సేవ్ ద గర్ల్ ఛైల్డ్ ప్లీజ్!
Posted By భూమిక on February 26, 2009
జనవరి24 తేదీని ”జాతీయ ఆడపిల్లల దినం”గా కేంద్రం ప్రకటించింది. విచ్చలవిడిగా విస్తరించిపోయిన లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిండాల హత్యలు, గృహహింస, పోషకాహారలేమి లాంటి అంశాలపై విస్తృత స్థాయి ప్రచారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ‘దినాన్ని’ ప్రకటించారు. టీవీప్రకటనలు, పాఠశాలల్లో పాఠాల రూపంలో, వ్యాపార ప్రకటనల్లోను ఆడపిల్లల గురించి ప్రచారం చేయనున్నారు. గృహ హింసకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు అవసరమైన నిధులను మళ్ళించి, పూర్తి స్థాయి రక్షణాధికారుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నిధులను బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా చెయ్యాలని నిర్ణయించారు. మొత్తానికి ఇంత కాలానికి ఆడపిల్లల కోసం ఓ ప్రత్యేక దినాన్ని కేటాయించడంతోపాటు, ఆడపిల్లలెదుర్కొంటున్న వివక్షకి వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఆలస్యం గానైనా ఆడపిల్లల సమస్యల మీద దృష్టి సారించడం ముదావహం.
అయితే ఒక ప్రత్యేక దినాన్ని ప్రకటించి, కొన్ని ప్రచార కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన మన సమాజంలో పాతుకుపోయిన లింగవివక్షని రూపుమాపగలమా? ఆడపిల్లల స్థితిగతుల మీద యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన అంశాలను ఒక్కసారి గమనిద్దాం.
ు ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల్లో లేని 110 మిలియన్ల పిల్లల్లో 60% ఆడపిల్లలు.
ు 18 సంవత్సరాలు నిండే నాటికి బాలురకన్నా, బాలికలు 4.4 సంవత్సరాల విద్యాకాలాన్ని తక్కువ పొందుతారు.
ు ప్రపంచం మొత్తం మీద ప్రాధమిక పాఠశాలల్లో నమొదు కాని 30 మిలియన్ల పిల్లల్లో 60% మంది ఆడపిల్లలే.
ు ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవి బారిన పడిన వారిలో బాలురకన్నా బాలికలే ఎక్కువ.
ు ప్రతి సంవత్సరం 1,46,000 మంది టీనేజ్ యువతులు ప్రసవ సమయంలో మృత్యువాత పడుతున్నారు.
ు 13 మందిలో ఒకరు ప్రసవ సమయంలో మరణించే ప్రమాదంలో వున్నారు. 450 మిలియన్ ఆడపిల్లలు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.
ు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో గృహహింసకు, పబ్లిక్ స్థలాల్లో హింసకు మహిళలు గురవుతున్నారు.
యునైటెడ్ నేషన్స్ గణాంకాల ప్రకారం చూస్తే ఈ రోజుకీ గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లలకి విద్య అందని కుసుమమే. ప్రపంచీకరణ నేపధ్యం, వ్యవసాయ, చేనేత విధ్వంసం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుంగుబాటు, ”అభివృద్ధి” పేరు మీద జరుగుతున్న నిర్వాసితత్వం- వీటి పర్యవసానాలు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీల, ఆడపిల్లల జీవితాలు మరింత ప్రభావితమౌతున్నాయి. రాష్ట్రంలో పెరిగిపోతున్న ”ట్రాఫికింగ్” విష వలయంలో చిక్కుకుని వేలాదిమంది బాలికలు ప్రతిరోజు వేశ్యావాటికలకు చేరవేయబడుతున్నారు. హెచ్ఐవిలాంటి ప్రవదకర వ్యాధులకు బలవుతున్నారు.
మన సమాజంలో ఇంకా జరుగుతున్న బాల్యవివాహాలు, ఆడపిల్లల చదువు, వృత్తి, ఆరోగ్యంలాంటి వాటిని సమూలంగా నాశనం చేస్తున్నాయి. బాల్య వివాహాల చుట్టూ అల్లుకుని వున్న సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, మత పరమైన అంశాల గురించి పట్టించుకోకుండా, వాటిని ప్రధాన స్రవంతి చర్చల్లోకి తేకుండా బాల్యవివాహాలు నశించాలి అంటూ గొంతులు చించుకుంటే ఏమీ ఫలితం వుండదు. దేశంలో విపరీతంగా పడిపోతున్న సెక్స్రేషియె, వీధి వీధినా అల్ట్రాసౌండ్ మెషిన్లు పెట్టి, లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిండాల హత్యలు చేస్తున్న వాళ్ళని ఉదారంగా వదిలేస్తూ చూసీ చూడనట్లు నటించే చట్టం వల్ల ఉపయెగమేమీ లేదన్నది ఇప్పటికే అర్ధమైపోయింది.
ఇటీవల యూనిసెఫ్ ఒక నగ్న సత్యంలాంటి రిపోర్ట్ని విడుదల చేసింది. జనవరి 15న మనమంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ చేదుగుళిక లాంటి వాస్తవాన్ని యూనిసెఫ్ ప్రకటించింది. వతృమరణాలకి, పేదరికానికి వున్న సంబంధం గురించిన ఈ అధ్యయన రిపోర్ట్ ఏం చెబుతోందో చూద్దాం. పేద దేశాలలో, ప్రసవ సమయంలో 300 రెట్లు స్త్రీలు మరణించే ప్రమాదంలో వున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ధనిక దేశాలలో కన్నా పేద దేశాలలో పుట్టిన పిల్లలు 14 రెట్లు అధికంగా మొదటి నెలలో చనిపోయే పరిస్థితి వుంది.చిన్న వయస్సు బాలిక గర్భం దాల్చితే ఆమె ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. అలాగే 15 సంవత్సరాల వయస్సులో ప్రసవించితే బాలిక చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. 95శాతం మాతృమరణాలు సంభవిస్తున్నది ఆఫ్రికా మరియు ఆసియా దేశాలలోనే. మరీ ముఖ్యంగా 35 శాతం దక్షిణాసియాలోనే. ఈ ప్రాంతాలలోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 7,00,000 మంది 15,19 ఏళ్ళ వయస్సున్న బాలికలు, యువతులు ప్రసవ సమయంలో మరణిస్తున్నారని యునిసెఫ్ రిపోర్ట్ ప్రకటించింది.
జనవరి 24 తేదీని ‘బాలికలదినం’గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పై విషయలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని, వాటి కనుగుణమైన విధాన నిర్ణయాలని, కార్యచరణ ప్రణాళికలను, చిత్తశుద్ధితో రూపొందించి అమలు చేస్తుందని ఆశిద్దాం. ”సేవ్ ద గర్ల్ ఛైల్డ్” క్యాంపెయిన్ని ఉధృతం చేస్తుందని ఆశపడదాం.
Comments
Leave a Reply