ఈ తీర్పు మహిళలందరికీ వ్యతిరేకమైంది

ఈ దేశం వేదభూమి … పుణ్యభూమి… బుద్ధుడు పుట్టిన దేశం… వివేకానందుడు జన్మించిన ‘పవిత్ర’ దేశం. ఈ పదాడంబరాలు చూస్తే… అబ్బో ఎంత గొప్పదేశం అన్పిస్తుంది విదేశీయులకి. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అంటే ఇదే కదా! ఇంతటి పుణ్యభూమిలో పురుషులు… ఈ ఆడంబరమైన పదాలను గుప్పించేది వీళ్ళే… తమ తల్లులు, భార్యలు, తోడపుట్టిన వాళ్ళతో పాటు బయటి స్త్రీల మీద కూడా నానా రకాల అఘాయిత్యాలకు పాల్పడతారు. అత్యాచారాలు చేసి చెట్లకు వేలాడదీస్తారు. చంపేసి తందూరి పొయ్యిలో వేస్తారు. మెడలు కోస్తారు. ఆసిడ్‌ పోస్తారు… అయినా సరే ఈ దేశం ‘పవిత్ర’ మైనదే. భారతమాత, ఆంధ్రమాత, గంగమ్మతల్లి, గోదారమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, కొండాలమ్మ తల్లి… అన్నింటా తల్లినే దర్శిస్తామని చెప్పుకునే ఈ దేశ పురుషులు ఆచరణలో నీ అమ్మ.. నీ ఆలి.. నీ అక్క లాంటి బూతు పంచాంగం వల్లిస్తూ… స్త్రీ జాతి మొత్తాన్ని అవమానపరుస్తారు.

ఆరు దశాబ్దాల స్వతంత్ర భారతదేశం అన్నింటా మహిళలకు సమాన హక్కులిచ్చామని ఢంకా బజాయించింది. కావాలంటే చూసుకోండి అని రాజ్యాంగాన్ని మన ముఖాన విసురుతుంది. ఔను… నిజం… అంబేద్కర్‌ పుణ్యమా అని రాజ్యాంగంలో అన్ని హక్కులు అందివచ్చాయి. అంతేనా.. స్త్రీల ఉద్యమం ఏ చట్టం కావాలని అడిగితే ఆ చట్టం తయారైంది. మేము స్త్రీల పరంగా అభివృద్ధి కాముకులం అనే ముసుగేసుకుని అనేక చట్టాలు చేసింది ప్రభుత్వం. ఎన్ని గొప్ప చట్టాలున్నాయో చూడండి…. వరకట్న నిషేద చట్టం, గృహహింస నిరోధక చట్టం, ఆస్తిలో సమానహక్కు చట్టం, పనిచేసే చోట లైంగిక వేధంపుల నిరోధక చట్టం, అత్యాచాచాల నిరోధక చట్టం, ఆసిడ్‌ దాడుల నిరోధక చట్టం… ఈ లిస్ట్‌ ఇలా పెరుగుతూనే వుంటుంది. ఇన్ని చట్టాలు వచ్చాకా కూడా ప్రతి రోజు కట్నం హత్యలు జరుగుతున్నాయి. గృహహింసకి వేలాదిమంది బలవుతూనే వున్నారు. ఆసిడ్‌ దాడులు అగింది లేదు. ఆస్తి హక్కు అమలవుతున్న దాఖలాలేదు. పి.సి. పిఎన్‌డిటి చట్టం అమలులో వున్నా ప్రతిక్షణం ఆడపిండం అబార్షన్‌ అవుతూనే వుంది.

మరి ఈ చట్టాలన్నీ చట్టుబండలేనా? ఇవన్నీ రాసిన చట్టాలు. ఈ దేశంలో రాయని చట్టాలు అనేకం వున్నాయి. వున్న చట్టాలను ఉపయోగించుకోనీయకుండా స్త్రీల మెడలకి గుదిబండలుగా మారిన వ్యవస్థలు, కట్టుబాట్లు, ఆచారాలు సవాలక్షవున్నాయి. పితృస్వామ్య వ్యవస్థకి పట్టుకొమ్మలైన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేకుండా అదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం దాకా కొనసాగుతూ వస్తున్నాయి. పెళ్ళి పేరుతో ఆడపిల్లల్ని దానమియ్యడం, దానికి కన్యాదానమని ఓ అందమైన పేరు పెట్టడం ఇంకా కొనసాగుతూనే వుంది. మగవాడు ఎలాంటి వాడైనా వాడు ‘మొగుడు’ కాబట్టి వాడేం చేసినా భరించాలి.. చంపేసినా చావాలి… కిరోసిన్‌ పోసినా పోయించుకోవాలి అనే బూజుపట్టిన పురుషాధిపత్య భావజాలం ముందు ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నీ దిగదుడుపే. తెంపుకుందామన్నా తెగని ఇనుప గొలుసుల అల్లికలో కుటుంబం, సమాజం, వ్యవస్థలు స్త్రీలను భావపరంగా బంధించి వుంచాయి. ఎనభై శాతం స్త్రీలు ఈ ఛట్రాలలో బిగించబడి వున్నారు. చట్టం వుందనే అవగాహన కానీ, చట్టాన్ని ఉపయోగించుకోవాలనే చైతన్యం కానీ లేని స్త్రీలు కోట్లల్లో వున్నారు.

ఎవరి సంక్షేమం కోసం చట్టాలు తెచ్చారో ఆ విషయం వారికి తెలియచెప్పాలన్న ఇంగితం లేని బండబారిన ప్రభుత్వ వ్యవస్థలు… దేశ జనాభాలో సగం మనుష్యులు పౌరులన్న స్పృహలేని ప్రభుత్వాలు సాధికారత, జెండర్‌ స్పృహ, మానవహక్కులు లాంటి పదాలను ఎలాంటి సిగ్గు శరం లేకుండా వాడేస్తుంటాయి. ‘మహిళా సాధికారత’ అంటే ఏంటో తెలియని ప్రభుత్వధికారులు డబ్బాలో గులక రాళ్ళు వేసి చప్పుడు చేసినట్టు అప్పుడప్పుడూ తమ ఉపన్యాసాల్లో ఆపదాన్ని వల్లెవేస్తుంటారు. జనరంజక, పాప్యులర్‌ పథకాలు, స్కీములు తేవడమే ‘మహిళా సాధికారత’ అని చెప్పే దుస్సాహసం కూడా చేస్తుంటారు. బండబారిన అన్ని వ్యవస్థలూ జెండర్‌ స్పృహ గురించి మాట్లాడే తెంపరితనాన్ని ప్రదర్శిస్తాయి. దీనికి న్యాయవ్యవస్థ కూడా అతీతం కాదు. చట్టాల అమలును పర్యవేక్షిస్తూ, ప్రజా బాహళ్యానికి న్యాయం అందించాల్సిన న్యాయ వ్యవస్థ పితృస్వామ్య పరిధిలోనే పనిచేస్తుందనడానికి అనేక జడ్జిమెంట్లు ఉదాహరణగా చెప్పకోవచ్చు. భర్త అప్పుడప్పుడూ కొడితే నేరం కాదని ఒక న్యాయమూర్తి తీర్పు చెబుతాడు. భర్త చెప్పినట్టు భార్య వినాలని, అనవసరంగా కోర్టులకు రాకూడదని ఒక జడ్జి సుద్దులు చెబుతాడు. ఇంకా ఇలాంటి ఎన్నో తీర్పులున్నాయి.

అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 498ఏ మీద ఇచ్చిన తీర్పు, ఆ తీర్పులో వల్లించిన సూక్తి ముక్తావళి గురించి మనం తప్పక పట్టించుకోవాలి. గొప్ప గొప్ప చట్టాలే చట్టుబండలై అమలుకాని చోట న్యాయమూర్తి వల్లించిన సూక్తులు ఎంతవరకు అమలవుతాయో ఆయనకే తెలియాలి. ఈ తీర్పు విషయానికి వస్తే…. తహమీనా కలీమ్‌ అనే మహిళ వేసిన కేసులో జస్టిస్‌ చంద్రకుమార్‌ ఈ తీర్పు వెలువరించారు. ఈ తీర్పు మహిళల ప్రయోజనాలకు వ్యతిరేకమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

అసలు ఐపిసి సెక్షన్‌ 498ఏ అంటే ఏంటో చూద్దాం. భర్త, అతని బంధువులు వివాహిత స్త్రీ పట్ల ప్రదర్శించే కౄరత్వానికి సంబంధించి శిక్షించే సెక్షన్‌ 498ఏ. శారీరక కౄరత్వం, మానసిక కౄరత్వం, ఆమె ఆత్మహత్యకు దారి తీయవచ్చు. ఆమెకు మానసికంగా, శారీరకంగా తీవ్ర గాయం చెయ్యవచ్చు, ఆమెను లేదా ఆమె తల్లిదండ్రులను ఆస్తి కోసం, విలువైన వస్తువుల కోసం, అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం… ఈ వొత్తిడి ఆమె మరణానికి దారితీయడం…. ఈ నేరాలకు గాను శిక్ష, మూడేళ్ళ వరకూ జైలు మరియు జరిమానా. అత్తింట తీవ్రమైన హింసకు గురయ్యే స్త్రీలను ఆదుకునే ఒకే ఒక్క సెక్షన్‌ ఐపిసి 498ఏ. ఇలాంటి ఒక సెక్షన్‌ తమ రక్షణ కోసం వుందనే అవగాహన, చైతన్యం లేని స్త్రీలతో నిండి వున్న దేశమిది.

తమ పట్ల అమలవుతున్న హింసను భరించలేక పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే స్త్రీల చేత 498ఏ కేసులు పెట్టిస్తున్నది పోలీసులు, నిజానికి వారిని డి.వి. చట్టం కింద రక్షణాధికారుల దగ్గరకు పంపించాల్సిన బాధ్యత పోలీసులది. అయితే తమ మీద హింస జరుగుతోంది అంటూ పోలీస్‌ స్టేషన్‌కి వచ్చిన మహిళలు కోరితే ఎఫ్‌ఐఆర్‌ చెయ్యాల్సిన బాధ్యత కూడా పోలీసులది. ప్రస్తుత హైకోర్టు వెలువరించిన తీర్పు నేపధ్యంలో ఏ పోలీస్‌ స్టేషన్‌లో కూడా కుటుంబ తగాదాలకు సంబంధించి కేసులు రిజిస్టర్‌ చెయ్యకుండా కౌన్సిలింగ్‌ సెంటర్లకు పంపుతున్నారని ఎంతో మంది హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి చెబుతున్నారు. సరైన కౌన్సిలింగ్‌ సెంటర్లు కానీ, నిపుణులైన కౌన్సిలర్‌లు గానీ లేనిచోట ఏ కౌన్సిలింగ్‌ సెంటర్లకు ఈ స్త్రీలను తరుముతున్నారు? కౌన్సిలింగ్‌ అంటే ”కలపడమే” అని గొప్పగా చెప్పుకునే వ్యవస్థలో తీవ్రమైన హింసని ఎదుర్కొంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన స్త్రీని నిప్పుల కొలిమిలాంటి కాపురంలో…. ఎలాంటి రిలీఫ్‌ ఇవ్వకుండా తొయ్యడమే కదా!

బాధిత స్త్రీ దుఃఖాన్ని, ఆమెకు పొంచివున్న ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోని తనం ఒకటైతే, ఈ తీర్పులో న్యాయమూర్తి వెదజల్లిన మహిళా వ్యతిరేకత చాలా ప్రమాదకరమైంది.

”ఐలిబీశిరిళిదీ 498 జు |ఆ్పు నీబిరీ లీలిబీళిళీలి బి గీలిబిచీళిదీ రిదీ లీజీలిబిదిరిదీవీ శినీలి ఓబిళీరిజిరిలిరీ జీబిశినీలిజీ శినీబిదీ రిదీ ఏదీరిశిరిదీవీ శినీలిళీ” ఈ అదనపు సెక్షన్‌ తెచ్చింది భర్త, భర్త బంధువుల కౄరత్వాన్ని శిక్షించడానికి, కుటుంబాలను కలిపి ఉంచడానికి కాదు. ఇంకా… చిన్న చిన్న కారణాలకు, భర్తల్ని కొంగున కట్టేసుకోవడానికి కూడా ఈ క్రిమినల్‌ సెక్షన్‌ని స్త్రీలు ఉపయోగిస్తున్నారట. చిన్న చిన్న కారణాలేంటో… పెద్ద పెద్ద కారణాలేంటో శెలవిచ్చి వుంటే బావుండేది. కుటుంబ జీవనానికి, భర్త, పిల్లలతో కలిసి వుండడానికీ ప్రాధాన్యత ఇచ్చే భారతీయ సగటు స్త్రీ చిన్న చిన్న కారణాలకి పోలీస్‌స్టేషన్‌కి రాదు. పోలీసులెంత న్యాయం చేస్తారో, న్యాయస్థానం ఎంత న్యాయం ఇస్తుందో మనకి తెలియనిదా? అయినా తెగించి ఇల్లు దాటి పోలీస్‌ స్టేషన్‌ కొచ్చిందంటేనే ఆమె ఎంతటి హింసను ఎదుర్కొంటున్నదో అర్ధం చేసుకునే జండర్‌ సెన్సిటివిటీ లేని చోట ఇలాంటి తీర్పులే వెలువడతాయి.

కుటుంబాలు కూలిపోతున్నాయంటూ గుండెలు బాదుకున్న సదరు న్యాయమూర్తి గారికి కుటుంబహింసకి కారకులెవరో తెలియదనుకోవాలా? 498ఎ సెక్షన్‌ రావడానికి దారితీసిన పరిణామాలు, పరిస్థితులు గురించి అవగాహన లేదనుకోవాలా? యాంత్రికమైన ఆలోచనా విధానాలతో ఆలోచించడం కాక సమాజంలో వాస్తవ పరిస్థితులు, స్త్రీల స్థితిగతులు అర్ధం చేసుకుంటూ కదా తీర్పులు చెప్పాలి. పోనీ హింసకు గురవుతున్న మహిళల్ని కౌన్సిలింగ్‌ల కెళ్ళమని శెలవిచ్చిన న్యాయమూర్తి హింసలకు పాల్పడుతూ 498ఏ ఆవిర్భావానికి కారకులైన భర్తల్ని పన్నెత్తి, పెన్ను విదిలించి ఒక్కమాట అనలేకపోయారే! అమలు సాధ్యం కానీ మార్గదర్శకాలు సృష్టించి మహిళల్ని అందులో ఇరికించేసారు కానీ హింసాయుత ప్రవర్తనలలో కుటుంబాలను కూలుస్తున్న మగవాళ్ళని/భర్తల్ని ఒక్క మందలింపు కూడా ఇవ్వకుండా… సదరు కేసులో అందరికీ ఉదారంగా బెయిల్‌ ఇచ్చేసారే. ఇదెలాంటి న్యాయం? ప్రశ్నించాల్సిన అవసరం వున్నది.

ఈ కేసు తీర్పు వెలువరించిన సందర్భంగా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను హరిస్తున్న ఇలాంటి మార్గదర్శకులకు వ్యతిరేకంగాను, వ్యవస్థల్లో జండర్‌ సెన్సిటివిటీ కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం వుంది.

– కొండవీటి సత్యవతి

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to ఈ తీర్పు మహిళలందరికీ వ్యతిరేకమైంది

  1. నమస్తే అండీ .. పేపర్ లో ఈ విషయం చదివి నాకు కూడా ఇలాగే అనిపించింది. ఇప్పటికే ఈ 498 సెక్షన్ లో కేసులు పెట్టే ఆడవాళ్ళందరూ తప్పుడు కేసులు పెడుతున్నారనే ఒక భావన ఉంది… అందుకే ముందు ఎవరైన కేస్ పెట్టటానికి వెళ్ళగానే మీరు చెప్పిన వాళ్ళందరి మీదా కేస్ ఎందుకు పెట్టాలి ?
    వాళ్ళు మీతో కలిసి లేరట కదా ?ముందు మేము ఎంక్వైరీ చేయాలి అంటూ
    హింసతో సంబంధం ఉన్న కుటుంబ సభ్యులను కేస్ నుండి తప్పిస్తున్నారు పొలీసులు ..

    FIR లో కూడా నిజం ఒకటైతే మరొక రకంగా కేస్ డైరీ తయారుచేస్తారు .. అక్కడే సగం కేస్ ఓడిపోయినట్లు .. ఇంక అత్యున్నత న్యాయ స్థానం లోని జడ్జీలే కాదు గుంటూరు జిల్లాలోని ఒక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో కూడా 498 కేస్ వస్తే ఒక్కళ్ళకి కూడా శిక్ష వేయరు ఆ జడ్జి గారు.. మీ కేస్ ఓడిపొయినట్లే అని ముందు లాయర్లే చెప్తున్నారు.. కేస్ గెలవాలంటే ఆయన ట్రాన్స్ ఫర్ అయ్యేదాకా మీ కేస్ వాయిదా వేయించుకోండి అని చెప్పే పరిస్థితి ఉంది ..

    న్యాయ మూర్తులకి విచక్షణాధికారం వుంది నిజమే కానీ ఆ అధికారాలను ఉపయోగించి అందరినీ
    ఒకే విధంగా అంచనా వేస్తామంటే అదేమి న్యాయం ..

    నా మనసుకు అనిపించింది చెప్పాలనిపించి కామెంట్ ఇస్తున్నాను తప్పులుంటే మన్నించగలరు ..

    Thank You..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.