గడ్డి పరక- తమ్మెర రాధిక

ప్రతాపరావు బస్సు దిగి ఊళ్ళోకి వస్తుం టే ఎదురు పడ్డ వాళ్ళు ఒకరిద్దరు మొహం తిప్పుకుపోవడం అతని కనుసన్నల్నించి దాటిపోలేదు. సాయంకాలం కను చీకటిపడు తోంది. అతను ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్‌ బల్ల మీద పడేసి, తల్లి పడుకున్న మంచం కేసి చూసాడు. తను ప్రొద్దున్న మంచం క్రింద పెట్టివెళ్ళిన చెంబు దొర్లిపడుంది. నీళ్ళన్నీ గదంతా పర్చుకొన్నాయి.

”అమ్మా!”

కొడుకు పిలుపుకు అననసూయమ్మ కళ్ళు తెరిచి చూసింది.

”నీళ్ళ చెంబు దొర్లిపోయి వుంది… కుక్కేమన్నా లోపలికొచ్చిందా? ఇదిగో నీళ్ళు తాగు.” ప్రతాపరావు గ్లాసు తల్లి చేతికి అందించాడు లేపి కూర్చో బెడుతూ. అతని చేతిలోని గ్లాసు ఆరాటంగా అందుకుని వణికే చేతులతో అతి కష్టంమీద నీళ్ళు నోట్లో పోసుకుంది. నీళ్ళు గొంతులోకి జారినంత లోనే కళ్ళల్లోకి కాస్త వెలుగొచ్చింది. తల్లినలా చూస్తోంటే అతని గుండె కలుక్కుమంది.

గబగబా స్నానం చేసొచ్చి పొయ్యి మీద అన్నం పడేసి కూరగాయలేమయినా వున్నా యేమోనని సంచీ బోర్లించి చూసాడు. అందు లో నాలుగు ఆలుగడ్డలూ, వాడిపోయిన మెంతికూర కట్టా, ఒక దోసకాయ కన్పించా యి. వాటితో ఏం చెయ్యగలనా అని ఆలోచిం చాడు. ఏమీ పాలుబోక తల్లి మంచం వద్దకు వచ్చాడు. అసలు తను సంచి సదురు కునేప్పుడే ఆలోచించాల్సింది ఇక్కడ ఏమి ఉన్నాయో లేవో అని. తల్లి దగ్గర వుంటూ ఇక్కడి నుంచే ఆఫీసుకు వెళ్ళాలని నిర్ణయిం చుకొని ఆ మాట భార్యతో చెప్పి వచ్చాడు. అత్తగారి దగ్గర ఎవర్నన్నా మనిషిని ఏర్పాటు చేసి రమ్మంది శ్రావణి. అలా మనిషి వున్నాపెద్ద తనంలో ఎవ్వరూ దగ్గర లేకపోతే ఆమె పరిస్థితేంటని ఊరి వాళ్ళు ఒకసారి ఫోన్‌ చేసి అతన్ని కోప్పడ్డారు. ఇప్పుడామెకు జ్వరం షుగరూ బాగా ఎక్కువయ్యాయని పని మనిషి ఫోన్‌ చెయ్యడం మూలాన్ని ఇక్కడి నుంచే బస్‌లో ఆఫీస్‌కు వెళ్ళాలని వచ్చాడు. ”వంట అయిపోవస్తున్నదమ్మా, పది నిముషాల్లో తినేద్దాం. అన్నట్టు కూరగాయలు తీసుకురావడం మర్చేపోయాను. రేపు ఆఫీసు నుంచి వస్తూ దార్లొ పట్టుకొస్తాను. ఈ సంచిలో ఇవున్నాయి. ఏం చేయమంటావు?” అడిగాడు ప్రతాపరావు.

”దోసకాయ పచ్చడి ముక్కలు వేసి, బంగాళ దుంపలు వేపుడు చెయ్యి నాయినా!” అనసూయమ్మ నాలుక తడుపుకుంటూ ఆశగా చూసింది. అలాగేనంటూ తల వూపి వంటగదిలోకి వెళ్ళాడు.

యిద్దరూ భోజనం చేసాక ఇంటి వెనకా ఇంటి ముందు వున్న తలుపులన్ని వేసొచ్చి మంచమీద వాలిపోయాడు. తల్లి వాకర్‌ పట్టుకుని నెమ్మదిగా వెళ్ళి మందులు తెచ్చు కోవడం, బాత్రూంకు వెళ్ళడం చూస్తూనే వున్నా అతని మనసు శ్రావణి గురించి అసహ్యపడటం మానలేదు. చిరాగ్గా అసహ నంగా అవతలి వైపు ఒత్తిగిల్లాడు నిద్రకోసం.

తెల్లారుజాము ఐదు గంటలకు ఇంటి ముందు చాకలామె వాకిలి చిమ్ముతుంటే మెలకువ వచ్చి తలుపు తీసాడు ప్రతాపరావు. అతన్ని చూసి ఈరమ్మ ”పంతులు గారూ నువ్వు నాకు ఈ నెల జీతమియ్యలేదు. ఇయ్యాల జీతం చెప్పరాదు. కంట్రోలు బియ్యం వచ్చినాయి. నువ్వు పెట్టిపోయిన మనిషి పన్లకు రాకుంటే మొన్నటి దాంక ఇంట్ల పని గూడ నేనే జేసిన…” ఇంకా ఏందో మాట్లాడబోతుంటే మధ్యలోనే ఆపు చేసి-

”ఈరమ్మా నీ అలుకు పని కాంగానే వెళ్ళి కూరగాయలు తీసుకురా…వంట చెయ్యాలె.” అన్నాడు. ఆమె పని కానిచ్చుకుని పోయి కూరగాయలు తెచ్చేవరకు, తెల్లగ తెల్లవారి పోయింది. మళ్ళా పైసలు గుర్తు చేసింది.

”ఇస్తాలే.. అమ్మకు స్నానం పోసి తల దువ్వి ముడేసి,బట్టలు జాడించామెవి.” అన్నాడు వంకాయలు తరుగుతూ.

నవ్వింది ఈరమ్మ.

”పెద్ద పంతులు బతికున్నరోజులల్ల సుత అమ్మగారిట్ల పొద్దుగాల తానం బోసుకొని నెత్తి దువ్వుకోని కన్పియ్యలే.”

దాని మాట ఎతాసికమా, సానుభూతా అన్నదతనికి అర్ధం కాలేదు. లేచి పోపు గింజలు కలుపుకుని కూర తాలింపు వేసి, ఇంటి వెనక నీళ్ళపొయ్యి దగ్గరికి పోయాడు. తనబట్టలు జాడించి చెట్లకు కట్టి వంట పనిలో పడ్డాడు. తొమ్మిదింటి లోపల వంట చేసుకుని తిని బాక్సులో పెట్టుకుని పోవాలి. ఈలోపు తల్లికి ఏం కావాలో గమనించాలి. ఆలోచనలో వుండగానే ఇంటి ముందు ఇడ్లీలు అమ్మేవాడు కేకవేసాడు. ఈరమ్మ లోపలికి వచ్చి చిన్న గిన్నె పళ్ళెం తీసుకుపోయి ఇడ్లీలు పెట్టించి అనసూయమ్మ ముందు పెట్టింది. అతను రోజూ వస్తాడు. నెలకోసారి డబ్బులు పట్టుకుపోతాడు. ప్రతాపరావు భోంచేసి బాక్సులో సర్దుకుని తల్లికి అన్ని గిన్నెల్లో పెట్టి మూతలు వేసి బైటికి వచ్చేసరికి తల్లి ఇడ్లీలు తింటోంది. ఈరమ్మ క్రింద కూర్చుని మాట్లాడుతోంది. ఇడ్లీ అతను రోజూ ప్రక్క ఊరి నుండి వచ్చి ఇక్కడ అమ్ముకునిపోతాడు. ఇది బాగానే వుందను కుని, ఈరమ్మకు మూడు వందలు ఇచ్చి, పన్నెండు గంటలకు తల్లిని భోంచెయ్యమని చెప్పి బస్‌కోసం వెళ్ళిపోయాడు ప్రతాప్‌రావు.

గత వారం రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. ఊళ్ళో జనం ‘తల్లినే పట్నం తీసుకోనిపోయి వాళ్ళ దగ్గర్నే వుంచుకోవచ్చు గదా, పెళ్ళాన్ని వదిలి ఈయనొక్కడే అటిటు తిరుగుడు ఎందుకు?’ అని ఆలోచనలో పడ్డారు, చుట్టు ప్రక్కల వారి అభిప్రాయాలు అతనికి తెలుస్తూనే వున్నా, మొన్నా మధ్య పండక్కు తన అక్క చెల్లెళ్ళు తల్లి దగ్గరికి వచ్చినప్పుడు భార్యతో ఎంత గొడవైందో అతనేం మర్చేపోలేదు.

సంక్రాంతి పండక్కు తల్లి ఆడపిల్లలు ముగ్గుర్ని పిలిచింది. కోడల్ని తీసుకొని రమ్మని ప్రతాపరావుకు చెప్పింది. ఆమెకు భర్త పెన్షన్‌ పదిహేను వేలు వస్తుంది. పొలంమీద డబ్బు యాడాదికో ఇరవయి వేలు వస్తుంది. ప్రతీ పండక్కూ కూతుళ్ళ కుంటుంబాలు ఇంట్లో వుండాల్సిందే. వాళ్ళకు నవకాయ పిండి వంటలతో విందు భోజనాలు అమరా ల్సిందే. శ్రావణి అత్తగారి డాంబీకం చూసి ఖంగుతినేది. తమ యిద్దరి రెక్కల కష్టంమీద తన కూతుళ్ళు చదువుకోవాలి. అత్తగారు కాస్త పొదుపు చేసి తమను ఆదుకోవచ్చు గదాని ఆమె ఆలోచన. ఆ మాటే ఆవిడతో చెప్పింది. ఆడబిడ్డలు విన్నారా మాటలు అత్తగారు జవాబు చెప్పే లోపలే ఆమె మీద విరుచుకొని పడ్డారు.

”నీ పుట్టింటి నించి ఏం తెచ్చి పెట్టలేదు మాకు. మా అమ్మ డబ్బు మీద మాకు హక్కు వుంది.” అన్నది పెద్దాడపడుచు.

”హక్కుల గురించికాదు… పొదుపు గురించి నేను మాట్లాడబోయేది.” అంది శ్రావణి.

”ఇద్దరూ సంపాయిస్తూనే వున్నారుగా, అమ్మ సొమ్ము కూడా ఆమెను తిననీయవా? ఇప్పుడు పొదుపు చేసి ఆమేం కావాలి?” రెండో ఆమె ఎదుర్కున్నది.

”డబ్బున్నది తినడానికి కాకపోతే ఎందుకు? నేననేది దుబారా ఖర్చులు వద్దని.” నిక్కచ్చిగా అంది శ్రావణి.

”నీకు తెలివి వుంటే నీ పుట్టింటి నించి తెచ్చుకో. మా మీదెందుకు ఏడుస్తావు?” మూడో ఆమె చురక పెట్టింది.

”పుట్టింటి నించి దోచుకోవాలంటే తెలివి తేటలెందుకు పీడించే గుణం వుంటే చాలు.” శ్రావణి మాటలకు-

”అంటే మేం పీడించి సొమ్ము తీస్కపోతు న్నామనా! నీకంటే నీ పుట్టింట్ల గతి లేదు. అందరు నీలాగనే వుండాల్నా?”

”గతుల దాకా ఎందుకు? మీ ఆడబ్డిలను మీరేపాటి పిలుచుకు పోతున్నారో నాకు తెలవదా? మీ అత్తలను మీరెంత గౌరవిస్తు న్నారో నేను చూళ్ళేదా?” తేల్చిపారేసింది శ్రావణి.

”ఏంటే పేద్ద వాగుతున్నావ్‌, మా అమ్మ సొమ్ముకు ఆమె బ్రతికున్నంత వరకూ మాకు హక్కుంటుంది.” గట్టిగా ఆర్చారు వాళ్ళు.

అప్పుడే బజారునుంచి ఇంట్లోకి వస్తున్న ప్రతాపరావు జరిగిందేమిటో కనుక్కోలేక శ్రావణి అంటున్న మాటలు విన్నాడు.

”హక్కుల గురించి మాట్లాడితే శానా దూరం పోవాల్సి వుంటుంది. మీ అమ్మ సొమ్మును తినడానికి మీ రొక్కరే గుత్తెదార్లేం కాదు. నా కడుపున పుట్టిన పిల్లలు కూడా వున్నారు. వీళ్ళూ మీ వారసులే. వాళ్ళను మందికి కనలేదుగా నేను.” అంది అక్కసుగా.

భార్య తన అక్కల ముందు అంత నీచంగా మాట్లాడ్డం సహించలేకపోయాడు. శ్రావణిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అది చూసి భయపడిన పిల్లలిద్దరూ జ్వరాలు తెచ్చుకుని అన్నం తినక మంచం దిగకపోయే సరికి ఎవరెంత చెప్పిన వినక పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది పండగకు వుండకుండా.

ఆ తరువాత నెలరోజులకు అనసూ యమ్మ షుగర్‌ ఎక్కువై కాలు విరిగినప్పుడు హాస్పటల్లో చేర్పిస్తే ఊరి వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చి చూసారు. అక్కలు ముగ్గురూ ఆస్పత్రిలో వంతుల వారిగా వుండి ఆమె బాగయి యింటికి వెళ్ళేదాకా వున్నారు. శ్రావణి మాత్రమే రాకపోవడంతో అందరూ వేలెత్తి చూపారు. ప్రతాపరావు ఎంత బ్రతిమాలినా వచ్చి చూడలేదు శ్రావణి. అసలు మామూలుగా కూడా అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత అంతంత మాత్రమే.

ఆలోచనలు విదుల్చుకుంటూ గబగబా బస్సెక్కాడు. పిల్లలిద్దరూ కళ్ళల్లోమెదిలి బాధగా నిట్టూర్చాడు. తనకు తల్లినీ, భార్యనూ సమంగా చూడ్డం రాదు కాబోలు. తల్లీ, కూతుళ్ళు ఒక వైపూ, భార్యా పిల్లలు ఒకవైపూ విడిపోయి తనొక్కడే వంటరి వాడయ్యాడు.

దెబ్బలు తినీ పిల్లల్ని తీసుకుని భార్య వెళ్ళిపోయాక తమ్ముడ్ని చూసి ”మాకు మాత్రం లేవుట్రా అత్తారిళ్ళు! ఆడబిడ్డలూనూ! ఒకసారి తగూపడితే మర్నాటికి సద్దుకు పోతాం. తిట్లూ భాగోతాలూ ఎవరింటో లేవూ?” అంది పెద్దక్క విచారంగా.

”అసలు మన పొడే గిట్టదులేక్కా…. అందుకే అంత కచ్చగా వుంటుందది. పిల్లల్ని చూడు మన దగ్గరికి రానిస్తుందేమో! జళ్ళు వేస్తామన్నా రానివ్వదు కుళ్ళుబోద్ది.” చిన్నక్క మాటలకు-

”మీరు మాత్రం ఒక్కదాన్ని చేసి మాటకు మాటా అనకపోతే కాస్త సామరస్యంగా వుండొచ్చు కదా! అందరి కందరే నా ప్రాణం తియ్యడానికి.” విసురుగా అన్నాడు ప్రతాపరావు.

”ఒరేయ్‌ వాళ్ళనంటే బాగుండదు చెప్తున్నా… నీ పెళ్ళాం వాళ్ళని అంతలేసమాటలన్నదని వాళ్ళత్తారింటో తెలిస్తే నీ అక్కలు తలెత్తుకోగలర్రా! నా మనవరాళ్ళంటే నాకు మటుకు ప్రేమ లేదా? బాధ్యత లేదా! సొమ్ము తింటున్నారని అదేడవడందేనికి? ముందు దాని నోరు మూయించు, కనీసం వెళ్ళేటప్పుడు నీతోనైనా చెప్పిపోయిందా! నువ్వు కూడా వస్తున్నావా లేదా అని నిన్నడిగిందా? ఆడదానికి అంత పొగరు పనికి రాదు..” అంది అనసూయమ్మ మూకుట్లోంచి కారప్పూస దేవి బేసిన్లో వేస్తూ. పండగ అయిపోయాక వెళ్ళమంది తల్లి. ఆమె దగ్గర అతనికి అన్నోదకాలకి లోటు లేకున్నా అక్కలూ పండక్కు వచ్చిన బావలూ అతని ఒంటరి తనాన్ని మరింత పెంచారు. పండగ మర్నాడు తల్లి కట్టిచ్చిన అప్పచ్చులు పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ శ్రావణి ప్రవర్తన అతన్ని మరింత దిగనాసిల్లేట్టు చేసింది. అత్తగారికీ కోడలుకూ వున్న అంతంత మాత్రపు సంబంధాలు క్రమంగా మౌన రూపం దాల్చాయి. ఇహ అప్పటి నుండీ తనే వారానికోసారి తల్లిని చూడ్డానికి వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నాడు.

కండక్టర్‌ టికెట్‌ అడగడంతో ఆలోచన ల్లోంచి ఇవతలికి వచ్చాడు ప్రతాపరావు. టికెట్‌ తీసుకుంటుంటే-

”ఆ మధ్య అనసూయమ్మగారికి అస్సలు బాగాలేకుండే. అప్పుడు కనీసం చూడటానికి కూడా రాలేదండీ!” బస్సుల్లో ఎవరో తెల్సి నతను సానుభూతో వెటకారమో తెలియ కుండా మాట్లాడుతుంటే చిర్రెత్తుకొచ్చి, సందు చిక్కితే చాలు దూదేకినట్టు ఏకడానికి ప్రతీవాడూ సిద్ధమైపోతారు అనుకుంటూ లోకరివాజు ప్రకారం అక్కలకు చెప్పాననీ, భార్యకు ఒంట్లో బాగలేక రావడం కుదర్లేదనీ అందుకు అమ్మను ఫోన్లోనే పలకరించాననీ ఇప్పుడు ఆమె బాగోగులు చూసుకోవడానికే వచ్చాననీ, అందుకే రోజూ ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వర్తించుకుంటున్నానీ ఓపిగ్గా చెప్పి తన స్టేజీ దగ్గర దిగిపోయాడు ప్రతాపరావు.

వారం రోజులలో అనసూయమ్మకు షుగర్‌ బాగా పెరిగింది. మాట కూడా బాగా తగ్గిపోయింది. తిండి పోక నానా అవస్థగా వుంది.

”అమ్మకేం బాగాలేదు.. షుగర్‌ బాగా ఎక్కువ అయ్యింది. అక్కడికి తీసుకొద్దామ నుకుంటున్నా… డాక్టరుకు చూపించాలి.” శ్రావణికి ఫోన్‌ చేసాడు.

”ఏం మీ అక్కలేం చేస్తున్నారూ? తల్లికి ఒంట్లో బాగాలేదని తెల్సినా రాకుండా పెళ్ళయి ఇన్నేళ్లయినా నా మీద ధాష్టీకమే నాయే. ఎన్నెన్ని మాటలంటున్నా ఒడికట్టు కునే ఉన్నానిప్పటి వరకూ…”

”సరి… సరి… నేను మాట్లాడేది అమ్మకు బాగాలేని విషయం. ఇప్పుడు ఆ సోదంతా ఎందుకూ! ఒకసారి డాక్టరుకు చూపిద్దాం.” అన్నాడు చిరాగ్గా. ”ఇప్పుడు నాకు పిల్లల పరీక్షలతో క్షణం తీరదు. మీ అమ్మ రాంగానే బిలబిల్లాడుతూ చుట్టాలు. ఇంటెడు చాకిరీ నావల్లకాదు.” శ్రావణి నిష్కర్షగా ఫోన్‌ పెట్టే సింది. నిస్సహాయుడయినాడు ప్రతాపరావు.

భార్య మాటలకు కోపం వచ్చినా ఎవరి మీద ఆగ్రహం చూపాలో అర్ధంకాని క్షణంలో తాత్కాలిక నిర్ణయం తీసుకున్నాడు. డాక్టర్‌ని అపాయింట్‌ చేసి చూద్దామని.

”రోగం పోయేది కాదులే నాయనా ఎవళ్ళో ఒకళ్ళు నన్ను చూస్తారులే, ఎన్నాళ్ళిక్కడ వుంటావు చెప్పు?” తేల కళ్ళతో, జారిపోయిన చెవులతో ఒంగిపోయి ఒణుకు మాటతో వున్న తల్లిని చూసే సరికి అతని కళ్ళల్లో సన్నని నీటిపొర అలుక్కుపోయింది.

కోడలి మీది కోపంతో బిడ్డలను దువ్వజూసింది తల్లి. పంక్తికి పది మంది కూర్చుని భోజనం చేసే లోగిలి ఒకప్పుడిది. అంతా ఆవిడ ఒంటి చేత్తో వ్యవహారం నడిపేది. అలాంటిదిప్పుడు అరఘడియ కూడాఎవ్వరూ వచ్చి కూర్చోని మాట్లాడ్డానికి ఇష్ట పడటం లేదు.

”ఒక్కదానివి ఎట్లా వుంటావు? పెద్దక్కను రమ్మంటాను నాల్రోజులు.” ప్రతాపరావు తనొచ్చి వారం రోజులు అయ్యిందని మనసులో లెక్కలేసుకుంటూ అన్నాడు.

”దానింటోనూ ఈ మధ్యే అంకురార్పణం అయ్యింది. వాళ్ళత్తగారు మంచాన పడింది.”

”పోనీ రెండో అక్కని రమ్మంటే సరి.”

”సాగినార మట్టలతో భోగిమంటలు వేస్తామా! ఇదీ అంతే పిల్లా జెల్లా, అదిపెద్ద సంసారి. అక్క ఇల్లొదిలి వస్తే మొగుడు కంపన పడ్డ కాకల్లె తిరుగుతాడు ఎందుకులే నాయనా.”

”పోనీ చిన్నక్కను రమ్మంటాను. నేను నాల్రోజులు పోయి వచ్చే వరకు వుంటుంది.” అన్నాడు.

”వాళ్ళ సంగతి తెలియందేం వుంది. వాళ్ళత్తారింటి వాళ్ళకు మనుషుల్ని అర్ధం చేసుకోవడం తెలియదు.పైగా అందర్ని చిన్న చూపు చూస్తారు. అదొచ్చిందగ్గర్నించే ఆ పింజారీ అల్లుడు ఈ ఊళ్ళో యాగీ చేస్తాడు.” అనసూయమ్మ దగ్గర ప్రతీ కూతురి గురించీ ఒక కారణం రెడీగా వుంది. కూతుళ్ళు తనున్న పరిస్థితుల్లో ఇక్కడికి రావడం ఆమె కిష్టం లేదు. కోడలు రావడం లేదనీ, చాకిరీ చెయ్యడం లేదనీ వాళ్ళ అత్తారిళ్ళల్లో తెల్సిపోతుంది. ఇంగువ కట్టిన గుడ్డ విచ్చుకుపోతుంది. అది కూతుళ్ళకూ చిన్నతనమేనని ఆవిడ బాధ.

”పోనీ పని మనిషితో చెప్పి వెళ్తాను. అక్కడ డాక్టరుకి రిపోర్ట్స్‌ చూపిస్తాను. అవసరం వుంది రమ్మనమనంటే వచ్చి తీసుకెళ్తాను.” అన్నాడు. కొడుకు మొహం లోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఏ భ్రమలూ లేవు, ఆశలూ లేవు. ”నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యినాన్నా.” కొడుక్కి చెప్పి కళ్ళు మూసుకుంది. ప్రతాపరావు శ్రావణి దగ్గరి కెళ్ళి పోయాడు.

ఊరు మళ్ళీ ముక్కుమీద వేలేసుకుంది. ఎంత మందికి అన్నంపెట్టిందా ఇల్లాలు అన్నారు. కోడల్ది మరీ విడ్డూరం అన్నారు.

ఆడదయి పుట్టాక అందర్నీ కలుపుకు పోవద్దూ అన్నారు. కాలకూటం లాంటి దానికి విరుగుడు వుంది, అత్తగార్ని చూడ్డం ఓ సమస్యా అని చెరిగేసారు.

షుగర్‌ పెరిగి ఒళ్ళు తెలియని స్థితిలో అనసూయమ్మని ఆస్పత్రిలో చేర్చారు. లబోదిబోమని ఆడబిడ్డలంతా ప్రతాపరావు ఇంట్లో దిగిపోయారు. ఇంటి నిండా వున్న జనానికి వండి వార్చాలంటే అయ్యే పని కాదని నిశ్చయించుకుంది శ్రావణి. ప్రొద్దున్నే లేచి పిల్లలకు పాలు కాచి వాళ్లని తయ్యారు చేసే పనిలో పడేది. ఏడయ్యేదీ ఎనిమిదయ్యేది ఎక్కడా టీ పెట్టి పోసే జాడ లేకపోవడం చూసి ముగ్గురూ ఆశ్చర్యపోయి, చివరకు వాళ్ళే పెట్టుకు తాగి శ్రావణి కింత పోసేవారు. పిల్లలకు మ్యాగీ చేసి తినిపిస్తూ – ”మనంద రికీ టిఫెన్లంటే భోజనానికి ఆలస్యం అవుతుం ది…వంటేదో పెందరాడే చేసె య్యండి. వీళ్ళని పంపి స్నానం చేసొస్తాను.” అనేది. తల్లికి బాగా లేదనే బాధని నొక్కిపట్టి వంట పనిలో పడేవారు చేసేది లేక. పెద్దాడపడుచు కూరలూ అన్నం చిమడ బెట్టింది కోపంతో.

అదంతా చూసి తినలేక బాక్స్‌ అవసరం లేదని చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయింది శ్రావణి మనసులో తిట్టుకుంటూ. పగలూ రాత్రీ ఇంత మందికి వంటలూ, టీలూ కాఫీలూ, ఇల్లంతా సత్రం క్రింద మారుస్తున్నారని శ్రావణి గోల పెట్టడం మొదలు పెట్టింది.

ఆడబ్డిలు సూటి పోటి మాటలు అనడం, ఒకళ్ళను చూసి ఒకళ్ళు మూతులు విరవడం, దెప్పిపొడుచు కోవడం మొదలయ్యింది. ఆడంగుల్లో కలివిడి తనం లేక ఇల్లు గిజాటయ్యింది.గ్యాసు పొయ్యి విరామం లేక ఎక్కే గుండీ దిగే గుండీ చూసి గుండెలు బాదుకుంటూ పక్కింటి వాళ్ళతో చెప్పింది శ్రావణి. ”డైనింగ్‌ టేబుల్‌ ముందు మనుష్యులూ, ఎంగిలి కంచాల ముందు మూగే ఈగలూ ఒకటే మాకు. తిండికి కరువు వాచినట్టు వీళ్ళు వేళాపాళా లేకుండా.” వంటగదిలో వంట చేస్తోన్న పెద్దాడపడుచు కళ్ళనీళ్ళ పర్యంతమయి పోతూ వరండాలో కూర్చున్న చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రావణి అన్నమాటలు చెప్పింది. ”అమ్మా నాయినా ఎంత మంది కోసరమని కష్టపడలేదూ! మనింట్లో ఎన్ని విస్తళ్ళు పెంటపోగు మీద వేసేవాళ్ళం రోజూ! ఇవ్వాళ అయిన వాళ్ళు నలుగురొస్తే ఇంత రొస్టు పడుతోంది. పూట కూటింటిలో పుట్టిన బుద్దులెక్కడికి పోతాయి? ఎంగిళ్ళ మధ్యని బ్రతికిన బ్రతుకు.” మొటికలు విరిచింది పెద్దామె.

”నాయిన పోయినా అమ్మ కాళ్ళ వేళ్ళా  పోగు జేసుంచింది రేపు వాళ్ళేగా తినేది.” మిగతా చెల్లెళ్ళూ ఆపసోపాలు పడ్డారు.

ఇంట్లో వున్నంత సేపు రామ రావణ యుద్ధం తప్పేట్టు లేదని భోజనాలు కాంగానే అక్క చెల్లెళ్ళు హాస్పటల్లో తల్లి దగ్గరికి వెళ్ళే వాళ్ళు. అనసూయమ్మ కాస్త తెరిపిన పడి కొడుకిల్లు చేరాక ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళపోయారు.

శ్రావణి వంట మటుకు చేసేది. పిల్లల్ని  పంపించి ఆఫీసుకు వెళ్ళిపోయేది.అత్తగారి సపర్యలన్నీ భర్త చూసుకోవలసిందే. చిన్న గదులతో బస్తీ ఇల్లు ఇంకో మనిషిని భరించేట్టు లేనట్టుగానే ఇరుకు మనసులు కూడా ఎవ్వరి పొడ గిట్టకుండా వుంది.

”ఎప్పుడు దింపొస్తారావిడని?” అడి గిందో రోజు.

”ఇప్పుడేగా కోలుకుంట పాపం! నువ్వు కాదుగాసేవ చేసేది.”

”వండిపెడుతున్నా చాలదా.”

”వెరిపించుకు తినే రకం. ఎంత కాలం నోరు నెత్తినేసుకు బ్రతుకుతావు?”

అవును నేనేం మాట్లాడినా నోరు నెత్తినేసుకునే దాన్లా కనిపిస్తుంటే,మీ వాళ్ళంతా నాకు నెత్తిమీది దేవతలా?” ఆమె మాట పూర్తి కాకమునుపే చెంప పగిలి పోయింది శ్రావణిది.

కొడుకు చెయ్యి చేసుకోవడం,కోడలు తనని కసిగా చూసి ఏడుస్తూ వెళ్ళి పోవడం చూసి అనసూయమ్మ ఏమాలోచించుకుందో గానీ మర్నాడు ప్రతాపరావుని పిల్చి చెప్పింది తనిక ఊరెళ్తానని.

”ఆరోగ్యం పూర్తిగా చిక్కనీయమ్మా! ఇప్పుడు తొందరెందుకూ!” ఆమె మంచం మీద కూర్చుంటూ అడిగాడు.

”ఇక్కడ నాకేం తోస్తుంది నాయనా… మీరంతా వెళ్ళిపోయాక నాలుగ్గోడల్లా ఒక్కదాన్ని… ఇంటికి పోతే వరండాలో మంచమేసుకుంటే గాలీ… ఆకాశం… మనుషులూ అంతా వుంటారు…” ఆమె మాట చిన్నగా వస్తుంటే కొంత సంజ్ఞల ద్వారా చెప్పింది. నవ్వుతూ తల్లి చెయ్యి పట్టుకున్నాడు. ముడుత పడిమెత్తగా వుందా చెయ్యి. తల్లి గాజు కళ్ళు చూసాక అతని హృదయం ద్రవించింది.

”మందులు వేసుకోవడం పూర్తి కాని య్యమ్మా! తొందరపడకు… నీకంతగా తోచక పోతే నేను సెలవు పెట్టి ఇంట్లో వుంటాలే నాల్రోజులు.” అనునయించబోయాడు.

”వద్దు లేరా… ఎలా పోతుందో ప్రాణం.. నా ప్రారబ్దం..”

”ప్రారబ్దం మహామహులకే తప్పలేదు… మనమెంతమ్మా!”

కొడుకు మాటలకు మౌనంగా వుండి పోయింది. అతను పలకరించబోయినా కళ్ళు తెరవలేదు. గ్రహించాడతను తల్లికి కోపమె చ్చిందని. మర్నాడు తల్లి బట్టలన్ని జాగ్రత్తగా మడతపెట్టి బ్యాగులో సర్దుతుంటే-

”ఎక్కడికేంటి ప్రయాణం?” ఒంకరగా అడిగింది శ్రావణి.

”మా ఊరికి…”

”అబ్బా ఊరు!”

”అవును ఊరే, అక్కడ ఆవిడకు చేసే వాళ్ళు లక్ష మంది వున్నారు.”

”అవునవును ఆ లక్షమందీ చేసాకే హాస్పటల్లో పడ్డది గావాల్ను…”

”ఛి…ఛీ… అత్తగారన్న ఆపేక్షా అంతఃకరణా లేకపోతే మానే లోకభీతి అయినా వుండొద్దూ!” విసురుగా బ్యాగు తీసుకొని హాల్లోకి వచ్చాడు. అతని వెనకే శ్రావణి హాల్లోకి వచ్చింది.

”నేను అమ్మను దించి రావడానికి వెళ్తున్నాను వస్తావా?” కోపాన్ని నిగ్రహించు కుంటూ అడిగాడు.

”నాకవసరం లేదు… రాను.. పిల్లలకు పరీక్షలు వున్నాయి,” నిర్ద్వందంగా తిరస్కరించింది.

తల్లీ కొడుకూ ఊళ్ళోకి అడుగుపెట్టిన నాలుగో నాడు, అనసూయమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.

తల్లి శవం దగ్గర చుట్టూతా కూర్చొని వున్నారు కూతుళ్ళు. ప్రతాపరావు తలొంచు కుని కుర్చీలో కూర్చొని వున్నాడు అక్కడే. గొల్లుమని ఏడ్పులు హఠాత్తుగా వినపడితే తలెత్తి చూసాడు. ఇంటి ముందు బస్సు ఆగింది, దాంట్లోంచి శ్రావణి పెద్దగా పెడబొబ్బలు పెడుతూ దిగింది. శవం దగ్గర కూర్చున్న వాళ్ళంతా పక్కకు తప్పుకున్నారు ఆశ్చర్యంతో ఆమె ఏడుపు చూస్తూ…

”అత్తయ్యా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావా అత్తయ్యా? నీ మనవ రాళ్ళింకా చిన్న పిల్లలత్తయ్యా… అయ్యో నీ కొడుకుని ఒంటరివాడ్ని చేసి పోయావా అత్తయ్యా” అంటూ వచ్చి అనసూయమ్మ శవం మీద పడిపోయింది.

ఎవరో ఆమెని లేవదీయబోతే విదిలించుకుంటూ-

”మొన్ననే హాస్పటల్లో చూపించాం.. అక్కడ బాగానే కోలుకుంది… ఇంతలోనే ముంచుకొస్తుందనుకోలేదు.” తలకాయ బాదుకుంది.

ఆడబ్డిలంతా ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని శ్రావణిని కౌగలించుకుని పెద్దగా శోకాలు పెట్టారు. ప్రతాపరావు తన వాళ్ళని చూసి తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. అయినా అతని మనసులో తల్లిని సరిగా చూసుకోలేకపోయాననే బాధ తొలుస్తూనే వుంది. తల్లి ముందు తను గడ్డిపరకగానే వున్నాడు తప్ప ఆమెకు కల్పవృక్షాన్ని కాలేకపోయానని నిస్పృహగా కళ్ళుతుడుచుకున్నాడు భార్యా అక్కల జాతర చూస్తూ…

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.