‘నడుంనొప్పి ‘
Posted By భూమిక on August 6, 2009
డా: రోష్నీ
‘నడుంనొప్పి ‘ అనేదాన్ని వర్ణించడం, అది ఎందువల్ల వస్తుందో వివరించడం కొంచెం కష్టమయిన పనే. ముఫ్పె సం.రాల పై బడ్డ చాలామంది స్త్రీలలో ఇది కనిపిస్తుంది. ఇది వెన్నెముకకు సంబంధించిన అనారోగ్యం. అంటే వెన్నెముక భాగాలయిన వెన్నుపూసలే కాకుండా, దానికున్న కండరాలు, లిగమెంట్లకు సంబంధించిన వ్యాధి. నడుంనొప్పి రాకుండా ఉండాలంటే పైన చెప్పినవన్నీ ఆరోగ్యంగా సమస్థితిలో ఉండాలి.
ఈ నడుంనొప్పికి బలయ్యేది ఎవరు? ఎక్కువగా స్త్రీలే. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.
రోజంతా ఏదో ఒకే భంగిమలో పనిచేయడం – అంటే ఎక్కువగా ముందుకు వంగి లేక మెడ మాత్రమే వంచి పని చేయడం. ఇంటిపనులన్నీ ఈ విధంగానే ఉంటాయి.
బరువులు మోసే పనులు. బరువైన పిల్లల్ని ఎత్తుకు తిరగడం కూడా కారణమే.
వెన్నెముకను, పరిసర కండరాలను రిలాక్సు చేసే వ్యాయామాలకు సమయం లేకపోవడం.
శరీరంలో సరిపడా కాల్షియం లేకపోవడం ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో పోషకాహార లోపం, రక్తహీనత కూడా నడుంనొప్పిని కలిగిస్తాయి.
మానసికమైన వత్తిడి నడుంనొప్పికి ట్రిగర్ పాయింట్గా పనిచేస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని కారణాలు. అందువల్ల దీన్ని ఏదో ఒక పెయిన్కిల్లర్ వేసుకుని తగ్గించుకోవడం అనేది సాధ్యం కాదు. మాత్రలు ఏదో కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత మాములే. అసలు మనం నడుంనొప్పి బాధతో డాక్టరు దగ్గరకెళ్ళితే అసలు దాన్ని సీరియస్గానే తీసుకోరు. మనం ఏదో మానసికంగా తెచ్చుకున్న రుగ్మతగానో, లేక ఏదో కొద్దిగా ఉన్న నొప్పిని ఎక్కు చేసి నటిస్తున్నామనో తీసిపడేస్తారు. ప్రస్తుత వైద్య విధానంలో ఉన్న మరొక లోపమేమిటంటే దీని గురించి పెద్దగా పరిశోధనలు కూడా జరగలేదు. దీన్ని ఎక్కువ చేసే పరిస్థితులనుంచి స్త్రీలను రక్షించేందుకు ఎవరికీ పెద్దగా అవగాహన, సానుభూతి ఉన్నట్టుగా కనిపించదు.దీనికి సాక్ష్యం ఈ మధ్యే జరిగిన ఒక సంఘటన. నేను తరచూ ప్రయాణించే రూటు రైల్లో స్త్రీల కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తాను. ఒక రోజు ఆ బోగీలోకి ఏడాది పాపనెత్తుకొని ఒక చిన్న వయస్సు (20-22 సం. ఉండోచ్చు) తల్లి, ఆమె అమ్మ, అమ్మమ్మ మొత్తం నాలుగు తరాలవాళ్లు ఎక్కారు. ఒక అరగంట ప్రయాణం తర్వాత ఆ ఏడాది పాప ఒకటే ఏడుపు. చిరాకు. పాపం ఆ తల్లి ఆ ఐదుగంటలసేపు పిల్లాడిని సముదాయించడానికి ఎత్తుకుని బోగీ అంతా తిరుగుతూనే ఉంది. వాడు ఇంకెవర్నీ దగ్గరికి రానీయడం లేదు. స్టేషన్లో రైలు ఆగినప్పుడల్లా పక్కనే ఉన్న ఎసి బోగీలోంచి ఆ పసివాడి తండ్రి వచ్చి కిటికీలోంచి పలకరించి, ట్రెయిన్ కదలగానే తన బోగీలోకి వెళ్ళిపోయేవాడు. కనీసం కొంచెం సేపయినా పిల్లవాడిని తీసుకుని సముదాయించడానికి ప్రయత్నించలేదు. చివరగా సికిందరాబాదు చేరుకున్నాక బేగులన్నీ మళ్లా ఆడవాళ్లే మోసుకుంటూ స్టేషన్ బయటికెళ్ళారు. ఇందులో అమ్మమ్మ అయితే స్వాతంత్య్ర సమరయెధురాలు. అంటే ఆమె వయసు ఎంతో ఊహించుకోండి. ఆమె అన్నింటికంటే పెద్ద బ్యాగు మోసింది. మీరే చెప్పండి ఇక నడుంనొప్పి రాదంటారా? మందులు ఎవరికి వేయాలంటారు? అల్లుడిగారి అవగాహనా రాహిత్యానికి కాదా?
ఆడవాళ్ల బాధల మీద ఎంతో సానుభూతి ఉన్నట్టూ , వారికి ఎంతో మేలు చేస్తున్నట్టు ఈ మధ్య ఒక వ్యాపార ప్రకటన వస్తోంది. ఆ ఇంట్లో కోడలు ఒక్కతే పనిచేస్తూ ఉంటుంది. మామగారికి కాపీ, అత్తగారికి అట్లు భర్తగారికి టీ, ఆడబడుచుకి గోరింటాకు పెట్టడం ఒక్కటేమిటి? గిరగిర తిరుక్కుంటూ సర్వం తానే చేసేస్తూ, సడన్గా నడుంనొప్పి వచ్చి పడిపోతుంది. మామగారు వెంటనే అర్ధం చేసుకుని ‘మూవ్’ఆయింట్ మెంట్ మర్దన చేయమని కొడుక్కి చెపుతాడు. అలా చేసాక మళ్లీ మాములే. అందరి పనులు కోడలుగారు చేయడం కంటిన్యూ అవుతుంది. ఏం మిగతా వాళ్లందరికీ ఏంరోగం? ఎవరి పనులు వాళ్లుచేసుకోవాలి. లేక కొంతపనినయినా సాయంచేసి ఆమె పనిభారాన్ని తగ్గించొచ్చుగా..అబ్బే…అలాజరగదు. ఇది మనకున్న అవగాహన…
ఇకపోతే నడుంనొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే చేయవలసిన చిట్కాలు వచ్చే సంచికలో….
కార్తిక మాసం ఎకదికైన వెల్తున్నర మెమ్య వస్తము
మీ పత్రికని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. అభిప్రాయం మరికొన్నిసార్లు చూసినాక రాస్తాను.
—సాయి పివిఎస్