భూమిక కథ, వ్యాస రచనల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతుల ప్రదానోత్సవం
Posted By భూమిక on August 6, 2009
భూమిక నిర్వహించిన కధ, వ్యాసం పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సభ జూలై 18న, గగన్విహార్లోని హిందీ అకాడమీ కాన్ఫరెన్సు హాలులో ఉత్సాహంగా జరిగింది. నింగి..నేల..నాదే సినిమా నిర్మాత చావ సుధారాణి ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసారు. భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి అధ్యక్షత వహించారు.
చావ సుధారాణి మాట్లాడుతూ పట్టుదల, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలుగు తామని, తాము ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిర్మించిన నింగి..నేల..నాదే సినిమాఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా మారిందని, ఎంతో మంది ఫోన్ద్వారా తమకు చెబుతున్నారని అన్నారు. ముందు ముందు భూమికతో కలిసి పనిచెయ్యాలని వుందని చెప్పారు. సత్యవతి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నా మని, ఈ నిర్వహణ వెనుక ఎందరో ఆత్మీయుల అండదండలున్నాయని చెప్పారు. ఈ పోటీలో బహుమతులను స్పాన్సర్ చేసిన వారు ఫ్రభంజనరావు (భార్గవీరావుగారి భర్త) ఆరి సీతారామయ్య, యుఎస్ఏ, శారదా శ్రీనివాసన్, డా. సమతారోషిణి, సుజాతా మూర్తి, సత్తిరాజు రాజ్యలక్ష్మి, సుజాతా గోపాల్, అనురాధ, సంపత్ కుమార్, ఢిల్లీ. వీరందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేసారు. ఇంతమంది ఆత్మీయుల స్పందన తనకి చాలా ఉద్వేగాన్ని కలిగిస్తోందని, వచ్చే సంవత్సరం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డును ప్రవేశపెట్టాలని సంకల్పించానని దీన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రదానం చెయ్యాలని నిర్ణయించామని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఆ తర్వాత బహుమతుల ప్రదానం జరిగింది. డా. భార్గవీరావు పేరు మీద ప్రభంజనరావుగారు కథకిగాను మొదటి బహుమతిగా రూ. 5000 లను, డా. ఏ సీతారత్నంకు అందజేసారు. వ్యాసానికిగాను మొదటి బహుమతిని డా. సమత తండ్రి పడాల… గారి పేరు మీద వారి తల్లి పడాల కాంతమ్మగారు కొమ్మర్రాజు రామలక్ష్మికి అందజేసారు. కధా విభాగంలో రెండో బహుమతిగా రూ. 4000లను పి. రాజ్యలక్ష్మికి ఇవ్వడం జరిగింది. మూడో బహుమతి విజేత సదాశివుని లక్ష్మి హాజరు కాలేదు. వ్యాసం విభాగంలో రెండు, మూడు బహుమతులను శాంతాదేవిగారి తరఫున వారి సోదరికి, కుసుమ స్వరూపకు ప్రదానం చెయ్యడం జరిగింది.
కొడవగంటి కుటుంబరావు శత జయంతి సందర్భంగా వా కుమార్తె ఆర్.శాంతసుందరి తాయమ్మ కరుణ కథా సంపుటికి ప్రత్యేక బహుమతి కింద రూ. 3000 లను కరుణకు అందజేసారు. ఆ తర్వాత విజేతలు ప్రతిస్పందన తెలియ చేసారు. భూమిక స్ఫూర్తితో అత్తలూరి విజయలక్ష్మి, వారణాసి నాగలక్ష్మి, సమత రోష్ని, చావ సుధారాణి, ప్రభంజనరావుగార్లు భవిష్యత్తులో ఇవ్వడానికిగాను వివిధ అవార్డులను ప్రకటించారు.
శిలాలోలిత ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా నిర్వహించిన ఈ సభకు రచయిత్రుల, భూమిక అభిమానులు, మీడియా వారు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
ఆ మీటింగులో ఎందరో రచయితలు పల్గొన్నట్లున్నారు.వివిధ అంశాలపైన వారు విశిష్టంగా మాట్లాడిన/స్ప్రుశించిన అంశాలను, అందరు తెలుసుకోగలిగిన ఆంశాలను కూడా ఇక్కడ ప్రస్తావిస్తే మేము(ఇక్క్క్చదువుతున్న వాళ్ళమ) కూడా ఆసభకు వచ్చినంత అనుభూతి పొందే వాళ్ళం.