రెండో వాయిస్
Posted By భూమిక on April 23, 2009
ఇంద్రగంటి జానకీబాల
1960-61 సంవత్సరాలలో నేను మద్రాసులో వున్న రోజులు. ఆ రోజు భలే ఉషారుగా వుంది. ఎందుకంటే ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ‘భార్యాభర్తలు’ సినిమా పాట రికార్డింగ్. నేను సుశీల గారితో తయరై పోయను. మొదట ఆమె భర్త ఆమెతో కూడా వెళ్తారనుకున్నారు. కానీ ఆయనకేదో అర్జంట్ పనివల్ల నేనే వెళ్ళాలని తెలిసింది.
సాలరి రాజేశ్వర రావు సంగీతం చేస్తున్న ఆ సినిమాలో ఈ పాట రిహార్సల్స్కి నేను వెళ్ళాను. అదీ నా ఆనందం.
ఏ.వి.ఎమ్ స్తూడియెలో ఆర్టిస్టు రూ౦ వేరేగా వుంది. అంటే పాడేవాళ్ళ రూ౦ సెపరేట్ – హాల్లో మొత్తం ఆర్కెస్ట్రా సెట్ చేశారు. ఆమె హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాడతారన్నమాట -
‘ఏమని పాడెదనో ఈ వేళ’ పాటకి వీణ వాయించిన వారు ప్రఖ్యాత వైణికులు చిట్టిబాబు. ఆయన్ని కూడా ఆర్టిస్టు రూ౦లో వుండి వాయించేట్టు ఏర్పాటు చేశారు, ఆ పాటకి మొత్తం పాటంతా చిట్టిబాబు గారు వీణ మీద ఫాలో అవుతారు. అది ఎంత అందంగా, ఎంత సున్నితంగా, ఎంత లలితంగా వుంటుందో ఆస్వాదించి తెలుసుకోవాల్సిందే-, నేను అదే రూ౦లో సోఫాలో కూర్చున్నాను. దూరంగా నాకు ఆర్కెస్ట్రా ధ్వని వినిపిస్తూనే వుంది. ఆమె పాడటం వీణ ఆమె పాటను అనుసరించటం వింటుంటే నాకెంతో సంతోషం. రెండు మూడు రిహార్సల్స్ అయ్యయి. అప్పుడప్పుడు అసిస్టెంట్ వచ్చి ఏవో సూచనలిచ్చి, చిన్న చిన్న సర్దుబాట్లు చేసి వెళ్తున్నారు-, రెడీ, టేక్ అన్నారు.
ఫస్టు టేక్ అయ్యింది. బాగుంది బాగుంది అన్నారంతా కానీ రెండో టేక్ కోసం తయరవుతుంటే నేను నాలో నేను అనుకున్నాను ‘చాలా బాగుంది కదా’- అని.
ఇంతలో అసిస్టెంట్ గారొచ్చి నెమ్మదిగా సుశీల గారితో ఏదో చెప్పి వెళ్ళారు.
ఆమె నా దగ్గర కొచ్చి నెమ్మదిగా
”నువ్వు పాడుతున్నావా – పాడకూడదు. నిశ్శబ్దంగా వుండు – సెకండ్ వాయిస్ వినిపిస్తోందన్నారంట’ అంటూ చెప్పారు.
నా గుండెలు జారిపోయాయి. రికార్డింగ్ అంటే పిన్ను పడిన శబ్దమైనా లాగేస్తుందని, నా కప్పుడప్పుడే అర్థమవుతోంది. సినిమా రికార్డింగులు చూస్తున్నప్పుడే నాకు కొన్ని సున్నితమైన విషయలు తెలియవస్తూ వున్నాయి. నేనెలా పాడాను? నా గొంతులోంచి శబ్దం ఎలా వచ్చింది? నాకు తెలుసుకదా అది రికార్డింగని’ అనుకుంటూ బాధపడిపోయాను. మొత్తానికి కుదురుగా, నిశ్శబ్దంగా, నోరెత్తకుండా కూర్చున్నాను. పాట రికార్డింగ్ పూర్తయింది. అంద ఆనందంగా సుశీలగార్ని అభినందిస్తుంటే అదేదో నన్నేఅన్నంత ఆనందపడి పోయాను.
”హీరోయిన్ ఈ పాట వీణ వాయిస్తూ పాడతారు. వీణ మెట్లమీద చక్కగా వేళ్ళు కదలాలి” అన్నారెవరో. ”పోనీ చిట్టిబాబు గారి చేతిని క్లోజప్లో పెడితే సరి”.
”అబ్బే అది కుదరదు. ఆయనది అచ్చమైన మగవానిచెయ్యి” అన్నారు మ్యూజిక్ డైరక్టర్ గారు.
ఈ ‘ఏమని పాడెదనో’ పాట తర్వాత ఎంత పాపులర్ అయిందో, అది ఈనాడు ఒక క్లాసిక్గా ఏవిధంగా నిలిచిపోయిందో అందరికీ తెలిసిన విషయమే.
మహాకవి శ్రీశ్రీ వ్రాసిన ఈ పాట సంగీతపరంగా కూడా చాలా గొప్ప పాట. పాడటంలో సుశీల చూపిన ప్రతిభ, వీణలో చిట్టిబాబు పలికించిన లాలిత్యం ఈ పాటను ఉన్నతంగా పెట్టాయి. రాజేశ్వరరావు గారు కంపోజ్ చేసి, సుశీల పాడిన వీణ పాటల్లో ఇదొక గొప్ప పాట.
వీటికి తోడుగా, ఆ పాటను చిత్రీకరించిన సన్నివేశం హీరోయిన్ నటన (కృష్ణకుమారి), సినిమా అత్యంతగా ప్రజాదరణ పొందడం, కళాత్మకంగా వుంటెనే మర్షియల్గా విజయం సాధించటం ఆ పాటని అందరి మనస్సులోన శాశ్వతంగా వుండేట్టు చేశాయి.
సినిమా పాటకి సంగీతం, సాహిత్యం, సన్నివేశం, కుదరటం ఒక ముఖ్యమైన అవసరం. దానికి తోడు సాంకేతికంగా బాగా రికార్డు చేయడం కూడా మరీ అవసరం. అప్పుడే అది కలకాలం నిలబడుతుంది.
Comments
Leave a Reply