ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్

ఆంధ్రప్రదేశ్ 2001 జనాభా లెక్కల ప్రకారం 76.2 మిలియన్‌ల జనాభాతో భారతదేశంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా వుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎక్కువగా వున్న ఆరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మిగతా ఐదు రాష్ట్రాలు: మణిపూర్, నాగాలాండ్‌లతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు.

2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభాలో 27.3 శాతం మంది పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఏడేళ్ళు, అంతకు మించిన వయసున్నవారిలో 60.5 శాతం మంది అక్షరాస్యులు.

భారతదేశంలో హెచ్ఐవి/ ఎయిడ్స్ ఉన్నట్లు అంచనా వేయబడిన వారి సంఖ్య 5.1 మిలియన్లు. కాగా అందులో 10 శాతం మంది ఆంద్రప్రదేశ్ లో ఉన్నారు.

రాష్ట్రంలో హెచ్.ఐ.వి.ఇన్ఫెక్షన్ స్థాయికి సంబంధించిన గణాంక వివరాలు ప్రధానంగా వార్షిక సెంటినల్ సైట్ సర్వేలెన్స్ ప్రోగ్రాం (నిర్దిష్ట ప్రాంతాలలో నిఘా కార్యక్రమం) ద్వారా లభిస్తున్నాయి. వ్యాధి వ్యాప్తిపై ప్రభావం చూపుతున్న అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో రాష్ట్రం తరచుగా నిర్వహిస్తున్న హెచ్.ఐ.వి రిస్క్ బిహేవియర్ సర్వేలెన్స్ సర్వేస్ (హెచ్.ఐ.వి. ప్రమాదం వుండే ప్రవర్తనలపై నిఘా పరిశీలనలు బి.ఎస్.ఎస్) ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యాధి నివారణా కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కూడా అవి ఉపయోగపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో హెచ్.ఐ.వి. ఎయిడ్స్ వ్యాప్తి ఎలా వుంది?
భారతదేశంలో మరణాలకు, తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదించడం అనేది లోపించినందువల్ల నిర్దిష్ట ప్రాంతాలలో నిఘా కార్యక్రమం ద్వారా దేశంలోని హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం ప్రతి సంవత్సరం నిర్ధిష్ట ప్రాంతాలలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (నాకో) నిర్దేశించిన పద్ధతులను పాటిస్తూ కొన్ని నిర్ణీత కేంద్రాలలో నిఘా కార్యక్రమం క్రింద హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ పరీక్షలు నిర్వహిస్తున్నది.

హెచ్.ఐ.వి. సోకే ప్రమాదం ఎక్కువగా వున్న వ్యక్తులను అంటే లైంగిక వ్యాధుల నివారణా కేంద్రాలలో చికిత్స పొందుతున్న రోగులు, సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు మొదలైన వారిని పరీక్షించడం జరుగుతోంది. ప్రసూతి పూర్వ చికిత్సా కేంద్రాలకు వచ్చే మహిళలను తక్కువ ప్రమాదం వున్నవారిగా పరిగణించడం జరుగుతోంది. ప్రసూతి పూర్వ చికిత్సా కేంద్రాలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు సమాజంలో మిగతా జనాభాకు లాగే లైంగికంగా హెచ్.ఐ.వి. వ్యాపించే ప్రమాదం వుంటుందని భావించబడుతోంది. 2005 సంవత్సరంలో మొత్తం 23 జిల్లాలలో ఈ నిఘా కేంద్రాలు 65 వరకు వున్నాయి.

ఎక్కువ ప్రమాదకర స్థితిలో వుండే ఒక సమూహంలో 5 లేదా అంతకంటే ఎక్కువ శాతం మందికి (ఉదాహరణకి లైంగిక వ్యాధిగ్రస్తులు) హెచ్.ఐ.వి పరీక్షలో పాజిటివ్ అని తేలితే ఆ రాష్ట్రాన్ని హెచ్.ఐ.వి తీవ్రత మధ్యస్థంగా వున్న రాష్ట్రంగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా లైంగిక వ్యాధిగ్రస్తులలో 5 శాతం కంటే ఎక్కువ మందికి హెచ్.ఐ.వి సోకినట్లుగా తెలుస్తోంది. కాగా గత 5 సంవత్సరాలుగా నిఘా కేంద్రాల సమాచారం ప్రకారం ఈ సమూహంలో వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.

తక్కువ ప్రమాదకర స్థితిలో వుండే సమూహంలో అంటే ప్రసూతి పూర్వ చికిత్సా కేంద్రాలకు హాజరవుతున్న మహిళలలో ఒకశాతం లేదా అంతకంటే ఎక్కువశాతం మందికి హెచ్.ఐ.వి. ఉన్నట్టు పరీక్షలలో తేలితే, ఆ రాష్ట్రాన్ని హెచ్.ఐ.వి తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా పరిగణిస్తారు. గర్భిణీ స్త్రీలలో అత్యధికులు ప్రమాదకర లైంగిక ప్రవర్తనకు దూరంగా వుంటారు అని భావించి, వారిలో హెచ్.ఐ.వి. వ్యాధి కనిపించిందంటే అక్కడ సాధారణ జనాభాలో కూడా హెచ్.ఐ.వి వ్యాపించినట్టే. అయితే గత ఏడు సంవత్సరాలుగా వీరిలో హెచ్.ఐ.వి. వ్యాప్తి రేటు ఒకశాతం కంటే ఎక్కువగా నమోదవుతూ వున్నట్టు నిఘా కేంద్రాల సమాచారం తెలియజేస్తుంది.

రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలకుగాను 19 జిల్లాలలో గర్భిణీ స్త్రీలలో ఒకశాతం లేదా అంతకంటే ఎక్కువశాతం మందిలో హెచ్.ఐ.వి. వుంది. సాధారణ జనాభా కూడా ఇప్పుడు హెచ్.ఐ.వి. బారిన పడుతున్న విషయాన్ని ఇది సూచిస్తోంది. ఎక్కువ ప్రమాదకర స్థితిలోని వ్యక్తులనుంచి తక్కువ ప్రమాదకర స్థితిలోని వ్యక్తులకు హెచ్.ఐ.వి విస్తరిస్తున్న రీత్యా ఈ కొత్త ప్రమాదం గురించి ప్రజానీకానికి నిరంతరం విస్తృతంగా సమాచారాన్ని అందిస్తూ అవగాహన కల్పించాల్సిన అవసరం వుంది. ఈ నివేదిక కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల గణాంకాలను వినియోగించి జిల్లాలవారిగా వ్యాధి వ్యాప్తిని అంచనా వేయడం జరిగింది.

స్వచ్ఛంద కౌన్సిలింగ్, పరీక్షా కేంద్రాలలో నిర్వహించే పరీక్షలలో హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలుతున్న వ్యక్తుల సంఖ్య కూడా మన రాష్ట్రంలో హెచ్.ఐ.వి స్థాయిని సూచిస్తోంది. ఏప్రిల్ 2004 నుండి మార్చి 2005 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షించబడినవారిలో 15.5 శాతం మందికి హెచ్.ఐ.వి. ఉన్నట్టు తేలింది. అయితే ఇది విభిన్నరీతులలో మహబూబ్‌నగర్‌లో 5.6 శాతం నుంచి మొదలుకొని గుంటూరులో 26.6 శాతం వరకు వుంది. ఈ పన్నెండు నెలల కాలంలో 228,183 మందిని కౌన్సిలింగ్ చేసి పరీక్షించగా అందులో 35,408 మందికి హెచ్.ఐ.వి. ఉన్నట్టు తేలింది.

పుట్టబోయే బిడ్డకు గర్భంలో వుండగానే లేదా పుట్టాక తల్లిపాలు తాగే సమయంలో హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వున్నందున ఈ వ్యాధి నిర్ధారణకు తల్లుల్ని పరీక్షించడం అత్యవసరం. సరైన చికిత్స తీసుకుంటే బిడ్డలకు వ్యాధిసోకే అవకాశం తగ్గుతుంది. ఏప్రిల్ 2004 నుంచి మార్చి 2005 వరకు తల్లిదండ్రులనుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించకుండా నిరోధించే కేంద్రాలలో (పిపిటిసిటిలు) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలలో తూర్పుగోదావరిలో 4.5 శాతం మొదలుకొని మెదక్‌లో 0.4 శాతం వరకు వుంది. ఈ పన్నెండు నెలల కాలంలో 215,339 మంది మహిళలని పరీక్షిస్తే 4,060 మంది మహిళలకు హెచ్.ఐ.వి. ఉన్నట్టు తెలిసింది.

హెచ్.ఐ.వి. వ్యాపింపజేసే సమూహాలకు (బ్రిడ్జి పాపులేషన్) భర్తలు ఒక ఉదాహరణ. అతి ప్రమాదకర లైంగిక చర్యలకు పాల్పడే భర్తలు హెచ్.ఐ.వి.ని తమ భార్యలకు వ్యాపింపచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవిధంగా డ్రైవర్‌ల భార్యలు ఎక్కువగా హెచ్.ఐ.వి. బారిన పడుతున్నారు. డ్రైవర్లు ఎక్కువకాలం పాటు తమ ఇళ్ళకు దూరంగా వుండవలసి వస్తుంటుంది. అందువల్ల ఆటో, టాక్సీ డ్రైవర్లు తరచుగా ఇందుకు గురవుతుంటారు. ఇదేవిధంగా వ్యవసాయ కూలీల భార్యలు గణనీయంగా హెచ్.ఐ.వి. బారిన పడడాన్ని బట్టి ఈ వ్యాధి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించినట్టు స్పష్టమవుతుంది.

అంతగా చదువుకోని మహిళలకు హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశముందన్న వాస్తవం హెచ్.ఐ.వి. సమాచార, చైతన్య కార్యక్రమాలకు అదనపు సవాలుగా మారింది. ప్రసూతి పూర్వ సంరక్షణా కేంద్రాలలో 2004వ సంవత్సరంలో నిరక్షరాస్యులైన మహిళలలో 2.2 శాతంతో అత్యధిక హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్‌ల రేటు నమోదైంది. ఈ రేటు మహిళల చదువు స్థాయి పెరుగుతున్నకొద్దీ తగ్గుతూపోయింది. పట్టభద్రులైన మహిళలలో ఈ రేటు 1.4 శాతంగా వుంది. ఏది ఏమైనా అన్ని విద్యార్హత స్థాయిలను కలిపి ఈ రేటు ఒకటి కంటే ఎక్కువ శాతంగా వుండడం వలన, రాష్ట్రంలో హెచ్.ఐ.వి. తీవ్రస్థాయి ఉన్నట్టు పరిగణించబడుతుంది.

అతి ప్రమాదకర ప్రవర్తన, వ్యాపింపజేసే సమూహాల గుర్తింపు

కొన్ని గ్రూపులకు చెందిన వ్యక్తులకు ఇతర్లకంటే హెచ్ఐవి సోకే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. వ్యభిచార వృత్తిలో ఉన్నవారు (సి.ఎస్.డబ్ల్యు), స్వలింగ సంపర్కులు (ఎంఎస్ఎం) నరాల ద్వారా మాదక ద్రవ్యాలను ఎక్కించుకునేవారు (ఐవిడియు) అతి ప్రమాదకర ప్రవర్తనా సమూహాల కిందకు వస్తారు. అదేవిధంగా ట్రక్కు డ్రైవర్లు, వలస కూలీలు, వీధి బాలలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్స్ వర్కర్‌ల వద్దకు వెళ్ళేవారు వ్యాపింపజేసే సమూహాలు (బ్రిడ్జి గ్రూపులు) గా హెచ్ఐవి సోకే ప్రమాదంలో వుంటారు. ఈ సమూహాలను వారధులుగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇంటినుంచి దూరంగా ఎక్కువకాలం గడుపుతూ సెక్స్ వర్కర్‌ల వద్దకు వెళ్తారు. ఎక్కువమంది భాగస్వాములను కలిగివుంటారు లేదా నరాల ద్వారా ఎక్కించుకునే మాదక ద్రవ్యాలను ఒకే సూదితో కలసి వాడడం వంటి అవకాశాలు వీరికి ఎక్కువ. కాబట్టి వీరు వ్యాధిని సంక్రమింపజేసుకుని సాధారణ జనానికి వ్యాపింపజేస్తారు.

ఇలాంటి సమూహాలు ఎక్కడెక్కడ వున్నాయో గుర్తించి వారిని సత్వరమే చేరి నివారణ, సంరక్షణ, చికిత్స కార్యక్రమాలను వారికి సమర్థవంతంగా అందించే ఉద్దేశంతో ఎపిఎస్ఎసిఎస్ 2002 లో ఈ సమూహాలను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టింది. అదనంగా సి.ఎస్.డబ్ల్యులు, ఎం.ఎస్.ఎం.ల సంఖ్య అంచనా 2003 మరియు 2004 లో బి.ఎమ్.జి.ఎఫ్. వారు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి ప్రమాదకర ప్రవర్తన కలిగిన సమూహాలు, వారధుల్లా వ్యాధిని వ్యాపింపజేసే సమూహాలు ఎక్కడెక్కడ ఏ సంఖ్యలో వున్నారో పట్టికలో చూడవచ్చు.

అవగాహన, నివారణః

హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ కు సంబంధించిన అవగాహన, ప్రవర్తనను అంచనా వేసేందుకు 2004 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో బి.ఎస్.ఎస్. నిర్వహించబడింది.

అత్యంత ప్రమాదకర స్థితిలో వున్న సమూహాల వారు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ నుంచి రక్షించుకునేందుకు సమగ్ర అవగాహన, నిరంతర కండోమ్ ఉపయోగం ఎలా తోడ్పడుతున్నాయో ఈ బి.ఎస్.ఎస్. వివరాలు స్పష్టం చేస్తున్నాయి. మురికి వాడల స్త్రీలు (67 శాతం మంది), వలస కూలీలు (75 శాతం మంది) ఇప్పటికే అదనపు జ్ఞానం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. వ్యాధి నివారణకు పరస్పరం ఒకే భాగస్వామికి కట్టుబడి వుండాలనే అవగాహన అన్ని సమూహాల్లోనూ తక్కువగా వుంది.

అన్ని సమూహాలలోనూ హెచ్.ఐ.వి. నివారణా సందేశాలను ప్రధానంగా టీవీ నుంచి అందుకుంటున్నారు. వార్తా పత్రికలు, స్వచ్ఛంద సంస్థల (ఎన్.జి.ఓ) కార్యకర్తల ద్వారా కూడా కొంతవరకు ఈ సందేశాలను అందుతున్నట్టు తెలిసింది. సెక్స్ వర్కర్లు, మురికివాడల్లో నివసించే స్త్రీలు మొదలైన వారిపై ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థల (ఎన్.జి.ఓ) కార్యకర్తలు, విస్తృత స్థాయి కార్య క్రమాలు విశేష ప్రభావం కనబరుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యభిచార వృత్తి

సెక్స్ వర్కర్లూ, విటులూ ఎక్కడ కలుసుకుంటారు, విటులతో సెక్స్‌లో పాల్గొనే స్థలాలు ఏవి అనే సమాచారం అందుబాటులో వుంటే నిర్దిష్ట లక్ష్యంతో కృషి చేసే అవకాశం వుంటుంది. దాదాపు సగం మంది సెక్స్ వర్కర్లు తమ విటులను బస్టాండ్‌లలో, బ్రోకర్‌ల ద్వారా లేదా నేరుగా కలుసుకుంటూ వుంటారు. సెక్స్ వర్కర్లు తమ విటులతో లాడ్జీలూ, హోటళ్ళలో (60 శాతం), ఖాళీ స్థలాల్లో (50 శాతం), విటుల ఇళ్ళలో (41 శాతం) సెక్స్‌లో పాల్గొంటారు.

మూడింట ఒకవంతు కంటే ఎక్కువ మంది (36 శాతం) కమర్షియల్ సెక్స్ వర్కర్లు (సి.ఎస్.డబ్ల్యు) అతి పిన్న వయసులోనే వ్యభిచార వృత్తిలో ప్రవేశిస్తున్నారని తేలింది. వ్యభిచార వృత్తిలో ప్రవేశిస్తున్న స్త్రీ సగటు వయస్సు 22 సంవత్సరాలు. సెక్స్ వర్కర్లు సగటున చివరి పనిదినం నాడు ముగ్గురు డబ్బు చెల్లించే విటులతో, చివరి వారంలో 12 మంది డబ్బు చెల్లించే మరియు ఇద్దరు డబ్బు చెల్లించని విటులతో సెక్స్‌లో పాల్గొంటారు.

సెక్స్ వర్కర్లు మరియు వారి దగ్గరకు వెళ్ళే పురుషులతో ప్రతిసారీ కండోమ్‌ను ఉపయోగించాలి అనే అవగాహన హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యమైన అంశం. ఇలా ప్రతిసారీ కండోమ్‌ను ఉపయోగించడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టవచ్చు అనే అవగాహన 2001 లో సేకరించిన బి.ఎస్.ఎస్.ఒ మరియు 2004 లో సేకరించిన బి.ఎస్.ఎస్.ఒ.ఒ సమాచారాన్ని బట్టి 69 శాతం నుంచి 91 శాతంగా పెరిగినట్లు తెలుస్తుంది. సెక్స్ వర్కర్‌లలో కూడా ఈ అవగాహన 2001 లోని 69 శాతం నుంచి 2004 నాటికి 84 శాతానికి పెరిగింది.

అవగాహనకూ, ప్రవర్తనకూ మధ్య తరచూ కొంత అంతరం వుంటుంది. మామూలుగా ఏం చేయాలో తెలిసినంత మాత్రాన ఒక వ్యక్తి దాని ప్రకారం నడచు కుంటాడన్న నమ్మకం ఏమీ లేదు. ప్రతిసారీ కండోమ్ ఉపయోగించాలి అని తెలిసిన సెక్స్ వర్కర్‌లలో 2001 లో 62 శాతం మంది సెక్స్‌లో పాల్గొన్నప్పుడల్లా కండోమ్‌ను వినియోగిస్తే 2004 లో 81 శాతం వినియోగించారు. మరియు 2001 నుంచి 2004 మధ్య కాలంలో సెక్స్ వర్కర్‌ల వద్దకు వచ్చే పురుషులలో ప్రతిసారీ కండోమ్ వినియోగించిన వారి సంఖ్య యాభైశాతం మేరకు పెరగడం ఆశాజనక పరిణామం.

తాత్కాలిక భాగస్వాములు

సర్వే ప్రకారం మూడింట ఒకవంతు మందికి గత 12 నెలల్లో కనీసం ఒక తాత్కాలిక భాగస్వామితో సంబంధం ఉన్నట్టు తేలింది. జీవిత భాగస్వామితో, సెక్స్ వర్కర్‌లతో లైంగిక సంబంధాలు కలిగివుంటూనే వారు తాత్కాలిక భాగస్వాములతో కూడా తరచూ సెక్స్‌లో పాల్గొంటున్నారు. అతి తక్కువ శాతం మందే గత సంవత్సరం తాత్కాలిక భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడల్లా కండోమ్ ఉపయోగించినట్టు తేలింది. ఉదాహరణకి వలస కూలీలలో 9 శాతం మంది మాత్రమే తాత్కాలిక భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడల్లా కండోమ్ వాడారు. మురికివాడల్లోని స్త్రీలు తమ తాత్కాలిక భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడల్లా కండోమ్‌లు ఉపయోగిస్తున్నట్టు తేలినా వారి సంఖ్య (36 శాతం) ఇంకా తక్కువనే చెప్పాలి.

లైంగికంగా వ్యాపించే వ్యాధులు

లైంగిక వ్యాధి వున్న వ్యక్తికి పుళ్ళు, మంట కారణంగా హెచ్ఐవి సోకే ప్రమాదం మరింత ఎక్కువగా వుంటుంది. లైంగిక వ్యాధి (ఎస్.టి.డి), హెచ్ఐవి రెండూ వున్న వారు ఇతర్లకు వాటిని మరింత ఎక్కువగా కలుగజేస్తుంటారు. బి.ఎస్.ఎస్, వివరాల ప్రకారం సర్వే చేసిన అత్యధిక ప్రమాద స్థితిలో వుండే సమూహాలలో 72 నుంచి 92 శాతంమంది లైంగికంగా వ్యాపించే వ్యాధుల గురించి విన్నట్టు తేలింది.

లైంగికవ్యాధి లక్షణాలు కనిపించిన వారిలో చికిత్స వివరాల గురించి సమాచారం సేకరించడమైనది. సెక్స్ వర్కర్‌ల వద్దకు వచ్చే పురుషులు, స్వలింగ సంపర్కులు, డ్రైవర్లు, హెల్పర్లు, మురికి వాడల స్త్రీలు, తరచూ ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందారు. యూనివర్శిటీ విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. అనేకమంది వలస కూలీలు, డ్రైవర్లు, హెల్పర్లు, సాంప్రదాయ నాటు వైద్యుల వద్ద చికిత్స పొందారు. ఇలాంటి చికిత్సలు అంత సరి అయినవి కావు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో లభించే చికిత్సలు పనిచేయవు. లైంగిక వ్యాధులకు సరైన చికిత్స చేయించక పోతే అవి తరువాత వైద్యం చేయడానికి వీలుపడకుండా తయారవుతాయి. వలస కూలీలు, విద్యార్థులు, మురికివాడల స్త్రీలు అనేకమంది అసలు చికిత్స తీసుకోకపోవడం చాలా ఆందోళన కలిగించే అంశం.

పరీక్షలు, కౌన్సిలింగ్

హెచ్ఐవి మరియు ఇతర అంటువ్యాధులను గుర్తించే సౌకర్యం భారతదేశంలో తక్కువగా లభిస్తుంది. అంటే చాలామంది తమకు హెచ్ఐవి వున్నా ఆ విషయాన్ని గమనించరు. తత్ఫలితంగా ఆ వ్యక్తులకూ వారి జీవిత భాగస్వాములకూ ఎంతో ప్రమాదం వాటిల్లుతుంది. హెచ్ఐవిని నివారించడంలో స్వచ్ఛంద, గోప్యమైన పరీక్షలు, కౌన్సెలింగ్ కీలక పాత్ర వహిస్తాయి.

హెచ్ఐవితో బాధపడేవారు సమాజంలో విచక్షణకు గురికాకుండా రక్షించడం కోసం గోప్యంగా నిర్వహించబడే హెచ్.ఐ.వి పరీక్షా సేవలు ఎంతో అవసరం. తీవ్రమైన ప్రమాదకర స్థితిలో వున్న సమూహాలలో అత్యధికులకు తమ సమాజంలో గోప్యంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకునే అవకాశం వుందని తెలిసినా ప్రతి సమూహంలో 20 శాతం మందికి అది సాధ్యమేనన్న సంగతి తెలియదు. దీనివల్ల సమాజంలో హెచ్.ఐ.వి వారి పట్ల విచక్షణ తగ్గించడానికి పరీక్ష, కౌన్సెలింగ్, చికిత్సకు సంబంధించిన అవకాశాలు పెంపొందించవలసిన అవసరం ఎంతైనా వుంది. అదనంగా గోప్యతకు హామీ వుండేలా చర్యలు తీసుకోవలసిన అవసరం కూడా వుంది.

సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మందికి ఎవరో ఒక హెచ్ఐవి సోకిన లేదా ఎయిడ్స్ తో చనిపోయిన వ్యక్తి తెలుసని స్పష్టమయింది. డ్రైవర్లు, హెల్పర్లు, సెక్స్ వర్కర్లు, వలస కూలీలు మొదలైనవారికి హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వున్న వ్యక్తులు ఒకింత ఎక్కువగా తెలుసు.

పరీక్ష,చికిత్స

ఆంధ్రప్రదేశ్‌లో 2004-05 సంవత్సరంలో మూడు యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ (ఎ.ఆర్.టి) కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. అవిః ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్, కింగ్ జార్జి హాస్పిటల్, విశాఖపట్టణం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గుంటూరు. ఈ కేంద్రాలలో హెచ్ఐవి సోకిన వ్యక్తులకు ఎ.ఆర్.టి. మందులను ఉచితంగా ఇస్తారు. ఆగస్టు 2005 నాటికి 1,509 మంది రోగులు ఎ.ఆర్.టి. చికిత్స పొందుతూ వున్నారు.

తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి, గర్భ సమయంలో నొప్పులు, ప్రసవ సమయంలో లేదా రొమ్ముపాలు పట్టే సమయంలో సంక్రమించవచ్చు. సరైన చికిత్స ద్వారా తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు హెచ్ఐవి సోకే ప్రమాదాన్ని చాలావరకు తగ్గించవచ్చు.

తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు వ్యాధి వ్యాప్తిని నివారించే కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించే సౌకర్యం కల్పించబడింది. వారికి హెచ్ఐవి వున్నట్టు తేలితే వారినుంచి గర్భంలోని బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా ఎ.ఆర్.టి మందులు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అంతటా 2005లో నిర్వహించిన పరీక్షలలో 1.61 శాతం మంది గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి వున్నట్టు తేలింది.

ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్: హెచ్ఐవి నివారణకు కృషి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంఘం 1998 లో రిజిస్టర్డ్ సంఘంగా నెలకొల్పబడింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (ఎస్.ఎ.సి.ఒ) సమగ్ర దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్. ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవి వ్యాప్తిని తగ్గించేందుకు, హెచ్ఐవి/ ఎయిడ్స్ పట్ల రాష్ట్ర ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ లక్ష్య సాధనకుగాను ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్. బహువిధ, బహుముఖ కార్యక్రమాలను, చర్యలను అనుసరిస్తోంది.
ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్. చేపట్టిన కార్యక్రమాలలో ముఖ్యమైనవి…
• నిర్ణీత లక్ష్యంతో కూడిన చర్యలు
• లైంగిక వ్యాధుల చికిత్స, కౌన్సెలింగ్
• కండోమ్ ప్రచారం
• సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యక్రమాలు
• రక్త సురక్షణ
• స్వచ్ఛంద కౌన్సెలింగ్ మరియు రహస్య పరీక్షా కేంద్రాలు (విసిటిసి)
• తల్లిదండ్రుల నుంచి పిల్లలకు హెచ్.ఐ.వి వ్యాప్తి నివారణ కేంద్రాలు (పిపిటిసిటి)
• యువతలో పాఠశాలల్లో, కళాశాలల్లో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాలు
• స్త్రీలకు, యుక్తవయసు బాలికలకు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పట్ల అవగాహన
• పోలీసు సిబ్బందికి హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై శిక్షణ
• పనిస్థలాల్లో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పట్ల అవగాహన చర్యలు
• వైద్య, ఉపవైద్య సిబ్బందికి హెచ్ఐవి/ ఎయిడ్స్ పై శిక్షణ
• సంరక్షణ, సహకార కేంద్రాలు
• హెచ్ఐవి/ఎయిడ్స్ తో జీవిస్తున్నవారితో (రాఐఆ) నెట్వర్క్‌లు
• యాంటి రెట్రోవైరల్ చికిత్స కేంద్రాలు (ఎ.ఆర్.వి)

ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్.: ఆశ ప్రచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంఘం (ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్) జులై, 2005లో నెలరోజుల పాటు ఎయిడ్స్ అవేర్‌నెస్ అండ్ సస్టెయిన్డ్ హోలిస్టిక్ యాక్షన్ అఆఐఆ (ఉమ్మడి ప్రయత్నానికి ఉద్యమ రూపం) అనే విస్తృత ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎయిడ్స్ పట్ల అవగాహనను పెంచడం, సేవల అందుబాటును పటిష్టం చేయడం, సమాజంలోని అన్ని రంగాలను భాగస్వాములను చేసి హెచ్ఐవి/ఎయిడ్స్ సేవలను పెంపొందించడం, ప్రభుత్వ సంస్థలు మొదలుకుని వ్యక్తులు, కుటుంబాల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేయడం ఆశ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి హెచ్ఐవి నివారణా సందేశాలను చేర్చడమే ఈ ప్రచారం ప్రధానోద్దేశం.

‘ఆశ’ ముఖ్యాంశాలుః

• 34,000 గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభల నిర్వహణ. 11 మిలియన్‌ల ప్రజలు సభలకు హాజరు.
• 1200 కు పైగా హెచ్ఐవి పాజిటివ్ వక్తలు. విస్తృత టీవి, రేడియో ప్రచారాలు.
• ఆదివాసీ ప్రాంతాలలో 9,000 కు పైగా జానపద ప్రదర్శనలు.
• 100 కొత్త విసిటిసిలు, 50 కొత్త పిపిటిసిటిలు ప్రారంభం
• 43,000 కొత్త కండోమ్ డిపోల ఏర్పాటు
• 12 కొత్త అనాధ శరణాలయాల స్థాపన.
• ‘ఆశ’ గ్రామసభల్లో 12,300కు పైగా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
• ‘ఆశ’ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి, 10 మంది గౌరవ మంత్రివర్యులు, 30 మంది గౌరవ పార్లమెంట్ సభ్యులతో పాటు 200 మందికి పైగా గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు.

నిర్ణీత లక్ష్యంతో కూడిన చర్యలు

అతి ప్రమాదకర, తక్కువ ప్రమాదకర ప్రవర్తన కలిగిన ఉభయ సమూహాలకు చేరువై నిర్ణీత లక్ష్యంతో కూడిన కార్యక్రమాలను అమలు పరిచేందుకు ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్. కృషి చేస్తోంది. 2004 సంవత్సరంలో దాదాపు 1 మిలియన్ అతి ప్రమాదకర స్థితిలోని జనానికి అంటే మురికివాడల్లో నివసించేవారు, వాహన డ్రైవర్లు, సెక్స్ వర్కర్లు, వీధి బాలలు, వలస కూలీలు, స్వలింగ సంపర్కులు, హిజడాలు, ఖైదీలు మొదలైనవారికి ఈ నిర్ణీత లక్ష్యంతో కూడిన కార్యక్రమాలు అమలు పరచింది. ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్. తన 108 కి పైగా వున్న ప్రభుత్వేతర స్వచ్ఛంధ సంస్థల (ఎన్.జి.ఓ) భాగస్వాములతో కలసి ఈ కార్యక్రమాలను అమలుపరుస్తోంది. బిల్ అండ్ మిలిండా గేడ్స్ ఫౌండేషన్ వారి అవాహన్ కార్యక్రమంలో 60 సెక్స్ వర్కర్‌లకు, 28 స్వలింగ సంపర్కులకు మరియు 3 ట్రక్కర్‌లకు మొత్తం 150,000 మందిని చేరేలా నిర్ణీత లక్ష్యంతో కూడిన కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు.

తక్కువ ప్రమాదం వుండే సమూహాలను చేరుకునేందుకు ఎ.పి.ఎస్.ఎ.సి.ఎస్. చాలావరకు ఐ.ఇ.సి కార్యక్రమాలను అనుసరిస్తోంది. ఇందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (పత్రికలు, రేడియో,టీవీల ద్వారా) సినీతారలు, రాజకీయ నాయకులు, సుప్రసిద్ధ క్రీడాకారులతో సందేశాల ప్రచారం వుంటుంది. వ్యాధి వ్యాప్తి ఎక్కువగా వున్న జిల్లాల్లో జానపద కళలు, వీధి నాటకాల ద్వారా కూడా ప్రచారాన్ని చేపట్టడం జరుగుతోంది. నగరాల్లోని ముఖ్య కూడళ్ళలో, గ్రామీణ ప్రాంతాలలో హోర్డింగులను ఏర్పాటు చేయడం, జీవనం కోసం ఎయిడ్స్ నడక వంటి సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో 157,000 మంది పాల్గొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంతటా 11,400 పాఠశాలల్లో తొమ్మిదవ, పదవ తరగతి చదివే 13 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఎయిడ్స్ నివారణ, అవగాహన కార్యక్రమాలను అందించడం జరిగింది.

నివారణలో భాగస్వాములు: హెచ్ఐవీకి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో అన్ని సంస్థల నిరంతర కృషి చాలా అవసరం. భారతదేశంలోని ఈ సమస్య అత్యంత తీవ్రంగా వున్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు ఈ వ్యాధిని అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని సెక్స్ వర్కర్‌లలో, వాహన డ్రైవర్లు, హెల్పర్‌లలో హెచ్ఐవి వ్యాప్తిని పూర్తిగా నివారించేందుకు, నియంత్రించేందుకుగాను బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బి.ఎం.జి.ఎఫ్) మద్దతును అందిస్తోంది. వాటిని హిందుస్థాన్ లేటెక్స్ ఫామిలీ ప్లానింగ్ ప్రమోషన్ ట్రస్ట్, ఇంటర్నేషనల్ హెచ్ఐవి/ఎయిడ్స్ అలయెన్స్, ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు అమలు పరుస్తున్నాయి.

ఆంధ్ర రాష్ట్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ కార్యక్రమాలకు మద్దతుగా ఆవాహన్‌వారు అనేక ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నారు. సెక్స్ వర్కర్‌ల వద్దకు వెళ్ళేవారికి లైంగిక వ్యాధుల చికిత్సకొరకు, కండోమ్‌ల అమ్మకాలకై ‘పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్’ వారితో మరియు ది ఎసెన్షియల్ అడ్వొకసీ, ద హీరోస్ ప్రాజెక్ట్, మాష్మీడియాలకై ఫ్యూచర్స్ గ్రూపు మరియు సెంటర్ ఫర్ అడ్వొకసీ అండ్ మీడియా రిసెర్చ్ వారి సహకారంతో పనిచేస్తుంది.

(ఆశ సౌజన్యంతో)

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్

  1. ఈ వ్యాసంలో చాలా పాతబడ్డ భావాలున్నాయి.అవి ఎంత పాతవంటే నేను అవి 1990లో చదివాను.ఉదాహరణకి భర్తల ద్వారా భార్యలకి హెచ్.ఐ.వి. సోకుతుందనడం. స్త్రీలంతా పవిత్రులన్నట్లు మగవారంతా అపవిత్రులన్నట్లు రాస్తున్నారు. స్త్రీలలో విచ్చలవిడితనం పెచ్చరిల్లిన ఈ కాలంలో ఇలా రాయడం చాలా అశాస్త్రీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.