పడి లేచిన అల… అలన – పి. ప్రశాంతి

గణగణ…గణ… బడి గంట మోగగానే గోలగోలగా బయటకొచ్చేశారు పిల్లలంతా. తేనెతుట్టెమీద రాయేస్తే లేచిన తేనెటీగల్లా… తరగతి గదుల్లోంచి దూసుకొస్తున్న పిల్లలు… కొందరు ఊరుదారి పడితే, కొందరేమో బడెనకున్న చింతచెట్టు కొమ్మల్లోకి… ఇంకొందరు దగ్గర్లోనే ఉన్న బండమీదకి పరిగెట్టారు. అలన మాత్రం తన ఫ్రెండ్స్‌కి ‘పోతున్నా’ అన్జెప్పి బడికి ఆ పక్కగా ఉన్న చెల్కల్ని దాటుకుంటూ తమ చేనుదారి పట్టింది. ‘బండెనక బండి కట్టి…’ పాడుకుంటూ, గెంతుకుంటూ వస్తున్న బిడ్డని చూస్తూనే ‘ఆ పాటాపి ఎడ్లని తోల్కపో… నే కట్టెలెత్తకస్తా…’ అని అరిచింది రాజమ్మ. చిర్నవ్వుతో తల్లిని చూస్తూ ‘ఈ అంటరానితనమే నాలో మంటలు రేపిందే…’ మరో పాటందుకుంది అలన. పాట ఆపకుండానే బర్రెని, దూడని, జంటెడ్లని తోలుకుంటూ పోతున్న బిడ్డని చూస్తూ నిట్టూర్చింది రాజమ్మ. ఆడుతూ, పాడుతూ కనిపించే అలన పాడే పాటల్లో నిరసన, ధిక్కారం రాజమ్మని భయపెడుతుంటాయి.

ఊరికి ఓ అంచున ఉన్న తమ గుడిసెల్లో పిల్లలంతా ఆడుకుంటుంటే అలన మాత్రం చదువుకుంటూ, రాసుకుంటూం టుంది. ఇంట్లో పన్లో తల్లికి, వ్యవసాయం పనుల్లో తండ్రికి సాయం చేస్తూ…. ఏది చేస్తున్నా నోట్లో ఏదో ఒక పాట నాన్తూనే

ఉంటుంది. తనకంటే మూడేళ్ళు పెద్దదైన అక్కని చదవు మాన్పించి పెళ్ళి చేస్తుంటే అప్పుడే ఒద్దని ఏడుస్తుంటే మేనత్త ‘నా కోడలు సదూకుంటే నాకూ గొప్పే, పెళ్ళైనా నే సదివిస్తాగా’ అంటూ మాటిచ్చిందే కాని ఆ ఊసే లేదు. ఆ విషయంపై తండ్రితో ‘అయ్యా! నీ అక్క మాట తప్పింది, నువ్వు సుతా మాట్టాడవ్‌… అక్కేమైతాదో’ గొడవ చేస్తూ

ఉంటుంది అలన. పైగా, ‘నాకట్ల జేస్తివా నేనూరుకోను, మేం బాలసంగెమైనంగా… దండెత్తుకొస్తరందరు! ఇనకపోతివా గుట్టల్లోకి పారిపోతా’ అంటూ బెదిరిస్తుంటుంది. ‘లే బిడ్డా నాకు నువ్వే కొడుకువి… నువ్వెల్లిపోతే ఎడ్లేడుస్తయ్‌…చెల్క ఎండిపోతది… బాయి సెమ్మగిల్లది… నువ్వు మా బత్కమ్మవి బిడ్డా’ అర్ద్రంగా అంటుంటాడు మల్లన్న. దానికి అలన నవ్వితే ‘నా తల్లి నవ్వితే బాటల తంగేడి ఇరబూసినట్టుంటాది…’ అని మురిపెంగా అనే తల్లిదండ్రులంటే వల్లమాలిన ప్రేమ అలనకి.

ఓరోజు ముందుగానే ఇంటికొచ్చేసింది అలన బర్రెను తోలుకుని. పత్తిచేలో గొర్రుకొట్టి చీకటిపడ్డాక అలిసిపోయి ఇంటికి చేరాడు తండ్రి. ‘బిడ్డా! ఎడ్లని కట్టలే జరజూస్తవా’ అంటూ మంచం మీద వాలిపోయాడు. ‘అయ్యకి పెయ్యి బాలేనట్టుంది జూడమ్మా’ అంటూ ‘ఎరుపెక్కిన కన్నులమై, గురిచూసిన అమ్ములమై’ మధ్యలో ఆపిన పాటందుకుని ఎడ్లని కట్టేయడానికెళ్ళింది అలన.

రొట్టెల్చేయడం పూర్తిచేసి ‘బిడ్డా… అయ్యన్లేపి, కాల్జేతుల్‌ కడుక్కు రా తిందురు’ అంటూ పిలిచిన రాజమ్మకి ఎంతకీ సమాధానం రాకపోయేసరికి మంచంలో మగత నిద్రలో ఉన్న భర్తని లేపి ‘ఎడ్లని కట్టనీకి బోయిన బిడ్డింకా రాలేదయ్యా…ఏమైందో సూడు’ అంటూనే ఇంటికి అంత దూరంలో గుట్ట వాలులో చదును చేసి గొడ్ల కోసం వేసిన మకాంవైపు దారితీసింది. వెనకే చేతిలో కర్రందుకుని మల్లన్న వచ్చాడు. అంతలోనే ఎడ్లు బెదురుగా అరుస్తున్నట్లినబడి ఒక్కుదుట్న అక్కడికి చేరారు. అలన కనబడక ‘బిడ్డా… బిడ్డా…’ అంటూ వెతుకుతున్న మల్లన్నకి మకాంకి కొంచెం దూరంలో గుట్టపైకి పోయే వైపు బండ మాటు నుంచి మూలుగు విన్పించి అటు ఉరికాడు. బట్టలు చెదిరిపోయి బోర్లా పడున్న అలనని ఒళ్ళోకి తీసుకోగానే గుండె లాగినంత పనైంది ఇద్దరికీ. ముఖ మంతా రక్తమోడుతూ, కళ్ళు తేలేస్తూ మూలుగుతున్న అలనని భుజమ్మీదేసుకుని ఇంటికి తీసుకొచ్చే టప్పటికి పదిమందీ చేరారు. ఎవరో అలనని బలాత్కారం చేసి రాళ్ళతో మోదారని గమనించిన యువకులు కొందరు లైట్లు పట్టుకుని చుట్టుపక్కల గుట్టంతా వెతికారు. ఏ ఆధారం దొరకలా… ఎవరూ కనపడలా…

అలనని ట్రాక్టర్లో వేసుకుని రాజమ్మ, మల్లన్నతో పాటు ఓ ఇరవై మంది గవర్నమెంటు ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అంతలో సంఘం స్త్రీలు కొందరు మహిళా సమత అక్కకి ఫోన్‌ చేశారు. ఎవరో ఆమెను రేప్‌ చేసి, తల పైన, ముఖం మీద బండతో మోదటం వలన తలవెనక పగలటంతో పాటు ముందుపళ్ళు రెండు ఊడిపోయి ఒకటి విరిగిందని, కంటిపైన గట్టి దెబ్బ తగిలిందని, బండల మీద ఈడ్చుకెళ్ళటంతో రాళ్ళు, ముళ్ళు గీసుకు పోయి వీపంతా గాయాలైనాయని డాక్టర్‌ చెప్తుంటే తల తిరిగినట్లైంది. అలన అవస్థకి కన్నీళ్ళాగలా.

పోలీసులు, డాక్టర్లు, ఊరి జనం, రాజకీయ నాయకులు, కుల నాయకులు, రిపోర్టర్లు… వచ్చిపోయే వారితో ఆ వార్డు జాతర్లా తయారైంది. రెండ్రోజుల తర్వాతగాని దీన్ని ఆపలేకపోయారు. రాజమ్మ, మల్లన్న ఈ లోకంలో లేనట్టే ఉన్నారు. మరో రెండ్రోజుల క్కాని అలన మాట్లాడలేకపోయింది. ఈ లోపు మహిళా సమత అక్కయ్యలు, సంఘాల స్త్రీలు, ఊరి జనం, ఇతర జిల్లాల నుండి వచ్చిన మహిళా సమత సంఘాల సభ్యులు దాదాపు మూడొందల మంది జిల్లా కేంద్రంలో ర్యాలీ తీసి కలెక్టర్‌కి, ఎస్‌.పి.కి తక్షణం దర్యాప్తు జరిపించి న్యాయం చేకూర్చాలని, ఆసుపత్రి ఖర్చులను భరిస్తూ, అలన చదువుకు సహకరిం చాల్సిందిగా వినతి పత్రం ఇచ్చారు. సంఘం స్త్రీలు దోషుల్ని పట్టుకుని, న్యాయం జరిపించే వరకు వదిలిపోమని భీష్మించారు. మరో పదిహేను రోజుల్లో అలన చెప్పిన గుర్తుల ఆధారంగా ఇద్దరి ముఖాల్ని చిత్రించారు పోలీసులు. ఆ ఇద్దర్లో ఒకరు రాజకీయంగా పలుకుబడి, కులబలం ఆర్థికబలం, మంది బలం ఉన్న ఓ ‘పెద్దమనిషి’ కొడుకని తెలిసి వెతికి పట్టుకునేటప్పటికి మరో ఇరవై రోజులు పట్టింది.’అలగా జనం… మా మీద కేసెట్ల గడ్తరు… గా పోరి సావలేదుగా…’ పోలీసుల్తోనే కయ్యమాడాడు ఆ ‘పెద్దమనిషి’. అరెస్టయ్యాక బెయిల్‌ ఇవ్వకూడదన్న సంఘం స్త్రీల ఒత్తిడితో నెలరోజులాగినా తర్వాత బెయిల్‌పై బైటపడ్డారు.

అలన మనోబలంతో, మంది ఇచ్చిన నైతిక బలంతో, మహిళా సమత అక్కలిచ్చిన కౌన్సిలింగ్‌తో ఆర్నెల్లకి తేరుకుంది. అధికారుల సహకారంతో చదువు కొనసా గించింది. సామాజిక స్టిగ్మాను దులిపేసుకుని ‘అపజయం లేని విజయం నాది’ అంటూ ఆడ పిల్లలకి అంబాసిడర్‌ అయింది. ఇలాంటి కొడుకుల్కి ఎలా బుద్ధి చెప్తారని తల్లిదండ్రుల్ని, మాదిగ్గూడేల ఆడపిల్లలు మనుషులుకారా అని సమాజాన్ని ప్రశ్నిస్తోంది. మరి జవాబెప్పటికి దొరికేనో!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.