ప్రసారమాధ్యమాల్లో స్త్రీ, పురుషులు సమానమేనా?

– డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి

ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ లేవనెత్తటం జరుగుతోంది. చాలావరకు పురుషులే నిర్వహిస్తూ వచ్చిన వృత్తుల్లో స్త్రీలు ప్రవేశించటంతో, అందులోని వివక్ష, భేదభావాలు, ప్రతికూల వాతావరణం, అభిప్రాయాలు వీరి వృత్తి నిర్వహణ మరింత కష్టతరం చేస్తూ వచ్చాయి. కానీ ఈ సమస్యలు గుర్తించి, చర్చించి పరిష్కారమార్గాలు వెతికే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అనుకూలమైన మార్పులు వస్తున్నాయి. అయితే దగ్గరగా చూస్తే మౌలిక సమస్యల్లో ఏ మాత్రం మార్పు వచ్చినట్లనిపించదు.

పత్రికా స్వాతంత్య్రానికి గల ప్రాము ఖ్యాన్ని గుర్తుకు చేయటానికి, దానిని గురించి పదిమందికీ తెలియజెయ్యటానికి మే మూడవ తేదీని ప్రతి సంవత్సరం పత్రికా స్వాతంత్య్ర దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు.

సాధారణంగా ఈ రోజు ప్రసార మాధ్యమాలకు సంబంధించిన చర్చలు, సమీక్షలు జరుగుతుంటాయి. ఈ సంవత్సర ఢిల్లీలో స్త్రీల, బాలల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కోర్‌ కలిసి ”ప్రసార మాధ్యమాల్లో స్త్రీ, పురుషుల సమానత్వం” గురించి చర్చ ఏర్పాటుచేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన చర్చలకు కేంద్రమంత్రి శ్రీమతి రేణుకా చౌదరి అధ్యక్షత వహించారు.

ఈ చర్చల్లో ప్రసారమాధ్యమాల్లో పనిచేస్తున్న స్త్రీల సమస్యలు, ప్రసార మాధ్యమాల్లో స్త్రీలను చిత్రిస్తున్న తీరు ప్రధానాంశాలయ్యాయి. ఈ విషయాల గురించి నాలుగు దశాబ్దాలకు పైగానే చర్చలు జరిగాయి. సర్వేలు జరిగాయి. పరిశోధన పత్రాలూ వ్రాయటమయింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కాని కాలం గడిచే కొద్దీ విపరీతంగా వస్తున్న మార్పుల వల్ల కొత్త సమస్యలు ఎదురవుతూ పరిస్థితులు యథాస్థితికి వస్తున్నాయి.

మొత్తానికి ప్రసారమాధ్యమాల్లో స్త్రీల ఉద్యోగాల విషయాలలోనేమి, వాళ్ళ కప్పగించే విధులలోనేమి, స్త్రీల గురించి వ్రాసే రిపోర్టులలోనేమి, వాళ్ళను చిత్రించే విషయంలోనేమి చాలా ప్రతికూల భావం స్పష్టమవుతూ ఉంటుంది. ఈ రంగంలో స్త్రీపురుష సమానత్వమనేది ఒక భ్రమగా మిగిలింది. వీరికి బాధ్యత గలిగిన ఉద్యోగాలివ్వరు. విధానాలు రూపొందించ టంలో భాగస్వామిత్వం ఉండదు. పత్రిక నడిపే స్థాయికి చేరుకోనివ్వరు. పేపరుమీద అటువంటి భేదభావం ఉన్నట్టు నియమాలు ఉండవు కాని అసలు విషయానికి వస్తే వీరికెన్నో పరిమితులు విధించటమవుతుంది. దీనినే గ్లాస్‌ సీలింగు అంటుంటారు.

స్త్రీల పట్ల భేదభావంతో వ్యవహరించ టానికి దేశాభివృద్ధికి సంబంధం లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా స్త్రీల పరిస్థితి అలాగే ఉంది. ఉద్యోగాలు చేసే స్త్రీలకు కావలసిన సదుపాయాల గురించి ఏ సంస్థా పట్టించుకోదు. పిల్లల్ని పెట్టుకొనే క్రెష్‌లు ఉండవు. ఉద్యోగమో లేక పిల్లల పెంపకమో ఏదో ఒకటి ఎన్నుకోక తప్పని స్థితికి స్త్రీలు లోను కావలసి వస్తోంది.

కొందరు స్త్రీలు ప్రసారమాధ్యమాలలో ఉన్నతస్థాయికి చేరినమాట వాస్తవమే. కాని వీరెందరో సహోద్యోగులైన పురుషుల కంటె ఎంతో వెనకబడి ఉంటారు. వీరికి మూసపోసినటువంటి పనులే అప్పజెపుతారు. ఆర్థిక, రాజకీయ, వైజ్ఞానిక, బౌద్ధిక విషయాల జోలికి వెళ్ళనివ్వరు. దానికి తగినట్లు వృత్తిపరంగా పదిమందితో కలిసి మాట్లాడటంగాని, పరిచయాలు చేసుకొనే అవకాశాలు గాని, సమాచారం పంచుకొనే విధానం గాని వీరికుండవు. వృత్తిపరంగా ఎదగాలంటే తగిన కౌశల్యం, నైపుణ్యం కావాలి. ఇవి పెంపొందించుకొనే అవకా శాలూ వీరికి దక్కవు.

ఇక స్త్రీలకు సంబంధించిన వార్తల ప్రచురణ విషయానికి వస్తే వారి పట్ల జరిగే అపరాధాలను కూడా సంచలనాత్మకంగా వ్రాస్తుంటారు. స్త్రీల అభివృద్ధికి సంబంధించిన విషయాలు, సమస్యలు ఎన్నో వుంటాయి. వాటి జోలికి పోనేపోరు. వీటి గురించి వివరంగా వ్రాయరు. మొక్కుబడిగా ఒక వార్త ప్రచురించి దాని పూర్వాపరాలు పట్టించుకోరు. ”ఒక భార్య, ఇద్దరు భర్తలు” అంటూ ఎన్నో వివరాలతో, ఇరుగుపొరుగుల వ్యాఖ్యలతో వార్తలు నింపేసి ఆ పరిస్థితులలో ఇరుక్కొన్న వ్యక్తులందరికీ జీవితం బాధామయం చేస్తారు. ఈ బాధలు పడలేక ఆ స్త్రీ జీవితం ముగించుకొన్నప్పుడు ఆ వార్త ప్రచురించేవారే ఉండరు. వార్తాపత్రికల కంటే టెలివిజన్‌ ఛానెల్స్‌ ఈ విషయంలో విజృంభిస్తుంటాయి.

టెలివిజన్‌ ఛానెల్స్‌ వచ్చిన తర్వాత ఈ మాధ్యమాల్లో స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వచ్చిన మాట నిజమే. కాని వారి భద్రత విషయం, వారి వేతనాల విషయంలో ఎన్నో లొసుగులున్నాయి. ఇక వార్తల విషయానికి వస్తే ఏ వార్తయినా ప్రచురించేముందు దానిలో ఉన్న సున్నిత విషయాలు గ్రహించాలి. ఎన్నో నేరాలు మానవుల హక్కులకు సంబంధించి నవి. వాటిని ఆ విధంగా చిత్రించవలసిన అవసరం ఉందికాని సంచలనాత్మకం చేసి ఒక పరిశోధక నవలగానో, శృంగారపరమైన కథగానో చిత్రించకూడదు. ప్రకటనలలో స్త్రీలను భోగ్యవస్తువులుగా చిత్రిస్తుంటారు. స్త్రీలెందుకు అటువంటి ప్రకటనల్లోకి వస్తారు అని అడుగుతారే గాని వారిని ఆ విధంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అన్నది పట్టించుకోరు. ఈ సమస్యల గురించి వినటానికి, న్యాయం చేకూర్చటానికి ఒక ప్రత్యేకమైన కౌన్సిలు అవసరమని చర్చలలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

సమాచారమంత్రి శ్రీ దాస్‌మున్షీ తమ మంత్రిత్వ శాఖలో స్త్రీలపట్ల వివక్ష లేదని, మాధ్యమాల్లో ఉన్నత పదవుల్లో స్త్రీలున్నారని చెప్పారు. ఈ సంవత్సరం 15 ఆగస్టు నుండి తమ మంత్రిత్వ శాఖలోని ప్రసార మాధ్యమాల్లో స్త్రీపురుషుల సంఖ్య సమానంగా ఉండేటట్లు విధానం వస్తోందని ప్రకటించారు.

ఇంతగా పత్రికా స్వాతంత్య్రాన్ని సమర్థించే వార్తాపత్రికలలో ఏమాత్రం స్వాతంత్య్రం ఉందని అడిగారు. టి.వి. ఛానెల్స్‌లో పనిచేస్తున్న స్త్రీలకు రక్షణ ఉందా? వారి వేతనాల విషయమేమిటి? స్త్రీపురుషులు సమానమనే భావాన్ని సమర్ధించే మాధ్యమాలు తమ స్త్రీ ఉద్యోగుల విషయమై ఎందుకు పట్టించుకోరు? తమని తాము చక్కదిద్దు కోకుండా ప్రపంచానికి ఏమి నీతులు చెపుతారు అనే ప్రశ్నలు లేవనెత్తారు.

నిజమే. ఈ ప్రశ్నలన్నీ సమంజస మైనవే. ప్రసారమాధ్యమాలు స్త్రీల పట్ల వివక్షను, ప్రతికూల భావాన్ని తొలగించటానికి ముందుకు రాకపోతే ఇంకెవరు చొరవ తీసుకొంటారు, అని మనం ప్రశ్నించుకోక తప్పదు. ప్రసారమాధ్యమాలకు శక్తి ఉంది, విద్య ఉంది, వివేకముంది, దూరదృష్టితో అభిప్రాయాలు వెలిబుచ్చే అనుభవముంది. స్త్రీపురుష సమానత్వాన్ని తీసుకురాగలిగిన శక్తి వీరికే ఉంది. వీరిలోనే అసమానత్వం ఉండటం విరోధాభాసమే అవుతుంది. తమకు తామే నిర్దేశించుకొన్న నైతికసూత్రాలకు కట్టుబడి ఉండటం ప్రసారమాధ్యమాల గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. వీరిపట్ల నమ్మకాన్ని పెంపొందిస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.