బ్రాహ్మణీయ శాసనాలు ధిక్కరించమని ఎలుగెత్తిన సావిత్రీబాయి పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

సావిత్రీబాయి ఫూలే… భారతదేశ స్త్రీలు నిత్యం తలుచుకోవాల్సిన పేరు. కానీ పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం కదా!సంస్కర్త లంటే మనకు పురుషులే గుర్తొస్తారు. రాజారామ్‌మోహన్‌ రాయ్‌, కందుకూరి వీరేశలింగం వగైరాలు గుర్తొస్తారు కానీ సావిత్రీబాయి, భండారు అచ్చమాంబ లాంటి వాళ్ళు గుర్తురారు. వాళ్ళను తలుచుకోనీయకుండా పురుష ప్రపంచం అమలు చేసిన పన్నాగ ఫలితం. బెంగాల్‌లో సతీసహగమన దురాచారం గురించి పోరాడిన రాజారామ్‌మోహన్‌ రాయ్‌ భారత దేశమంతా ప్రఖ్యాతి గాంచాడు. స్త్రీల చదువు కోసం అహర్నిశలు పోరాడిన సావిత్రీ బాయి మాత్రం మహరాష్ట్రకే పరిమితమైపోతుంది. మహార్‌, మాండ్‌ కులాల కోసం మాత్రమే ఉద్యమం నడిపినట్లు ముద్రవేసేసి ఆమెను చరిత్ర చీకటిలోకి తోసేస్తారు. చరిత్ర పొడుగునా స్త్రీలకు జరిగిన అపచారం అంతా ఇంతా కాదు. తెలుగులో తొలికథ రాసిన భండారు అచ్చమాంబను వెనక్కి తోసేసి నిన్న మొన్నటి వరకు గురజాడ అప్పారావే తొలి కథకుడు అంటూ చరిత్ర వక్రీకరణ కొనసాగింది. ఎంతో పోరాటం తర్వాత మాత్రమే ఆమెను అంగీకరించడం జరిగింది.

సావిత్రీబాయి ఫూలే విషయంలోనూ అదే జరిగింది. భారత దేశంలో సామాజిక విప్లవానికి అవిరళ కృషి, పోరాటం చేసిన జ్యోతిరావ్‌ ఫూలే భార్యగానే సావిత్రిని పరిమితం చెయ్యడం వెనక పనిచేసింది పురుషస్వామ్యమే. తొలుత ఆమెను జ్యోతిరావ్‌ భార్యగానే గుర్తించారు. 19వ శతాబ్దంలో స్త్రీల విద్య కోసం ఆమె చేపట్టిన ఉద్యమం మరుగునే ఉండిపోయింది. భారతదేశంలో మొట్టమొదటి

ఉపాధ్యాయురాలిగా స్త్రీవిద్య కోసం, ముఖ్యంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాల, కులాల, స్త్రీల కోసం ఆమె స్థాపించిన పాఠశాలలు… ఇవన్నీ పరిగణనలోకి, ప్రచారంలోకి రానేలేదు.

తొలి ఉపాధ్యాయురాలిగా సావిత్రి చేసిన కృషిని, ఆమె స్త్రీ కాబట్టి పక్కకి నెట్టేసి, ఏ మాత్రం గుర్తించకుండా పురుషుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరుమీద ఉపాధ్యాయ దినోత్సవం జరపడం అనేది సావిత్రిబాయి పట్ల జరిగిన అపచారం, అన్యాయం. ఇక్కడ కాలం, జండర్‌, ఆధిపత్య వర్గాల అభిజాత్య ధోరణులు ప్రస్ఫుటంగా కనబడతాయి. జనవరి 3వ తేదీ సావిత్రీబాయి జన్మదినం. ఇక నుంచైనా ఖచ్చితంగా ఉపాధ్యాయ దినాన్ని సెప్టెంబరు 5న కాక జనవరి మూడున జరపాలి. ఇది భారత స్త్రీలందరికీ గర్వకారణమౌతుంది.

భండారు అచ్చమాంబ లాగానే సావిత్రీ బాయి స్త్రీ విముక్తి చదువు ద్వారానే సాధ్యమౌతుందని బలంగా నమ్మింది. అచ్చమాంబ ఎన్నో వ్యాసాలను, కథలను రాసి స్త్రీ విద్య ఆవశ్యకత గురించి ప్రచారం చేసింది. అయితే సావిత్రీ బాయి మరింత ముందుకెళ్ళి స్త్రీ చదువుకోవాలి అని చెప్పడంతో పాటు, ఉపాధ్యాయురాలై, పాఠశాలలు నిర్మించి ఆచరణ మార్గం పట్టింది. ఆమె బతికిన కాలానికి అదెంత విప్లవాత్మకమైన చర్యో ఈనాటి తరానికి ఊహకు కూడా అందదు. ఎన్నెన్నో అవమానాలను, దాడులను ఎదుర్కొని ధీరోదాత్తంగా పోరాడిన వీర వనిత సావిత్రీబాయి ఫూలే. సావిత్రి, ఆమె భర్త జ్యోతిరావు ఎలాంటి అవమానాలను, ఇబ్బందులను ఎదొర్కొన్నారో ఆమె రాసిన క్రింది ఉత్తరంతో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉత్తరం ఎంతో ప్రేమతో జ్యోతిరావుకు 1856లో రాసింది. ఆమె అనారోగ్యంతో పుట్టింట్లో ఉన్నపుడు రాసింది. తన సోదరుడు తననెలా విమర్శించిందీ ఇందులో రాసింది.

”అంటరాని వాళ్ళ (మహర్‌, మాంగ్‌లు) కోసం నువ్వు, నీ భర్త చేస్తున్న సేవలకు మిమ్మల్ని ఇప్పటికే కులం నుండి వెలివేసారు. ఆ తక్కువ జాతి మనుషులకు సాయం చెయ్యడానికని మీరు మన కుటుంబానికి మచ్చ తెస్తున్నారు. ఇప్పటికన్నా కుల ధర్మాన్ని తెలుసుకుని, బ్రాహ్మణులు చెప్పినట్టు నడుచుకుంటే మంచిది.” అని హెచ్చరించినపుడు ఆమె ”మేకలూ, ఆవులూ లాంటి జంతువులన్నింటినీ ప్రేమగా నిమురుతావు. వాటి పట్ల అంటరానితనమనే భావన లేదు. విషం గక్కే నాగుపాముకూ నాగులచవితినాడు పాలుపోస్తావు. కానీ, మన సాటిమనుషులైన మహర్‌లనూ, మాంగ్‌లనూ అంటరానివాళ్ళుగా దూరంగా ఉంచుతావు. ఈ ఆచారంలో ఏమన్నా అర్ధముందా చెప్పు? ఆ బ్రాహ్మణులు మడికట్టుకుని పూజలు చేసేటపుడు నిన్నూ అంటరాని వాడిగానే చూసి, దూరంగా ఉంచుతారు. మహర్‌లకు, నీకూ వాళ్ళ దృష్టిలో తేడా ఏమీ లేదు” అన్నానని వ్రాసింది. ఈ ఉత్తరంలో సావిత్రీ బాయి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆ కాలానికి చాలా తీవ్రమైనవి. విప్లవాత్మకమైనవి. ఆమెలో ఎగిసిపడిన ఆ ధైర్యానికి, సాహసానికి తలవంచి నమస్కరించాల్సిన భారతీయ స్త్రీ సమాజం ఆమె ఉనికినే గుర్తించలేకపోవడమంత విషాదం మరొకటి లేదు. ఇది చరిత్ర స్త్రీలకు చేసిన ద్రోహం.

నిజానికి భారతదేశంలో ఆధునిక వ్యవస్థల నిర్మాణం కోసం, స్త్రీల విద్యకోసం, పీడిత కులాల విద్యావకాశాల కోసం అలుపెరుగని పోరు సల్పిన సావిత్రీబాయిని తల్చుకోకుండా ఆయా పోరాటాలు అసంపూర్ణాలే. స్త్రీలూ, పీడిత కులాలకు విద్యావకాశాల కోసం జరుగుతున్న పోరాటాల గురించి ప్రస్తావించుకోవాలంటే తొలుతు మాట్లాడాల్సింది సావిత్రి గురించే. జ్యోతిరావు చేసిన సమస్త పోరాటాలకు వెన్నుదన్నుగా నిల్చిన పోరాట శిఖరం సావిత్రీబాయి.

సావిత్రి ఉద్యమ కారిణిగానే మిగిలిపోలేదు. రచయిత్రిగా నాలుగు గ్రంథాలను ప్రచురించింది. ఆమె అద్భుతమైన కవితలురాసింది.

”ఆత్మ గౌరవంతో, కఠిన దీక్షతో

జ్ఞాన సంపదలు సేకరించుకో

విద్యలేనిదే జీవితం వృధా

………..

కులవ్యవస్థ సంకెళ్ళను తెంచి విద్యనందుకో

బ్రాహ్మణీయ శాసనాల ధిక్కరించు వెంటనే”

ఈ కవితలో ఆత్మగౌరవం గురించి, విద్య గురించి కుల వ్యవస్థ గురించి, బ్రాహ్మణీయ శాసనాల గురించి చాలా స్పష్టమైన అవగాహనతో రాసిన సావిత్రీబాయికి ఆయా అంశాల పట్ల ఉన్న క్లారిటీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆ కవిత్వం నిన్నా మొన్నా రాసింది కాదు… పంథొమ్మిదో శతాబ్దపు చివరి పాదంలో రాసింది. మనువాద, బ్రాహ్మణీయ భావజాలం సర్వత్రా కమ్ముకుని ఉన్న కాలం, అణగారిన కులంలో పుట్టిన ఒక స్త్రీ ఇలాంటి తిరుగుబాటు బావుటా నెగరేయడం సహించలేని కాలం. అలాంటి సమయంలో ”బ్రాహ్మణీయ శాసనాలు ధిక్కరించు” అని ఎలుగెత్తగలిగిన సావిత్రి భావపరంపరను ఆనాడే అందిపుచ్చుకొని ఉంటే… భారతీయ సమాజం ఉన్నతంగా సంస్కరించబడి ఉండేది. స్త్రీల పురోభివృద్ధి వేగవంతమై ఉండేది. దళితుల, అణగారిన కులాల, వర్గాల మీద అమలవుతున్న పీడన, దోపిడి, వివక్ష అంతమై ఉండేవి. ఈ భయంతోనే, ఈ గగుర్పాటుతోనే సావిత్రీబాయిని ప్రధాన స్రవంతిలోకి రానీయకుండా, ఆమె గురించి ప్రచారం లేకుండా, ఆమె భావాలు విస్తరించకుండా విజయవంతంగా మరుగున ఉంచగలిగారు.

అందుకే, చరిత్రను తిరగదోడడం అవసరం. చరిత్ర చీకటిలో మినుకు మినుకుమంటున్న వెలుగురవ్వల్ని వెలికి తీయడం మన బాధ్యత. కులాల ప్రసక్తి లేని పాఠశాలను ప్రారంభించి, పాఠాలు చెప్పడానికి వడివడిగా నడుస్తున్న సావిత్రి మీద పేడముద్దలు పడినా ఆమె లక్ష్యం వేపే నడిచి వెళ్ళిపోయింది. అదరలేదు… బెదరలేదు… ఆమె వేసినదారుల్లో నడవడమే మన ముందున్న కర్తవ్యం. అదే ఆమెకు నివాళి…

సావిత్రీబాయిని ప్రేమిద్దాం… ఆమె ఆశయాలను కొనసాగిద్దాం…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.