బాల్య స్మృతుల్లేని తరం వెంపర్లాట – పి. ప్రశాంతి

కొబ్బరి పుల్లల చీపురుతో వాకిలూడుస్తున్న చప్పుడికి మెలకూ వచ్చిన శాంతి కళ్ళు తెరిచి చూసింది. ఆరుబైట వరసగా వేసిన నవ్వారు మంచాలు, మడత మంచాలు… వాటి మీద సుఖంగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదీ కనిపించారు. అమ్మమ్మకి మాత్రం దినచర్య ప్రారంభమైపో యినట్లుంది మంచం ఖాళీగా ఉంది. చల్లటి పిల్లగాలి మృదువుగా ముఖానికి తాకుతూంటే హాయిగా అనిపించి కళ్ళు మూసుకుంది.

ఎండాకాలం సెలవులకి అమ్మమ్మగారి ఊరొచ్చి చేరిపోయారు శాంతి, వీణ, నీలు, పమ్మూ… ఇంకా కజిన్స్‌ అందరూ కలిసి దాదాపు 15 మంది వరకూ ఉంటారు. వేసవి సెలవులోస్తే చాలు వీళ్ళందరికీ పెద్దపండగే. ఊరి మెయిన్‌బజార్లో ఉన్న అమ్మమ్మ, నానమ్మల ఇళ్ళు ఈ సెలవులన్నాళ్ళూ వీళ్ళ ఆటపాటలతో హోరెత్తిపోతాయి. అందరూ ఒకింట్లోచేరి అంతూపొంతూ లేని కబుర్లతో ఏ మధ్య రాత్రికో దొరికిన మంచం మీద పడుకునేవారు. తెల్లారేలేచిన అమ్మమ్మా, నాయనమ్మలు పిల్లలేఇంట్లో ఉన్నారో చూసిరండని పాలేరుకి పురమా యిస్తే ఏ యింట్లో పిల్లల అల్లరి వినిపిస్తుందో ఆ ఇంటికెళ్ళి ”చూసిరమ్మన్నార”న్న వార్త ఆ యింటి వారికి అందించేసి వెళ్ళిపోతాడు. ఫోన్లులేని, ల్యాండ్‌లైన్‌

ఉన్నా దూరపూళ్ళకి తప్పించి ఫోన్లు చేయని ఆ రోజులెంత బాగుండేయో!!

మామిడి పిందెలు, చెరుగ్గడలు, సీమచింతకాయలు, పనస తొనలు, చిన్నుసిరికాయలు, తాటిముంజెలు, వేరుశనగగుళ్ళు, రేక్కాయలు… ఇదీ అదని లేదు చెట్లకింద, గట్టమీద, చెరువు గట్టమ్మట, చేలల్లో… ఏవి ఎక్కడ దొరికితే అక్కడే పండగ. మిట్టమధ్యాహ్నాలు వడదెబ్బ కొడ్తుందని ఇంటి వసారాలో చేరి పచ్చీసు, దాడీ ఆటలాడటమో, చింత పిక్కలతోనూ, గచ్ఛకాయల్తోనూ  ఆడుకోడమో లేదా అందరూ మూకుమ్మడిగా చేరి వాళ్ళ స్కూల్‌లో చేసిన అల్లరి గురించో, చదువుల గురించో, అమ్మానాన్నలు కోప్పట్టం  గురించో కబుర్లు కలబోసుకునేవారు.

అంతలో దూరంగా చెరువుగట్టు మీదెక్కడో గంట శబ్దంతో పాటు ‘ఐస్‌’ అని వినిపించగానే ఒకరి ముఖాలొకరు చూసుకుని కూడబలుక్కున్నట్టే అందరూ జట్లుగా విడిపోయేవారు. ఇద్దరు, ముగ్గురు గిన్నెలో, గ్లాసులో తీసుకురాడానికెళ్తే, రెండు జట్లు ఇంటికి రెండోపులా ఉండే వీధి గుమ్మాలవైపు పరుగు తీసేవారు – ఏదో ఒక జట్టుకి ఐస్‌ డబ్బా సైకిల్‌ వాలా దొరికిపోతాడని. ప్రతిసారీ అమ్మమ్మనో, తాతగార్నో అడిగి డబ్బులు తెచ్చుకోడం శాంతి వంతయ్యేది. శాంతి గౌను చివరో, చిటికిన వేలో పట్టుకుని పెద్ద సపోర్ట్‌లా వెనకే వెళ్ళేది అందర్లో చిన్నదైన పమ్మూ. అంతా కలిసి  అందరికీ ఒక్కో పుల్లైసు పంచుకుంటూ వచ్చేవారు. చివర్లో మిగిలిన  చల్లని నీళ్ళని కూడా పంచుకుని తాగేసేవారు.

ఇది అయ్యీ అవ్వకముందే ‘మల్లెపూలూ’ అని అరుస్తూ సైకిల్‌ బెల్‌ కొట్టుకుంటూ వీరయ్య వీధిలో నుండి వెళ్ళడం చూసి ఎవరో ఒకరు లోపలికి పరిగెత్తి ప్లాస్టిక్‌ పూల బుట్ట రెండు రూపాలు పట్టుకుని వచ్చేవారు. వాటితో ఇద్దరు, ముగ్గురు రామాలయానికి వెళ్ళేవారు. అక్కడ వరండాలో వీరయ్య ఎప్పుడొస్తాడా మల్లెమొగ్గల బస్తా ఎప్పుడు విప్పుతాడా అని ఎదురు చూసేవారు. వీరయ్య వస్తూనే ”పాపమ్మ గారూ… బాగున్నారా… ఎన్ని మొగ్గలెయ్యాలండి…” అనేవాడు. వంద మొగ్గలు పావలాకి (25 పైసలికి) ఇచ్చే వీరయ్యతాత వీళ్ళకెంతో ఆప్తుడు, మరి వీళ్ళకి రెండ్రూపాయలకే వెయ్యి మొగ్గలిచ్చేవాడుగా! మొగ్గల కోసం వెళ్ళినవాళ్ళు అవి తీసుకోచ్చేలోపు ఇంట్లో ఉన్న వాళ్ళు పాత శుభలేఖల్ని వెతికి పట్టుకుని అమ్మమ్మ కుట్టుమిషన్‌ మీద కత్తెరతో రకరకాల సైజుల్లో చక్రాల్లా కత్తిరించటం, రెండు సూదుల్లో తెల్లదారం ఎక్కించి ఉంచటం చేసేవారు. మరో ఇద్దరు చిన్న ప్లాస్టిక్‌ బుట్టో, గిన్నో పట్టుకొచ్చి దొడ్లో ఉన్న కనకాంబరం పూలు, మరువం కొమ్మలు కోసుకొచ్చేవారు. అప్పటికి టీ తాగేసి వసారాలోకొచ్చి అరుగుమీద కూర్చునేది అమ్మమ్మ. పిల్లలంతా అమ్మమ్మ చుట్టూ చేరి అందరూ తెచ్చినవన్నీ ఒక దగ్గర పెట్టేవారు.

పిల్లలు పోటీపడి పూలందిస్తుంటే గుండ్రంగా కట్‌ చేసి పెట్టిన  కార్డుల మీద ఒక్కోపూవు అందంగా అమర్చి కుట్టేవారు. చుట్టూ రెండు వరసలు మల్లె మొగ్గలు, వాటిలోపల కనకాంబరాలు, మధ్యలో మరువం… మూడు రంగుల్లో చూట్టానికి ముచ్చటగా ఉండే పద్మాలు తయారైపోయేవి ఒక అరగంటలో. ఆ రోజు చక్రాల పూలజడ వేసుకునేది ఎవరో ముందే వంతులేసుకునేవారు కనుక ఆలస్యం లేకుండ రడీ అయిపోయివచ్చి అమ్మమ్మ ముందు కూర్చునేవారు. నున్నగా దువ్వి జడకుప్పెలు వేసి గట్టిగా అల్లిన జడపైన పెట్టి మల్లెపూల కుడ్తుంటే సంతోషంతోను, మల్లెపూల వాసనిచ్చిన నిర్మలత్వంతోను ముఖాలు మెరిసిపోతుండేవి.

తర్వాత పెద్దమ్మమ్మ ఇంటికి, చిట్టిమామ్మ ఇంటికి, చిన్నాయ నమ్మ ఇంటికి… ఇలా చీకటిపడి లైట్లేసే వరకు అందరిళ్ళకీ వెళ్ళి పలకరించి, పట్టులంగాకి జడకి మ్యాచైందనో, పెళ్ళికూతుర్లా ఉన్నావ్‌… ఆలస్యమెందుకు అని వరసైన వారి సరసాలో… అన్ని రకాల వ్యాఖ్యానా లతో ఇంటికి తిరిగొచ్చేసరికి చీకటిపడేది. ఒక్కో ఇంట్లో ఒక్కోరకం పిండివంట తినొచ్చినా ‘పాపమ్మగారూ… ముంజికాయలు తెచ్చా….’ అన్న పెద్దపాలేరు నాంచారి కేకకి కడుపంతా ఖాళీ అయిపోయి తాటి ముంజెల కోసం రడీ అయిపోయేది. పై గౌన్లు తీసేసి షమ్మీలతో వసరా అంచున వరసగా కూర్చుంటే ఎన్ని ముంజెలు తింటున్నారో తెలిసేదికాదు. ముంజె నోట్లోకి వెళుతుంటే కడుపులో చల్లగా హాయిగా ఉండేది.

మమ్మీ అన్న తన్మయ్‌ మాటతో సినిమా రీళ్ళలా కళ్ళ ముందు కదుల్తున్న దృశ్యాలు, ఆలోచనలు చెదిరిపోయాయి. సెలవులకొచ్చిన ఆరుగురు పిల్లలు టీవీకి అతుక్కుపోయో, సెల్‌ఫోన్స్‌లో ఎవరికి వారు ఆటలాడుకుంటూనో, కంప్యూటర్‌లో వర్చ్యువల్‌ గేమ్స్‌ ఆడుతూనో, ఐ ప్యాడ్‌లో వీడియోస్‌ చూస్తూనో, మైండ్‌ గేమ్స్‌ బుక్‌లో సుడొకు నింపు తూనో… అందరూ ఒకే దగ్గరున్నా ఎవరి లోకం వారిదన్న ట్లున్న ఈ కాలం పిల్లల్ని చూసి దిగులేసింది శాంతికి. ఈ పరిస్థితికి కారణ మేంటి? పల్లెల్నొదిలి పట్నాలకొచ్చేసినందుకా? కాని పల్లెల్లో ఏముంది ప్రస్తుతం… సిసి రోడ్డు కోసం పెద్ద పెద్ద చెట్లని కూల్చేసి… నీరు భూమీలోకింకకుండా సిమెంటు చేసేసిన, పిట్టలు, చెట్లు, చల్లదనం లేని ఊర్లు… సాగు నీరు లేదని, కూలీలు దొరకట్లేదని వ్యవసాయం ఒదిలేసి వ్యాపారాల్లో చేతులు కాల్చుకుంటున్న రైతు కుటుంబాలు.. అభివృద్ధి పేరుతో సహజవనరుల్ని విచ్ఛిన్నం చేస్తున్న సర్కారు… గ్లోబలైజేషన్‌, స్వేచ్ఛా విపణి విధానాలతో టెక్నాలజీ పేరిట మానవ సంబంధాల్ని తుంచేసిన గ్యాడ్జెట్లు .. ఏది ఏమైతేనేం నష్టపోతున్నది మాత్రం మానవ సంబంధాలంటే పుస్తకాల్లో నేర్చుకోవాల్సి వస్తున్న ఈ తరం బాలలు… యువత. ఎవరిది తప్పు? వేటిని తప్పు పట్టాలి?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.