ఆడదాన్ని నేను… ఆదిశక్తినీ నేనే

– దొమ్మాటి జ్యోతి

మన దేశం హిందూమత సంస్కృతి సంప్రదాయాలకు నిలయం, ఇలాంటి సంస్కృతిలో జీవిస్తున్న మనం లక్ష్మీ, సరస్వతి, పార్వతి, సమ్మక్క, సారక్క… మొదలగు స్త్రీ దేవతామూర్తులను పూజిస్తున్నాం. స్త్రీ దేవతా మూర్తులను నిత్యం పూజిస్తున్న నేటి సభ్య సమాజంలో స్త్రీ వివక్షకు గురౌతూనే ఉంది. స్త్రీని వివక్ష భావనల్తో చూస్తున్న సమాజ విధానం మారాలి. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలపైన వివక్ష ఎందుకు అని పరిశీలిస్తే ముఖ్యంగా కరువు ఉండే ప్రాంతాలలో తీనడానికి తిండి, కట్టు కోవడానికి బట్టలు ఉండవు. పనులు చేసి సంపాయించుకుందామన్నా చేసే పనులు ఉండవు. చాలీ చాలనీ కుటుంబ విధానం, కలిమీ లేములతో సాగుతున్న కుటుంబంలో ఆడబిడ్డ జన్మిస్తే తలకు మించిన భారంగా తల్లిదండ్రులు భావిస్తారు. ఎందుచేతంటే వారి వివాహానికి సంబంధించిన వరకట్నాన్ని సంపాదించాలి. బయట పరిస్థితి చూస్తే మింగ మెతుకు, నిలబడడానికి చోటు లేని మగాడు సైతం లక్షల్లో వరకట్నం అడుగు తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండి గింజలే సంపాదించ లేని స్థితిలో అదనపు సొమ్మును కూడ బెట్టలేమనే బాధతో ”ఛీ ఆడపిల్ల పుట్టిందని” చిత్కారాలు వెలిబుచ్చుతున్నారు. ఇక ఒక్క కుటుంబం లోనే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఆడ పిల్లలు పుడితే ఇంకేముంది, పురిట్లోనే గొంతు నులిమి లేదా నోట్లో వడ్ల గింజలు పోసి ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రలూ లేకపోలేదు. ప్రతీకాన్పులో ఆడ పిల్లల్ని కంటున్న తల్లుల బాధలు వర్ణనాతీతం. ఇలాంటి తల్లులు రెండు రకాలుగా బాధలు పడుతున్నారు. ఒకటి ఆడపిల్ల పుట్టిందని, రెండవది ఆడపిల్లను కన్నందుకు అత్తా మామ, భర్త మిగతా కుటించచికులు పెట్టే మానసిక హింసను కూడా భరించాల్సి వస్తున్నది. మగాడి వీర్యకణాల్లోని ఎక్స్‌-క్రోమోజోమ్‌ ఆధిపత్యం వల్ల ఆడపిల్ల పుట్టిందని, అలా పుడుతుందని ఎందరికి తెలుసు, తప్పంతా ఆడదాని మీదనే వేస్తున్న సమాజ దృష్టికోణం మారాలి. ఆడదాని ఆవశ్యకతని గుర్తిస్తూ అభివృద్ధి వైపుకు ముందడుగులు వేయాలి. ఆడది అనే పదానికి అందమైన నిర్వచనం చెప్తూ ఆరుద్ర

”ఎపుడో పరిణయమైన

ఈడా వుండదు కాన

ఆడ దనబడె చాన”

అని ‘కూనలమ్మ పదాల్లో’ ఆడపిల్లకు వివాహం అయిన తర్వాత తల్లిగారింటిని వదిలి అత్తగారింట్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆడది అని ప్రస్తావించారు. ”ఆడది అంటే తెలంగాణాలో ఇక్కడిది కాదు అనే ఒక అర్ధం ఉన్నది. ఆడపిల్ల అంటే అక్కడున్న పిల్ల” (ఓపెన్‌ హార్టు విత్‌ – ఆర్‌.కె – సుద్దాల అశోక్‌ తేజ) అంటూ అశోక్‌ తేజ అభిప్రాయాన్ని తెలిపారు.

”ఆడది ఆడదై ఒకరింట కోడలై

ఓర్పుగా, నేర్పుగా పతిసేవ చేయగా

పిల్లగా పుట్టి కన్నెగా పెరిగి

తల్లిగా మారే ఒకరింటి దీపమై”

అని తెలుపుతూ గురజాడ అప్పారావు ఆడదాని ప్రాముఖ్యతని అభివ్యక్తం చేశారు. పూర్ణ కవుల ప్రభావాన్ని కనబరుస్తూసుద్దాల అశోక్‌ తేజ

”ఆడిదాన్నిరో! నేను

ఆడదాన్నిరో!

ఈడ ఎవరికి కాని దాన్ని

యాడి దాన్నిరో ! నేను”

అంటూ సమాజంలో ఆడ పిల్లల్ని తక్కువగా చూస్తున్న విధానాన్ని ఎత్తి చూపారు. స్త్రీ వాద కవయిత్రి డా|| వాసా ప్రభావతి ఆడ పిల్లల గొప్పతనం, విలువను వర్ణిస్తూ ఆడపిల్లలు పుడితే బాధపడే పరిస్థితులకు భిన్నంగా

”అసలు ఆడపిల్ల అంటే ఎవరని?

తల్లకి మరో ప్రాణం

తండ్రికి ఆరోప్రాణం

ఇంటి పనిలో వంట పనిలో

చేయి వేసి సాయం చేసేది ఆడపిల్ల

కాలు చేయి ఆడని నాడు

కలిపి అన్నం పెట్టేది ఆడపిల్ల

చివరికి మరణించిన నాడు

మీదపడి ఏడ్చేది ఆడపిల్ల”

అని అంటూ ఆడపిల్లల్ని తక్కువగా చూసే సమాజానికి కనువిప్పు కలిగేలా ప్రయత్నించారు. మరొక స్త్రీవాద కవయిత్రి అబ్బూరి ఛాయాదేవి రాసిన ‘విన్నావా’? కవితలో ఆడపిల్లని తక్కువగా చూస్తున్న తండ్రిని, తల్లిని, స్నేహితుల్ని, సమాజాన్ని కవిత్వీకరించారు. తల్లి, కూతుర్ని భారంగా భావిస్తున్న విధానం, కూతురి మాటల్లోనే

”అమ్మ అంటుంది

ఆడ పిల్లవి

పెళ్ళి కావలసిన అబలవి

గుండెలో గుబులువి”

అంటూ తెలిపారు. ఈ గుండెలో గుబులు ఆడపిల్లల్ని కన్న తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే కలుగుతుంది. పురుడు పోసిన మంత్రసాని సైతం పురుటికట్నం ఎక్కువియ్యరని చీదరించుకునే వాస్తవ చిత్రణల్ని

”పాడుగాను మల్లాయిపుడు

ఆడిపోరి పుట్టిందని

పొత్తిళ్ళలో నన్ను చూసి

మొత్తుకున్నదట తల్లి

పైక మెక్కు వియ్యరని

తిట్టిందట మంత్రసాని”

(బతుకుపాటలు. పుట 28)

అంటూ సుద్దాల అశోక్‌ తేజ రచన గావించారు. ఆడ పిల్లలకు ఎదైనా రోగం వస్తే దావఖానాకు తీసుకపోకుండా అది సత్తేంది, బతుకుతేంది అని నీచంగా దూషించిన సంఘటనలు లేకపోలేదు. ఆడ పిల్లలకు వచ్చిన రోగం దానికై అది తగ్గితే సరేసరి లేకుంటే ప్రాణాలు పోయినా బాధపడేవారు, చెమ్మగిల్లె కళ్ళున్న వారు లేరంటే ఆడపిల్లల పైనున్న వివక్షతను గ్రహించవచ్చు. ఈ విషయాన్ని గూర్చి అశోక్‌ తేజ వర్ణిస్తూ.

”ఆటలవ్వ జెరంతోని

అగ్గిలెక్క నేనయితిని

బయపడి మాయవ్వన్నది

దవాఖానకు పోదామని

బతికితేంది? సత్తేంది

వద్దన్నాడు మా నాయిన”

ఇలా ఎల్లప్పుడు ఆడ వారిగా ముసలి తనం పొంది మరణించే వరకు వివక్షాయుత మైన జీవితానుభూతులు పొందుతూనే ఉన్నారు. అదే మగ పిల్లాడు పుడితే వరకట్నం తల్లిదండ్రులకే వస్తుంది. పిల్లాడు వారితోనే ఉంటాడు. కాబట్టి ఆప్యాయంగా పెంచు తారు. అశోక్‌ తేజ ఇలాంటి సందర్భాన్ని చిత్రణ గావిస్తూ తల్లిదండ్రుల అంతర్ముఖాన్ని ప్రత్యక్షం చేసారు.

”తమ్ములకే సిలుకులంగి

తమ్మునికే సదుల బడి

ఏందే ఈ ఒరపాటు

ఎందని అవ్వను అడిగితే

తమ్ముడేడీ? నువ్వేడ

తగదు ఆడ పిల్లకన్నది”

అంటూ సమాజంలో ఆడపిల్లల స్థానాన్ని తెలిపారు. ఆడపిల్లలకి పెళ్ళి చేయాల్సి వస్తే కట్నం తక్కువగా తీసుకొనే చెడిపోయిన తాగుబోతు, స్త్రీ వ్యామోహం ఉన్న వ్యభిచారులకు పనికి మాలిన వారికి కట్ట బెట్టడం చూస్తే వారిపై నున్న వివక్ష స్థాయి అర్థమవుతున్నది. స్త్రీ యొక్క దైనందిన జీవితంలో అడుగడుగునా తక్కువగా చూడ బడుతున్న విధానాలను రచయిత్రి రజియా బేగం

”బాల్యంలో

చిన్న పిల్లవి నీకేం తెల్సు కూర్చో అన్నారు.

యవ్వనంలో

ఉడుకు రక్తం మంచీ చెడు తెలీదు కూర్చో అన్నారు.

వృద్ధప్యంలో

ముసల్దానివి ఇంకెం చేస్తావ్‌ కూర్చో” అన్నారు.

అంటూ వాస్తవ పరిస్థితులను చిత్రణ చేశారు. ఈ రచన స్త్రీకి సమాజం ఇస్తున్న విలువకి నిదర్శనము. ఇన్ని రకాలుగా తక్కువగా చూడబుతున్న స్త్రీల పరిస్థితి ఇప్పుడు మార్పు గమనంలో ఉందంటూ శీల సుభద్రాదేవి

”మా గుండెలు మూగవే

కానీ యిప్పుడు కాదు

ఎన్నో ఏళ్ళుగా నిద్రించిన

మా వ్యక్తిత్వం తుళ్ళిపడి లేచింది

ఆవులించి జూలు విదిల్చింది”

(ఆకలి నృత్యం)

అంటూ మాకు ఒక వ్యక్తిత్వం ఉందని, మనసు ఉందని,పితృస్వామ్య వ్యవస్థ నాటి స్త్రీలము కాదని, ఈ నాటి మమ్ములను తక్కువగా చూడడానికి వీలు లేదని తెలిపింది. ఈనాటి స్త్రీలలో ఇంత మంట పుట్టడానికి ఎన్ని రకాల హింసలకు లోనై ఉన్నారో ఇట్లే అర్ధమవుతున్నది. తరతరాల నుంచి పురుషుడు స్త్రీకి చేస్తున్నది అన్యాయమే! ఆమె ఆత్మ గౌరవాన్ని చంపాడు. స్త్రీ దాన్ని మల్లా సంపాదించుకోవాలి, తన ఇష్టం వచ్చినట్లు, తనకి తోచిన మార్గాన ఆమె తిరిగి తన గౌరవాన్ని పొందాలి. అందుకు ముఖ్య సాధనం ఎదురింపు. అన్నింటికి, గ్రహానికి, భర్తకి, పెద్దలకి, పురాతన ధర్మాలకి, బూజుపట్టిన నీతులకీ, తన అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రతీ సంస్థకి తిరగబడి, నలిగి, తనజీవితం అర్పిస్తేనే గాని పోయిన తన ఆత్మని తను తిరిగి పొందలేదు. ఈ భయంలో, సిగ్గులో, బద్దకంలో, బానిసత్వం లోంచి మేల్కొని, తన నిజమైన హక్కులని, స్వతంత్య్రాన్ని ధిక్కరించి లాక్కోవాలి. అప్పుడే తన ఆత్మని ధన్యం చేసుకుంటుంది. తక్కిన ప్రపంచాన్ని ఉద్దరిస్తు ంది” (స్త్రీ – చలం) అంటూ చలం పలికారు. చలం మాటల్లోని మంటను గ్రహించిన సుద్దాల అశోక్‌ తేజ స్త్రీని ఉన్నత శిఖరాల్లోకి తీసుకరావడానికి వివిధ సందర్భాల్లో ఆత్మస్థైర్యాన్ని అందిస్తూనే ఉన్నారు. అవే ఆలోచనల్తో..

”ఆడదాని గుండెలలో

ఆదిశక్తి వున్నదని

ఆడ బతుకు కాదని మీ

రీడ బతుక నేర్చుకోండ్రి”

అంటూ స్త్రీ ఔన్నత్యాన్ని ఆది శక్తితో పోల్చుతూ కీర్తించారు. స్త్రీని తక్కువగా చూస్తున్న సమాజానికి ఆమె యొక్క ఆవశ్యకతను తెలిపారు. స్త్రీని శృంగార సాధనంగా చూస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తూ లైంగిక దాడులకు పాల్పడి స్త్రీ అస్తిత్వానికి భంగంకలిగిస్తున్న పురుషాధిక్య సమాజ విధానం మారకపోతే మానవజాతి మనుగడకే ప్రమాదం వాటిల్లి అంతరించే ప్రమాదం పొంచి ఉంది. రామాయణంలో సీతను ఎత్తుకెళ్ళిన రావణుడు అంతమొం దించబడ్డాడు. ద్రౌపదీ వస్త్రాపహరణతో నిండు సభలో అపమాస్యం చేసిన కౌరవుల వంశం నాశనమయ్యింది. దుర్గాదేవిని పరాభవించిన నరకాసురుని రాజ్యం కూలిపోయింది. ఆడదాన్ని ముట్టుకుంటే అహుతైపోయి ఆ తర్వాత ఏడు తరాల వరకు ఆ పాపం చుట్టుకొని ఉంటుందని పురుష లోకం గ్రహించాలి. అందుకే ఆది శక్తి స్వరూ పులైన మాతృమూర్తుల గౌరవాన్ని పెంపొందించేటట్లు చేస్తూ కన్నీళ్ళు లేని స్త్రీలోకాన్ని నిర్మించడానికి ప్రతీ ఒక్కరం కృషి చేద్దాం. ముందడుగు వేద్దాం. ఆడ పిల్లలకు ఆత్మ స్థైర్యాన్నిస్తూ అభివృద్ధిలోకి నడిపిద్దాం….

 

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.