కలిసి నడుద్దాం..- Y. Nagaveni

రాధ, తన సహ ఉద్యోగురాలు స్వప్న ఎపి ఎక్స్‌ప్రెస్‌ రైలును అందుకోవ డానికి ఢిిల్లీ రైల్వే స్టేషన్‌లో రెండవ తరగతి ఎ.సి. బోగీ వైపు పరుగులు తీసారు. చివరి నిమిషంలో బోగీ లోపలికి వెళ్ళగలిగారు. తమ బెర్త్‌ నెంబర్లు చూసుకొని లగేజీలను బెర్తు క్రింద సర్దుకున్ది కూర్చున్నారు. కొద్దిసేపు అలసట తీరాక మాటల్లో పడ్డారు. టిటి రాగానే తమ టికెట్లను చూపించి ఒక పని అయిపోయిం దనుకుని వాళ్ళు ఢిల్లీలో హాజరైన వర్క్‌ షాప్‌లో చర్చించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాధ, స్వప్నలిద్దరూ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను తగ్గించడానికి ఎటువంటి విధానాలతో పని చేయాలన్న అంశం గురించి జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన వర్క్‌ షాపుకు హాజరయ్యారు. వీరిద్దరూ వర్క్‌షాపులో ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీలు, బాలికలు ఎటువంటి ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారనే విషయాలను చర్చించడానికి ఒక స్వచ్ఛంధ సంస్థ తరపున వెళ్ళారు.

రైలులో కూర్చున్న స్వప్న, రాధలి ద్దరూ వర్క్‌షాపులో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ స్త్రీ వాదులు, సామాజిక కార్యకర్తలు మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగాలకు లోనవుతూ ఉండటం తమ ఎదురుసీటులో కూర్చున్న వ్యక్తి చాలా ఆసక్తిగా గమనిస్తున్నాడు. రాధ తన చేతి గడియారం వైపు చూసుకుంది.

”అయ్యో 9గంటలు అయ్యిందా, స్వప్నా తినడానికి ఏమైనా కొనుక్కుందాం”, అంది.

అంతలో రైలులో భోజనాలు అమ్మే అబ్బాయి రానే వచ్చాడు. రెండు భోజనాలు, నీళ్ళ బాటిల్‌ తీసుకున్నారు. వీరిద్దరిని ఎప్పటినుంచో గమనిస్తూ ఎదురు సీటులో కూర్చున్న వ్యక్తికి వీరితో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి చూడటానికి సాదాసీదాగా ఉన్నాడు. సుమారు 30సంవత్సరాలు ఉండొచ్చు,

”హల్లో వేెర్‌ ఆర్‌ యు గోయింగ్‌” అంటూ పలకరించాడు.

రాధ ‘హైద్రాబాద్‌’ అని సమాధా నం చెప్పి స్వప్నతో ఆఫీసుకు వెళ్ళిన వెంటనే చేయాల్సిన పనుల గురించి గుర్తుచేసింది. అతను ”ఎక్స్‌క్యూజ్‌ మి” అంటూ వీరి మాటలకు అడ్డు పడుతూ, ఇంతసేపూ మీరు మాట్లాడుకున్న విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాను. కానీ నాకు తెలుగు సరిగ్గా రాకపోవడం చేత కొన్ని విషయాలు పూర్తిగా అర్ధం కాలేదని ఇంగ్లీష్‌లో చెప్పాడు. చెబుతూ, ”ఐ యామ్‌ గౌతమ్‌ ఫ్రమ్‌ మధ్యప్రదేశ్‌,” మీ సంభాషణ చాలా ఆసక్తిగా వుంది. ”కెన్‌ ఐ డిస్‌కస్‌ విత్‌ యూ”. స్వప్న ”ఎస్‌ ప్ల్లీీజ్‌” అంటూ సమాధానం చెబుతూ, రాధతో ”ఇతనేంటి చాలా జిడ్డు మనిషిలాగా ఉన్నాడే” అని గొణుక్కుంది. మీరు సమస్యల కోసం పని చేస్తారని మీ మాటలను బట్టి అర్థం చేసుకున్నాను. ఇందుకోసం ”మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు”? అని అడిగాడు. స్వప్న తమ సంస్థ ఉద్దేశ్యాలూ, గ్రామస్థాయిలో స్త్రీలను చైతన్యపరచడానికి చేపడుతున్న కార్యక్రమాలనూ, అవలంబిస్తున్న విధానాలనూ పూర్తిగా వివరించింది. అంతలో స్వప్న మొబైల్‌ మ్రోగింది. ” ఎక్స్‌క్యూజ్‌ మి, దిస్‌ ఈజ్‌ వెరీ ఇంపార్‌టెంట్‌ కాల్‌, ఐ వుడ్‌ అటెండ్‌ ఇట్‌” అంటూ అక్కడి నుండి లేచి డోర్‌ వైపుకు వెళ్ళింది.

గౌతమ్‌ రాధ వైపు చూస్తూ ”ఇఫ్‌ యు డు నాట్‌ మైండ్‌, కెన్‌ యు కంటిన్యూ ది డిస్‌కషన్‌’ అన్నాడు. రాధ అతనికి మిగతా వివరాలను చెబుతూ అతని సందేహాల న్నింటిని తీర్చింది. ముఖ్యంగా స్త్రీలు ఎదు ర్కొంటున్న ఇబ్బందులు, పితృసామ్య వ్యవస్థ స్త్రీల అణిచివేతకు ఏ విధంగా కారణమవు తుందనే విషయాల మీద లోతుగా చర్చ సాగింది. ఇంతలో స్వప్న ఫోన్‌ మాట్లాడటం పూర్తి చేసుకుని తన బెర్తులో కూర్చుంది. రాధ, గౌతమ్‌ల మధ్య జరుగుతున్న సంభాషణలను కుతూహలంగా గమని స్తోంది. అతను తన సందేహాలు అడగటం, రాధ వాటికి ఉదాహరణలతో వివరిస్తున్న తీరును చూసి, ”ఇటువంటి విషయాలను తెలుసుకోవడానికి మగవాళ్ళు ఆసక్తి చూపిస్తే, ఆడ మగ మధ్య అసమానతలు ఎప్పుడో పోయుండేవి” అని మనసులో అనుకుంటూ, వారి చర్చలకు అంతరాయం కల్గించడం ఇష్టం లేక వారి సంభాషణలను వింటూ కూర్చుంది. ఇంతలో గౌతమ్‌ మొబైల్‌ మ్రోగడం వల్ల చర్చల నుండి బయటకు వచ్చారు. ”ఎక్స్‌క్యూజ్‌ మి, ఐ విల్‌ హావ్‌ టు ఆన్సర్‌ దిస్‌ కాల్‌” అంటూ లేచాడు.

స్వప్న ”జెండర్‌  ట్రైనింగ్‌” అయిపోయిందా అని సరదాగా రాధను ఆట పట్టించింది. సరే, సరే ముందు భోజనం చేద్దాం నేను చేతులు కడుక్కొస్తాను అంటూ లేచింది రాధ అప్పటికే చాలా ఆలస్యం కావడం వల్ల భోజనం పూర్తి చేసి స్వప్న      అప్పర్‌ బెర్తులో పడుకుంది. రాధ లోయర్‌ బెర్త్‌లో పడుకోవడానికి బెడ్‌షీట్లను సర్దుకుంది. స్వప్న పడుకున్న వెంటనే నిద్రపోయింది. రాధకు మాత్రం నిద్రపట్టలేదు. తన బ్యాగులోంచి ఒక పుస్తకం తీసి చదువుకుంటూ ఉంది.

అంతలో గౌతమ్‌ ”బై సార్‌ ఐ విల్‌ క్యాచ్‌ యు సూన్‌” అంటూ తన బెర్త్‌ వైపు వచ్చాడు. మీరు పడుకునేసారా! నేను ఒక్కడినే భోజనం చేయాలా! మీరు ఏం అనుకోకపోతే నేను భోజనం చేసే వరకూ నాకు కంపెనీ ఇస్తారా? అని పుస్తకం చదువుకుంటున్న రాధతో మర్యాదగా అడిగాడు. రాధ కాదనలేక పోయింది. అక్కడ మొదలైన సంభాషణ చాలాసేపటి వరకూ కొనసాగింది. స్త్రీల అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వారి సంభాషణ సాగింది. తమ ప్రక్క బెర్తుల్లో ఉన్న ప్యాసింజర్లు అందరూ నిద్రపోయారు. వీరు మాటల్లో పడి సమయాన్ని మర్చిపోయారు. ఇంతలో స్వప్నకు మెలుకువ వచ్చి లైట్‌ ఇంకా వెలుగుతుండటం చూసి, వీరిద్దరి మాటలు విని మధ్య రాత్రి మూడు గంటలు కావస్తూందని వారికి గుర్తు చేసింది. వెంటనే గౌతమ్‌ ”క్షమించండి నేను మీ నిద్రా సమయాన్ని తీసేసుకున్నట్టున్నాను. నేను దిగాల్సిన జంక్షన్‌ వస్త్తోంది. మీతో జరిగిన చర్చల వలన నాకు తెలియని చాలా కొత్త కోణాలను తెలుసుకోగలిగాను. థాంక్యూ” అంటూ తన లగేజీని సర్దుకున్నాడు. కెన్‌ ఐ హావ్‌ యువర్‌ విజిటింగ్‌ కార్డ్‌ ఫ్లీజ్‌ అంటూ రాధ వైపు చూసాడు. రాధ తన బ్యాగ్‌లోంచి విజిటింగ్‌ కార్డు తీసి ఇచ్చింది. అంతలో భోపాల్‌ స్టేషన్‌ వచ్చింది. బై,నైస్‌ టు టాకింగ్‌ టు యూ అంటూ దిగి వెళ్ళిపోయాడు.

హైద్రాబాద్‌ చేరుకున్న రాధ, స్వప్నలిద్దరూ ఆఫీస్‌ పనుల్లో బిజీ అయిపో యారు. నెల రోజులు గడిచిపోయాయి. ఒక రోజు రాధ సెల్‌కు ఒక కాల్‌ వచ్చింది. రాధ మీటింగ్‌లో ఉండటం చేత కాల్‌ తీసుకోలేదు. ఆ నెంబర్‌ నుండి కాల్‌ రెండు సార్లు వచ్చి కట్‌ అయింది. బ్రేక్‌ టైంలో రాధ తన మొబైల్‌ చూసుకుంటూ మిస్డ్‌ కాల్స్‌ చూసుకొని కొత్త నెంబర్‌ నుండి వచ్చిన నెంబర్‌కు తిరిగి డయల్‌ చేసింది.
”హాయ్‌ మేడం హౌ ఆర్‌యు దిస్‌ ఈజ్‌ గౌతమ్‌” అంటూ రిఫరెన్స్‌ ఇచ్చాడు.
”ఎలా ఉన్నారు గౌతమ్‌ గారు, ఏ పని మీద కాల్‌ చేసారు” రాధ అడిగింది.         నేను బాగున్నాను, ప్రస్తుతం నేను ఆదిలాబాద్‌లో పని చేస్తున్నాను. మీరు ఇటు వైపు వచ్చినప్పుడు నాకు కాల్‌ చేస్తారు కదా దిస్‌ ఈజ్‌ మై నెంబర్‌ మీరు మొబైల్‌లో సేవ్‌ చేసుకోగలరు.
బ్రేక్‌ సమయం పూర్తి కావడం చేత ”నేను తరువాత ఫోన్‌ చేస్తాను” అంటూ ఫోన్‌ పెట్టేసింది రాధ.
అప్పుడప్పుడూ గౌతమ్‌ నుండి రాధకు మెస్సేజెస్‌ రావడం వాటికి రాధ రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉండేవి. రాధ ఒకసారి ఆఫీసు పని మీద ఆదిలాబాద్‌కు వెళ్ళాల్సి వచ్చింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మార్చి 8న జిల్లా స్థాయిలో స్త్రీలతో మేళాను నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నారు. దానికి జిల్లా కలెక్టర్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని జిల్లా ఆఫీసు టీంతో పాటు రాధ కలెక్టర్‌ ఆఫీసుకు వెళ్ళింది. కలెక్టర్‌ను కలవడానికి చాలాసేపు వేచివుండాల్సి వచ్చింది. కలెక్టర్‌ పిఎ మేడం మిమ్మల్ని సార్‌ రమ్మంటున్నాడు అంటూ చెప్పాడు. లోపలికి వెళ్ళిన రాధ సీట్లో కూర్చుని ఉన్న కలెక్టర్‌ను చూడగానే నిశ్చేష్టురాలైంది. కలెక్టర్‌ సీట్లో నుండి లేచి రాధ దగ్గరగా వచ్చి
”ఎలా ఉన్నారు” అంటూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.
రాధ కొంచెం తేరుకుని, ”ఐ యామ్‌ గుడ్‌” అని చెప్పింది.
అతను రండి కూర్చోండి, అని తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు.
మనం అభిమానించే కొన్ని పరిచయాలు అంత సులభంగా మనకు దూరం కావు అంటూ అతను రాధ వైపు చూసాడు.
ఇదంతా రాధతో పాటు వచ్చిన జిల్లా ఆఫీస్‌ టీమ్‌కు అర్ధంకాక వారి మొఖాలను ప్రశ్నార్థకంగా పెట్టారు. ఆ పరిస్థితిని అర్ధం చేసుకున్న రాధ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న గౌతమ్‌తో తనకున్న పరిచయాన్ని క్లుప్తంగా చెప్పింది. కానీ రాధ మనసులో అప్పటికే తలెత్తిన ఎన్నో ప్రశ్నలను గౌతమ్‌తో అందరూ ఉండటం చేత అడగలేకపోయింది. రాధ ఈ గందరగో ళంలో ఉండగా, మిగితా టీమ్‌వారు వచ్చిన పనిని వివరించి గౌతమ్‌ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. తప్పకుండా అంటూ గౌతమ్‌ తన డైరీలో నోట్‌ చేసుకున్నాడు. గౌతమ్‌ కార్యక్రమానికి ఒప్పుకోవడం చేత టీమ్‌ అందరూ చాలా సంతోషపడి, ధన్యవాదాలు తెలుపుతూ బయటికి వచ్చేసారు. కాని రాధకు మాత్రం చాలా చికాకుగా అనిపించింది. ఎందుకని గౌతమ్‌ తన గురించి ఇంతకు ముందు చెప్పలేదు. ఎందుకని దాచి పెట్టాడు అనే ప్రశ్నలు పదే పదే రాధను అసహనానికి గురి చేసాయి.
అదే రాత్రి రాధ ఆదిలాబాద్‌ నుండి హైద్రరాబాద్‌కు బయలుదేరింది. రాత్రి 10గంటల సమయంలో రాధకు గౌతమ్‌ నుండి కాల్‌ వచ్చింది. ఇప్పుడెందుకు ఫోన్‌ చేస్తున్నాడని అనుకుంటూ ”హల్లో” అంది.
”హల్లో రాధ గారూ” ఇంత తొందరగా మిమ్మల్ని లుస్తానని అనుకోలేదు.” గౌతమ్‌ చెప్పాడు.
‘మీరు ఫోన్‌ ఏ పని మీద చేసారో తెలుపగలరు’ అని కటువుగా సమాధానం చెప్పింది.
రాధ కోపాన్ని అర్థం చేసుకున్న గౌతమ్‌,     ”నేను కొన్ని విషయాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది” అన్నాడు గౌతమ్‌. రాధ దేని గురించి అని అడిగింది.
నా గురించి, నేను కలెక్టరుగా పనిచేస్తున్న విషయం మీతో ఉద్దేశ్యపూర్వ కంగానే చెప్పలేదు, ఎందుకంటే ఒకవేళ నేను కలెక్టర్‌ ననే విషయం మన మొదటి పరిచయంలోనే తెలిసి వుంటే మనం ఇన్ని విషయాలు చర్చించుకోలేక పోయేవాళ్ళం. మన మధ్య హోదాలతో కూడిన పరిచయం ఉండేది. అది నాకు ఇష్టం లేదు. నేను ఒక గిరిజన తెగకు చెందినవాడిని. చాలా కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాడిని. నేను మిమ్మల్ని నేరుగా కలిసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాల నుకున్నా.
కానీ అంతలోనే ఇలా జరిగిపో యింది.
రాధ మనసు కొంచెం శాంతిం చింది. నేను కూడా గౌతమ్‌ ఉద్యోగం గురించి వివరాలు అడగలేదు కదా! కాబట్టి గౌతమ్‌ని నిందించడంలో అర్ధం లేదు. అని రాధ తన మనసులో అనుకుంది. నాకు మీ మీద కోపం లేదు అంది రాధ. ”థాంక్యూ, నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు నాకు, నేను ఒక మంచి వ్యక్తిని కలిసాననే భావన కలిగింది. దానిని నేను పోగొట్టుకోదలచుకోలేదు” అన్నాడు గౌతమ్‌. నిజాయితీగా ఉండటాన్ని నేను గౌరవిస్తానని రాధ అంది. నేను కూడా అని గౌతమ్‌ చెప్పాడు. అప్పటికే చాలా ఆలశ్యం అవటం చేత రాధ తరువాత మాట్లాడుకుందాం అంటూ బై చెప్పింది. తరచుగా గౌతమ్‌ నుండి మెస్సేజ్‌లు రావడం, తీరిక సమయాల్లో ఫోన్‌ చేయడం, సమాజంలో బలంగా నాటుకుపోయిన సమస్యలూ, స్త్రీల సమస్యలూ, కులవివక్షత, గిరిజన తెగల సంస్కృతీ, వారి వెనుకబాటు తనం గూర్చి వారిద్దరి మధ్య చర్చలు సాగేవి. సమాజం పట్ల రాధ దృక్పధం, ఖచ్చితమైన అభిప్రాయాలూ, ఆశయాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. వారి మధ్య జరిగే చర్చల్లో అప్పుడప్పుడు పెళ్లి, సమాజంలో వివాహ వ్యవస్థ, దానితో ముడిపడి ఉన్న విషయాలను మాట్లాడుకునే వారు. ఎంతవేడిగా చర్చలు సాగినా వాస్తవాలను గౌరవించడం వారిద్దరిలో కనిపించేది. గౌతమ్‌ ఎక్కువగా గిరిజన తెగ సాంప్రదాయాల గురించీ, ఆ సమాజంలో స్త్రీల పరిస్థితి గురించీ మాట్లాడేవాడు. అప్పుడప్పుడు, తన ఊరు, తన కుటుంబం, తన గిరిజన తెగ అలవాట్లు, వెనుకబాటు తనం గురించి చర్చించేవాడు.
ఒక రోజు గౌతమ్‌ ఆఫీసు పని మీద హైద్రాబాద్‌కు వచ్చాడు. మరుసటి రోజు ఆదివారం కావడం చేత గౌతమ్‌ ఇక్కడే ఉండిపోయాడు. ఆదివారం ఉదయాన్నే రాధకు ఫోన్‌ చేసాడు.
”మిమ్మల్ని కలవాలనుకుంటు న్నాను కుదురుతుందా”! అని అడిగాడు గౌతమ్‌.
ఆదివారం కావడం చేత రాధ కూడా సరేనంది. మధ్యాహ్నం రెండుగంటల సమయంలో రాధ ఇంటి అడ్రస్సు వెతుక్కు ంటూ వచ్చాడు. కుశల ప్రశ్నలయ్యాక, గౌతమ్‌ మాట్లాడ టానికి చాలా సతమతమవుతున్నట్లుగా అనిపించింది రాధకు. ”ఏదైనా సమస్యా” అని అడిగింది. మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలని వచ్చాను, కానీ ఎలా మొదలుపెట్టాలో నాకు అర్థం కావడంలేదని చెప్పాడు. పర్వాలేదు, చెప్పమని అంది రాధ.
”మీరు నన్ను అపార్థం చేసుకోరని అనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టాడు. మన తొలిపరిచయంలోనే నాకు మీ మీద చాలా మంచి భావన కలిగింది. ఆభావనే మీతో పరిచయం పెంచుకునేలా చేసింది. మీ అభిప్రాయాలూ, మీరు ఏర్పరచుకున్న సిద్ధాంతాలూ, సమాజం పట్ల మీ దృక్పధం, సామాజిక చైతన్యానికి మీరు చేస్తున్న ప్రయత్నాలూ జీవితంపట్ల మీకున్న ఖచ్ఛితమైన అభిప్రాయాలు, విలువలు నాకు చాలా స్ఫూర్తిని కలిగిం చాయి, మిమ్మల్ని మీరు ఒక ఉన్నతమైన వ్యక్తిగా మలచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది.
అందుకే మీలాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే ఆశ నాలో బలపడింది. నేను నా జీవిత భాగస్వామిగా ఎటువంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానో అటువంటి వ్యక్తి నాకు ఎదురైనప్పుడు ఆ సంతోషం వ్యక్తపరచ డానికి మాటలు సరిపోవు. కాని మొదటి పరిచయంలోనే వ్యక్త పరచాలంటే మన మధ్య ఉన్న సంబంధానికి విలువెంత? అనే ప్రశ్న నన్ను చెప్పనివ్వ కుండా అడ్డగించింది. అందుకే నేను మిమ్మల్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి సమయం తీసుకున్నాను. ఇక ఆలశ్యం చేయలేను. మీరంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. మీరు లేని నా జీవితం అసంపూర్ణం అని ముగించాడు గౌతమ్‌.
నిశ్చేష్టురాలైన రాధ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. రాధనే గమనిస్తున్న గౌతమ్‌ నాకు తెలుసు మీకు పెళ్ళి పట్ల కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని మీ స్నేహితురాలు స్వప్న ద్వారా తెలుసుకు న్నాను. వాటిని నేను గౌరవిస్తాను, నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు అని మర్యాదపూర్వకంగా చెప్పాడు గౌతమ్‌.
కాని రాధ మనస్సు ఇవన్నీ వినడానికి సిద్ధంగా లేదు ప్లీజ్‌ గౌతమ్‌గారు, నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను, పెళ్ళి అనే ఆలోచనను మరిచిపోయి చాలా సంవత్స రాలైంది. ఇక ఈ విషయం గురించి నాతో ప్రస్తావించకండి అంది రాధ. రాధ మనస్సు ను కష్టపెట్టడం ఇష్టంలేక సరేనంటూ గౌతమ్‌ బై చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
గతవారం రోజులుగా రాధ చాలా అశాంతిగా కనిపించింది. గౌతమ్‌ పంపు తున్న మెస్సేజ్‌లకు రిప్లై ఇవ్వడం లేదు, కాల్‌ను తీయడం లేదు. చాలా ముభావంగా ఉంటోంది. ఇదంతా గమనించిన స్వప్న తీరిక సమయం చూసుకుని రాధ ఇంటికి వచ్చింది. స్వప్నను చూసిన రాధ, తన ముభావాన్ని కప్పిపెడుతూ మాములుగా ఉన్నట్లు కనిపించింది. కాని రాధ గురించి చాలా దగ్గరగా తెలిసిన వ్యక్తి స్వప్న. రాధ మనస్సులోని గందరగోళాన్ని ఇట్టే పసిగట్టగలదు. రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, జరిగిన విషయాలన్నీ గౌతమ్‌ తనతో చెప్పాడని మొదలుపెట్టింది స్వప్న.
ఇందులో నువ్వు అంతగా బాధ పడాల్సిన అవసరమేముంది?
అదే నాకు అర్థం కావడం లేదని అంది రాధ.
సరే నా ప్రశ్నకు సమాధానం చెబుతావా! అంది స్వప్న . గౌతమ్‌ పట్ల నీ అభిప్రాయమేంటి?
రాధ కొంచెం సంశయిస్తూ గౌతమ్‌ మంచివాడు, సామాజిక సృహ కల్గినవాడు అంది. అంటే, గౌతమ్‌ ఇతరుల అభిప్రాయా లను గౌరవిస్తాడు, ఎందులోనైనా ఆడ, మగ ఇద్దరూ సమానం అని భావిస్తాడు అని అంది రాధ. నీ ముభావానికి, గందరగోళానికి కారణం నాకు అర్థమైంది అని రాధను వెక్కిరిస్తూ, గౌతమ్‌ మీద ఉండే గౌరవం, అతని మీద ఉన్న మంచి అభిప్రాయం అది అంది స్వప్న.
రాధ ప్రశ్నార్థకంగా స్వప్న వైపు చూసింది. అతని ఆలోచనలు, నీ ఆలోచన లు ఒకే విధంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవిత భాగస్వామికి నువ్వు ఉండాలనే లక్షణాలు అతనిలో మెండుగా ఉన్నాయి. అందుకే ”నో” చెప్పడానికి కారణాలు వెతుక్కోవడంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు. నీకున్న అనవస రమైన భయాలు, అపోహలు అన్నీ పక్కన పెట్టి గౌతమ్‌తో వివరంగా మాట్లాడి చూడు, తరువాత నిర్ణయం తీసుకో అంది స్వప్న. రాధ మనుస్సు కొంచెం కుదుట పడి, గౌతమ్‌తో మాట్లాడటానికి తనను తాను మానసికంగా సంసిద్ధం చేసుకుంది.
వారం రోజుల తరువాత రాధ గౌతమ్‌కు కాల్‌ చేసింది. రాధ కాల్‌ కోసం నిరీక్షిస్తున్న గౌతమ్‌ ఆనందానికి అవధులు లేకుండా అయ్యాయి. రాధ చాలా ప్రశాంతంగా మనం మన ఇద్దరి గురించి ఇంకా కొన్ని విషయాలను పూర్తిగా మాట్లాడుకున్న తరువాతనే మనం సరైన నిర్ణయం తీసుకోగలుగుతామని నాకు అనిపిస్తుందని చెప్పింది. అలాగే, ఎప్పుడు కలుద్దాం? అన్నాడు  గౌతమ్‌. రేపు ఆదివారం హైద్రాబాద్‌ రాగలుగుతారా అంది రాధ. మరునాడు ఉదయం 8 గంటల కల్లా గౌతమ్‌ రాధ ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత బాల్కనీలో కూర్చున్నారు. గౌతమ్‌ చాలా సంతోషంగా కన్పించాడు. మన బంధం కొనసాగుతుందనే గొప్ప నమ్మకం నాకు ఉంది. అందుకే నిరాశ పడలేదు. అన్నాడు గౌతమ్‌. నేను మీకు ఇంకా ఓకె చెప్పలేదు కదా అంది రాధ.
ప్రిలిమ్స్‌ పాస్‌ అయ్యామంటే మెయిన్స్‌కి వెళ్ళడానికి మార్గం సులభమ యినట్లే కదా! అని తన స్టైల్‌ లో చెప్పాడు గౌతమ్‌. ముందుగా నా కుటుంబం గురించి నీకు పూర్తిగా వివరించాలి అన్నాడు గౌతమ్‌. నా కుటుంబ సభ్యులు చదువుకున్న వాళ్ళు కాదు, అంతేకాదు నాగరిక ప్రపంచం అని చెప్పుకునే నేటి ప్రపంచానికి మా తెగ వారు దూరంగా ఉంటారు. మా తెగ ప్రజలు పాటించే నియమాలు, అలవాట్లు, అడవి తల్లితో అనుబంధం అంటే నాకు ఎనలేని గౌరవం. మా తెగ ప్రజల వృత్తిని నేను గౌరవిస్తాను. నాగరిక ప్రపంచం పేరుతో చోటుచేసుకుంటున్న మార్పులు మా తెగ ఉనికిని పూర్తిగా కోల్పోయే విధంగా చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన నేటి తరం తమని తాము గిరిజనులుగా చెప్పుకోడానికి కూడా ఇష్టపడటంలేదు. అంతేకాదు బాగా చదువుకున్న వారు తమ తల్లిదండ్రుల యొక్క అలవాట్లను, జీవన శైలిని గౌరవించకుండా పాశ్చాత్య ధోరణిని అలవర్చుకోవాలని వత్తిడి చేస్తున్నారు. ఉన్నత పదవుల్లో పనిచేస్తున్న కొంతమందికి ఇంకా సామాజిక సృహ రావడంలేదు. వీటన్నింటిని దగ్గరగా గమనించిన నేను పెళ్లి పట్ల ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా చేసింది. అందుకే మీలాంటి వ్యక్తి కోసం ఎదురుచూసానని చెప్పాడు గౌతమ్‌. మీకు మనుషుల కులం, జాతి, ఆర్థిక స్థాయి వంటి విషయాలతో సంబంధం లేకుండా గౌరవించే గుణం ఉంది. అందుకే మీరంటే నాకు చాలా గౌరవమని అన్నాడు గౌతమ్‌. నా జీవితంపై కుల, మత, జాతి మొదలైన వాటి ప్రభావం పడకుండా నేను జాగ్రత్త పడుతున్నానని చెప్పింది రాధ.
నేను పెళ్లి విషయంలో కొన్ని నిర్ణయాలను తీసుకున్నాను, వాటిని మీతో వివరంగా మాట్లాడాలంది రాధ. పెళ్లిని ఆర్భాటంగా చేసుకునే బదులు రిజిష్టర్‌ పెళ్లి చేసుకుంటే, పెళ్లి కోసం ఖర్చు పెట్టే డబ్బు పేద పిల్లల చదువు కోసం ఉపయోగిం చవచ్చు, అంతేకాదు నేను ఉద్యోగం చేయడంలో పూర్తిగా నా నిర్ణయం ఉండాలి అంతేకానీ నా మీద ఆంక్షలు ఉండకూడదు. నా వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం దెబ్బతినే ఎటువంటి పనులైనా  నేను చేయలేను అంది రాధ. మీరింతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నా వైపు నుండి గానీ మా కుటుంబ సభ్యుల నుండి గానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అది నా ప్రామిస్‌ అన్నాడు గౌతమ్‌. నేను భర్త అనే హోదాలో మీ మీద పెత్తనం చేయాలనే ఆలోచన కూడా చేయనని మరీ మరీ చెప్పాడు. గౌతమ్‌. మనమిద్దరం ఎవరి స్వేచ్ఛను ఎవరం బంధించవద్దు, నియంత్రిం చవద్దు, మంచి సమాన భాగ స్వాములుగా ఉందాం అన్నాడు గౌతమ్‌. నేను నిర్ణయం తీసుకోవడానికి ఇంకొంత సమయం కావాలని అంది రాధ.
రాధ తన తల్లిదండ్రులకు గౌతమ్‌ తో పెళ్ళి ప్రతిపాదన గురించి చెప్పింది. వారి నుండి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ రాధ వారిని ఒప్పించింది. గౌతమ్‌ అంతకంటే ముందే తన కుటుంబ సభ్యులకు రాధ గురించి చెప్పాడు, వారు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు.
రాధ గౌతమ్‌ల పెళ్ళి రిజిష్ట్ట్రార్‌ ఆఫీసులో కొద్దిమంది స్నేహితుల సమక్షంలో జరిగింది.
రాధ  హైద్రాబాద్‌లోనే ఉంది. గౌతమ్‌ మాత్రం శెలవు రోజుల్లో హైద్రా బాద్‌కు వచ్చేవాడు. కొద్దిరోజులు గడిచాక, గౌతమ్‌ రాధలిద్దరూ 20 రోజుల పాటు శెలవు తీసుకొని మొదటిసారిగా గౌతమ్‌ ఇంటికి వెళ్ళారు. అక్కడ రాధకు భాషా పరంగా కొంచెం ఇబ్బంది కల్గినప్పటికీ గౌతమ్‌ సాయంతో కుటుంబ సభ్యులతో తక్కువ సమయంలో చక్కగా కలిసిపోయింది.
రాధ అక్కడి పరిస్థితులను, ప్రజల జీవన శైలిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. భూముల ఆక్రమణ, మెరుగైన ఆరోగ్య వసతులు లేకపోవడం, పిల్లలకు చదుకోవ డానికి బడులు లేకపోవడం, అమ్మాయిపట్ల వివక్షత, చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు చేయడం, వంటి సమస్యలను కొద్ది సమయం లోనే రాధ గుర్తించింది. అంతేకాదు గిరిజను లు సాంప్రదాయాలు, సంస్కృతి, వేషధారణ, అలవాట్లను మార్చుకోవాలంటూ ప్రత్యక్షం గా, పరోక్షంగా సమాజం నుండి వస్తున్న ఒత్తిడిని కూడా గమనించింది. ఆ ప్రాంతం లో సుమారు 50 గ్రామాల వరకూ ఉన్నా యి. అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిం చింది. ఇవన్నీ చూసిన రాధ మనస్సు చలించిపోయింది.
అక్కడున్న 20రోజుల్లో రాధ, గౌతమ్‌ తమ కుటుంబ సభ్యులతో గడిపిన దానికంటే ఊర్లో మిగతా ఆడ వాళ్ళతో, గ్రామపెద్దలతో, పిల్లలతో మాట్లా డుతూ గడిపిన సమయమే ఎక్కువ. రాధ గ్రామస్థులందరికి బాగా పరిచయమ య్యింది. రాధకు గిరిజన బాష ఏ మాత్రం అడ్డంకి కాలేదు.
ఇక్కడి ప్రజల వెనుకబాటుతనం, సమస్యలను అధిగమించాలంటే వ్యూహాత్మ కంగా పని చేయాల్సిన అవసరముందని గట్టిగా అనుకుంది రాధ. శెలవులు అయిపో యిన తర్వాత రాధ, గౌతమ్‌లిద్దరూ హైద్రాబాద్‌కు వచ్చేసారు. ఆఫీసు పనులతో బిజీగా గడిపినప్పటికీి రాధకు మాత్రం గిరిజన గ్రామాలే గుర్తుకు వస్తున్నాయి.
ఆదివారం శెలవు కావడం చేత గౌతమ్‌ హైద్రాబాద్‌కు రాధను చూడటానికి వచ్చాడు. ఇద్దరూ మామూలు విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు. నేను ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నాను అంది రాధ.
ప్రశ్నార్థకంగా రాధవైపు చూసాడు గౌతమ్‌.
నేను మన గిరిజన గ్రామాల్లో పని చేయాలని అనుకుంటున్నా,
రాధ నిర్ణయం వినగానే గౌతమ్‌ కళ్లు కోటి ఆశలతో మెరిసాయి.
మి లాంటి రాధలు ఎంతో మంది అవసరం, తప్పకుండా వెళ్ళండి.
మీ ప్రయాణంలో నేను కూడా ఉంటాను. అన్నాడు గౌతమ్‌.
రాధ అపారమైన నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.