రైతు రాజ్యమా… దళారి ప్రపంచమా… పి. ప్రశాంతి

కూ… కూ… కుహూ… కుహూ… రెండు గండు కోయిలలు రెండు పక్కల నుండి పోటీపడి కూస్తున్నాయి. చెరువుగట్టు మీద ఉన్న వేపచెట్టు కొమ్మల్లోనుంచి ఒకటి, జమ్మిచెట్టు కొమ్మల్లో నుంచి ఒకటి… దాని వెనకే దాని కూతననుసరిస్తూ పిల్లలూ కోయిల పాటలు పాడ్తున్నారు. చెట్లన్నీ కొత్త ఆకుల్తో మెరుస్తున్నాయి. వసంత కాలపు వర్ణాలు ఏ కుంచెకీ అందని సొగసుల్ని ప్రకృతికంతా అద్దినట్లుంది.

కొత్తగా రెక్కలొచ్చిన కాకి పిల్లలు మామిడి చెట్టు కొమ్మలన్నింటినీ చుట్టొ స్తున్నాయి. వాటి హడావిడికి కంగారుపడ్డ ఉడతలు చెట్లమీద పైకి కిందకి పరుగులు పెడుతూ అరుస్తున్నాయి. చెరువులో నుంచి ఒక బాతుల గుంపు క్వాక్‌… క్వాక్‌… అనుకుంటూ గట్టెక్కి వచ్చేశాయి. పొలాన్నించి గడ్డి నెమరేసుకుంటూ వచ్చిన నాలుగు గేదెలు, రెండు ఆవు దూడలు చెరువు నీళ్ళల్లో కూర్చుని సేద తీరుతున్నాయి. దూరంగా వినిపిస్తున్న ఎడ్ల మెడలోని గంటల చప్పుడు రాన్రాను దగ్గరపడుతోంది. దాంతోపాటే బండి చక్రాలు రేపిన ఇనప బద్దీ చప్పుడు… సంగీతంలా రిథమిక్‌గా వినిపిస్తున్న నాడాల సవ్వడి, ఆ సవ్వడిలోనే తెలుస్తోంది బండి బరువుగా వస్తోందని. అల్లంత దూరంలో బస్తాలు వేసుకొస్తున్న బండి, బండి తొట్లో కూర్చుని ఎడ్ల తోకలు పట్టుకుని ప్రేమగా అదిలిస్తున్న నాంచారి… అది కనబడగానే పెరట్లో గోడపక్కగా ఉన్న గట్టెక్కి చూస్తున్న శాంతి లంగాని పాదాలపైకి ఎత్తిపట్టుకుని నల్లరాతి రోలు మీదుగా గెంతుకుంటూ కిందకు దూకేసి వీధి వాకిట్లోకొచ్చేసింది. అప్పుడే ఇంటి ముందుకొస్తున్న బండి తొట్లో కూర్చున్న నాంచారి వెనగ్గా కనిపిస్తున్న పచ్చటి, నల్లటి కలనేత రంగుల్లో ఉన్న తాటిముంజెల గెలల్ని చూడగానే శాంతి

కళ్ళు మెరిసాయి.

శాంతిని చూడగానే నాంచారి కూడా ఉత్సాహంగా ”పాపమ్మగారూ! ముంజికాయల్తెచ్చా.. బస్తాల్ని వసారాలో ఏసొచ్చేస్తా… మీరు రెడీ ఐపోండి” అంటుండగానే ముంజికాయలు తింటుంటే మీదపడి మరకలవుతాయని లంగా మార్చేసుకుని గౌను వేసుకోడానికి ఇంట్లోకి పరుగెత్తింది. తనతోపాటే మిగతా పిల్ల లందరూ వచ్చి చేరిపోయారు. ఇంతమందికి కాయలు కోసివ్వడానికి నాంచారికి తోడుగా కొండలు కూడా జత కలిశాడు.

ఒకదాని తర్వాత ఒకటిగా ముంజికాయలు కోసిస్తుంటే తింటూనే ‘ఏమేం వచ్చాయి నాంచారి పొలం నుంచి’ అంటూ ఆరిందాలా అడిగింది ఆ ఇంటి పెద్ద మనవరాలు శాంతి. ‘అమ్మా… భూ తల్లి చలవతో అన్ని దినుసులూ వచ్చాయమ్మా. మనందరికీ సరిపోయేన్ని వచ్చాయి. తాతయ్యగారు ముందాలోచన్తో ఎయ్యబట్టి మేమెవ్వరం కూడా కొట్టుకెళ్ళి కొనుక్కో వాల్సిన అవసరం లేదు…’ అని నాంచారి అంటుంటే కొండలు కల్పించుకుని ‘ఏమేం తెచ్చావని అడుగుతుంటే… అవి చెప్పవేంటి బాబాయ్‌’ అన్నాడు.

‘ఏంతేకేఁ! పెసలు, మినుములు, ఉలవలు, కందులు వచ్చాయి. ఇప్పుడేమో మిరపకాయలు, నువ్వులు, ధనియాలు తెచ్చాం. కంద, పెండలం కూడా తెచ్చాం. ఆవాలు, పసుపు కొమ్ములు ముందే తెచ్చేశాం. ఇప్పుడు ఒడ్లు కూడా వస్తున్నాయి…’ అంటూనే ‘కానివ్వండి.. కానివ్వండి… పురి కట్టాలి, బళ్ళొచ్చేస్తాయి’ అంటూ హడావిడి పెట్టాడు. ‘బాబాయ్‌ చెరుకెల్లింది గందా, బెల్లమొచ్చిందా’ అడిగాడు కొండలు. ‘తయారైపోయిందంట, ఎల్లి తేవాల్రా’ అంటూనే ‘ఇక ఈ నాల్గూ నువ్వు కోసిచ్చెయ్‌’ అంటూ లేచెళ్ళిపోయాడు. వరిగడ్డితో ఎంట్లు పేని మోపులు చుట్టించిన దగ్గరకెళ్ళి మరో ఇద్దరితో కలిసి పురి చుట్టడంలో పడ్డాడు.

ధాన్యం, ఆపరాలు, ఎండు మిరపకాయలు, కూరగాయలు… వీటి

ఉత్పత్తిలోనూ, ధరల్లోనూ ఏరోజుకారోజు వస్తున్న హెచ్చుతగ్గులు చూస్తున్న శాంతికి ఎప్పుడో ముప్ఫై ఏళ్ళ కిందటి సంఘటనలు గుర్తొచ్చాయి. కనీస మద్దతు ధర లేక గోదాముల్లో మగ్గుతున్న ధాన్యం, అపరాలు… అక్కడివరకూ చేర్చడం కూడా దండగేనని, ఆ ఖర్చులన్నీ మిగులుతాయని కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపాడుకున్న మిరప పంటకి ధరలేక పొలాల్లో, కళ్ళాల దగ్గరే తగలబెడ్తున్న రైతుల దుస్థితి చూస్తోంటే కడుపు తరుక్కు పోతోంది. ఇక కూరగాయల సంగతి సరేసరి. బాగా పండిందని సంతోషపడాలో… పంట ఎక్కువైనందుకు రేటుని పాతాళానికి తొక్కేసే మార్కెట్‌ దళారీల దౌర్యన్యాన్ని తలచుకుని బాధపడాలో తెలియని స్థితి అయిపోయింది నేటిి రైతు జీవితం…

మూకుమ్మడిగా ఏకపంట వేసి మూకుమ్మడిగా నష్టపోతున్న రైతుమీదా కోపమొస్తుంది. అయినా రైతులేంచేస్తారు! సబ్సిడీలంటూ ప్రకటించిన ప్రభుత్వం అనా లోచితంగా వాణిజ్య పంటలకే ఈ సబ్సిడీలను పరిమితం చేస్తుంటే… చిరుధాన్యాలకి మార్కెట్‌ లేక పండించడం మానేసిన రైతు… అందుబాటు లేక తినడమూ మానేశారు. నీరు తక్కువ పట్టే మెట్ట పంటలు, దేశవాళి విత్తనాల్ని మర్చే పోయారు. విత్తనం ఏరడం, దాచడం అనే మాటే లేదు. కావాలంటే విత్తనాల దుకాణానికెళ్ళి తెచ్చుకోవాల్సిందే. అవి మొలకెత్తుతాయో లేదో… కాస్తాయో లేదో… అదీ జూదమే. విత్తనం వేయాల్సిన సమయానికి స్టాక్‌ ఉండదు. పత్తి, మిరప విత్తనాలకిచ్చినంత ప్రాచుర్యం చిరుధాన్యాల కెందుకివ్వరు? అవి పండించి ఎవరివి వారే తింటే మార్కెట్‌ శక్తులు, వ్యాపార దళారులు బతకడం కుదరదనా? మరి ప్రభుత్వం మాటేంటి? నీరు తక్కువ అవసరమయ్యే జాతుల్ని మరుగున పడేసి హైబ్రీడ్‌, బీటీ అంటూ అసలు రైతు దగ్గర విత్తనమే లేకుండా చేయడం వెనుక దాగున్న రాజ కీయాన్ని అర్థం చేసుకోనంత వరకు రైతు పని కొనబోతే కొరివి… అమ్మబోతే అడవి… చందమే అవుతుంది.

వీటన్నిటిపైనా అవగాహన కల్పించి రైతులకు ఆసరాగా ఉండాలని ఏర్పడిన కేవీకేలు, పొలం బడులు, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు, వ్యవసాయ అధికారులు… ఎన్నుండి ఏం లాభం… చిత్తశుద్ధి లేకపోతే? అలా అని వదిలేద్దామా? పరిస్థితుల్లో మార్పు వచ్చేదెలా?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.