రావోయి చందమామ…
Posted By భూమిక on February 26, 2009
ఇంద్రగంటి జానకీబాల
( భూమిక పాఠకుల కోసం ప్రముఖ రచయిత్రి జానకీబాలగారి కాలమ్ ఈ సంచిక నుండి మొదలవుతోంది.
- ఎడిటర్)
తెలుగు సినిమా చరిత్రలో 50 నుండి 60 వరకు వున్న పదేళ్ళకాలం రాగయుగంగా అభివర్ణించుకోవచ్చు. సినిమాపాట సొంత గొంతు విప్పి, సొంత రుపాన్ని ఏర్పరచుకుని రాగరంజితమైన కాలం అది.
నలభైల చివరి భాగంలో సిని్మారంగ ప్రవేశం చేసిన ఘంటసాల తక్కువ కాలంలోనే తన ప్రతిభను చాటుకున్నారు. బాలరాజు సినిమాలో చెలియ కనరావా, కీలుగుర్రంలో కాదు సుమ కలకాదు సుమ అనే పాటలు బాగా ప్రచారం పొందాయి.
యభైల నాటికి హీరోలుగా స్థిరపడిన నాగేశ్వరరావు, రావరావులకు ఘంటసాల మాత్రమే ప్లేబ్యాక్ పాడాలనే అభిప్రాయం అందరికీ వచ్చేసింది.
నాగేశ్వరరావుకి ప్రేమ, దేవదాసు, లైలామజ్ను, స్వప్నసుందరి లాంటి సినిమాలుంటే, రావరావుకి షావుకారు, పాతాళభైరవి, మల్లీశ్వరీ – ఆంధ్రులను ఉర్రుతలగించాయి – ఇవన్నీ సంగీతపరంగా ఉన్నతస్థానాన్ని పొందినవే. ఇద్దరు హీరోలకీ ఘంటసాల నేపథ్యగాయకునిగా స్థిరపడిపోయరు. అప్పట్లో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడని సిని్మాలు అరుదనే చెప్పాలి. ముఖ్యంగా మన ఇద్దరు హీరోలు నటించిన చిత్రాలలో.
సినిమా పరిశ్రమ మంచి ఊపందుకుని కళాత్మకంగా, వ్యాపారపరంగా ఎదుగుతున్న సమయంలో చిన్నచిన్న మాట తేడాలు, పట్టింపులు, పంతాలు రావడం సహజమే కదా.
సంగీత దర్శకత్వంలో స్టార్వాల్య వున్న రాజేశ్వరరావుగారికి, ఘంటసాల వారికి ఏదో చిన్న మాటపట్టింపు వచ్చినట్టుగా అప్పట్లో అనుకున్నారు – అంతే -
1954లో నాగేశ్వరరావు నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం భరణీవారి ‘విప్రనారాయణ’లో హీరోకి ఘంటసాలవారు పాడలేదు. అందులో భక్తి సినిమా – అయినా హీరోకి ప్లేబ్యాక్ పాడింది ఎ.ఎం. రాజా. భానుమతి నాయికగా తన పాట తనే పాడుకుంట అగ్రగామిగా వున్న సమయం. ‘విప్రనారాయణ’ సినిమా సంగీతపరంగా అత్యంత గొప్పది. రాజేశ్వరరావు సంగీతదర్శకునిగా మరోమెట్టు పైకి ఎక్కారు. అందులో ప్రతీపాటా ఆణిముత్యమే – ఇందులో ఘంటసాల పాడలేదేమిటి? – ఆయన పాడి వుంటే బాగుండేది అని ఒక్కరు కూడా అనుకోలేదు. అంటే ఆ పాటలకున్న బాణీల విలువ అటువంటిది. ఆ పాటలు పాడిన ఎ.ఎం. రాజాకున్న ప్రతిభ, సామర్ధ్యం అలాంటివి – ఆయన అవి నిరూపించుకున్న సంగీతం అందులో వుంది.
మధుర మధురమీ చల్లని రేయి (డుయట్ – భానుమతితో)
చూడుమదే చెలియ -
మేలుకో శ్రీరంగ -
అనురాగాలు దరములాయనా (డ్యయట్)
ఇవన్నీ ఈనాటికీ, ఏనాటికీ ఆ పాటలు అలాగే వుండాలి అనిపిస్తుంది గానీ, మరొకరు పాడి వుంటే అనే ఊహేరాదు. సినిమాలో ఆ పాటలు నాగేశ్వరరావు ముఖానికీ, అభినయనానికీి ఎంతో బాగా సరిపోయయి. అంటే సంగీత దర్శకులు సాలరి రాజేశ్వరరావు, చిత్రదర్శకులు పి. రామకృష్ణల ప్రతిభ అని చెప్పుకోవాలి.
1955లో మిస్సమ్మ (విజయవారి)లో, సాలరి రాజేశ్వరరావు సంగీతంలో ఎన్.టి.ఆర్కి ఘంటసాల పాడలేదు. ఎ.ఎం.రాజా హీరోకి ప్లేబ్యాక్ పాడారు. నిజానికి కథానాయకుడికి పాట సట్ అయిందా లేదా అనే సంగతి లేకుండా ‘మిస్సమ్మ’లో పాటలన్నీ సూపర్హిట్ అయి కూర్చున్నాయి.
రావోయి చందమామ ఎ.ఎం.రాజా, పి.లీల
బృందావనమది అందరిదీ ఎ.ఎం.రాజా, పి.సుశీల
అవునంటే కాదనిలే – కాదంటే అవుననిలే ఎ.ఎం.రాజా
కావాలంటే ఇస్తాలే - ఎ.ఎం.రాజా
తెలుసుకొనవె యువతీఎ.ఎం.రాజా
అన్నీ ఎన్.టి.ఆర్. మీద అద్భుతంగా చిత్రీకరింపబడినవే. ఈ పాటలన్నీ ఎంత ప్రజాదరణ పొందాయె ఇప్పుడు మళ్ళీ మనం చెప్పాల్సిందేమీ లేదు.
ఆ తర్వాత కాలంలో అంతామమూలే – ఒకే గాయకుడు ఇద్దరు హీరోలు అవిచ్ఛిన్నంగా సాగిపోయరు. రాజ్కపూర్ ఒకసారి మట్లాడుత ‘నా ఆత్మ ముఖేష్’ అన్నారు. మన ఘంటసాలవారు ఇద్దరు హీరోలకు ఆత్మని చెప్పుకోవాలి.
అప్పటి కాలంలో ఘంటసాల లేకుండా రెండు మ్యూజికల్ సూపర్హిట్స్ గురించి ఆలోచిస్తే ఆశ్చర్యంగా వుంటుంది. అప్పటి హీరోలకి చెప్పిన మాట వినే వినయమే తప్ప, నాకిలా కావాలి అనే పెంకితనం లేదని అనిపిస్తుంది.
ఆంధ్రులకి మాత్రం ఒక మాటా – ఒక బాణం లాగా ఒకే గాయకుడు కావాలి – రెండోవారివైపు చూడరు – ఘంటసాల, కాకపోతే బాల – అంతే! .
Comments
Leave a Reply