బాలసాహిత్యానికి నేను కేవలం ఒక పాఠకురాలిని.

(డా. మంగాదేవి బాలసాహిత్య పురస్కారం అందుకుంటూ చేసిన ప్రసంగం)….చంద్రలత

మొదట,
ఇవ్వాళ ఈ వేదిక మీద నన్ను నిలబెట్టిన పెద్దలకు ధన్యవాదాలు.

ఇక్కడి దాకా నన్ను నడిపించుకు వచ్చిన పిల్లలందరికి జేజేలు.
పిల్లల తరుఫున, వారి ప్రతినిధిలా, వారి అక్కలా.. నేను మీ ముందు నిలబడ్డాను.

పిల్లల కోసం తమ ఆలోచనను, సృజనను, తమ జీవితాలనే అంకితం చేసిన పెద్దలు నిలబడిన చోటు ఇది.
మీరు నన్ను ఇక్కడ నిలబెట్టడంలో, నాకు ఒక సందేశం, ఒక గట్టి సూచన అందాయి.  ఆ పెద్దల స్పూర్తితో ముందుకు సాగమని.

”బడికి పిల్లలు రాలేరా? అయితే, బడే పిల్లల దగ్గరికి వస్తుంది” అన్న ఆలోచన ఎంత గొప్పది.  అంత ఆలోచన చేసిన పెద్దలు డాక్టర్‌ మంగాదేవి గారు.

ఇంత ఆప్యాయంగా మా చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించడం బోలెడంత నమ్మకాన్ని ఇచ్చింది.  ”మా ఆలోచనా సరి అయిన తోవలోనే నడుస్తున్నది కదా” అని  సంతోషం కూడా కలిగింది.  అందుకు డాక్టర్‌ మంగాదేవి గారికి, బాలకుటీరీయు లకూ నా ధన్యవాదాలు.
నిన్న ఇక్కడి పత్రికలలో వార్త చదివి, ఇక్కడి నుంచి ఒక పరిశోధకులు నన్ను పలకరించారు.

”పిల్లల కోసం మీరు ఎన్ని పద్యాలు రాశారు, పాటలు రాశారు” అంటూ.
నేనేమీ రాయలేదు.  అదే వారికి చెప్పాను.
”పిల్లలతోను, సాహిత్యం తోనూ కొంత సాన్నిహిత్యం ఉన్నది.  కానీ బాలసాహి త్యానికి నేను కేవలం ఒక పాఠకురాలిని.”
వారు నిరాశ పడ్డారు.  ఆ నిశ్శబ్దం గమనించి అన్నాను.
”కానీ, పిల్లలతో కొన్ని పుస్తకాలు తీసుకు వచ్చాము”
”ఓ…. అంతేనా? పిల్లలతో రాయించారా?
వారు బోలెడు నిరాశ పడ్డారు.
”పిల్లలే రాశారు”
వారు మరింత నిరాశ పడ్డారు.
బాల సాహిత్యంతో మా మొదటి పరిచయం, బహుశా మా ఈడు వారందరి వలే, పుస్తకాల ద్వారా రేడియో ”అక్కయ్య అన్నయ్యల” ద్వారా.

మా ఊరి గురించి కూడా ఒక మాట చెప్పాలి.  ఎనభై దశకం నడుమ వరకు విద్యుత్తు లేదు.  సమాచార సంబంధాలు లేవు.  ప్రయణ సౌకర్యాలు లేవు.  మేడలు లేవు.  మిద్దెలు లేవు.  ఇన్నెందుకు, అసలు బడే లేదు.
కాలువ, చెరువు, గడ్డివాములు తప్పించి పిల్లలం ఆడుకోవడానికి తోటలు తోపుల ఏమీ లేవు.  మాదో పెద్ద ఉమ్మడి కుటుంబం.  మేం బోలెడు మంది పిల్లలము.  మాకున్నదల్లా ఒక బ్యాటెరీ రేడియె, కొన్ని పుస్తకాలు, అంతే.
బడి కోసం పాలమూరు వచ్చినా, మళ్ళీ, సెలవులకు పల్లెకు పరిగెత్తే వారం.  వేసవి కాలం సెలవుల్లో ఆ కాలువ ఆగి పోయేది.  చెరువులు ఖాళీ అయ్యేవి.  పురులు గడ్డివాములు పలచ బడేవి.  చెట్ట చేవ మోడు వారేవి.  నల్లరేగడి నెర్రెలు వారేది.  వడ గాడ్పులు, సుడిగాలులు.  ఇళ్ళు వాకిళ్ళ నిండా పత్తి బోరాలు.
పిల్లలం ఎప్పుడూ సంతోషంగా ఉండే వారం.

అమ్మ పాడి నేర్పించిన ‘పుష్ప విలాపం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’లు… నాన్న చదివించిన నండూరి రామమోహన రావు గారి ”విశ్వరూపం”, మహీధర నళిని మోహనరావు గారి ”నరవతారం”, ”క్యాలెండర్‌ కథలు”, చదివి వినిపించిన ”వేమన సుమతీ శతకాలు…. మందార మకరందాలు” పెదనాన్న కథలు కబుర్ల,
ఇవీ మా చిన్ననాటి తోడూనీడూ.  ఆటా పాట.
మాలో కాస్త బద్దకస్తులు ఉన్నారు.  కథ చదివే ఓపికైనా లేదు వాళ్ళకి.
మాలో ఎవరో ఒకరం చదివి.. మసి పూసి ఆ కథను కాస్తా ఏ మారేడు కాయనో చేసేసి.. వినే వాళ్ళకి చెప్పే వాళ్ళం.
ఈ పరిచయం ఎందుకో విజ్ఞులకు అర్థమై ఉంటుంది.  పిల్లలకు కథలకు ఉన్న అవినాభావ సంబంధమది.
మా లాగా పల్లెవాటున పెరిగిన పిల్లలకు కథలే సకల ప్రపంచం.
ఆ నాటికి ఈ నాటికీ.

ఇక, మా తరువాతి తరం వారికి, డాక్టర్‌ వాసిరెడ్డి సీతాదేవి గారు బాలభవన్‌ డైరక్టర్‌గా ఉన్నప్పుడు, శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్‌, ఏడిద కామేశ్వరరావు గారి వంటి పెద్దల కృషి వల్ల, ఆడియో క్యాసెట్లు వచ్చేసాయి.
ఇప్పుడు, ఆడియో విజువల్స్‌ వచ్చేశాయి.  రేడియో వెనకకు తగ్గి టీవీలు… మళ్ళీ ఎఫ్‌ ఎం రేడియోలు… ఒక వృత్తం పూర్తయ్యింది.
ఒకసారి, తెలుగులోని బాల సాహిత్యాన్ని కొంత దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం.  చాలా మట్టుకు తలపండిన పెద్ద వాళ్ళు పిల్లల కోసం రాసినవే.  సహజంగానే, హితబోధలు, ఉపదేశాల, చారిత్రికాలు, పౌరాణిక, జానపద ప్రధానాలు.  అవేకాక, మేము విరివిగా చదివిన రష్యన్‌, ఇంగ్లీష్‌, అరేబియన్‌ అనువాదాలు కూడా ఆ కోవలోనివే.

టాం సాయర్‌, అలెక్సీ, చుక్‌, గెక్‌.. అందరిని మేము తెలుగులోనే పరిచయం చేసుకొన్నాం.  ఏ మాటకు ఆ మాట చెప్పాలి.
పిల్లల ఊహకు తోడుగా, ఈ అనువాద కథలకు, ముఖ్యంగా రష్యన్‌ కథలకు, చక్కటి రంగుల బొమ్మలు వుండేవి.  అయినప్పటికీ, మా వంటి పల్లె పిల్లలకు మంచు కురవడంలోని అందం ఎలా తెలుస్తుంది? గౌన్లు వేసుకొనే అమ్మలు, విమానాలు ఎగర వేయగలిగే అమ్మాయిలు… ఆనాటి మా ఊహకు ఎలా అందుతారు?  వీరందరు మా ఊహలకు గట్టి పదును పెట్టారు.  అలాగే, పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే నాన్నలు కూడా…!
అయితే, రాజులు మంత్రులు, రెక్కల గుర్రాలు, ఎగిరే తివాచీలు, కత్తియుద్ధాలు, మంత్రాలు తంత్రాలు… మేము కళ్ళతో చూడక పోయినా, ఊహకు తట్టేవి.  భారతీయనేపథ్యమో, జ్ఞానమో, మూలమో… మరోటో.  వాటిలోని చెణుకులు చమత్కా రాలు టక్కున తట్టేవి.  హాస్యాలు ఫక్కుమని పించేవి.  ఇతిహాసాలు ఇట్టే అర్థం అయ్యేవి.  పువ్వులు, పక్షులు, చెట్లు చేమలు తెలిసేవి.  అందు చేతనే కాబోలు, చందమామ, బుజ్జాయి, బాల, బాలజ్యోతి.. ఇలాంటి అనేక పిల్లల పుస్తకాలు మాలో ఒక భాగం అయి పోయాయి.
అయితే, తెలుగు బాలసాహిత్యంలో పిల్లలు చేసిన రచనలు చాలా తక్కువ.  పిల్లలుగా ఊహించుకొని రాయడానికి… పిల్లలే ఊహించి రాయడానికి చాలా తేడా ఉన్నది.  పిల్లల్లో ఆసక్తి, కుతహలం, పరిశీలనాశక్తి.. అపారం.  పెద్దల కలాలు తెలియకుండానే కొన్ని పరిమితులకు లోనవుతాయి.  ఎల్లలు ఎరగని స్వేచ్ఛ పిల్లల సహజ లక్షణం.
ఈనాటి పిల్లలు ఒక మీట నొక్కితే చాలు సకల భువన భాండములు వారి ముందు ప్రత్యక్షం అవుతాయి.  వారికి అందుతోన్న సమాచారం అపారం.  సాంకేతిక జ్ఞానం పుష్కలం.  ఎంత మారు మూల గ్రామమైనా తాగడానికి నీరుండదేమో కాని చూడడానికి టీవి లేకుండా ఉండదు.
ఈ సమాచార యుగంలోని పిల్లలకు కూడా తెలుగులో అందుబాటులో ఉన్న బాల సాహిత్యం మా చిన్న నాటిదే.
కాలం మారింది.  భాష, భావజాలం, వస్తువు, ఇతివృత్తము…. అన్నీ మారాయి.  కథలు కథనాలు మారలేదు.  ఈనాటి పిల్లల అవసరాలకు అనుగుణమైన సాహిత్యాన్ని వారే సృజించుకోగలిగితే…? అన్న చిన్న ఆలోచన గట్టి నమ్మకంగా బలపడింది.  పిల్లల స్పందన చూస్తూ చూస్తూ.
ఈ నాటి పిల్లలు చాలా తెలివి గలవారు.  వారికి కావలిసింది వారు నిర్మించుకోగలరు.  పిల్లలు కలలు కనగలరు.  వారి గురించి, మనగురించి, ఆ కలలను వ్యక్తపరుచుకొనే సృజనాత్మకత మాధ్యమం.. వారి స్వంతం.  వారి స్వతంత్రం.  వారి ప్రత్యేకం… అదే ఈ బాలల సాహిత్యం.
సృజనాత్మక రచన నేర్పితే నేర్చుకొనే కళ కాదు కానీ పిల్లల్లో సహజంగా ఉన్న సృజనశీలతను ప్రకటింపబడడానికి ఒక అనుకూల వాతావరణాన్ని సంధర్భాన్ని కలిగించడమే మార్క్‌ షాప్‌ పేరిట మేము చేసినది.  తొలినాళ్ళలో ఈ వ్యవహారాన్ని అక్కడి పిల్లలు సరదాగా అనే వారు ”రిషివ్యాలీ లో తెలుగు విప్లవం” అని.  చూస్తుండగానే అది ”రిషివ్యాలీలో హిందీ విప్లవాన్ని”కీ ప్రేరణ అయ్యింది.
పల్లె గడప దాటని పిల్లల నుంచి.. భూగోళం ఆవలి అంచు నుంచి అక్కడికి వచ్చిన.. విభిన్న మాతృభాషల, నేపధ్యాల, సంస్కృతుల, పిల్లలు అక్కడ ఉన్నారు.  ఈ భిన్నత్వమే అక్కడి ప్రజాస్వామిక స్వభావానికి పునాది.  ఒకరి నుంచి ఒకరు నేర్చుకొనే ఒక సహజీవన సంస్కృతి, ఒక సృజనాత్మక సభ్యత అక్కడ ఉన్నది.  స్వీయ పరిశీలనకు అపారమైన అవకాశం ఉన్నది.  భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నది.
అక్షరం కన్నా ముందు అక్కడ అరణ్యం ఉంది.  అక్షరం అబ్బిన తరువాత ఎడారి మిగిలింది.  అంటారు ఎకో లింగ్విస్ట్‌ షాథోబ్రీఒ.
రాళ్ళు రప్పలతో నిండిన కొండవాలు కరువు ప్రాంతం వికసించిన వనాలతో విద్యారణ్యమై పోయింది.
గోడలు లేని బడులు,  ప్రకృతి ఒడిలో తరగతులు.  పుస్తకాలకు మించిన చదువులు.
అక్కడి సృజనాత్మక సంస్కృతి, స్వేఛ్చాభరిత వాతావరణం.  సామాజిక స్పృహ.  మేధోచింతన. మానస చేతన బుద్ధ భావన, పర్యావరణ ప్రధాన బోధన….
అదీ డెబ్భై యేళ్ళకు పైగా, జిడ్డు కృష్ణమూర్తి గారి విద్యా తాత్వికతకు సజీవ రూపమైన రిషివ్యాలీ.
”చంప నొంప వెయ్యేల బువ్వ చాలదా?” అన్నాడు మన పెద్దన్న వేమన.
”ఆకలి ఉంటుంది అందరికీ… అన్నం ఉండదు ఎందుకని?” అమాయకంగా పసి గొంతుతో ప్రశ్నిస్తారు బాలబంధు బి.వి. నరసింహారావు గారు.
”కొండనే అన్నంగా మార్చేస్తా… ప్రజలందరికి పంచేస్తా…” అంటున్నాడు తొమ్మిదేళ్ళ వాసుదేవ.
ఎక్కడో పత్రికలో ఒక చిన్న వార్తలా వచ్చిన సునామి విషాద అనుభవంలోని ”మేఘన” అనే అమ్మాయిలా ఊహించుకొంటూ సింధు వ్రాసిన  ”పీడ కల.”
సరిగ్గా ఏడాది తరువాత, అసలు మేఘన అచ్చం అవే మాటలలో .. ఇచ్చిన ఇంటర్వ్య పత్రికల పతాక శీర్షికల్లో వచ్చింది.. ”అదొక పీడ కల” అంటూ.
”కూర్చున్నాను రథచక్రం మీద
ప్రక్క స్కలులో అందరు పేద
లక్షలతో కట్టుతారు ఆ రథం
అది అంతా ఎవరి కోసం?” అంట ప్రశ్నించిన పిల్లవాడు
”ఈ భరత మేధిని భాగ్యవిహీనుల క్షుత్తులారునే” అన్న జాషువా గారి మాట విన్నవాడు కాడు.
మా పల్లె ప్రయాణంలో.. ఒక బడి ఆవరణలో… నిర్మాణంలో ఉన్న ఒక రథాన్ని చూసాం.  ఆ రథంపై చేయబోతున్న వ్యయాన్ని తెలుసుకొని … ఆ రథచక్రం పైనే కూర్చుని ఆ పదేళ్ళ అబ్బాయి అప్పటికప్పుడు రాసిన వాక్యాలు అవి.  ‘ఆకాశ’ మంతటి ఆలోచనలు అవి.
”మంచి బట్టలు
ఖరీదైన కంప్యూటర్లు
కొత్త కార్లు
ఇదేనా స్వర్గం?

పెద్దచెట్లు
చల్లనిగాలి
చిన్న తనీగలు
పసుపు పచ్చ పూలు
మధ్యలో నువ్వు
ఇదా స్వర్గం?”
తొమ్మిదో తరగతి ”కృష్ణ” మనోభావమిది.
బహుశా.. కాలక్రమంలో, పిల్లలు ప్రకటించిన ఈనాటి భావాలు మారిపోవచ్చు.  మరిచి పోవచ్చు.  మరింత మెరుగు పడొచ్చు.
ఏనాటికైనా ఈ పుస్తకం చూసినప్పుడు.. ”ఒక నాడు నేను ఇలా ఆలోచించాను” అన్న ఒక చిన్న జ్ఞాపకం.. ఒక చిరునవ్వు.. ఒక చిన్న నాటి నిష్కపట మనసు..
మళ్ళీ కొత్త దోవను చూపుతుందేమో… మరొక మంచి ఆలోచనకు నాంది అవుతుందేమో.
అమ్మ, ఆకలి, ఆటలు… పిల్లలు ఎవరైనా ఇవే వారి మొదటి విషయలు… మిగిలినవన్నీ ఆ తరువాతే.
బాల సాహిత్యంలో ఈ రచనల ప్రాధాన్యత ఏమిటో, ప్రామాణికత ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది.  ఇప్పటికి, ఈ రచనలు సమకాలీన సమాజంలోని పిల్లల ఆలోచనలను అనుభతులను వారితో ఒకరికొకరు పంచుకోవడానికి… పెద్దలుగా మన పాత్రలు… ప్రమేయలు… పరి మితులను…తెలుసుకోవడానికి సాయపడగలవనే నా గట్టి నమ్మకం.
పిల్లల కోసం అహర్నిశలు ఆలోచిస్తూ ఉంటూనే… అనుకోకుండా ఒక అమాయకత్వంలోకి పడిపోతుంటాం.  మనకు తెలియ కుండానే.
”ఇంతగా ఆలోచిస్తున్నాం కదా… మనకు పిల్లల గురించి తెలియనిది ఏముంది?” అనే భావనలో పడిపోతాం.
పెద్దలు క్షమించాలి.
పిల్లల కోసం చేసే ఏ ఆలోచనలోనైనా పిల్లల భాగస్వామ్యం లేనిదే అది సమగ్రం కాదు!  ఎందుకంటే పిల్లల ఆలోచనలేమిటో, అనుభతులేమిటో, అవసరాలేమిటో.. పిల్లలే చెప్పగలరు.  అది వారి అనుభవం.  మనకు ఊహ.
అందుకే, వారు చెప్పగలరు.  మనం కేవలం ఊహించగలం.
పిల్లల్ని ప్రేమించడంతో పాటు వారి అభిప్రాయల్ని గౌరవించ గలగాలి.  అది ఇల్లైనా, బడైనా, సమాజమైనా, ఎక్కడైనా సరే.
ఈనాటి విద్యా వ్యవస్థ ఒక తనికల కొలతల దుకాణంలా తయరయ్యింది.  అందులోనూ, ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసే వారు ఉన్నారు.  ఆ ఆలోచనలను కూడా అరకొరగా అందిపుచ్చు కొని… వాటితోనూ వ్యాపారం చేసే వారూ ఉన్నారు.  అందు కలరు ఇందు లేరు… అని అనలేని సామాజిక పరిస్థితి…!!!
తిలక్‌ అన్నంత అందంగా ఆనందం గా…. ‘కనుల చివర కాంతి సంగీత గీతాన్ని రచించడం…” నేర్పితే అబ్బుతుందా?
అది సహజంగా సంతోషంగా మనసు లోలోతుల్లోంచి పెల్లుబికి రావాలి కాని..!
”కలలకు విశ్వకవుల కన్నులుండు…” అన్న నార్ల గారి మాటల్లోని మర్మాన్ని గుర్తించి.. పిల్లల కలలు కలాలలో నింపి.. ఆ ”పట్టు పువ్వులు” పుస్తకంలో ముడిచి మీ ముందుంచాం.
తెలుగుమనుగడే ప్రశ్నార్థకమైనదని అనుకుంటుండగా, అటు భాషపై మమకారాన్ని కలిగించడానికి… ఇటు భావవ్యక్తీకరణ మాధ్యవన్ని పిల్లలకు పరిచయం చేయడం కోసమే ఈ ప్రయత్నాలు.
ప్రకృతిలో ఒక చిన్న భాగమైన మన మనుగడ ఆ ప్రకృతిని పదిల పరుచుకోవడం లోనే ఉన్నది.  చిన్న నాట ప్రకృతితో పెంచుకొనే మమకారమే పర్యావరణ స్పృహకు ప్రకృతి జ్ఞానానికి నాంది కాగలదు.  అక్షరం అరణ్యానికి రక్షణ కాగలదు.
ఈ ప్రయత్నాలలో జరిగిన ఒక ముఖ్యమైన ప్రయత్నం.
…”పిల్లలకు నచ్చని పాఠాలనైనా పిల్లలే మార్చుకోవచ్చును” అన్న వాస్తవాన్ని గ్రహించగలగడం.
”చెప్పిన పాఠం వినండి”… అన్నదే మనకు తెలుసు.  అయితే, అలా వింటూ వింటూ.. అటు భాషను, ఇటు భావాన్ని తిరిగి తిరిగి.. తెలుగు తరగతినీ, ఆ పాఠం చెప్పే ఉపాధ్యాయులను… తప్పించుకు తిరగకుండా… ఆ పాఠాలనే తిరగ రాసే ఒక ప్రయత్నం చేయగలిగాం.  రిషీ వ్యాలీ ఐ.సి.యస్‌.సి. 2005 తెలుగు విద్యార్థుల చొరవ, ధైర్యం, ప్రోత్సాహం… ఈ రోజు ”ఐ.సి.యస్‌.సి.” తెలుగు పాఠాల నవీకరణకు నాంది అయ్యింది. అడిగీ అడగగానే విశ్లేషాత్మ కంగా వారు వ్రాసి ఇచ్చిన అభిప్రాయలను, అప్పటి సీనియర్‌ స్కూల్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కుమార స్వామి గారి సమక్షంలో, అప్పటి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శైలేష్‌ షెరాలీ గారి ముందు ఉంచడం.  బడి తరుపున ఐ.సి.యస్‌.సి. బోర్డు ముందుకు ఈ విషయన్ని తీసుకు వెళ్ళడం జరిగింది.  ఈ దిశగా ఇది మా మొదటి ప్రయత్నం.
మరొక ఏడాది తరువాత ఎలాంటి మార్పు లేకపోవడంతో డాక్టర్‌ మంజులత గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ చేకూరి రావరావు గారి అధ్యక్షతన తెలుగు విశ్వవిద్యాలయం ఒక సెమినార్‌ ”ఐ.సి.యస్‌.సి. తెలుగు పుస్తకాల నవీకరణ” అన్న విషయంపై.. పలువురు ఆచార్యులు, భాషావేత్తలు పాల్గొని వారి అభిప్రాయలను వ్యక్తపరచడం జరిగింది.
ఈ సెమినార్‌ నందలి ముఖ్యాంశాలతో పాటుగా, తమ ప్రతిపాదనలతో తెలుగు విశ్వవిద్యాలయం తరుపున డాక్టర్‌ మంజులత గారు ఐ.సి.యస్‌.సి. బోర్డుకు పాఠ్యపుస్తకాల నవీకరణను గట్టిగా ప్రతిపాదించారు.  ఇటు డాక్టర్‌ కుమార స్వామిగారు రిషి వ్యాలి నుంచి తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండగా అటూ డాక్టర్‌ పరిమి గారు తమ పద్ధ్దతిలో బోర్డును సంప్రదించారు.
తెలుగు టెక్ట్స్‌ బుక్స్‌ నవీకరణకు బోర్డు నిర్ణయం తీసుకోవడం ఒక సంతోషం.
రిషీవ్యాలీలో అమూల్యమైనది ఏదైనా ఉందీ అంటే అది పిల్లల సమయం.
వారి సమయాన్ని నా కోసం కేటాయించడానికి తెలుగు ఉపాధ్యాయులు… ఇంటింటికి తిరిగి, ఇతర ఉపాధ్యాయుల సమయన్ని అరువు తెచ్చుకొని, హౌజ్‌ పేరంట్స్‌ అనుమతులు పొంది, పల్లె ప్రయణాలను ఏర్పాట్లు చేసి.. ఆదివారం సెలవు రోజులు… అన్నీ వదిలేసి… నా ప్రయత్నాలలో పాలు పంచుకొన్నారు.  రంగాచార్యులు గారు.. ఉషా బాలక్క.. శారదక్క.. రాజా మాష్టారు.. రాధా అక్క ఇక పల్లె బడుల పిల్లలను ఒక చోటికి చేర్చడం.. వారి బస, వసతి, భోజనం ఏర్పాట్లు చేయడం… పద్మవల్లి గారి నిర్వహణా చాతుర్యం.
మైళ్ళకు మైళ్ళు నడిచి వచ్చిన పిల్లలు, కొండల కోనలు దాటుకు వచ్చిన పిల్లలు..
తమ సైకిళ్ళపై వాహనాలపై పిల్లలను తీసుకు వచ్చిన ఉపాధ్యాయుల..
ఈ సాధక బాధకాల నడుమ కసరత్తు చేస్తూ.. నన్ను వత్రం తాకనీయ కుండా.. ఇంత మంది నిమగ్నులై.. నాకు ఇచ్చిన స్వేచ్ఛ.. నాపై ప్రకటించిన నమ్మకం.. ఇవ్వాళ మీ ముందున్న ఆ బాలల సాహిత్యం.
ఇదంతా చూస్తున్న నాకు బాగా దిగులు వేసింది.
”ఇంత మంది నాకు ఇచ్చిన సమయన్ని నాపై ఉంచినా నమ్మకాన్ని నేను వృథా చేస్తున్నానా.. అసలు ఈ ప్రయత్నాల వలన ఏదైనా ఫలితం ఉంటుందా” అని.
అప్పుడు, రంగాచార్యులు గారు అన్నారు ”మీరు విత్తనం నాటారు.  పూవులు ఎలా పూస్తాయి.. కాయలు ఎలా కాస్తాయి.. పళ్ళు ఎలా ఉంటాయి.. ఇవన్నీ ఆలోచించకండి.  విత్తనం నాటడం వరకే మీ పని.”
మొదటి సారి పల్లె పిల్లల నుంచి వచ్చిన అసంఖ్యాక స్పందనను చూసి.. నేను ఒక నిశ్శబ్దంలోకి కూరుకు పోయాను.
అంతటి సృజనాత్మక ప్రతిభ, చక్కటి భాష, పల్లెపదపు సొంపు సొలుగు, చిగురించక మునుపే వాడిపోతుందే.. అన్న బాధ కలిగింది.
”ఇది మన సామాజిక వాస్తవికత. మనం చేయగలిగిన మేరకు చేసే ప్రయత్నంలో ఉన్నాం.  ఇది ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదు.  మనం ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాము.  ఒక చిన్న ఉదాహరణలా.  ఇది మరొకరికి ప్రేరణ అయితే మనకు సంతోషం.” అన్నారు రవక్క.
హాయిగా సంతోషంగా తమ భావాలను ప్రకటించుకోవడానికి ఒక సృజనాత్మక మాధ్యవన్ని పిల్లలకు పరిచయం చేయగలిగాము.  ఇది ప్రారంభమూ కాదు.  ముగింపూ కాదు.  కొనసాగింపు మాత్రమే.
తమ సృజనాత్మక ప్రయత్నాలలో నాకు కొంత భాగం ఇచ్చిన విద్యావేత్తలు పెద్దలు శ్రీ శివరాం గారికి, శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి, శ్రీమతి ఇంద్రాణి గారికి నా ధన్యవాదాలు.   పాఠ్యపుస్తకాల విశ్లేషణ ఎంత శ్రద్ధగా చేసారో, చిట్టి రచనలన అంత సంబరంగా చదివి స్పందించిన పెద్దలు శ్రీ రావెల సాంబశివ రావు గారికి ధన్యవాదాలు.
ఈ నా చిన్న ప్రయత్నాలలో.. నా వెనువెంట ఉన్న నా ప్రాణ స్నేహితులు, ప్రధమ విమర్శకులు… మా పిల్లలు.. భవ్య ఆకాశ్‌ లకు నా అభిమానాలు.
ఈ మార్క్‌ షాప్‌ల నిర్వహణ బాధ్యతలను ఒక పండగలాగా రూపొందించిన తెలుగు అధ్యాపకులకు..
పల్లెబడుల విషయంలో ముఖ్యంగా.. పద్మవల్లి గారి దీక్ష దక్షత.. నేను మరవలేను.
అంత మంది పిల్లల పెద్దలు నిశ్శబ్దంగా నేపథ్యంలో నిలబడి ఉండగా, నేను మీ ముందుకు వచ్చి ఇలా వెలుగులో నిలబడ్డాను.
వారు నాకు ఇచ్చిన స్వేచ్ఛ… నాపై ప్రకటించిన నమ్మకం… ఈ పురస్కారం.
సుమారు రెండువందల మంది బాల రచయితల తరుపున.. వారి అక్కలాగా.. సంతోషంగా సగౌరవంగా ఈ అవార్డును స్వీకరిస్తున్నాను.
ఈ ప్రతిష్టాత్మక ”డాక్టర్‌ మంగా దేవి బాల సాహిత్య పురస్కారాన్ని” రిషీ వ్యాలీ విద్యాసంస్థల పిల్లలకే అంకితం చేస్తున్నాను.
అంగీకరించినందుకు డాక్టర్‌ రాధికా హెజ్బర్గర్‌ గారికి, డాక్టర్‌ కుమార స్వామి గారికి డాక్టర్‌ వై.ఎ.పి. రావు గారికి, శ్రీమతి రమారావు గారికి … నా ధన్యవాదాలు.
బాల రచయితలకు మరొక్క మారు శుభాకాంక్షలు.  బాల కుటీరీయులకు నా నమస్కారాలు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.