పితృస్వామ్య బహుళ అస్తిత్వాన్ని ప్రశ్నించిన నవల ”ఆమె అడవిని జయించింది” – ఎస్‌. చంద్రయ్య

సంక్షిప్తి

డా. గీతాంజలి గారు రాసిన నవల- ”ఆమె అడవిని జయించింది”. స్త్రీవాద ఉద్యమం ప్రశ్నించిన అనేక అంశాల్లో ముఖ్యమైనదీ, బహుళ వికృత అస్తిత్వాల్ని కలిగిందీ పితృస్వామ్య వ్యవస్థ లేదా పురుషాధిక్యత. గీతాంజలి గారు ఈ నవలలో చర్చించిన అనేక అంశాలకూ ఇదే ప్రధాన భూమిక. కనుక ఈ పత్రంలో పితృస్వామ్య వ్యవస్థ, రూపంలో కనిపించకుండా సారంలో ఎన్ని ముఖాలుగా వర్తిస్తూ స్త్రీల అభివృద్ధికి ఆటంకాన్ని కల్గిస్తుందో విశ్లేషించాను. పితృస్వామ్య వ్యవస్థ ఒక భావజాలంగా స్త్రీల ప్రవర్తనను కూడా ఎలా నియంత్రిస్తుందో, ఎలా పరివర్తింపజేస్తుందో, తోటి స్త్రీలను ఎలా శతృవులుగా భ్రమింపజేస్తుందో ఈ పత్రంలో విశ్లేషించాను.

1. నేపథ్యం

ఇరవయ్యవ శతాబ్ది ఉత్తరార్థంలో తెలుగునేల మీద అస్తిత్వ ఉద్యమాలు బౌద్ధిక, భౌతిక రంగాల్లో తీవ్రమైన అలజడులను, ప్రకంపనాలను సృష్టించాయి. ‘సమాజంలో మా స్థానం ఏమిటి?’ అనే ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చాయి. కుల, లింగ, మత, ప్రాంత మొదలైన సమూహాలుగా చీలిపోయి తమ అస్తిత్వం కోసం పోరాటం మొదలెట్టాయి. వీటినుంచి ప్రేరణ పొందిన కవుల, కళాకారుల, రచయితల ”వస్తువు”లో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ సమూహానికి సంబంధించిన కవులు ఆ సమూహానికి ప్రాతినిధ్యం వహించే సాహిత్యాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంతో ముందుకు వచ్చిందే స్త్రీవాద సాహిత్యం. అంతకు పూర్వం అనేక రకాల విలువల పేరుతో కొనసాగుతూ స్త్రీలను అణచివేస్తున్న సమాజాన్ని, అందుకు మూలమైన పితృస్వామ్యాన్ని పునాదులతో సహా పెకలించాలనే కాంక్ష కలిగిన రచనలు విస్తృతంగా వెలువడ్డాయి.

పితృస్వామ్య భావజాలమంటే కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాకుండా అది స్త్రీలను కూడా ప్రభావితం చేసి తోటి స్త్రీలను శతృవర్గంగా ఎలా మలిచిందో అనే ఎరుక స్త్రీవాద రచయితల్లో ఉండటం వారి ప్రాపంచిక దృక్పథ పటిష్ఠతను తెలియజేస్తుంది. సరిగ్గా ఇటువంటి ప్రాపంచిక దృక్పథంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న రచయిత్రి డా. గీతాంజలి గారు. ఈమె రాసిన ”ఆమె అడవిని జయించింది” నవల అనేక విమర్శలకు కేంద్రంగా మారి, స్త్రీవాద రచయితల బౌద్ధిక రంగాన్ని విస్తరింపజేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ నవలలోని ఇతివృత్తం విషయానికి వస్తే, ‘సంధ్య’ తన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా నాన్న పురుషాధిక్యాన్ని భరించలేనితనంనుంచీ, స్త్రీ పురుష సంబంధాల విషయంలో ఉన్న అదర్శాత్మకమైన విలువలు ఆచరణలో సాధ్యంకానితనంతో తీవ్ర ఘర్షణకులోనై, చివరకు ఈ సామాజిక అసమానతలకు వైయుక్తిక స్థాయిలో కాకుండా సమిష్ఠి ఉద్యమ నిర్మాణంలోనే పరిష్కారముందని నమ్మి, మహిళా ఉద్యమంలో భాగం కావడం ఈ నవల్లోని సారాంశం.

2. ఈ నవలలో ప్రదర్శితమైన పితృస్వామ్య వ్యవస్థ బహుముఖీనత

డా. గీతాంజలి గారు ఈ నవలలో ముఖ్యంగా 2.1 కుటుంబం 2.2. సమాజం అనే రెండు స్థాయిల్లో పితృస్వామ్య వ్యవస్థ దృగ్గోచరం కాకుండా సారంలో స్త్రీలను ఎలా కట్టడి చేస్తుందో చిత్రించింది.

2.1. కుటుంబం

”సమాజంలో ప్రాథమిక యూనిట్‌ అయిన కుటుంబం బహుశా మిగిలిన అన్నిటి కంటే ఎక్కువగా పితృస్వామిక స్వభావాన్ని కలిగి ఉంది. దీనిలో పురుషుడే కుటుంబ పెద్దగా ఉంటాడు. కుటుంబంలోపల అతను స్త్రీల లైంగికత్వాన్ని, శ్రమను లేదా

ఉత్పత్తిని, పునరుత్పత్తిని, వారి ప్రతి కదలికనూ కంట్రోలు చేస్తుంటారు. పురుషుడు గొప్పవాడిగా, ఆధిపత్యం చలాయించేవాడిగా, స్త్రీ తక్కువదిగా, లొంగివుండేదిగా జీవించే ఒక అధికార విధానం కుటుంబంలో ఏర్పడి ఉంటుంది” (కమలా ‘భసీన్‌ (మూలం)’. ఓల్గా (అనువాదం) 1996; 14) కనుక స్త్రీ అణచివేత మొదట కుటుంబం నుంచే మొదలవుతుంది. ఈ నవలలో రచయిత్రి ‘సంధ్య’ అనే పాత్రను నిర్మించిన విధానమంతా కుటుంబం కేంద్రంగా వ్యవస్థీకృతమైన పురుషాధిక్యతను విమర్శించటంలో భాగంగానే జరిగింది.

సుమతి తమ ఇంటి పని మనిషి చెంద్రిని గూర్చి చెబుతూ, సంధ్యతో ”మీకు అదంటే మస్తు ఇష్టంగని వైని, అది నలుగుర్ని మార్చింది” అని వ్యంగ్యంగా నవ్వగా… ”భర్తతాగి తన్ననీ, శీలాన్ని అనుమానించనీ, అవమానించనీ… శరీరమూ ఆత్మ నుజ్జు నుజ్జు అయిపోనీ… మంగళగౌరీ వ్రతాలు చేస్కుంటూ ఆ భర్తగారి ఆయురారోగ్యాలు దివ్యంగా ఉండి బాగా దంచడానికి, పెత్తనం చలాయించడానికి బలవాలని కోరుకోండి” అంటూ సంధ్య మనసులో అనుకొంటుంది. చెంద్రి మార్చిన ఆ ముగ్గురు భర్తలవల్ల చెంద్రి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు భరించిందో సంధ్యకు తెలుసు. ఈ పితృస్వామిక వ్యవస్థ- ఇద్దరు స్త్రీల మధ్య ఎలా శతృత్వాన్ని, వ్యతిరేక భావాన్ని కల్గింపజేస్తుందో ఈ సంఘటనద్వారా నిరూపించారు రచయిత్రి. భర్తనుంచి ఎన్ని బాధలు అనుభవిస్తున్నా భరిస్తూ ఉండాలనే కనిపించని పోలీసింగ్‌ను తోటి స్త్రీల ఆలోచనా విధానంలో గూడుకట్టుకునేట్లు చేయడం మనం గమనించవచ్చు. ఇటువంటి విషయాన్నే మరింత నొక్కిచెప్పే క్రమంలో సందర్భానుసారంగా చిత్రించింది. రచయిత్రి సమస్యా చిత్రణ వరకే పరిమితం కాకుండా బాధించే భర్తలనుంచి విముక్తి పొంది, తనకిష్టమైన మరో మగాణ్ణి పెళ్ళిచేసుకొని తద్వారా పరిష్కారాన్ని పొందొచ్చనే సందేశాన్ని అన్యాపదేశంగా చెప్పింది. ఆ మాత్రం స్వేచ్ఛను స్త్రీ కలిగి ఉండాలని రచయిత్రి అభిప్రాయపడింది.

కుటుంబంలో స్త్రీ ఆలోచనలకు, అనుభూతులకు స్థానం లేదు. తమ భర్తల, మామల, కొడుకుల, తమ్ముళ్ళ అనుభూతులే తమ అనుభూతులుగా, వాళ్ళ సంతోషాలే తమ యిష్టాలుగా మారి వాళ్ళకు ఈ స్త్రీలంతా జిరాక్స్‌ కాపీల్లా మారారు. ఈ మార్పు చిన్నప్పటినుంచి ఒక క్రమపద్ధతిలో అలిఖిత నియమావళిని అమలు పరుస్తూ సాగుతున్న తంతు. ”బాపుజీకి బూరెలు పసందయినవే. మూడు తిన్నాడు. అంటూ సంధ్యవాళ్ళ అత్తమ్మ సంతోషించినా, ”అవ్‌! బజ్జీలు కూడ నచ్చినయి. రెండెక్కువనే తిన్నాడు. అని సంధ్యవాళ్ళ తోడికోడలు సంబరపడ్డా, తన కిష్టమైనా తన భర్త కోసం అంత చైతన్యమున్న సంధ్య కూడా అసంకల్పితంగానే ఉల్లిపాయల్ని తినడం మానేసినా, వీళ్ళంతా మొగవారి ఇష్టాయిష్టాలకు అనుకూలంగానే తమ ఇష్టాయిష్టాల్ని రూపొందించుకొని తీరాలనే నియమం ఈ పితృస్వామిక వ్యవస్థ కల్పించింది. ”ఎంత తృప్తి వీళ్ళ మొఖాల్లో మొగవాళ్ళు కడుపునిండా తింటే వీళ్ళ కడుపులే నిండినంత తృప్తి… తమ వంట తమకే నచ్చినంత తృప్తి…” అంటూ రచయిత్రి వ్యంగ్యంగా సంధ్యచేత అన్పిస్తుంది.

ఈ విధంగా దృగ్గోచరం కాని పురుషాధిక్యం కుటుంబ వ్యవస్థలో వేళ్ళూనుకొని, తన బహుళ అస్తిత్వాలను ప్రదర్శిస్తూ స్త్రీలను వంటింటికి ఎలా పరిమితం చేస్తుందోననే విషయాన్ని ఎన్నో

ఉదాహరణల ద్వారా రచయిత్రి చిత్రించారు.

2.2. సమాజం

పితృస్వామ్యం కుటుంబంలో వలే సమాజ నిర్మాణంలోనూ చాలా మార్మికంగానూ, నిగూఢంగానూ పరుచుకొని ఉంటుంది. స్త్రీ ఏ సందర్భంలో ఎటువంటి కట్టుబొట్టుతో ఉండాలో, ఎవరితో, ఎలా మాట్లాడాలో ఎప్పటికప్పుడు నియంత్రిస్తూనే ఉంటుంది. ఈ పురుషస్వామ్యం ”చరిత్రలో రకరకాల కాలాలలో రకరకాల సమాజాలలో వేరువేరుగా ఉంటుంది. మౌళిక సూత్రాలు మాత్రం మార్పు లేకుండా ఉంటాయి. ఉదాహరణకు స్త్రీలపై పురుషుల కంట్రోలు అనే దాంట్లో మార్పు వుండదు. కానీ ఎట్లాంటి కంట్రోలు, దాని స్వభావం ఏమిటి అనే దాంట్లో మార్పు ఉంటుంది” (కమలా భసీన్‌ (మూలం). ఓల్గా (అనువాదం) 1996.8) అని కమలా గారు చెప్పినట్టు స్త్రీలపై పురుషుల కంట్రోలింగ్‌, పోలీసింగ్‌ అగ్రకుల స్త్రీలకు, శ్రామిక స్త్రీలకు భిన్నంగానే ఉంటుంది. అగ్రకుల స్త్రీలు కేవలం మగవాని ద్వారానే పోలీసింగ్‌కు గురవుతే, శ్రామిక వర్గ స్త్రీలు ఇంట్లో మొగనిద్వారానూ, బయట కులం/మతం ద్వారానూ పోలిసింగ్‌కు గురవుతున్నారు. గీతాంజలి గారు ఇట్లాంటి ‘మోరల్‌ పోలిసింగ్‌’ ఎన్ని అస్తిత్వాల్లో ఉంటూ స్త్రీలను కబళిస్తుందో చిత్రించారు.

”మెళ్ళో నల్లపూసలేసుకో… మంది ఏమన్న అనుకుంటరు. లేనిపోని రపరప” అని సంధ్యతో వాళ్ళ అత్తమ్మ అనడం, నాలుగు వారాలు ఆ వ్రతాలు ‘ఆ వ్రతం చేయటం’ రెండు గంటలు పూజలు చేయటం హారిబుల్‌… సినిమాలోలా ఛట్‌మని అయిపోతే… హాయిగా తను హైదరాబాద్‌ ఎగిరిపోతే…” అని సంధ్య మనసులో అనుకోవడం, ”పట్టుచీర, నల్లపూసల గొలుసు… తలలో చామంతుల దండ. తను అద్దంలో ఒక వింత మృగంలా కనిపిస్తోంది కాని… తను కాదు… సంధ్య కానే కాదు.” మొదలైన ఉదాహరణలన్నీ స్త్రీకి ఇష్టంలేని పనులను పితృస్వామిక సమాజం ఎలా చేయిస్తుందనే విషయాలను రచయిత్రి చిత్రించారు. సంధ్య చైతన్యవంతమైన యువతి అయినప్పటికీ తన అత్తగారింట్లో తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేకుండా పితృస్వామ్యానికి తలవంచింది. చివరకు ఈ వ్యవస్థలో పాతుకుపోయిన పురుషాధిపత్యాన్ని రూపుమాపడానికి శ్రామిక వర్గ దృక్పథంగల మహిళా సంఘంలో చేరుతుంది.

3. ఉపయుక్త గ్రంథ సూచి

1. కమలా భసీన్‌ (మూలం). ఓల్గా (అనువాదం). 1996. పితృస్వామ్యం – ఒక పరిచయం. హైదరాబాదు : వంటింటి మసి. స్త్రీవాద ప్రచురణలు.

2. కాత్యాయని విద్మహే, జ్యోతీరాణి. తోట. 2007. జెండర్‌ సమానత దిశగా… సమాజం- సాహిత్యం. వరంగల్లు : స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ.

3. గీతాంజలి. 1999. ఆమె అడవిని జయించింది. హైదరాబాద్‌ : గోదావరి ప్రచురణలు.

4. జ్యోతీరాణి, తోట… 2005. స్వాతంత్య్రానంతర భారతదేశం స్త్రీల స్థితి గతి. వరంగల్లు : స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ.

5. తారబాయి షిండే (మూలం), జయప్రద, సి.ఎల్‌.ఎల్‌. 1999. పురుషాహంకారానికి సవాల్‌. హైదరాబాదు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.

6. నందన సోనాళ్‌కర్‌. 1999. జెండర్‌ రాజకీయాలు – చర్చనీయాంశాలు. హైదరాబాదు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.