జీవవైవిధ్యం – ఆఖరి కుందేలు

 రమాదేవి చేలూరు
ప్రకృతిలోని సమస్త జీవరాసుల్ని, వృక్షసంపదని, కొండకోనల్ని నదీనదాల్ని రక్షిస్తేనే మనిషి మనుగడ సాగించాలనే హెచ్చరికే ‘జీవవైవిధ్యం’.

‘జీవవైవిధ్య సదస్సు’ మన రాష్ట్రంలో హైదరాబాదులో అక్టోబరు 2012లో జరిగింది. జీవవైవిధ్యం కోసం, సదస్సు, సంతకాలు, చట్టాలు అంతర్జాతీయ పరిధిలో జరుగుతాయి.

అసలు ఎందుకలాంటి సదస్సులు, హెచ్చరికలు అవసరమయ్యాయి? పరిస్థితి విషమించిందనే తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నామా? సమస్య పీకలదాకా వచ్చిందనే కఠిన, కర్కశసత్యాన్ని మనకు తెలియ చేస్తోంది సదస్సు.

అభివృద్ధిపేరిట  మనిషి ఎన్నో రకాల ఫ్యాక్టరీలు, తవ్వకాలు, అణువిద్యుత్తు, డ్యాములు, వాహనాలు, ఎన్నింటినో సృష్టించి  ఆకాశమే హద్దులా తన జ్ఞానం, కృషి, ధనం ధారపోస్తూ, మనిసే సమస్త భూమండలం  మీద అడుగిడి, ప్రకృతిని, జీవరాసుల్ని, సర్వనాశనం చేస్తూ పోతూ తుదకంటా తన నాశనాన్నే కోరి తెచ్చుకున్నాడు. ఇకనైనా మేల్కొని, ప్రకృతిని రక్షించాలనే నినాదమే మనకు ఆఖరుగా శరణ్యమైంది. దానిక్కారణం భూమి, నీరు, గాలి, అంతా కల్మషం, కల్మషం. మనల్ని ఏలే ఏలికలకు జీవవైవిధ్యం పట్టదు. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందనే సూత్రం మీద దృష్టి లేదుగానీ, నీవల్లనాకు నా వల్ల నీకు లాభం, కలిసి దోచే ‘క్రిర్‌ప్రోకో’ అనే చతురత మాత్రం తెలుసు.

కానీ, జీవవైవిధ్యం పట్ల, కవులకు, రచయితలకు అవగాహన లేకపోలేదు. ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలొచ్చి జనాన్ని జాగరణ చేసే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు.

ఈ మధ్యనే వచ్చిన ఒక కథా సంకలనం ”ఆఖరికుందేలు” ద్వారా కథా రచయిత ‘ఉదయ మిత్ర’గారు మనిషిని, ప్రకృతిని రక్షించుకుందాం, అంటూ చైతన్యంతో గొప్ప నినాదం చేశారు. కొన్ని కథల్లో ఎంతో ఆవేశం, ఆక్రోషం, వ్యంగ్యం, బాధ కలబోసిన స్పందన మనల్ని ఆలోచింపచేస్తుంది. జీవవైవిధ్యం నాశనం అయింది. భూమ్మీద ‘ఆఖరి మనిషి’  కూడా మిగలడు, ప్రభుత్వాలే మనల్ని నాశనం చేస్తున్నాయి.ఇక మనల్నెవరు రక్షిస్తారు? మనకిక దిక్కులేదు, నాశనం తప్ప కాబట్టి సెజ్‌ల్ని ఆపండి, వలసల్నిఆపండని హృదయాన్ని విస్తరించి, ఖగోళం మేర వెర్రికేకలు వేశాడు ఉదయమిత్ర.

జీవవైవిధ్యం పట్ల దృష్టి ఆన్చి, కధల్ని పండించిన గొప్ప రైతన్న ఉదయమిత్ర. ఆయనకి ధన్యవాదాలు. ‘ఆఖరికుందేలు’ సంకలనంలో, ఆఖరికుందేలు కథలో రచయిత ఇలా వాపోతారు.

చెట్లు చేమల్ని కొట్టి, అందంగా వున్న కొండల్ని, భూతాల్లాంటి మిషన్లు పెట్టి తవ్విపోసి, కంకర్ని లారీ కెత్తుతూ బతికున్న జంతువును తోడేెళ్ళు పీక్కుతింటున్నట్లుగా చేశారు. పచ్చదనం వలసబోయి నట్టుంది… అంతా భయానకంగా వుంది. యంత్ర లోహాలతో భూమిని  ఎక్కడబడితే అక్కడ రాక్షసరతి జేస్తున్నట్లుగా వుందని వాపోతారు రచయిత.

అంతేగాదు, గుడ్లపొడి ఫ్యాక్టరీలోంచి దుర్గంధం, కాలుష్యం వాగులోకి దిగి విషపూరితమైంది. ఆ నీరు తాగిన జీవాలు చచ్చిపోయాయి. కుందేలు ఫ్యాక్టరీ వాసన భరించలేక దూరంగా  పరిగెత్తింది. దాహం పాతప్పులోడిలాగ వెంటాడింది. విషపూరితమైన నీళ్ళు తాగితే ఇనుపకడ్డీని దానికడుపులోకి దూర్చి ఎవరో మెలిదిప్పినట్లయిందటారు రచయిత.

అంతేకాక భూమికి గత్తరజుట్టుకున్నట్లయ్యింది. చప్పుళ్ళు.. దుర్వాసన..వేడి తాగడానికి నీళ్ళు లేవు, విశ్రాంతి కింత చోటు లేదు కుందేలుకి.

ఇక రాబోవు కాలంలో ఆ కుందేలుకి పట్టిన గతే మనిషికి పడు తుందని రచయిత హెచ్చరించాడు. కలుషితమైన నీళ్ళు తాగిన కుందేలు శోషొచ్చి పడిపోతుంది. ఆ కుందేల్ని తిన్న మనిషి ఆసుపత్రి పాలవుతాడు ఇది కథ.

మనుషులవల్ల జీవాలకు దిక్కులేదు. పెద్దమనుషులవల్ల మనుషు లకు దిక్కులేదు. మనుషులూ-పెద్దమనుషులు పన్నిన చక్రబంధంలో అంతా ఇరుక్కున్నట్టుగా వుందని వాపోతారు ఉదయమిత్ర.

”గుప్పిటమట్టి” అనే మరో కథలో పోలేపల్లి సెజ్‌కోసం తన పొలం పోగోట్టుకున్న నర్సింహులు అనే రైతు దు:ఖిస్తూ, పొగిలి పొగిలి ఏడుస్తూ, సెజ్‌ పూర్వాపరాల్ని తలపోస్తూ, నష్టాల్ని కష్టాల్ని, శూన్యమైన భవితని, జీవనాన్ని, కుటుంబాన్ని, ఎద్దుల్ని తలపోస్తూ ఆ రాత్రి పొలంలో నిద్రపోయి, నిద్రలోనే అమరత్వం పొందడం ఈ కథ సారాంశం.

”వొచ్చే పొయ్యే బాటల్లా

వొల్లాపురావు పల్లెలా

వొక్కసారి వొచ్చీపోయె

వో తెలుగోల్ల బాలమ్మ” అంటూ నర్శింహులు పాడుతుంటే ప్రకృతి పరవశించేది ఒకానొకప్పుడు. అదెప్పుడంటే..సెజ్‌ భూతం వాళ్ళ వూర్లోకడుగిడక మునుపు. సెజ్‌ తమ వూర్లోకి జొరబడి వాళ్ళని నిట్టనిలువునా నాశనం చేశాక చీలిన వేణువులా అవుతాడు నర్శింహులు. ఈ కథ చదివితే ”ది లాస్ట్‌ ఛైల్డ్‌” కథ గుర్తొస్తుంది.
పొలాల్ని పోగొట్టుకుని రైతులు హోటల్లల్లో చిప్పలు కడుగుతున్నారు. ఫ్యాక్టరీల్లో పనికి కుదురుతున్నారు. వలసలు పోతున్నారు. ఎటూ వెళ్ళలేక, ఊళ్ళో వుండలేక మనుష్యులు  చస్తూ బతుకుతున్నారు. ఊర్లర్లో గౌరవంగా బతికినోళ్ళు హోటళ్ళకాడ, డాబాలకాడ అడుక్కుంటున్నరని, ‘సెజ్‌’ల పేరుమీద ప్రభుత్వం రైతుల మీద యుద్ధం ప్రకటించిందని రచయిత బాధపడతారు. ఈ కథలో నర్శింహులు తన పొలంతో తనే సంభాషించాడు. తన ఆత్మతో తానే సంభాషించాడు. పువ్వుల్ని, తీగల్ని తాకి తన బాధని వాటిలోకి పంపి, వాటిలోని తీయదనాన్ని తనలోకి తీసుకున్నట్టుగా వుంది. నర్శింహులు ఆకాశం కేసి చూశాడు. చుక్కలు చూట్టానికి దగ్గరగా కన్పిస్తున్నా, అవి చాలా దూరంలో వున్నాయి. తనకిప్పుడు తన పొలమూ అట్లాగే కనిపించసాగింది. తన స్వంత పొలం తనకెంతో దూరంగా, తనకు కాకుండా పోయింది. ఈ భూమి, ఈ చెట్లూ, ఈ గట్లూ, ఈ గొడ్డు గోదా ఇక తనవి కావు. ఇంకా కొద్ది   రోజుల్లో ఫ్యాక్టరీ వాళ్ళొచ్చేస్తారు. పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లు, మిషన్లు, బుల్డొజర్లు దెచ్చి, తన పొలాన్ని ధ్వంసం చేస్తారు. తాను ఎంతో కష్టపడి పెంచిన చెట్లని, తోటను, గట్లని దున్ని పడేస్తారు, నేల మట్టం జేస్తారు.  కోకిల పాటలు వినిపించే చోట కొయ్యగుర్రాల డెక్కల చప్పుళ్ళు వినిపిస్తాయి. క్రమంగా ఫ్యాక్టరీ తన ఇనుప కోరల్ని విస్తరిస్తోంది. ఫ్యాక్టరీ బునాదుల్లో తమ బతుకు సమాధి కాబోతోంది. ఇలా నర్శింహులు బాధపడతాడు.
అసలు ఎవరన్నా అన్నేయం జేస్తే సర్కారు నడుగుతాం. మరి సర్కారు అన్నేయం జేస్తే ఎవరికి జెప్పుకోవాలె? నిలదీసిన రైతుల్ని చేరదీసిన్రు గట్టిగ నిలదీస్తే ..ప్రభుత్వం గట్టిదెబ్బేగొట్టిన్రు, అచ్చం ‘తెల్లోని పద్ధతులే’ అని రైతు తలచుకుంటూ, కుములుతాడు.
”పుడితే బారసాలకు దిక్కులేదు
చస్తే బొందకు తావులేదు
చావు పుట్టుకలనడుమ
బతుకిక్కడ అర్థమే లేదు.”
అంటూ ఆ రైతు మసిలి మసిలి నిద్రపోయి, దీర్ఘంగా నిద్రపోతాడు.
ఉదయమిత్ర రాసిన మరో కథ ”ఇనప్పురుగు”. ఈ కథలో పాముని వెంటపడి ఒక స్త్రీ చంపేస్తుంది. పాము విషప్పురుగు. కరిస్తే చస్తాం. అది నిజమే. అదెప్పుడు? తెలిసో, తెలికో మనం వెడితే తప్పా, ఉత్తి పుణ్యానికి అది మన జోలికి రానే రాదు. ఈ ముక్క జనానికి అర్థం కాదు. ఎంతజెప్పినా మా బాగా చెప్పావ్‌ లే అని ఎదురు మాట్లాడుతారు. పాము జనావాసాల్లో కన్పిస్తే, దాన్ని దూరంగా తరిమెయ్యాలిగానీ, చంపి పడేయ్యరాదని జీవవైవిధ్యం చెబుతుంది.
ప్రకృతిలో అదీ ఒక భాగం, మనతో పాటు అది కూడా వుండాలనే ఒక నిశ్శబ్ద సందేశం రచయిత మనకు తెలియ చెబుతూనే, విషప్పురుగులాంటి మనుషుల్ని భరిస్తూ, జీవిస్తున్నాం, పాముల్ని చూసి భయపడని వాళ్ళు కూడా భర్తని చూసి భయపడతున్నారని, జీవితంలో ‘అడ్జెస్ట్‌మెంట్‌’ అనే ధోరణికి బాగా అలవాటు పడ్డారని, చావలేక, ఎదురించలేక చస్తూ బతుకుతున్న స్త్రీలోకాన్ని చూసి రచయిత బాధపడటం ఈ కథలో కన్పిస్తుంది.
పాములు, కప్పల్పి, ఎలుకల్ని, పురుగుల్ని, క్రిముల్ని తిని పంటల్ని రక్షిస్తున్నాయని, పాము జాతి అంతరిస్తే పంటల రక్షణ కరువవుతుంది. జీవసమతౌల్యం, ప్రకృతి సమతౌల్యం  జరగాలంటే ఏ జీవరాశి  మనం పూర్తిగా ధ్వంసం చేయగూడదని రచయిత చెబుతున్నారు. ఈ కథలో నాగమణి ఝూన్సీలక్ష్మిబాయిలాంటి ధైర్యసాహసాలగల స్త్రీ. ఆమె పామువెంట పడి చంపుతుంది. ఆమెకి భర్తంటే భయం. ఆయన ద్వేషాన్ని ఎదిరించక, సర్దుకొని కాపురం చేస్తుంటుంది.
ఆదివాసీ స్త్రీలు కూడా అడవుల్లో క్రూరమృగాలతో ధైర్యంగా పోరాడి, ఇంటికొచ్చి భర్తతో తన్నులు తింటుంటారని  రచయిత మనకు చెప్పారు.
”పులులు సింహాలను గెల్చినా
మానవ మృగముల గెల్వక
ఓడిపోయినం – బాంచెలం” అంటూ ఎప్పటిపాటనో గుర్తుకు తెచ్చుకుంటూ కథని ముగిస్తారు రచయిత.
‘కాదేదీ పోరు కనర్హం’ కథలో కూడా ఎంతో జీవవైవిధ్యం కన్పిస్తుంది. పందులవల్ల మెదడు వాపు వ్యాధి వస్తుందని, వాటిని నిర్ములించాలని ప్రభుత్వం తలపోసినప్పుడు, వాటిని తీసుకొని ఊరేగింపు చేస్తారు. మేమేం పాపం జేశాం” అనే నినాదాలున్న అట్టముక్కల్ని పందుల మెడలకి వేలాడి దీసి సాగిన ఊరేగింపు తీరే ఈ కథ.
చాలా పల్లెల్లో మరుగుదొడ్లు వుండవు. ఆరుబయటే మలవిసర్జన జరుగుతుంది. ఎంతటి దుర్గంధం, కాలుష్యం, ఈగలు ఎంతో గందరగోళం. పందులవల్ల ‘మలం’ శుభ్రమవుతావుంది. మరుగుదొడ్లకి గతిలేనిచోట ఈ పందులే మనకి గతి.
పందిని కరిచిన దోమ, మనిషిని కరిస్తే వచ్చేది మెదపువాపు వ్యాధి. పందుల్ని పూర్తిగా సంహరించక, వాటి నివాసాల్ని, మన ఆవాసాలకి దూరంగా వుంచితే మంచిదనేది జీవవైవిధ్యం కదా? ఉదయమిత్ర ఆర్తిగా, ఆక్రోషంగా, వ్యంగ్యంగా రాసిన కధల్లో ప్రకృతిని, మనిషిని, ధ్వంసం చెయ్యకండని మొరపెట్టుకోవడం మనకు కన్పడుతుంది.
సెజ్‌లవల్ల బికారులైన రైతులు వలసలుబోతే మనిషికి జీవనం, గౌరవం, బతుకులో కళ పోతుందని సొంతూరిలో ఇంటి ముందు కూర్చొని గంజి తాగినా తృప్తేనని, వలసల్ని ఆపి మనిషిని కాపాడాలని రచయిత కోరుకుంటున్నారు. ఆయన్ని ఎన్నో వందల సార్లు అభినందించితీరాలి.
”పక్షులీకల్ని పీకి కుషన్‌ చేసి, ఆ సోఫాల్లో కూర్చుని, 193 దేశాల జీవ విధ్వంసకారులు జీవవైవిధ్యం గూర్చి సదస్సు చేయటం హాస్యాస్పదం” అని మహాశ్వేతాదేవి వాపోయారు. అందుక్కారణం  కేవలం  సదస్సులకే పరమితం, ఆచరణ శూన్యమని ఆమె బాధపడుతున్నారు. జీవ వైవిధ్యం సూత్రాన్ని మనమందరం తెలుసుకొని, అత్యవసరంగా ఆచరిద్దాం, ఆచరింపచేద్దాం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.