పిడికెడు బియ్యం – ఆకలి మాయం కొక్కొరోకో… కొక్కొరోకో… పి. ప్రశాంతి

కోళ్ళ గూట్లోంచి ఒకదానివెనక ఒకటి సందివ్వకుండా పాటలాగా అందుకుంటున్న కోళ్ళ కూతలకి మెలకూ వచ్చింది ఎనిమిదేళ్ల శాంతికి. కళ్ళు తెరవకుండా అలాగే వింటూ ఉంది. ఒక పక్క నుండి కొంగలు, గోరింకలు, కాకులు, చిలకలు, పిచ్చికలు… ఇంకా ఏవో పిట్టలన్నీ కలిసి ఆర్బాటంగా సంగీత కచేరీ చేస్తున్నట్టుంది. మరోపక్క దూరంగా మొదలై ఇంటి పక్కనున్న రోడ్డుమీదగా వెళ్ళి దూరమైపోతున్న ఎడ్ల బండ్ల చక్రాల చప్పుడుతో పాటు, ఎడ్ల మెడలోని చిరు గంటల సవ్వడి… మధ్య మధ్యలో ‘హెయ్‌… హెయ్‌…’ అంటూ ఎడ్లని అదిలిస్తున్న శబ్దం. చల్లని పిల్లగాలితో పాటు గాలిలో తేలొస్తున్న రకరకాల శబ్దా లన్నింటిని ఆస్వాదిస్తూ అలాగే పడుకుంది. ‘అమ్మా! ఓ ముద్దుంటెయ్యమ్మా… చదన్నముంటే ఎయ్యమ్మా… అమ్మా…!’ చేతికర్ర తాటింపుతో పాటే వినొచ్చిన ఆ కేకకు ఒక్కదుటున లేచి మంచం మీంచి స్ప్రింగులా దూకి పెరట్లోకి పరిగెత్తింది. రాత్రి పడుకునే ముందు అమ్మమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి ‘ఇదిగో మామ్మా… ఇప్పుడిది తినేసి మజ్జాన్నం భోజనానిక్కూడా వచ్చెయ్‌’ అంటూ ఆ అడుక్కునే ఆమెకి చెయ్యూపుతూ చెప్పి దొడ్లోకెళ్ళిపోయింది. దొడ్లో దడి మీదగా గొడ్ల చావిడి మీదకి పాకిన పాదుని గాలించి ఏడు పెద్ద సొరకాయల్ని కష్టపడి తెంపి ఒక దగ్గర చేర్చింది. సంతృప్తిగా చూస్తూ అంతలోనే యాభైమందికి ఇవి సరిపోతయ్యో లేదో అని అనుమానపడ్తూనే కావిడితో నీళ్ళ కెళ్తున్న సుబ్బయ్యని పిలిచి ఇద్దరూ కలిసి కాయల్ని ఇంట్లోకి చేర్చేశారు.

వారం రోజులుగా సెలవులకి అమ్మమ్మగారి ఊరొచ్చిన తను, తన కజిన్సు, స్నేహతులు అందరూ కల్సి పోగేసిన బియ్యం ఒక దగ్గర చేర్చడానికని ఆలోచిస్తూ పళ్ళు తోమేసుకుని, అమ్మమ్మ కలిపుంచిన పాలు తాగేసి బయటకు పరిగెత్తింది. అంతలో నిద్రలేచిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళని త్వరగా పాల్తాగేసి రెడీగా ఉండమని హెచ్చరిస్తూ చెల్లి వీణని, కజిన్‌ శోభని తీసుకుని మిగిలిన వాళ్ళందర్నీ కలిసిరాడానికెళ్ళింది.

ఎనిమిదయ్యేసరికి ఓ ఇరవైమంది పిల్లలు చేతిసంచులు, పెద్ద మూటలతో బిలబిలమంటూ వచ్చి అప్పటికే అక్కడ పెట్టున్న డబ్బాలోకి ఆ మూటల్ని, సంచుల్ని ఒంపేశారు. సుమారు 30 కిలోలు పట్టే ఆ బియ్యం డబ్బా మూడొంతులు నిండి పోయింది. రకరకాల ఛాయల్లో ఉన్న ఆ బియ్యాన్ని చూసి సంతోషం గా చప్పట్లు కొట్టి ‘అమ్మమ్మా…’, ‘బేబి మ్మామ్మా…’ అంటూ పిల్లలందరూ గోలగోలగా పిలుస్తుంటే ‘అబ్బ! అరవకండల్లా… వస్తున్నా…’ అంటూ వచ్చిన అమ్మమ్మ ఆ డబ్బాని, పక్కనే కుప్పగా పోసున్న టమాటాలు, వంకాయలు, సొరకాయలు, పచ్చిమిరప కాయలు, తోటకూర, బచ్చలి కూరల్ని చూసి బుగ్గల్నొక్కుకుంటూ ‘మీ అసాధ్యం కూల…. ఎంత మంచిపని చేశా రల్లా… ఇరవై కిలోలపైనే ఉంటాయీ బియ్యం. ఇవాళ నారాయణ సేవకి బాగా సరిపోతాయ్‌. ఐతే మేం పోగేసినయి మళ్ళీ వారానికి ఉంచె య్యొచ్చు…’ అంది విస్మయంగా.

ప్రతి గురువారం నారాయణ సేవ పేరున బేబమ్మగారితో పాటు ఆ వాడకట్టు లోని ఆడవారంతా కలిసి ఊళ్లోని వయసు మీరిన ఒంటరి, అతిపేదలకి మధ్యాహ్నం భోజనం పెట్టటం ప్రారంభించి అప్పటికి సుమారు ఆర్నెల్లవుతోంది. ఇది తెల్సిన చుట్టు పక్కల గ్రామాల నుండి కూడా భిక్షాటన చేసుకు బ్రతికే మరికొంతమందీ రావటం ప్రారంభించారు. అలా 20 మందితో మొదలై ఇప్పుడు ప్రతివారం 50 మంది వరకు వచ్చి భోజనం చేసెళ్తారు. ఎముకల గూళ్ళులా

ఉండే ఈ పెద్ద మనుషులు కనీసం వారినికి ఒకరోజైనా ఎతుక్కోవాల్సిన అవసరం లేకుండా తమ ఆకలి ఎల్లమారుతుందని గురువారం కోసం ఎదురుచూస్తుండేవారు. అమ్మమ్మ, నానమ్మలు చేస్తున్న ఈ గొప్ప కార్యంలో

ఉడతా సాయం… శాంతి తన గ్యాంగ్‌తో చేసిన ఈ వారం రోజుల ప్రయత్నం. రోజూ వండటానికని తీసిన బియ్యంలో నుండి ఒక్కొక్కరు వారి పిడికిలితో ఒక పిడికెడు బియ్యం రెండు పూటలా తీసి దాచి వారం చివర ఇలా పోగేసి వాటిని ఆ పేద్దోళ్ళకి వండి, వడ్డించడానికి ఇచ్చేశారు. బియ్యంతోపాటు వారివారి దొడ్లో కాసిన కూరగాయలు అవిన్ని ఇవిన్ని తెచ్చేసరికి పెద్ద కుప్పే అయింది.

అదీ సంఘటిత ప్రయత్నపు ఫలితం… అనుకుంటూ ఈ లోకంలో కొచ్చింది శాంతి. 30 ఏళ్ళ క్రిందటి తన అనుభవాన్ని మహిళా సమత ద్వారా బాలికలకు జీవన నైపుణ్యాలతో కూడిన విద్యనందించే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నపుడు తన కొలీగ్స్‌తో పంచుకోడంతో అది అందరికీ ఎంతో నచ్చింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలంతా నిరుపేద కుటుంబాల నుండే వస్తున్నారు. తినడానికి ఒక పూట ఉండి ఒక పూట లేక, బళ్లో మధ్యాహ్న భోజనం పెడ్తారనే బడికొచ్చే పిల్లలెందరో. కాస్త కలిగున్న కుటుంబాల పిల్లలు తమ క్యారేజీలు తామే తెచ్చుకున్నా… దాదాపు అందరూ పోషకా రోగ్య లోపంతోనే ఉంటారు. ఈ విషయంలో ఏదైనా చెయ్యాలనుకుంటున్న తన కొలీగ్స్‌ అందరికీ ఇదొక మంచి మార్గంగా అనిపించి, నచ్చి ఆరేడేళ్ళ క్రిందట వారి వారి ప్రాంతాల లోని గవర్నమెంట్‌ స్కూళ్ళలో ఇదే పద్ధతి అనుసరించారు. అయితే ఇది ఒక నిబంధనగా కాక ఎవరెవరికి సాధ్యమో వారు మాత్రమే తేవాలి. ప్రతిరోజూ పిల్లలంతా తెచ్చిన కాయ గూరల్ని, ఆకు కూరల్ని స్కూల్‌ వరండాలో పెట్టిన బుట్టలో వేస్తారు. మధ్యాహ్న భోజనం వండే సంఘం స్త్రీలు ఆ రోజు వారు వండే కూరలో ఆ రోజు పిల్లలు తెచ్చిన వాటిని కూడా వేసి వండేస్తారు. కొన్ని స్కూళ్ళలో పిల్లలు ఐదారు రకాల విత్తనాలు తెచ్చి స్కూల్‌ కాంపౌండ్‌లోనే నాటి జాగ్రత్తగా పెంచారు. వచ్చిన కూర గాయలు స్కూలు వరకే కాక పేద కుటుంబాల పిల్లలు ఇంటికి తీసుకెళ్ళడానికని పంచి ఇచ్చేవారు. దీన్తో స్నేహానికి స్నేహం, ఆరోగ్యానికి ఆరోగ్యం పెరగటమే కాక బాధ్యత, పట్టింపు, సంరక్షణ వంటి ఎన్నో లక్షణాలు అబ్బి పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి సాధ్యమౌతుంది.

అన్నిటికీ ప్రభుత్వమే చేయాలని ఎదురుచూస్తూ… చేసేది పూర్తిస్థాయిలో చెయ్యట్లేదని విమర్శించే బదులు మనమూ భాగస్థులమైతే… అదీ ఆలోచనాత్మక, క్రియశీల భాగస్వామ్యం అయితే అభివృద్ధితోపాటు సంవేదన, సమానత్వపు ధోరణి కూడా అలవడుతుందని… ఈ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎప్పుడు చెప్తారో! పెద్దలంతా ఎటు వంటి భేషజాలు లేకుండా ఎప్పుడాలోచిస్తారో!! ఎన్నటికి ఆచరిస్తారో!!!

 

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.