గిరిజనుల చీకటి బతుకులో దీపం మహాశ్వేతాదేవి కల్పనా రెంటాల

(జులై నెలలో మహాశ్వేతాదేవి తొలి వర్థంతి)

మారుమూల అడవుల్లో ఒదిగి ఉండే అమాయక జనం-గిరిజనం. నది ఒడ్డుని ఆనుకుని, ఏ కొండ కొమ్మనో కాసింత నీడ వెతుక్కుని, ప్రకృతి ప్రసాదించిన ఏ కొద్దిపాటి ఆహార వనరులనో నమ్ముకొని బతికే గిరిజనానికి బయటి లోకపు పోకడలేమీ తెలియవు. బయటి లోకపు రోడ్లు, వంతెనలు, ఇతరేతర సౌకర్యాలు ఏవీ వాళ్ళ దరిచేరవు. కానీ పట్టెడు నేల కనిపిస్తే చాలు, కబళించి కాసులు చేసుకోవాలనుకునే దురాశ జీవులు ఇప్పుడు కొండల్ని కరిగిస్తున్నారు, చెట్లని నరికేస్తున్నారు. అడవిలో దొరికే ప్రతి సంపదనీ కొల్లగొట్టి, లాభాలతో తమ సంపదల్ని పెంచుకుంటున్నారు. గిరిజనం జన్మహక్కయిన భూముల్ని ఆక్రమించి, ఆ భూమ్మీద బతికే గిరిజనాన్ని వెళ్ళగొడుతున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళని దోపిడీ దొంగలుగా ముద్ర వేస్తున్నారు.

లెక్కలు, పట్టాలు, దస్తావేజులు, చట్టాలు ఏమీ తెలియని అమాయక ఆదివాసులు నమ్ముకున్న భూమిని వదులుకుని, చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు. వాళ్ళతోపాటు వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళే కాదు, ప్రకృతి అందాలన్నీ చెదిరిపోతున్నాయి. వాళ్ళ ఆటలు పాటలతో ప్రతిధ్వనించాల్సిన అడవులు దెయ్యాల గూళ్ళవుతున్నాయి. అలా చెదిరిపోతున్న ఆదివాసులకు ఏ ప్రభుత్వమూ అండగా నిలవడంలేదు. వాళ్ళ హక్కులేమిటో వాళ్ళకే తెలియక అజ్ఞానంలో, అవిద్యలో, అంధకారంలో కూరుకుపోతున్న ఆదివాసీ జనసమూహాల్లోకి, వాళ్ళ చీకటి బతుకుల్లో ఒక దీపంలా నడిచి వచ్చింది మహాశ్వేతాదేవి.

ఆదివాసులంటే భయంకర మనుషులనీ, వాళ్ళకు సభ్యతా సంస్కృతి లేవన్న అపోహలను ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగలు, దోపిడీ ముఠాలకి నెలవుండే చోటన్న కట్టుకథల్నీ ఆమె చెదరగొట్టింది. అక్కడి మనుష్యులు రాక్షసులైన అసురతెగలకి చెందిన వాళ్ళన్న ప్రచారాల్నీ ఆమె పట్టించుకోలేదు. ఆత్మస్థైర్యాన్నే దివ్వెగ వెలిగించుకుని ఆమె అడవుల్లోకి వెళ్ళింది. నగర జీవితంలో పుట్టి పెరిగిన మహాశ్వేతాదేవి కీకారణ్యాల గుండెల్లో ఏ మారుమూలనో దాక్కుని బతుకుతున్న అడవి బిడ్డల ఆక్రందనలను వింటూ వాళ్ళ గుండెల్లోకి అడుగుపెట్టింది. భయం, ఆకలి, దారిద్య్రం, అమాయకత్వం… వీటన్నింటికీ పర్యాయపదాలుగా బతుకుతున్న ఆదివాసీలకి కొండంత అండగా నిలబడింది. ఇప్పుడు ఆమె అడివి బిడ్డల అమ్మ. తరతరాల దోసిళ్ళకు ఆనవాలుగా మిగిలిన గిరిజనానికి కనుపాప. ఒకవైపు ఆయుధాలతో కొండ బతుకుల్ని తీర్చిదిద్దే నక్సల్బరీ పోరాటం సాగుతున్న దశలోనే ఒకే ఒక్క కలం బలంతో తానే ఒక సైన్యంగా పోరాడి గెలిచిన యోధ మహాశ్వేతాదేవి.

ఇప్పటికి ఎనభై ఏండ్ల క్రితం ఢాకాలోని ఒక సాహిత్య సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మహాశ్వేతాదేవి చిన్న వయసులోనే ‘గణ నాట్య’ అనే ఒక థియేటర్‌ బృందంతో కలిసి పనిచేసింది. 1930, 40 లలో ‘గణ నాట్య’ అంటే సామాజిక రాజకీయ విప్లవ సంకేతం. ఆనాడు బెంగాల్‌లోని పల్లెసీమల్లో ‘గణ నాట్య’ గజ్జెల మోత వినిపించని ఊరు లేదు. ‘గణ నాట్య’ అడుగుపెట్టిన చోట అజ్ఞానానికి నిలువ నీడ లేదు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో ఎమ్మే చదువుతున్న కాలంలో కూడా మహాశ్వేత ‘గణ నాట్య’ ప్రభావంతో ఎప్పుడూ ఏదో ఒక సామాజిక రంగంలో తలమునకలుగా ఉండేది. అతి కొద్దికాలంలోనే ఆమె అధ్యాపకురాలిగా, పత్రికా రచయితగా

ఉద్యోగంలోకి అడుగిడింది.

మన దేశాన్ని చేజిక్కించుకుని దుష్ట పాలన సాగిస్తున్న తెల్లవాళ్ళని గజగజ వణికించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాన్ని ఆధారంగా తీసుకుని చేసిన ప్రయోజనాత్మక రచన ‘ఝాన్సీర్‌ రాణి’ తో ఆమె సాహిత్య జీవితం 1956తో మొదలైంది.

కేవలం గ్రంథాలయాలు శోధించి, చరిత్ర పుస్తకాల ఆధారాలతోనే ఆమె ఈ జీవిత చరిత్రను రాయలేదు. ఎక్కడైతే ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగిందో, ఆ నేలమీద జీవిస్తున్న సామాన్య జన హృదయాల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా శాశ్వతంగా నిలిచిపోయిందో, ఇప్పటికీ ఆ నేలమీద, ఆ ప్రజానీకంలో ఆ వీరనారి జ్ఞాపకాలు ఏ విధంగా సజీవంగా

ఉన్నాయో రికార్డు చేయడం ఈ రచనలో మహాశ్వేతాదేవి చేసిన ప్రయోగం.

నిరుద్యోగ రక్కసి ఒకవైపు పట్టి పీడిస్తున్నా, కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగం కూడా లేని దుర్భర స్థితి

ఉన్నప్పటికీ 400 రూపాయలు అప్పు చేసి బుందేల్‌ఖండ్‌కి ప్రయాణమయింది మహాశ్వేత. బుందేల్‌ఖండ్‌ చుట్టూరా ఎన్నో ఊర్లు తిరిగింది. మామూలు జనంతో ముఖ్యంగా స్త్రీలతో కలిసి మాట్లాడింది. తరాలుగా చెప్పుకునే కథల్ని రికార్డు చేసింది. ఆ పరిశోధన ఫలితమే ఆమె మొదటి రచన ‘ఝాన్సీర్‌ రాణి’.

ఆ తరువాత నాలుగు దశాబ్దాల పైబడిన సాహిత్య జీవితంలో ఆమె ఇరవై సంపుటాల కథలు, వందకి పైగా నవలలు, వందలకొద్దీ వ్యాసాలు, ఉపన్యాసాలు ఆమె బహుముఖ ప్రతిభకు నిలువుటద్దాలు. భారతదేశంలోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని ఆమె గెలుచుకున్నారు. ‘ఆసియా నోబెల్‌’ గా పేరొందిన రామన్‌ మెగనెసె అవార్డు కూడా ఆమెకు దక్కింది. ఒక తల్లి ఆత్మఘోషని అక్షరబద్ధం చేసిన ‘హజాద్‌ చౌరాసీ మా’ నవల ప్రసిద్ధ దర్శకుడు గోవింద్‌ నిహలానీ దర్శకత్వంలో ఒక చిత్రంగా వెలువడి, ఆమె కీర్తిని అంతర్జాతీయ పటంమీద నిలబెట్టింది.

1985లో పలమావు అనే ఒక గిరిజన గూడాన్ని చూసిన తర్వాత మహాశ్వేతలో చాలా మార్పు వచ్చింది. ”ఈ ఊరు గిరిజన భారతానికి అద్దం” అని ఆమె అనుకుంది. ఆ ఊళ్ళోని భూమిలేని నిరుపేద గిరిజనుల దారుణ జీవన స్థితిగతులు, భూమి ఉన్న ధనస్వాముల అరాచకాలు ఆమె ఆలోచనలను మేల్కొలిపాయి. నిజమైన భూమి బిడ్డలకి, భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకుని గిరిజనుల నోట మట్టికొట్టి విలాసంగా బతుకుతున్న భూస్వాములకు మధ్య జీవితంలో ఇన్ని వ్యత్యాసాలున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పు పేరిట గిరిజనుల మీద పెత్తనం సాగిస్తున్న భూస్వాముల దాష్టీకాన్ని ఎండగట్టాలని ఆనాడే ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఇంక కాలినడకన గిరిజన గూడేలన్నీ తిరగడం మొదలుపెట్టింది.

తన జీవితాన్ని అక్షరాలకే పరిమితం చేయలేదు మహాశ్వేత. రచయిత అంటే తన గదిలో తాను భద్రంగా కూర్చుని రాసేవారు మాత్రమే కాదని, తాను ఎవరికోసమైతే ఆ పీడితుల జీవితంలో, వాళ్ళ కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలన్న దృక్పథం మహాశ్వేతాదేవిది.

ఒకవైపు దేశం 21వ శతాబ్దంలోకి ఉరుకులు పరుగులతో పరుగులు తీస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న దశలోనే మరోవైపు అభివృద్ధి ఫలాలు ఏవీ దక్కక ఆదివాసీలు బాధిత, పీడిత ప్రేక్షక జనసమూహాలుగా మిగిలిపోయే పరిస్థితి పోవాలని, వాళ్ళ అమాయక జీవితాల్లో చైతన్యం నింపాలని కంకణం కట్టుకుంది. అడవి బిడ్డల హక్కుల సాధన కోసం నడుం బిగించింది. వివిధ అవార్డుల నుంచి తనకు అందిన వేలకొద్దీ ధనాన్ని గిరిజనుల కోసమే వెచ్చించింది. ఆమె కేవలం రచయిత్రిగా కాకుండా ఒక క్రియాశీల కార్యకర్తగా జీవిత చరిత్ర పైన చెక్కుచెదరని ముద్ర వేసింది.

గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపే దశలో ఆమె మొదటి మెట్టు వాళ్ళ ఆర్థిక స్థాయిని పెంచడం, జీవనస్థితిని మెరుగుపరచడం. ఇప్పటికే గిరిజనులకు అందుబాటులో ఉన్న వ్యవసాయం, పాడి సంపాదలను ఆధారంగా తీసుకుని, వాటిని ఇంకా ఎలా మెరుగుపరచాలో శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడం మహాశ్వేత సాధించిన తొలి విజయం. అదే సమయంలో వాళ్ళను అక్షరాస్యులుగా చేయడం, అందుబాటులో ఉన్న వనరులు, అక్షరాస్యత రెండూ గిరిజన బతుకుల్ని మార్చాయంటుంది మహాశ్వేత. ఇంతకుముందు ఒకే పంట వేసి, భూమిని పోడుతో పాడుచేసే స్థితి నుంచి ఇప్పుడు అదే భూమిలో మూడు పంటలు వేసే స్థితికి గిరిజనులు వెళ్ళారు. దాంతో గిరిజనుల ఆర్థిక స్థితి మారడమే కాదు, జీవన ప్రమాణాలు పెరగడంతోపాటు వాళ్ళలో కొండంత ఆత్మవిశ్వాసం మేల్కొంది. ఇంతకుముందు పూటకింత సరిపోయేటంత మాత్రమే పండించిన గిరిజనం ఇప్పుడు శక్తిసామర్ధ్యాలున్న రైతులుగా మారి, ధాన్యంతో పాటు బంగాళదుంపలు, వేరుశనగల్లాంటివి కూడా పండిస్తున్నారు. కాసింత నమ్మకమిస్తే చాలు, కొండల్ని పిండి చేస్తాం అనే గొప్ప జీవన సూత్రం ఇప్పుడు వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.

ఇక గిరిజన మహిళల జీవితాల్లో మహాశ్వేత తీసుకువచ్చిన వెలుగులు లెక్కలేనన్ని. కుటుంబం, పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణ లాంటి విషయాల్లో ఇప్పుడు ఆ గిరిజన మహిళలు సభ్యసమాజానికే పాఠాలు చెప్పగలరు. 500 నుంచి 600 గిరిజన కుటుంబాలు ఇప్పుడు తమ చేతివృత్తుల్ని, హస్తకళా నైపుణ్యాన్ని వినియోగంలోకి తీసుకువస్తున్నాయి. వాళ్ళ చేతుల్లోంచి అద్భుతమైన, కళాత్మకమైన వస్తువులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లోకి వెళ్తున్నాయి. అడవిలో దొరికే చిన్న వస్తువునైనా అద్భుతమైన కళగా మలచగలమన్న లక్ష్యంతో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు అనేకం. ప్రపంచీకరణ పుణ్యమా అని ఛిన్నాభిన్నమయిపోతున్న స్థానిక కళారూపాలకు పునర్జన్మనిస్తున్నారు ఈ గిరిజన మహిళలు.

కొన్ని తరాలుగా నేరస్తులుగా ముద్ర వేయబడి, నేరమే జీవితంగా మారిన గిరిజన తెగల మధ్య పనిచేయడం మహాశ్వేత గొప్ప విజయం. సమాజం, అధికార వ్యవస్థ చెక్కిన వికృత నేర శిల్పాలుగా మారిన దాదాపు రెండున్నర కోట్ల మందిని నేర కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నది మహాశ్వేత శపథం. విషాదం ఏమిటంటే పురిలియాలోని ఖేరియా శబర అనే తెగకు చెందిన వీళ్ళని గిరిజనుల్లోని మిగిలిన తెగలవారు కూడా నేరస్తులుగానే పరిగణించే ఈ తెగను అక్కున చేర్చుకుని, వారి జీవితాల్ని మార్చడానికి, వాళ్ళ పట్ల సమాజ దృక్పథంలో మార్పు తీసుకురావడానికి మహాశ్వేత పోరాడింది. దారుణం ఏమిటంటే, పోలీసు వ్యవస్థ వీళ్లను ఇంకా నేరస్తులుగానే మారుస్తోంది. 9 ఏళ్ళ క్రితం శబర తెగకు చెందిన బుధాన్‌ అనే ఒక గిరిజనుడ్ని పోలీసులే కొట్టి చంపిన ఉదంతంతో ఈ పోరాటానికి నాంది పలికింది మహాశ్వేత. బుధాన్‌ని కొట్టి చంపిన పోలీసుల్ని కలకత్తా హైకోర్టుకి ఈడ్చి న్యాయపోరాటం మొదలెట్టింది మహాశ్వేత. ఈ పోరాటంలో శబర తెగ విజయం సాధించింది. ఇన్నేళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శబర గిరిజనుడు కోర్టులో నిలదొక్కుకొని విజయం సాధించాడు.

మహాశ్వేత పోరాటంతో అనేక సంఘాల కళ్ళు తెరచుకున్నాయి. తరతరాలుగా నేరజీవితం వైపు నెట్టివేయబడిన శబర తెగల హక్కుల పోరాట సంఘం ఏర్పడింది. అప్పటినుంచి శబర గిరిజనుల సంక్షేమానికి మహాశ్వేత అంకితమైంది. దేశం నలుమూలలా తిరిగి శబర గిరిజనుల వివరాలు సేకరించింది. వాళ్ళ కష్టాలను రికార్డ్‌ చేసింది. ‘డీ నోటిఫైడ్‌ ట్రైబ్స్‌ అండ్‌ కమ్యూనిటీస్‌ రైట్‌ యాక్షన్‌ గ్రూప్‌’ అనే ఒక గుంపు ఆమె ఆలోచనలకు అక్షర రూపం. దేశంలోని రెండు వందలకు పైగా గిరిజన సంస్థలను ఈ సంస్థ పరిధిలోకి తీసుకువచ్చింది.

2006లో ఫ్రాంక్‌ఫర్డ్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పుస్తక మహోత్సవానికి మహాశ్వేతాదేవి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. ఇది భారతీయ సాహిత్యానికి, భారతదేశంలో పీడిత ఉద్యమాలకీ గర్వకారణం. ఆ ఉత్సవంలో మహాశ్వేత కీలకోపన్యాసానికి కరగని గుండే లేదు. ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆ ఉత్సవానికి వచ్చిన వందలాది మంది రచయితల కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి. భారతీయ సంస్కృతి అంటే అనేక కులాల మతాల హరివిల్లు అనీ, దురదృష్టవశాత్తు అది ఇప్పుడు ఒకే ఒక్క నెత్తుటి రంగుని పులుముకుందని ఆమె బాధపడింది. దుష్టశక్తుల పన్నాగంలో భిన్న సంస్కృతుల నాగరికత అణిగిపోయిందని ఆమె ఆవేదన పడ్డారు.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.