పి.సరళాదేవి కథలలో స్త్రీ పాత్రలు
Posted By భూమిక on October 16, 2008
డా. పి.శర్వాణి
పి. సరళాదేవి 1937 విజయనగరంలో జన్మించారు. అక్టోబరు 19, 2007లో మరణించారు. వీరు మెట్రిక్యులేషన్ మాత్రం చదువుకున్నారు. కానీ ”కాలాతీత వ్యక్తులు” రచయిత్రి డా|| పి. శ్రీదేవి స్నేహం, ప్రోత్సాహంతో రచనా వ్యాసంగం చేపట్టి, స్త్రీ కుటుంబ జీవనంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని 1960 నుండి కథలు రాయడం మొదలుపెట్టారు. ఆమె కథలు రాశిలో చిన్నవైనా వాసిలో గొప్పవి.
1962లో తొలిముద్రణగా వెలువడిన ‘కుంకుమరేఖ’లతో పాటు, 1978లో ‘సరళాదేవి కథలు’ వెలువరించారు. ప్రముఖ రచయిత్రులు ఆరుగురితో కలిసి ‘సప్తపది’, ‘షణ్ముఖప్రియ’ గొలుసు నవలలు రాసారు. ‘కొమ్మా-బొమ్మా’, ‘చిగురు’ రెండు చిన్న నవలలు పుస్తకరూపంలో తెచ్చారు. తెలుగువారి కుటుంబ జీవనంలో వినవచ్చే సామెతలకు సంబంధించి ”తెలుగు సామెతలు-సాంఘిక చరిత్ర” అనే గ్రంథాన్ని ప్రచురించారు.
కథానిక దీర్ఘంగా సాగిపోకుండా పొందికగా ఉండాలి. అందులో దీర్ఘసమా సాలు, వర్ణనలు అవసరం లేదు. పఠితకు సంభ్రమాశ్చర్యాదులు కలిగించే విచిత్ర సంఘటనలుండాలి. కథాగర్భంలో కరుణ రసోత్పాదకమైన సన్నివేశాలుండాలి. పాఠకులు ఊహించని అద్భుతమైన మలుపుతో కథ ముగియాలి.
ఇతివృత్తంలో, శైలిలో ఆధునికతను సంతరించుకున్న తొలి కథ గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’. దాంతోపాటు వారు చాలా కథలను రచించారు. ఒకప్పుడు కాలక్షేపానికి పరిమితమైన కథ నేడు సామాన్య మానవ జీవిత పరిధిలోకి చొచ్చుకొనిపోయి వారి సమస్యలను, వర్గవైషమ్య్లలను సూచిస్తుంది.
పి. సరళాదేవి మధ్యతరగతికి చెందిన విద్యావతియైన యువతి కాబట్టి ఆనాటి యుగసంధిలో కొత్తపాతల మధ్యపడి, గమ్యమేదో తెలియక దిగ్భ్రాంతులవుతున్న ఆధునిక యువతులను, వారి బాధలను నేర్పుతో చిత్రించారు. తన కథలలో మనకటువంటి యువతులను పరిచయం చేసారు.
హేమలత -
‘కుంకుమరేఖలు’ కథలో నాయకురాలు హేమలత. పెళ్ళయిన తరువాత సంసారాన్ని బాగా నడిపి, డబ్బు మిగిల్చి, అందరికీ మార్గదర్శి కావాలని ఆశించింది. పెళ్ళయిన ఒకటి రెండు నెలలు బాగా గడిచినా, తరువాత ఏదో ఒక ఖర్చు వచ్చి డబ్బు ఖర్చయిపోయేది. చివరకు ఎన్.జి.ఓ.కు డబ్బు మిగలడం కలలో మాట, అప్పులు కాకుండా ఉండడమే మిగులు బడ్జెట్టు అని తెలుసుకుంది.
హేమలత మన మనసుకు తప్పుకాదు అని తోస్తే, ఆ పనే చేయాలి అనే మనిషి. పన్నెండేళ్ళమ్మాయి డాన్సు ప్రోగ్రాం చూసి, ఆ సొగసులు, ఆ వగలు ఆ వయసులో ఆ పిల్ల చూపించవలసినవేనా? అంది. దాంతో వాళ్ళకి హేమలతకి విరోధం వచ్చింది. మహిళా సంఘం ొచూసి అక్కడి విషయం నచ్చక ొమాట్లాడి, అందరిచేత తిరస్కారం ఎదురుకుంది. చివరకి పేరంటంలో భర్త వెంటనే వెళ్ళకపోతే చిందులు త్రొక్కుతారన్న అబద్ధాన్ని అందర ఒప్పుకున్న తీరుచూసి, కొత్తపాఠం నేర్చుకుంది.
హేమలత అత్తవారింటికి పండగకు వెళ్ళింది. అక్కడ ఆడపడుచులు, తోడి కోడళ్ళు తమ తమ పుట్టిల్లు ఎంత గొప్పవో చెప్పుకోసాగారు. దాంతో హేమలత తాను సామాన్య హెడ్మాష్టరు కూతురునని చిన్నబోయింది. చివరకు పావని ఉయ్యలలో వేసే సమయంలో తన పుట్టింటి వారి గొప్పతనం అతిశయంతో చెప్పుకుని మనశ్శాంతి పొందింది.
హేమలత పిల్లవాడు పుట్టాక మాటలు నేర్చుకుంది. బాధ్యతగా మాట్లాడలని చిన్నప్పటిలాగా అంటీ ముట్టనట్టుగా ఉండకూడదని తెలుసుకుంది. చివరకు భర్త పార్థసారథి ”ఇంక ఫరవాలేదు హేమలత బ్రతకడం నేర్చుకుంది” అని అనుకున్నాడు. మనుషుల మనస్తత్వాలు, మాట్లాడవలసిన తీరు అంతా ఈ కథలో రచయిత వివరించారు.
రుక్మిణి -
”సరస్వతులను చేయబోతే కథలో ప్రధానపాత్ర రుక్మిణి. ఏడుగురు అన్న దమ్ముల తరువాత ఆడపిల్ల. తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. అన్నదమ్ములు కంటికిరెప్పలా పెంచారు. డాక్టర్ను చేయాలని ఉవ్విళ్ళూరారు. కాని రుక్మిణి మాత్రం ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టిన లక్ష్మణమూర్తిని వివాహం చేసుకుంది.
రుక్మిణికి పుట్టిన ఆడపిల్ల విజయలక్ష్మినన్నా చదివిద్దామనుకుంటే, ఆమె కూడా చదువుకుంటున్నప్పుడే ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆడపిల్లల జీవితాలు వివాహం వైపుకే అడుగులు వేస్తాయంటూ రుక్మిణి పెద్దన్నయ్య వాపోయడు.
జానకి -
”తిరిగిన మలుపు” అనే కథలో ప్రధానపాత్ర జానకి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన జానకి, ఆఫ్రికా ఖండంలో నైరోబీలో మూడేళ్ళు జీవించి పరిణతి పొందడం ఈ కథ వివరిస్తుంది.
ఆడపిల్లకు చదువెందుకు అన్న తండ్రి వల్ల ఫిఫ్తుఫారంలో జానకి చదువు ఆగి పోయింది. పెళ్ళయి అత్తవారింట్లో అలా అడుగుపెట్టిందో లేదో ఢిల్లీలో భర్తకు ఉద్యోగం. ఢిల్లీ జీవితం వంటబట్టలేదు. వెంటనే కెన్యాలోని ఇండియ రాయబార కార్యాలయంలో ఉద్యోగం వేసారు. అక్కడ మూడేళ్ళ జీవనం తరువాత సొంత ఊరు వచ్చింది.
పుట్టింల్లో తనకు ఎదురైన మాటలు, మనస్తత్వాలు తన వాళ్ళ మధ్య దరం పెంచాయి. విశాఖపట్టణంలో భర్త ప్రసాదరావు మాటలు ఎక్కడ మొదలైనా జానకి దగ్గర ముగిసేవి. అది జానకీకి కోపం తెప్పించి భార్యాభర్తల మధ్య దూరం పెంచింది.
తిరిగి భర్త ఉద్యోగరీత్యా ఢిల్లీకి వెళ్ళినప్పుడు తన పరిణతిని అక్కడి వాళ్ళకు ొచూపించింది. అందరి మెప్పు పొందింది. చివరకు కూతురు శోభ వల్ల వాళ్ళు కలతలు ొమారి కలుసుకున్నారు. జీవితంలోని వైవిధ్యాల వల్ల స్త్రీ జీవితంలో కలిగే మార్పులను జానకి పాత్ర ద్వారా రచయిత్రి వర్ణించారు.
శకుంతల -
”ఇల్లూ-ఇల్లాలూ” అనే కథలో శకుంతల ప్రధానపాత్ర. వివాహం అయిన తరువాత శకుంతల రాజారావు తీసుకున్న పెద్ద ఇంట్లోకి వచ్చింది. ఒకసారి ఉద్యోగ పనిమీద రాజారావు మూడురోజులు ఊరు వెళ్ళాడు. జవాను అప్పలస్వామిని పడుకోమన్నాడు. ఆ రోజు రాత్రి శకుంతల దొంగ భయంతో నిద్రపోవడం మానేసింది. రాజారావు వచ్చిన తరువాత చిన్నిల్లు చూడమని పోరుపెట్టింది. ఆ పోరు భరించలేక చిన్నిల్లు ొచూసి ొమారారు. అక్కడకు వచ్చిన తరువాత భయమనే మాట శకుంతల ఎత్తలేదు. ఆ విషయం రాజారావు అడిగితే, ఆ అనువనం అలాగే ఉండనివ్వండి. ఎలాగ ఇల్లు మారి పోయం కదా అని సమస్యలు తీరిన శకుంతల నవ్వేసింది. ఇల్లును బట్టి మారిన శకుంతల మనస్తత్వాన్ని ఈ కథలో చిత్రించారు.
కౌసల్య -
”దుర్బలుడి వాగ్ధానం” అనే కథలో కౌసల్య ప్రధానపాత్ర. ఆమె చదువుకుంటున్న యువతి. ఒకసారి రైల్లో పరిచయం అయిన ప్రభాకరం వివాహం చేసుకుంటానన్న ప్రస్తావన చేసాడు. చదువు పూర్తయిన తరువాత చేసుకుంటానన్నది. చదువు పూర్తయ్యక కౌసల్య అన్నయ్య ముహూర్తం పెట్టి ప్రభాకరానికి ఉత్తరం రాసాడు. ప్రభాకరం తండ్రి ఈ వివాహం జరిగితే ఆస్తిలో దమ్మిడీ రాదని తేల్చాడు. ఆ మాటలకు లొంగి వివాహం వాయిదా వెయ్యమన్నాడు. కానీ కౌసల్య అన్నగారు ”పౌరుషంలేని నీలాంటివాడికి చెల్లెల్నివ్వలేను” అని టెలిగ్రాం పంపాడు. చదువుకున్న యువతులు వివాహం విషయంలో చొరవ తీసుకున్నా దానిని యువకులు అందుకోలేరని ఈ కథలో చెప్పారు.
కూతుళ్ళు -
రాఘవయ్య, సుందరమ్మలకు కాంతం, రాజ్యలక్ష్మి, శ్యామల, పద్మ నలుగురు కూతుళ్ళు. వీరికి దాదాపు ఒకేసారి తొలిచలు. వరుసగా పుట్టింటికి వచ్చారు. కాంతంకు అన్నీ వైభవంగా జరిగాయి. రాజ్యలక్ష్మికి కొంత తక్కువలో సీమంతం, నామకరణోత్సవాలు జరిగాయి. శ్యామల తన డబ్బు ఇచ్చి అన్నీ చేయించుకుంది. పద్మ ఎవరికీ ఖర్చులేకుండా ప్రవర్తించింది. పద్మ ఈనాటి తరం యువతి. పరిస్థితులకు అనుగుణంగా ధైర్యంగా నడుచుకుంది. ఆడపిల్లల మనస్తత్వాన్ని ఈ ”కూతుళ్ళు” కథలో రచయిత్రి వివరించారు.
సుశీల -
”తొలిచలు” కథలో నాయకురాలు సుశీల. సుశీల మూడవనెల దగ్గరనుండి పిల్లవాడు పుట్టేవరకు జరిగిన సంఘటనలు ఈ కథలో వివరించబడ్డాయి. సుశీల మగపిల్లవాడే కావాలని పడ్డ ఆరాటం, దానిని నెగ్గించుకున్న తీరు చిత్రించబడింది.
దుర్గ -
”ఎదురుచూసిన ముహూర్తం” కథలో ప్రధానపాత్ర దుర్గ. తన వాళ్ళు తన కోసం ఏదైనా వస్తువు కొనిపెడతారని చిన్నప్పటి నుండి చనిపోయే వరకు ఎదురుచూసింది. చివరకు అది చనిపోొయాక తీరింది.
దుర్గ చిన్నప్పుడు పువ్వుల గౌను వేసుకోవాలనుకుంది. నాన్న కొట్టిన తరువాత మరి అడగలేదు. ఉద్యోగంలో చేరాక ఇంటికే జీతం ఖర్చు పెట్టింది. వివాహం అయ్యక తన జీతం కూడా భర్తే తీసుకునేవాడు. పిల్లలు తనలా బాధపడకూడదని, అడగకముందే అన్నీ తీర్చేది. వాళ్ళ దగ్గర నుండీ ఆ కోరిక తీరలేదు. చివరకు చనిపోయాక తీరింది.
కమలం -
”తొణికిన స్వప్నం”లో నాయకురాలు కమలం. ఆమె చుట్టూ కథ తిరుగుతుంది. పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది. అక్క, అన్నయ్య పెళ్ళిళ్ళు అయ్యక పిన్ని దగ్గర పెరిగింది. వివాహమయ్యక భర్తకు మరో స్త్రీతో సంబంధం ఉందని తెలిసింది. పిల్లవాడు పుట్టినా ఆమె ప్రమేయం లేకుండానే అత్తగారి దగ్గర పెరుగుతుంటాడు. కమలం ప్రమేయం లేకుండానే, ఆమె జీవితం నడిచింది.
జమున -
”భిన్నత్వంలో ఏకత్వం” అనే కథలో జమున ప్రధానపాత్ర. ఆమె డాక్టరీ చదవలేకపోయినా, డాక్టర్ని భర్తగా చేసుకుంది. మూడు నెలలు బాగానే ఉంది సంసారం. ఆ తరువాత కష్టాలు మొదల య్యయి. ఆ డాక్టర్ భర్త భార్యను అడపాదడపా చితకగొట్టడం మొదలు పెట్టాడు. ఈ తతంగం అంతా చూస్తున్న పుట్టింటివాళ్ళు, అతనికి విడాకులు ఇచ్చి వచ్చేయమన్నారు. బి.ఏ. చదివిన ఆ అమ్మాయి దానికి ఇష్టపడలేదు.
”దుర్మార్గుడైన పురుషుడ్ని రెచ్చగొట్టే స్త్రీ దుర్మార్గురాలు కాదా? ఈ నిర్ణయంలో వీళ్ళు సాధించదలుచుకున్నదేమిటి? భయంకరమైన సత్యమేదో కనిపించీ కనిపించనట్లయింది. అదే నిజమయితే వీళ్ళ ప్రయాణం ఏ దిక్కుకి?” అని రచయిత ప్రశ్నించారు. దీనికి జవాబు కాలమే చెప్పాలి.
శకుంతల -
”వక్రించిన కీర్తికాంక్ష” అనే కథలో శకుంతల ప్రధానపాత్ర. శకుంతల నీటి కోసం తన ఇంటి బావికి వచ్చేవారికి పెరటి తలుపు తీసి ఆదరించేది. తన భర్తకు ట్రాన్స్ఫర్ అవగానే ఆ ఊరిలోని ఇంటి ప్రక్కనున్న ఉమను నీరు కోసం పొగిడేసరికి శకుంతలకూ కీర్తికాంక్ష ఆవహించింది. తానూ రెండు రోజులకొకసారి వత్రం తలుపు తీసేది. చివరకు ”రాతిగుండె! ఆడదై పుట్టవలసినది కాదమ్మా!” అన్న నీళ్ళు తీసుకుపోతున్న ఒకావిడ మాటలు విని శకుంతల నీరై పోయింది. కీర్తికాంక్ష మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది అన్న విషయం శకుంతల పాత్ర ద్వారా రుజువవుతుంది.
రాజేశ్వరి -
”అనిపించని అజ్ఞానం”లో రాజేశ్వరి ప్రముఖపాత్ర. పనిమనుషులలో నీతినియ మం ఉంటుందని ఈ కథ చెబుతుంది. రాజేశ్వరి పనిమనిషి ఇల్లు కాలిపోయింది. ఆ విషయం ఆమె కూతురు చెప్పగానే, తన గిన్నె ఏమయ్యిందో అని బెంగపడింది. గిన్నె రాగానే డబ్బులు అడుగుతుందేమొనను కుంది. కానీ అడగకుండా వెళ్ళిపోయేసరికి నిర్విఘ్నరాలైపోయింది. ఇందులో మధ్య తరగతి ఇల్లాలు మనస్తత్వం కనిపిస్తుంది. మధ్యతరగతి ఇల్లాలుకు రాజేశ్వరి ప్రతీక.
పి. సరళాదేవి తన కథలలో మధ్యతరగతి స్త్రీలను చిత్రించారు. స్త్రీ సహజ కోరికలు, ఆమె పరిణతి, ఆమె బాధ్యతలు ఇలా పలురకాలైన స్త్రీ జీవిత కోణాలు తన కథలలో చూపించారు.
Comments
Leave a Reply