యితరులచే స్త్రీవిద్యవలనంగలుగు నష్టములు చెప్పి మాన్పజూచెను. కాని గోపాలరావు వారికి దన ప్రత్యుత్తరము చెప్పి పంపెను. మామగారి యూరికి సమీపమునందుండుట యెడల భార్యవిద్య సాగదని గోపాలరావు అల్లీబాగను గ్రామమునకు మార్చుకొనెను. అచటికి ఆనందీబాయితోడనామె ముత్తువ పోయియుండెను. కాన పిల్ల కేవిధమయిన భయము లేకయుండెను.
అటుపిమ్మట గోపాలరావామెకు విద్యవలన లాభముల నెరింగింపగా నామె మిగుల శ్రద్ధతో ప్రతిదినము తప్పక పాఠములు చదువుచుండెను. ఆమె చురుకుదనమును జూచిన కొలదిని గోపాలరావునకు మరింత యుత్సాహము కలిగి యాతడామెతో ననేకసంగతులను ముచ్చటింపుచుండెను. అందువలననే ఆనందీబాయికి త్వరగా విద్యాసక్తి గలిగెను. పెండ్లియైన పిదప రెండు సంవత్సరములలో ఆనందీబాయికి మహారాష్ట్రభాష చక్కగా జదువుటకును, వ్రాయుటకును వచ్చెను. అంతలో నామె కా భాషయందలి వ్యాకరణము, భూగోళము, ప్రకృతిశాస్త్రము, గణితశాస్త్రము మొదలయినవి గోపాలరావుగారు చక్కగా నేర్పిరి. అల్లీబాగునందుండు కాలముననే ఆనందీబాయి ఋతుమతియైనందున భార్యాభర్తల నొకటిచేసిరి. వెంటనే యానందీబాయి గర్భవతియైనందున నామె కళ్యాణమునకు బోయెను. అచట నామెకు కొమారుడుగలిగి పదియవదినంబుననే చనిపోయెను. కాన ఆనందీబాయికి జిన్నతనముననే పుత్రదుఃఖము గలిగెను. అందువలన గొన్ని దినముల వరకును ఆమె విద్యాభ్యాసమునకు భంగము గలిగెను. కాని యటుపిమ్మట మరల నామెచదువు చక్కగా సాగుచుండెను. కొన్ని దినములలో నామెకు దన మనోగతమును బాగుగావ్రాసి తెలుపునంతటి ప్రజ్ఞ గలిగెను. అల్లీబాగులోని లోకు లానందీబాయికి వచ్చిన విద్యనుగని యోర్వలేక గోపాలరావు ననేక కష్టముల పెట్టుచుండిరి. కాన నచట నుండుట కిష్టములేక, కోలాపురమునందు స్త్రీవిద్య కనుకూలు రగువా రున్నందున బహుప్రయత్నముతో గోపాలరావుగా రచటికి మార్చుకొనిరి. కోలాపురములో బాలికాపాఠశాల వీరింటికి దూరమగుటచే ఆనందీబాయిని నొక్కర్తనంతదూరము కాలినడకతో బంప వీలులేక యుండెను. పాఠశాలలో నుపాధ్యాయినిగా నుండిన మిస్‌ మాయసీగారి యిల్లు వీరియింటికి సమీపము నందుండెను. ఆమె బహుమంచిదని విని గోపాలరావుగా రామెతోడ మాటాడ నరిగెను. ఆయన ప్రసంగావశమున ”నా భార్యను మీబండిలో గూర్చుండబెట్టుకొని వెళ్లెదరా” యని యడుగగా నామె కొంత యోచించి మంచిదనియెను. అందుపై ఆనందీబాయి కొన్నిదినము లచటి పాఠశాల కరుగుచుండెను. కాని యటుపిమ్మట మాయసీ తన బండిలో స్థలమియ్యనందున నామె పాఠశాల కరుగుట మానుకొనవలసిన దాయెను.
కోలాపురమున నీదంపతులు పాద్రీల (క్రైస్తవధర్మ గురువుల,) యిండ్లకగుచుండిరి. పాద్రీ యాడువారు ఆనందీబాయికి నింగ్లీషు రెండు మూడుపుస్తకములవరకును నేర్పిరి. ఆనందీబాయి యల్పవయస్కురాలయినను వారు చేయు మతబోధను గ్రహింపక కేవల నీతివాక్యములనే గ్రహింపుచుండెను. వీరివలననే యీ దంపతుల కమేరికాలోని సంగతులన్నియు తెలిసెను. కాన నమేరికాలోని కరిగి విద్యనభ్యసింపవలెనని ఆనందీబాయి కప్పటినుండి యిచ్చగలిగెను.
1876వ సంవత్సర ప్రారంభమున గోపాలరావుగారిని బొంబాయికి మార్చిరి. అచట నుండుకాలములో ఆనందీబాయి కొంతవర కింగ్లీషును, సంస్కృతమును నేర్చుకొనెను. కాని యచటను లోకులామె విద్యాభ్యాసమున కనేక విఘ్నములు తెచ్చుచుండిరి. ఇట్లుండగా 1880వ సంవత్సరము నచటనుండి భూజయను గ్రామమునకు మార్చినందున, నాదంపతు లచటికరిగిరి. బొంబాయినుండి భూజకు బోవునపుడు ఆనందీబాయి ముత్తవ యామెతోడ రానందున నింటిపని యంతయు నామెయే చేయవలసి యుండెను. ఇంటిపనినంతను చేసి యానందీబాయి భర్తకడ నింగ్లీషు మాటాడుట చక్కగా నేర్చుకొనెను.
గోపాలరావుగారికి భార్యను విశేష విద్యావతిని జేయవలెనని యుండుట నొకవార్తాపత్రికలోన జదివి అమేరికాలోని న్యూయార్కుపట్టణవాసినియగు మిసెస్‌ బీ.ఎఫ్‌. కార్పెంటర్‌ అను నామె ఆనందీబాయికి సహాయము చేయదలచి యామెకొక ఉత్తరము వ్రాసెను. ఈమెయే ఆనందీబాయి కనేకవిధముల సహాయముచేసి యామెను కూతురివలె జూచుచుండెను. కాన ఆనందీబాయియు నీమెయం దధికప్రేమ గలది యయి ఈమెను పిన్ని యని పిలుచుచుండెను. ఈమెకు ఆనందీబాయి వ్రాసిన యుత్తరముల వలన మనదేశమునందలి స్త్రీలకు గల పరతంత్రతయు, దానిని వదిలించుటకై ఆనందీబాయికి గల యభిప్రాయములు దెలియుచున్నవి. స్త్రీలకు విశేష విద్యగపినంగాని స్వహితము తెలియదని యామె మతము, ఇదియంతయు నామె స్వానుభవము వలననె తెలిసికొనెను. ఇట్లుత్తర ప్రత్యుత్తరముల వలన నా యిరువురకును సఖ్యమధిక మయ్యెను.
తదనంతరము గోపాలరావుగారిని కలకత్తాకు మార్చిరి. అచ్చట నుండుకాలములో పోస్టుఆఫీసులో 30 రూపాయల వేతనముగల యుద్యోగము ఆనందీబాయికొరకు సిద్ధమయ్యెను. కాని యుద్యోగములో బ్రవేశించి స్వతంత్రతను పోగొట్టుకొనుట కిష్టములేక, యామె దానిని స్వీకరించకుండెను. తదనంతర యామెకు నమెరికాలో వైద్యవిద్య నభ్యసించుకోరిక యధిగమయ్యెను.
కలకత్తానుండి శ్రీరామపురమను స్థలమునకు మార్చినందున నాదంపతు లచటి కరిగిరి. అచటి కరిగినపిదప గొన్ని దినములు సెలవు తీసికొని వారు సమీపమునందుగల జయపూర్‌, ఆగ్రా, గ్వాలేర్‌, లఖనౌ, కాన్‌పూర్‌, ఢిల్లీ, ప్రయాగ, కాశీ మొదలగు ప్రసిద్ధి పట్టణములను జూడ నరిగిరి. అందువలన ఆనందీబాయికి గొంతవరకు ప్రవాసస్థితి తెలిసెను. వారు మరలి శ్రీరామపురమునకు వచ్చిన కొద్దిదినములలోనే రెండు సంవత్సరముల సెలవుతీసికొని అమెరికాదేశమునకరుగ నిశ్చయించిరి. కాని యింతలో నీకు సెలవియ్యజాలమని పైనుండి యుత్తరువు వచ్చెను. అందువలన ఆనందీబాయి నొకర్తనే యమెరికాకు బంపదలచి గోపాలరావుగారెమెతో నొకదిన మిట్లు ప్రసంగించిరి:-
గోపాలరావు:- (చింతతో) నీవు ఒంటరిగానే అమెరికాకు వెళ్ళరాదా? నా కిప్పుడు సెలవు దొరకదు. నీకిచటనుండి విద్యాభ్యాసము కానేరదు. కాన వొంటరిగానైన నరుగుట యావశ్యకము. మన మిరువురము కలసి వెళ్ళవలెననినచో నింకను రెండుసంవత్సరముల వ్యవధి గలదు. ఇంతలో నీచదువచట జాలవరకగును.
ఆనందీబాయి :- (ఏమియు ననక భర్తవంకజూచి మీరేమనెదరని యడిగినటుల నగుపడెను; దానింగని.)
గోపాలరావు :- నేటివరకును బ్రాహ్మణ స్త్రీ పరదేశమునకరిగి విద్యనభ్యసించిన యుదహరణ మెందును గానరాదు. కాన నీవు వెళ్ళి విద్యనభ్యసించి యుదాహరణీయవగుము. స్త్రీలు సామర్ధ్యహీన లన్నవాక్యమును నీవబద్ధము చేయుము. మన నడవడిని విడువక అమెరికావారికి మన నడవడిని నేర్పుము. ప్రస్తుతము సంస్కరణము కావలయు ననువారు పెక్కండ్రు పురుషులు కలరు. కాని వారిచేత గొంచమైనను సంస్కరణమగుటలేదు. నీవు స్త్రీవై కొంచెము సంస్కరణముచేసి చూపినను మిగుల నుపయోగకరముగా నుండును.
అందుకానందీబాయి సమ్మతించి యెంతదూరదేశ ప్రయాణమునగు సాహసించెను! ఆమె తన కెట్టి కష్టములు వచ్చినను వెనుకదీయక స్వదేశ సోదరీమణుల కొక యుదాహరణముచూపి వారికి మేలుచేయదలచెను!!
ఇట్లు వారు కృతనిశ్చయులయి ఆనందీబాయికొర కమేరికాలో ననుకూలములగు బట్టలనుకుట్టించి, సిద్ధపరుచుచుండిరి. ఆనందీబాయి పరదేశపు వస్త్రములు ధరియింపనని నిశ్చయించుకొని మనదేశమునందలి ముతక బనాతుగుడ్డలతోనే దుస్తులను కుట్టించుకొనెను. ఇట్టిదిగదా స్వదేశాభిమానము! ఆమె ఆమేరికా కరుగునని విని యనేకు లనేకాక్షేపణలు చేసిరి. కాన వారి కందరకును సమాధానకరముగా ఆనందీబాయి యొక పాఠశాలామందిరమున సభచేసి గంటసేపు హూణభాషయందు నస్ఖలితముగా నుపన్యసించెను. అందువలననే యామెకు నింగ్లీషునందు గల ప్రజ్ఞయు, నామెయొక్క యప్రతిమ వక్తృత్వశక్తియు వెల్లడి యగుచున్నవి. ఆయుపన్యాస మత్యంత శ్రవణీయము. కాన జనానాపత్రికోక్తముగా నిచ్చట నుదాహరించుచున్నాను.
”నా యమేరికాదేశయాత్రను గురించి వందలకొలది ప్రశ్నలు నన్న నేకు లడుగుచున్నారు. కావున నే నిప్పుడు అవకాశము గలుగజేసికొని వానిలో గొన్నిటికి బ్రత్యుత్తరములం జెప్ప దలంచితిని అవి యెవ్వనగా :
1. నేనమేరికాదేశ మేల వెళ్ళవలెను?
2. హిందూదేశమునందు గృషిచేయుటకు నాకు సాధనములు లేవా?
3. నేనొంటరిగా నేల వెళ్ళవలెను?
4. నేనీ దేశమునకు తిరిగివచ్చినప్పుడు జాతిలోని వారినుండి నాకు బహిష్కారము గలుగదా?
5. ఏదేని యాపద సంభవించిన యెడల నేనేమి చేయవలెను?
6. స్త్రీలలో నెవరునుజేయనిపనిని నేనెందులకు జేయవలెను? అనునవి.
1.    మొదటిప్రశ్నకుత్తరము : నేను వైద్యము నేర్చుకొనదలచి యమేరికాదేశమునకు వెళ్ల నిశ్చయించితిని. ఈ హిందూదేశమునందు స్త్రీలకు జికిత్స జేయదగిన సాధనకలాపము లేని కారణమువలన గలిగెడి బాధలను ఇప్పు డిక్కడకు దయచేసిన నారీమణులు బాగుగా దెలిసికొని యున్నారు. ప్రకృతిశాస్త్రములను, స్త్రీవిద్యను, వెలయింపజేయ నీ దేశమున వెలయుచున్న సమాజము లెవ్వియు మనదేశపు యువతుల నేరినిగాని, నాగరికతచే బ్రతిష్ఠం గాంచిన ఖండాంతరముల కంపించి వైద్యశాస్త్రప్రవీణలను గావించి, వారిచే నిచ్చటం బ్రమదల కా వైద్యశాస్త్రమును గరపు కళాశాలలను స్థాపింప దలంపమికి నే నత్యద్భుతము నొందుచున్నదానను. తనకుగల లోపముల నెల్ల వెల్లడి సేయక తన్నివారణార్థమై యర్థింపక యుపేక్షించుచు నిందాస్పదమైనదేశము ఈ హిందూదేశమున కంటె మరియొక్కటి యేదియు లేదు. ఈ హిందూదేశమంతట స్త్రీవైద్యులులేని లోపము కష్టముగనున్నవి. యూరపుదేశపు నారులును, హిందూసుందరులును, అవసరము తటస్థించినప్పుడు పరపురుషులకు తమదేహస్థితిని వివరించి వారిచే జికిత్స జేయించుకొనుటకు సహజముగా నిష్టపడకయున్నారు. యూరపు, అమెరికాదేశములనుండి యిక్కడకు కొందరు స్త్రీవైద్యులు వచ్చుచున్నారు. గాని, వారి భాషయు, నాచారమర్యాదలును, గ్రొత్తలగుటచే, వారు మనస్త్రీలకంతగా నుపయోగపడక యున్నారు. తమ దేశమందును దమవారయెడలను నైసర్గికమయిన ప్రేమగల హిందూసుందరులు పరదేశ యువతులతో గలిసి మెలగలేరు. కావున వారివలన నే సహాయలాభమును బడయజాలకయున్నారు. ఈ హిందూదేశమున, స్వదేశీ స్త్రీవైద్యుల అక్కర మిక్కిలిగా నున్నట్టు నాకు దోచుచున్నది.
2. ఇక నీ హిందూదేశమునం దందులకు తగిన సాధనములు లేవా యను రెండవ ప్రశ్నమున కుత్తరము : లేవని నిష్కర్షగా మనవిచేయుచున్నాను. కానివున్న సాధనములు సులభసాధ్యములు గావని నా యభిప్రాయము. చెన్నపురి యందు నొక సర్వకళాశాలయు నన్ని రాజధానులలోను మంత్రసానితనము నేర్పు తరగతులును నుండుట సత్యమే. అయిన నందలి బోధకులు ప్రాచీనాచారప్రవిస్టు లగుటచేతను, కొంతవర కసహిష్ణులగుటవలనను అచ్చట నొసంగబడుచున్న విద్య యసంపూర్ణ మయినదిగాను లోపములతో గూడినదిగాను నున్నది. ఇట్లనుటనే నా బోధకుల తప్పుల నెంచుటకు గాదు సుడీ. అది పురుషుల స్వభావమని మనవిచేసితిని. వీరికి మారుగా నాస్థానములను స్త్రీలలంకరించువరకిట్టి యిబ్బందులకు మన మోర్చుకోవలసి యున్నది.
నేను క్రైస్తవరాలనుగాను; బ్రాహ్మమతావలంబినిని గాను కాబట్టి హిందూ మతాభిమానముగలిగి తద్ధర్మముల ననుష్ఠింపుచు నీదేశమున నెందయినను పాఠశాలకు బోయి విద్య గరచుట నాబోటి బోటికి దుష్కరము. ఇంగ్లీషువారి యుడుపుల దొడిగికొని నడయాడు మతాంతరులయినను ఇచటి ప్రజలు నన్ను జూచినట్టూరక యెగదిగ జూడరు. నగరులలోను, వెలుపలను. నావంటి హిందూయువతులకు గలుగుచున్న దురాక్షేపణలు, దుర్వదంతులు స్వదేశీయులైన క్రైస్తవ స్త్రీలకు లేశమును గలుగుటలేదు. పొగబండిలోగాని, వీధులవెంటగాని నే నొంటరిగా బోవునపుడెల్ల ప్రజలు కొందరు నన్ను జేరి నా మొగమువంక నట్టే చూచుచు కొంటెప్రశ్నలచే నన్నలయింపుచుందురు. ఈ పొడిమాటలకంటె కొన్ని యుదాహరణముల వలన నిజము మీ మనసులకు నాటజెప్పెదను చిత్తగింపుడు.
కొన్ని సంవత్సరముల క్రిందట నేను బొంబాయి నగరమున నుండగా పాఠశాలకు బోవుచుంటిని. చేత పుస్తకములం బట్టుకొని నేను బడికి బోవుచుండునపుడు కొందరు కిటికీలగుండ నన్ను చూచువారును, మరికొందరు బండ్లెక్కి పోవచు నన్ను జూచువారును, వీధులలో ద్రిమ్మరుచుండు నిక కొందరు పెద్దపెట్టున నవ్వుచు ”ఇదేమి వింత! కాళ్ళకు మేజోళ్ళను బూట్సులను దొడిగికొని పాఠశాల కేగు నీగరిత యెవ్వతె! ఇందుమూలమున కలియప్పుడే ప్రజల మనముల నావహించినజాడలు బొడగట్టుచున్నవిగదా.” యని నాకు వారు వినబడునట్టుగా కోలాహలముగా బలుకువారుగ నుండిరి.
ఓమానినీమణులారా! అట్టిప్రశ్నలను మిమ్మడిగినప్పుడు మీ మనసెట్టి సంతాపమును బొందెడినో మీరే సులభముగా నూహించి తెలిసికొనగలరు.
ఒకప్పుడు నేను కొంతకాలము పాఠశాలలో నుండవలసివచ్చి భోజనము నిమిత్తము దినమునకు రెండుసారులు బంధువుల యింటికి బోవలసి వచ్చెను. నేనపు డట్లు పోవుచు వచ్చుచున్నప్పుడెల్ల వీధి వెంట నేగువారు నా చుట్టును జేరి కొంద రెగతాళిజేయ నారంభించిరి. కొందరు కడుపుబ్బ నవ్వజొచ్చిరి. తక్కిన గృహస్థులు డాంబికముగా తమతమ పంచలలో గూర్చుండి నన్నుగని వికృతాలాపము లాడుచు నాపైని రాళ్ళు రువ్వుట కెంతయు లజ్జింపరైరి. ఇక నంగడివాండ్రు బేరగాండ్రన్ననో నన్ను వెక్కిరింపుచు నసహ్యకరమైన సైగలు జేయసాగిరి. అట్టి సమయములలో నాస్థితి యెట్లుండెనో శీఘ్రమే యిల్లు చేరుకొనుటకు నా మనసెట్లు త్వరపెట్టెనో దానినూహించి మీరే తెలిసికొనుడు.
బొంబాయినగర వాస్తవులతీరిట్లుండగా, బంగాళా వారి రీతి యిక జెప్పుటకే శక్యముగాకున్నది. ఇది యెల్ల కడు శోచనీయము. గాలిపట్టులకెప్పుడయిన నేను వ్యాయామముకొరకు పోయినప్పుడు ఇంగ్లీషువారయిన నన్నెప్పుడు కన్నెత్తి యంత నిబ్బరముగా జూడరయిరి. కాని బంగాళావారు తమ దంభమునంతను వెల్లడిచేసి హాస్యాస్పదము గావించుకొన నన్ను గని, ”నీ వెవతెవు? నీ పేరేమి? నీ స్థలమేమి? నీ వెందులకేగెదవు?” అని యపరిచితు లడుగగూడని ప్రశ్నల నడిగి యాగడ మొనర్చిరి. శ్రీరామపురములో విద్యావంతులని యెన్నిక గన్న కొందరు స్వదేశ క్రైస్తవులు నేను వివాహితనో, వితంతువునో, దుర్వర్తన గలదాననో, కులభ్రష్టనో యని శంకింపుచుండిరి. ప్రియులయిన యో సభాజనులారా! యిట్టి యవినయప్రచారములు స్వదేశ క్రైస్తవులు చేయగూడునా? ఎంతమాత్రము చేయగూడదు. వీనిని మీకిట్లు విన్నవించుట మీరిట్టి లోపములను సవరణ చేయ దివియెదరనియు, మీలోని కష్టముల నెవడెరుగనివారు వీనినెల్ల వినినపిమ్మట నమెరికాదేశమునకు నేను పోవ యత్నించుట కేవలము వేడుకకై గాదని యెంచెదరనియే కాని మరియొక తలపున గాదు.
3. నేనొంటరిగానేల విదేశమునకు బోవలెనను మూడవప్రశ్న కుత్తరమేమనగా – తొలుత నేను, నా పెనిమిటియును గలసి వెళ్ళుటకే యుద్దేశించితిమి. కాని స్థితిగతులనుబట్టి యాతలంపు మానుకొనవలసివచ్చెను. మాయొద్ద ధనమా చాలినంత లేదు. ఋణమా చేయుటకు మా కిష్టము లేదు. ఈ హేతు వొక్కటియెకాక, యింతకంటె ముఖ్యములయినవి యందరి నొప్పింపదగినవి మరికొన్ని గలవు. అవి యేమనగా నాభర్తగారికి వయోవృద్ధయగు జననియు, పసివాండ్రుగా నన్ను తోబుట్టువులును, తమ్ములను గలరు. వారందరికి సంరక్షక్షుడు నా భర్తగారే యగుటచేత నాయన నాతోగూడ వచ్చిరేని వారు దిక్కుమాలిన వారలయి, వారి బ్రతుకు భగ్నమయి, వారు తీరని దారిద్య్రబాధలకు లోనగుదురు. నా యొక్కత కొరకు పెక్కండ్రను మలమలమాడునట్లు జేయుట ఎంత యమానుషకృత్యము! కాబట్టి నే నొంటరిగా నేగ నిశ్చయించితిని.
4. నే నిండియాకు (హిందూదేశమునకు) మరల వచ్చినప్పుడు నాకు బహిష్కారము గలుగకయుండునా యనుదానికి సమాధానము – అట్టి భయమువలన నేను చలించెదనని తలంతురా? నేనందుకు నావంతయినను వెరవను. ఇక్కడ నే విధముగా నుంటినో, యక్కడగూడ నాతీరుననే యుండ నిశ్చయించుకొని యుండగా నాకు బహిష్కార మేల కలుగును? నా యాచార వ్యవహారముల యందుగాని, ఆహార విహారములలోగాని, వేష భాషలయందుగాని మార్పుగావింప నేనెంతయు దలంపలేదు. హిందూయువతిగనే పోయి, మరల హిందూ మానవతిగనే వచ్చి, యిక్కడ హిందూ సుందరులతోనే గలసియుండ నిశ్చయించితిని. ఇప్పు డున్నదానికంటె భిన్నముగా నుండగా నా పూర్వులెట్లు సామాన్యముగ జీవించిరో నేనునట్లే యుండగలదానను. ఇప్పగిది నేను బ్రవర్తించునప్పుడు అస్మద్దేశీయులు నన్ను బహిష్కరింప జూతురేని, యప్పుడేల? ఆ పని యిప్పుడే చేయరాదా? అందుకు వారికి సర్వస్వాతంత్య్రము గలిగియే యున్నది. మా మహారాష్ట్ర కుటుంబ మొక్కటియైనను లేని యీ బంగాళాదేశమందలి యీ స్థలమున నేనిప్పుడు వాసము చేయుచుంటిని గదా! నేనియ్యెడ నా దేశాచారధర్మముల ననుష్ఠించి ప్రవర్తింపుచుంటినో లేదో యెవ్వరెరుగుదురు? కాబట్టి యెన్నడును సంభవింపగూడనట్టియు, సంభవించినప్పుడు మానుషప్రయత్నములకు లోబడనట్టియు వానిని గురించి చింతింపక యుండుటయే యుత్తమము.
5. నాకేది యయిన నిక్కట్టు తటస్థించిన నేనేమి చేయుదు ననెడి ప్రశ్నకు సదుత్తర మేమన్న : కొందరు మనుష్యులు ప్రపంచములో గనబడుదానికంటె నతి భయంకరముగా గ్రంథములలో గనబడు దురవస్థలను, దుర్దశలను నుదాహరణముగా జూపిన భయము నతిశయింపజేయ బ్రయత్నింతురు. కాని యా యాపదలెంత భయంకరములో యంత యరుదుగా సంభవించునట్టుగ విధింపబడి యున్నవి. పురుషులుగాని, స్త్రీలుగాని యెద్దియేని యొక కార్యము చేయబూనినప్పుడు తొలుత మేలెంచెదరుగాని కీడెప్పుడు నెంచరు. ఒకానొకప్పుడు తప్పక కీడులు మూడి మగవారినిగాని, యాడువారినిగాని భూమిలోని కడగ ద్రొక్కినయెడల నింకప్పుడు వృధా చర్చలతో బనియేమి? అవి వచ్చినప్పు డనుభవించి తీరవలసినదే కాని యా యాపదలు రాబోవు నన్నప్పుడుండెడి బాధకంటె వాని ననుభవించునపుడుండెడిబాధ యల్పమనుట జగద్విదితమే. ఏవిధమున నయినను ఈ లోకమున శాశ్వతమయిన సుఖమును బడయగలమా యనుశంకను నివృత్తి చేసుకొనుట కీ ప్రపంచము మన కవకాశ మెన్నడును గలుగజేయనేరదు. కాని పయికగుపడుచున్న సాధనముల యంతరములకు దగిన సౌఖ్యమును మనుజు లెల్లప్పుడును బొందుచుండుట లేదనిమాత్రము మనము చెప్పవచ్చును. ఆ సౌఖ్యమనునది కొందరుచేరి తమలో తాము విభాగించుకొనదగిన పదార్థముగాదు. అది మన మనసునుబట్టి యుండును. దురవస్థలలోకెల్ల మరణమే గొప్పదని యెంచెదమంటిమా కొందరు దాని రాకకేల సంతోషింతురు? మరికొందరేల దుఃఖింతురు? వేయేల? మృత్యువును దుర్దశయును, మంచివారికిని, చెడ్డవారికిని, పుణ్యాత్ములకును, పాపాత్ములకును, భాగ్యవంతులకును, దరిద్రులకును, దేశదిమ్మరులకును, గృహస్తులకును సమానముగనే వచ్చుచుండును. ఆపత్‌క్షామమున నందరు వివశులగుటయు, కక్ష్యావేశముచే నెవ్వరు ప్రతిభావంతులు గాకుండుటయును సుప్రసిద్ధమే. రానున్న విపత్తు నెంతటి మనుజుడైన నడ్డగింపలేడు. ఆపదయును, నెల్లప్పుడు మనల ననుసరించియే యున్నది. కాబట్టి వాని రాకకు ప్రతి మనుష్యుడును నిరీక్షించియే యున్నాడు. ఏదియయిన నొక యుత్కృష్టమైన పనియొక్క  ఫలిత మనుకూలముగా నుండెనా, దానిని పూనికతో నెరవేర్చినవారి పరిశ్రమమును ఘనముగా ప్రశంసింతుము. లేక యది ప్రతికూలముగా పరిసమాప్తి నొందెనా తత్కార్యవాహుల యవజ్ఞతను నిందింతుము. ఈ తీరుననే యదృష్టము మారి, ఫలము విఫలమైనచో లోకమది యవివేకమని చాటుటకు సిద్ధమయి యుండును.
ఇంక కొందరు కూపస్థమండూకములవలెనింటి నంటిపెట్టుకొనువారే సుఖభోగులందురు. కాని, వారికి సుఖభోగమేలాగున గలుగునో తెలియదు. అది కోరినప్పుడనుభవింప దగినట్టు సిద్ధముగా నమర్చబడియున్న పదార్థము కాదుగదా. కొందరికి నూతనప్రియత్వ మెంత యధికముగా నుండుననగా సౌఖ్యమయినను నెడతెగనిదిగా నుండిన దానియందు రుచి లేదని వారప్పుడప్పుడు కష్టములను గోరుచుందురు. విదేశమున కేగుట చెడుపనిగాదు. కొన్ని యంశములనుబట్టి యొక్కచోట నివసించియున్న దానికంటె మేలయిన పనియని చెప్పవచ్చును. దేశాటనమున నాయాదేశములయొక్కయు, ప్రజలయొక్కయు స్థితిగతులు బాగుగ మనసున బట్టగలవు. అట్టివాని దెచ్చుకొనుటయందు విముఖులమయి యుండగూడదు. అవజ్ఞతను మనము బుద్ధిపూర్వకముగా నవలంబించుట యనునది గొప్ప దోషములలో నొకటి. విదేశయాత్రలం గావించుటచే మనసు బుద్ధివికాసము, జ్ఞానాభివృద్ధియు నగుటయేకాక యంతరింప కళాకౌశలములు జీవించుటయు గలుగును. ఎల్లవారును యుక్తమయిన దానిని జేయవలసినదే. ప్రతి మనుష్యుడును తన సహజీవులకు జేతనయినంత యుపకారముజేయ బద్ధుడయి యున్నాడు. నరులయి పుట్టినవారెల్ల నితరులవలన దమకు గలిగిన యుపకారమునకు బ్రత్యుపకారముచేసి ఋణవిముక్తతను బొందవలసినది. పరసీమలో మనకు దిక్కెవ్వరని యడిగెదరా? ఏతద్విషయమయి గోల్డుస్మిత్తను ఇంగ్లీషుకవి చేసిన మహోపదేశమును మనము గమనింతము. అది యెద్దియనగా ”అంధుల బుద్ధివిశేషము ననుసరింప నేర్చుకొనుము. ఏలయనగా వారెన్నడు తమ చేతి యూతకోలతో భూమిని దడవి తెలిసికొనకుండ నడుగుపెట్టరు.” ఆ తీరుననే నేను సర్వశక్తి సంపన్నుడయిన నా పరమపితను నాకూతకోలగా జేసికొనియెదను. ఆయనయే నా మార్గమును బరిశీలించి నన్ను ముందుకు నడిపించుకొనిపోవును. దానికంటెను మహోత్తరమయిన చేతియూత నాకన్య మేమియు గనబడదు.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.